Thursday 30 August 2012

ADIVI BAPIRAJU : THE BRIDGE BETWEEN ANDHRA AND TELANGANA

ఆంధ్ర-తెలంగాణల సాహిత్య వారధి అడివి బాపిరాజు

    రచయితగా తెలుగు సాహిత్యానికి, సంపాదకుడిగా తెలంగాణ పత్రికా రంగానికి తద్వారా మొత్తం తెలుగు సమాజానికి అడివి బాపిరాజు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిజాం జమానాలో హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు పత్రికా రంగానికి బలమైన పునాదులు వేసిన అగ్రగణ్యులైన సాహితీ వేత్తల్లో, సంపాదకుల్లో ఆయనొకరు. హైదరాబాద్‌లో 1943లో స్థాపించబడ్డ ‘మీజాన్‌’ దిన పత్రిక సంపాదకుడిగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ తెలంగాణ ప్రజలకు ఆప్తుడయ్యాడు. పత్రికా యాజమాన్యం ప్రధానోద్దేశ్యం ‘మీజాన్‌’ ద్వారా ‘నిజాం కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడిరప జేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం.’’ అయితే అడివి బాపిరాజు ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు జరిపిన ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటా’నికి, కాంగ్రెస్‌ వారు నిర్వహించిన ‘ఆంధ్రమహాసభ’, ‘భారతదేశంలో హైదరాబాద్‌ విలీనోద్యమాల’కు మద్ధతుగా వార్తలు ప్రకటించేవాడు. అసిధారావ్రతం లాంటి తన  సంపాదకీయ బాధ్యతలను ఎంతో చాకచక్యంగా నిర్వహించిన ఆయన ప్రతిభ అద్వితీయం. అన్ని పార్టీల్లోనూ మిత్రులుండడం, అభ్యుదయ రచయితల సంఘం హైదరాబాద్‌ స్థాపక అధ్యక్షుడిగా, చారిత్రక నవలా చక్రవర్తిగా, తెలంగాణ చరిత్రను నవలా రూపంలో అక్షరీకరించి గోనగన్నారెడ్డి లాంటి వ్యక్తులకు జీవం పోసిన బాపిరాజు తెలంగాణకు ఆత్మీయుడు.
    హైదరాబాద్‌ రాజ్య ప్రజలతో మమేకమవడమే గాకుండా ఇక్కడి చారిత్రక స్థలాలకు సంబంధించిన విశేషాలెన్నింటినో పత్రికలో వ్యాసాలుగా ప్రకటించాడు. తెలుగు తల్లి పత్రికను అభ్యుదయ రచయితల సంఘ పత్రికగా మల్చడంలోనూ, ఎందరో కొత్త కథకులకు మీజాన్‌లో అవకాశమిచ్చి మలితరం తెలంగాణ కథకు జీవం పోసిండు. సాయుధ పోరాట సాహిత్యానికి అండగా నిలిచిన ఏకైక హైదరాబాద్‌ రాజ్య పత్రిక మీజాన్‌ అంటే అతిశయోక్తి కాదు.
    రచయిత అయినందుకే బాపిరాజుకు ‘మీజాన్‌’ పత్రిక సంపాదకపదవి దక్కింది. అయితే పత్రిక సంపాదకత్వం చేపట్టిన తర్వాతే ఆయన రచనలు అధికంగా అచ్చుకు నోచుకున్నాయి. అందరికీ అందుబాటులోకొచ్చాయి. తెలుగు నవలాకాశంలో ఆయన్ని ధృవతారగా నిలబెట్టిన ‘హిమబిందు’, ‘గోనగన్నారెడ్డి’, ‘కోనంగి’, ‘తుపాను’ మొదలైన నవలలన్నీ బాపిరాజు సంపాదకునిగా ఉన్న సమయంలోనే మీజాన్‌ పత్రికలో సీరియల్‌గా వెలువడ్డాయి. బాపిరాజు తన రచనల్ని ఏరోజు కారోజు దగ్గర నిలబడి చెబుతూ పోతుంటే పత్రికా కార్యాలయంలో కంపోజ్‌ చేసేవారట. అలాగే నిన్నటి కథ ఎంతవరకైందో కూడా చూడకుండా కథను డిక్టేట్‌ చేసేవాడంటే సాహితీవేత్తగా, సంపాదకుడిగా ఆయన ప్రతిభ తెలుస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ఆంధ్రమహాసభల సందర్భంగా మీజాన్‌ పత్రిక ప్రత్యేక సంచికలు వెలువరించేదంటే ఆయన సాహసం తెలుస్తుంది.  పత్రిక యాజమాన్యం పాలసీ భిన్నంగా ఉన్నప్పటికీ బాపిరాజు చాలా నేర్పుగా ‘తెలంగాణ సాయుధ పోరాట’ వార్తలను అధిక ప్రాధాన్యత నిచ్చి ప్రచురించేవాడు. ఆళ్వారుస్వామి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మాడపాటి హనుమంతరావులతో సాన్నిహిత్యం ఉండటంతో వారు నిర్వహించే వివిధ ప్రజా ఉద్యమాలకు పత్రిక ద్వారా దన్నుగా ఉండేవాడు. మీజాన్‌ పత్రికలో బాపిరాజు వెలువరించిన వందల కొద్ది రచనలు ఇప్పటికీ పుస్తక రూపంలో అందుబాటులోకి రాలేదు. మందుమల నరసింగరావు, రామచంద్రరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, రాజబహదూర్‌ గౌర్‌ లాంటి ఆనాటి రాజకీయ ఉద్యమకారుల జీవితాల్ని ‘ప్రతిరూపములు’ శీర్షికన శశికాంతుడు పేరిట అడివి బాపిరాజు వెలువరించారు. ఈ వ్యాసాలు ఆనాటి ఉద్యమరూపానికి ప్రత్యక్ష ప్రతిరూపాలు. అయితే దురదృష్ట వశాత్తు ఈ వ్యాసాలేవి ఇంతవరకూ పుస్తక రూపంలో ముద్రణకు నోచుకోలేదు. దీనికంతటికీ ప్రధాన కారణం మీజాన్‌ పత్రిక ప్రతులు చాలా అరుదుగా లభించడం, అవికూడా అందరికీ అందుబాటులో లేకపోవడమే. తెలంగాణ`ఆంధ్ర అన్న తేడా లేకుండా ఇరు ప్రాంతాల అభిమానులు బాపిరాజు అముద్రిత రచనల ప్రచురణకు ఉమ్మడిగా ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాల్సిన అవసరముంది. దీనితో అడివి బాపిరాజుని భిన్న పార్శ్వాల్లో బయటి ప్రపంచానికి చూపెట్టడానికి వీలవుతుంది. తెలంగాణ` ఆంధ్ర ప్రజల ఉమ్మడి వారసత్వమైన ఆయన రచనలు వెలుగు చూసినట్లయితే మరుగునపడ్డ సాహిత్యమెంతో వెలుగు చూస్తుంది. ఎన్నో కొత్త కోణాల్ని ఆవిష్కరించుకోడానికి అవకాశమిస్తుంది.
    అడివి బాపిరాజుని ఆంధ్ర` తెలంగాణ ప్రజల మధ్య వారధిగా చెప్పొచ్చు. హైదరబాద్‌లో మొట్టమొదటి సారిగా అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో ఆయన విశేషమైన కృషి చేసిండు. తమ పత్రికా కార్యాలయంలోనే ఆ సంఘం సమావేశాలు నిర్వహించేవారు. అక్టోబరు ఆరు 1944లో హైదరాబాద్‌లోని థియోసాఫికల్‌ సొసైటీలో  జంటనగరాల అరసం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వట్టికోట ఆళ్వారుస్వామి, బిదురు వెంకటశేషయ్య, వెల్దుర్తి మాణిక్యరావు, మానేపల్లి తాతాచార్య, ఎల్లాప్రగడ సీతాకుమారి, భాస్కరభట్ల కృష్ణారావు, జమ్మలమడక పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇందులోనే జంటనగరాల అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాపిరాజు, కార్యదర్శిగా ఆళ్వారుస్వామి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌తో బాపిరాజుకు గల సాన్నిహిత్యంలో ఇదొక చిన్న ఉదహరణ. నిజాం ప్రభుత్వ కోరికమేరకు అజంతా, ఎల్లోరా ప్రదేశాల్ని సందర్శించి వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తూ నివేదిక సమర్పించాడు. చిత్రకారుడు కూడా అయిన బాపిరాజు అజంతా, ఎల్లోరా శిల్ప సౌందర్యాన్ని హృదయానికి అత్తుకునేలా రాసి చిన్న పుస్తకంగా అచ్చువేయించాడు. బాపిరాజు స్థానికేతరుడే అయినప్పటికీ ఆయనకు తెలంగాణ అంటే మక్కువ ఎక్కువ. ఇక్కడి ప్రజలపై అభిమానం చూపించేవాడు. ఇక్కడి ప్రజలు చేస్తున్న వీరోచిత పోరాటల పట్ల సానుభూతితో ఉండేవారు. సంఫీుభావం చూపేవారు. అందుకే బాపిరాజు బంధువు, మీజాన్‌ పత్రికలో పనిచేసిన వెటరన్‌ జర్నలిస్టు బుద్ధవరపు కామరాజు ఇలా అన్నారు. ‘‘మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా పనిచేసి తెలంగాణ ఆంధ్రులలో ఐక్యమై, తెలంగాణ సాహితీ పరులకు సన్నిహిత బంధువైనాడు. తెలంగాణ చారిత్రక శిల్ప సంప్రదాయాన్ని శోధించి, ఆకళించుకొని తెలంగాణయే సిసలైన తెలుగు గడ్డ అని చాటి చెప్పాడు.’’
    నిజాం ప్రభుత్వాధికారులు, పాలకుడు ఉస్మాన్‌ అలీఖాన్‌లు ప్రజలపై తమ పట్టు సడలుతున్నట్లు భావించి, వారికి తాము చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాలను వారి భాషలోనే తెలిపితే బాగుటుందన్న ఆలోచనతో ‘మీజాన్‌’ పత్రిక స్థాపించబడిరది. 1943లో మీజాన్‌ అనే అరబిక్‌ పేరుతో ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు దిన పత్రికలను గులామ్‌ అహమద్‌ కలకత్తావాలా అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్త వీటి యజమాని. ఈయన ఖాన్‌ బహదూర్‌ అహమద్‌ నవాజ్‌ జంగ్‌ అనే నిజాం సన్నిహితుడి అల్లుడు. దేశంలోనే మొట్టమొదటి సారిగా మూడు భాషల్లో ప్రచురించబడ్డ ఈ పత్రికలు మూడు వేర్వేరు పాలసీలు అవలంభించాయి. ఇంగ్లీషు పత్రిక నిజామ్‌కు, ప్రభుత్వ పాలసీలకు మద్ధతుగా నిలిచేది. ఉర్దూ పత్రిక ముస్లిం లీగ్‌ని, మజ్లిస్‌ని, దాని నాయకుడు బహదూర్‌ యార్‌ జంగ్‌ని, ఆ తర్వాతి కాలంలో రజాకార్లకు అండగా ఉండేది. తెలుగు పత్రిక మాత్రం నిజాం వ్యతిరేక శక్తులకు, ముఖ్యంగా కమ్యూనిస్టులకు ఊతమిచ్చేది. ఆంధ్ర మహాసభ నాయకుడిగా, తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సర్వదేవభట్ల రామనాథం, వట్టికోట ఆళ్వారుస్వామి పంథాలను సమర్థిస్తూ వారికి అండగా ఉండేది. వారికి విశేష ప్రచారం కల్పించేది. ఈ పత్రిక స్థాపనలో డబ్బు సంపాదించడం కూడా ఒక ప్రధానోద్దేశ్యం. మీజాన్‌ (అరబిక్‌లో తరాజు (త్రాసు) అని అర్థం) పత్రికలో  తిరుమల రామచంద్ర, రాంభట్ల కృష్ణమూర్తి, శ్రీనివాస చక్రవర్తి, బుద్ధవరపు కామరాజు, విద్వాన్‌ విశ్వం లాంటి వారెందరో పనిచేసిండ్రు. మీజాన్‌ పత్రిక కార్యాలయంలో బాపిరాజు నిర్వహించే దర్బార్‌లో కురుగంటి, రాయప్రోలు, శ్రీశ్రీ, శివశంకరస్వామి తదితరులు క్రమం తప్పకుండా పాల్గొనేవారు.  హైదరాబాద్‌ వచ్చిన ఆంధ్రప్రాంత సాహితీకారుడు ఆనాడు మీజాన్‌ సందర్శించుకోవడం, పత్రిక కార్యాలయంలో నిర్వహించే దర్బార్‌లో పాల్గొనడం ఆనవాయితిగా ఉండేది. ‘స్వాతంత్య్రము, సమత్వము, సౌభ్రాతృత్వము’ అని పత్రిక ముఖపత్రంపై ఒక నినాదంగా ప్రకటించి పత్రిక ఉద్దేశ్యాన్ని వెల్లడిరచేవారు. 
    మొదట మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా కాకినాడకు చెందిన హైదరాబాద్‌ ప్రభుత్వోద్యోగి, సాహితీవేత్త ఖాసింఖాన్‌ని సంపాదకునిగా ఎంపిక చేద్దామని అనుకున్నారు. అయితే ముస్లిమ్‌ల పత్రిక అని ముద్రపడితే తెలుగు వారు చదవబోరు అనే ఆలోచనతో రాయప్రోలు, కురుగంటి, ఖాసింఖాన్‌ల సలహాతో అడివి బాపిరాజుని మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా ఎంపిక చేశారు. అప్పటికే బాపిరాజు కృష్ణా పత్రిక దర్బార్‌లో రెగ్యులర్‌గా పాల్గొనడం, ముట్నూరి కృష్ణారావు దగ్గర జర్నలిజంలో ఓనమాలు దిద్దుకోవడం ఆయన ఎంపికకు దారి తీసింది. పత్రిక సంపాదకునిగా స్థానికున్ని నియమించినట్లయితే అతను నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాసి రహస్యంగా ఆంధ్రమహాసభకు మధ్దతిస్తాడనే ఆలోచనతో తెలంగాణ వాళ్ళకు అవకాశమివ్వలేదు. ఎందుకంటే అప్పటికి ప్రచారంలో ఉన్న గోలకొండ పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక వార్తలతో ప్రభుత్వానికి తలనొప్పిగా ఉండేది. ఆ ఉద్దేశ్యంతోనే స్థానికున్ని గాకుండా గైర్‌ ముల్కీని నియమించాలనుకున్నారు. ఈ కారణాలు బాపిరాజు ఎంపికకు దోహదం చేశాయి. అయితే బాపిరాజు ఎంపిక మొత్తం తెలంగాణకు, ఆనాటి తెలంగాణ ఉద్యమాలకు, సాహిత్యానికి, పౌరహక్కులకు చేసిన మేలు ఎంతో గొప్పది.
     ధూపదీపాలు పేరిట ప్రతి ఉగాదికి తెలుగు వ్యక్తులకు వ్యంగ్యంగా బిరుదులు తగిలించి వారికి మొత్తం తెలుగువారిలో బాపిరాజు ప్రచారం కల్పించేవారు. 1945 ఉగాది సందర్భంగా ఆయన కొంతమంది తెలుగువారికిచ్చిన బిరుదులు గమనిస్తే అందులోని వ్యగ్యం అర్థమవుతుంది. 1. మాడపాటి హనుమంతరావు ` ఆంధ్రపార్టీ ఎస్కేపిస్టు బహదూర్‌, 2. మందుముల నరసింగరావు `సర్‌ ఆంధ్రాం థ్రాం థ్రాం, 3. రావి నారాయణరెడ్డి ` సౌమ్య సౌమ్యాంధ్రా జి.సి.హెచ్‌.ఎస్‌. 4. సురవరం ప్రతాపరెడ్డి `ముల్కేతర ముల్కీ ఆంధ్రాదివాన్‌, 5. రాయప్రోలు సుబ్బారావు `దండకారణ్య వాల్మీక, 6. కాళోజి నారాయణరావు `ఆంధ్ర సభాఅభినవ గోపరాజగీతామృతకలశా. ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బిరుదు తగిలించి బాపిరాజు ఆట పట్టించేవాడు.
    తెలంగాణ అభ్యుదయం కోసం తమ కలాన్ని కత్తిలా వాడి తనకు ఉపాధి కల్పించిన వారిపైనే సమరం చేసిన యోధుడు అడివి బాపిరాజు. బాపిరాజుకు హైదరాబాద్‌తో గల సాన్నిహిత్యం, ఆయన సాహిత్యం, ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఆయనపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగి పిహెచ్‌డీలు అవార్డయినప్పటికీ మీజాన్‌ పత్రికల సమాచారం ఉపయోగించుకుంది చాలా తక్కువ. దాదాపు శూన్యం. అందుబాటులో ఉన్న అరకొర మీజాన్‌ సంచికల్ని ప్రెస్‌ అకాడెమీ వారు ఒక ప్రాజెక్టుగా చేపట్టి గతించిన  తరం సాహిత్యాన్ని, సమాజాన్ని రికార్డు చేయాల్సిన అవసరముంది. ఈ పని ఆంధ్ర`తెలంగాణల ఉమ్మడి వారసత్వంగా బయటికి రావాల్సిన అవసరముంది. 

                                                                                                                                      -సంగిశెట్టి శ్రీనివాస్‌

Monday 27 August 2012

SURAVARAM PRATHAPA REDDY THE BEACON OF TELANGANA


సురవరాన్ని ఆవాహన చేసుకుందాం!!

    వాస్తవాల్ని వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా, ఆబ్జెక్టివ్‌గా, పాజిటివ్‌గా దర్శించి, స్వీకరించే వారిని అటు వామపక్ష భావజాలం వాళ్ళుగానీ, ఇటు రైటిస్టులు గానీ తమదైన రీతిలో ముద్రలు వేసి వారి కృషికి గుర్తింపు రాకుండా చేస్తారు. అమెరికా వాడి మాదిరిగా తమతో కలిసి రాకుంటే శత్రువుతో కలిసి ఉన్నట్టే అని కూడా ప్రచారం చేస్తారు. వారి మీద బట్టకాల్చి మీదెయ్యడానికి ఏమాత్రం వెనకాడరు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల్ని గానీ, ఆ సంస్థలతో కలిసి పనిచేస్తున్న వ్యక్తులను గానీ హేతుబద్ధంగా, విచక్షణతో, విషయ పరిజ్ఞానంతో ఎవరైనా విమర్శిస్తే, అది ఎంతటి సద్విమర్శ అయినప్పటికీ అట్లా చేసిన వారి స్థాయిని దిగజారుస్తారు. వారి గౌరవానికి భంగం కలిగిస్తారు. మానకసిక క్షోభకు గురి చేస్తారు. ఈ పద్ధతి తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి తెలుగు నేల అంతటా పర్చుకుంది. ఇప్పటికీ ప్రాంతీయ అస్తిత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో ఇది పకడ్బందీగా కొనసాగుతోంది. 1940వ దశకం మధ్య నుండి ఒక వైపు కమ్యూనిస్టులు, మరో వైపు ఆర్యసమాజ్‌ వాళ్ళు, వారితో అంటకాగిన హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులు, ఇంకో వైపు మజ్లిస్‌/రజాకార్లు పరస్పర విమర్శలకు దిగారు. ఈ రెండు, మూడు రకాల రాజకీయ ప్రక్రియల వల్ల గానీ, వాటి కొనసాగింపు, ఎదుగుదల మూలంగా గానీ సమాజంలో  ప్రజాస్వామిక చోటు (డెమోక్రాటిక్‌ స్పేస్‌) అంతకంతకూ కుంచించుకు పోయింది. కొన్ని కొన్ని సార్లు ఈ రాజకీయ పార్టీలు మొత్తం సమాజాన్ని శత్రు శిబిరాలుగా మార్చే ప్రయత్నం కూడా చేస్తాయి. అందులో భాగంగా రాజకీయ సంస్థలు, అందులోని వ్యక్తులు పనిగట్టుకొని విచక్షణను గాలికొదిలేసి తమ భావజాల ప్రచారానికే ప్రాధాన్యత నిస్తాయి. లెఫ్ట్‌, రైట్‌ గాకుండా ‘ప్రజాస్వామిక’మైన ఆచరణ సాధ్యమైన, అనుసరణీయమైన మరో ‘మధ్యే’మార్గముందని వీళ్లు గుర్తింప నిరాకరిస్తారు. లెఫ్ట్‌, రైట్‌ సిద్ధాంతాలు వేరయినప్పటికీ సారాంశంలో మాత్రం వీళ్లు అన్ని రంగాల్లోనూ సహజ సిద్ధంగా, న్యాయంగా ఎవరికి దక్కాల్సిన వాటాను వారికి దక్కకుండా చేస్తారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సార్లు వీళ్లిద్దరూ కలిసి మరీ ఈ ‘సెంట్రిస్ట్‌’లపై గోడమీది పిల్లి అనే ముద్రవేస్తారు. కండ్లకు కనబడని దాడిని చేస్తారు. సెంట్రిస్ట్‌లు చెప్పే విషయానికి విలువ లేకుండా/ రాకుండా ప్రచారం చేస్తారు. ఇది కుట్రపూరితంగా, తమ ఆధిపత్యాన్ని అప్రతిహతంగా కొనసాగించుకోవడం కోసం ఎత్తుగడగా వేసే ‘ముద్ర’లు అని అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ముద్రనే ఇప్పుడిక్కడ చర్చించుకుంటున్న సురవరం ప్రతాపరెడ్డిపై కూడా వేసిండ్రు.
    ఇజాలకు సంబంధం లేకుండా మంచిని మంచి అని, చెడుని చెడు అని ‘నీర క్షీర వివేకా’న్ని ప్రదర్శించిన సురవరం ప్రతాపరెడ్డిని ఆయన జీవితకాల కృషిని ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు గుర్తింప నిరాకరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిని ‘సంపాదకుడి’గా పరిమితం చేసిండ్రు. ఇంకొందరు కొంచెం కన్సెషన్‌ ఇస్తూ ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర కారుడి’గా గుర్తించారు. అయితే బహుముఖంగా, అనేక రంగాల్లో ఆయన చేసిన కృషికి న్యాయమైన గుర్తింపు దక్కలేదు. ‘హిందువుల పండుగలు’ పుస్తకాన్ని రాసిండు కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి రైటిస్టు అని లెఫ్టిస్టులు ముద్ర వేసిండ్రు. అలాగే ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షుడిగా జోగిపేట సభలకు ‘భాగ్యరెడ్డి వర్మ’ను ఆయన సహచర దళితుల్ని ఆహ్వానించి, అందలం ఎక్కించినందుకు సంప్రదాయవాదులు ఆయన్ని తప్పుబట్టిండ్రు. రైటిస్టు స్వామి రామానందకు దక్కిన గౌరవం కూడా ఆ యా వర్గాల నుంచి ప్రతాపరెడ్డికి దక్కలేదు. ‘‘ఉభయ వర్గాలు (కమ్యూనిస్టులు, జాతీయ వర్గం) కలువక పోవడం విచారకరమే కాని కలువక పోయినందున ఒకరిపై నొకరు ఆరోపణము చేయడం మరింత విచారకరము. ఇది నాయకులకు తగిన ఘనత కాదు’’. అని సురవరం ప్రతాపరెడ్డి అభిప్రాయ పడ్డాడు. అంటే ఇరువర్గాల వారు ఒకే ఆశయం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు పరస్పరం సహకరించుకోక పోయినా, ఘర్షణ వైఖరి ఉండకూడదనేది ప్రతాపరెడ్డి అభిప్రాయం.   బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కూడా మెజారిటీ ప్రజల శ్రేయస్సు కోసం ‘సెంట్రిస్ట్‌’ధృక్పథాన్నే ఆచరించాడు. ఈ ‘మధ్యే’మార్గ సిద్ధాంతానికి ప్రచారం కల్పించకుండా ఎవరికి వారు గిరి గీసుకొని మెజారిటీ ప్రజాభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరించారు. ప్రతాపరెడ్డి ఆచరించిన, సూచించిన మార్గన్నే ఇటీవలి ఎరుకలో జయశంకర్‌ సార్‌ ఆచరించాడు. ఆయన కూడా ప్రత్యేక తెలంగాణ సాధన విషయంలో అన్ని శక్తులూ కలిసి పోరాటం చేయాలని, అలా సాధ్యం కాని పక్షంలో పరస్పర విమర్శలకు తావు లేకుండా ఉద్యమం నిర్మించాలని అభిప్రాయ పడ్డారు. అయితే అటు ప్రతాపరెడ్డి ప్రతిభకు తగిన గుర్తింపు రాకుండా అడ్డుకున్న వర్గాలే ఇటు కొత్తపల్లి జయశంకర్‌ కృషికి కూడా తగిన గుర్తింపు రాకుండా అడ్డుకున్నారు. జయశంకర్‌ బీసీ కావడం మరో అదనపు అవరోధం. ఈ అవరోధాల్ని ఇటీవలి కాలంలో తెలంగాణ అస్తిత్వ సోయితో కొంచెం కొంచెంగా అధిగమిస్తున్నారు. ప్రతాపరెడ్డి విషయంలో ఈ అవరోధం తొలగిపోలేదు. కామ్రేడ్‌లను ఒకటి రెండుసార్లు వ్యంగ్యంగా ‘కామరేడ్లు’ అని రాసినందుకు కమ్యూనిస్టులు ఆయన ప్రతిభకు సమాధి కట్టిండ్రు. బిరుదురాజు రామరాజు జానపద సాహిత్యంలో పరిశోధన చేసినా, సామల సదాశివ సంగీత, సాహిత్య రంగాల్లో కృషి చేసినా అది ప్రతాపరెడ్డి మార్గదర్శకత్వమే అన్న విషయం చరిత్రలో అంత ప్రస్ఫుటంగా రికార్డు కాలేదు. వీరిద్దరూ  20 యేండ్ల వయసులో ఉన్న కాలంలోనే వారిలోని ప్రతిభను గుర్తించి దిశా నిర్దేశం చేసిన ప్రతాపరెడ్డి దార్శనికతకు తగిన గుర్తింపు లేదు. గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణలోని నలుమూలల ఉన్న కవులు, కథకులు, రచయితలను ప్రోత్సహించాడు. వారి రచనలు అచ్చేయడం ద్వారా అటు మరుగున పడ్డ ప్రతిభను వెలుగులోకి తెచ్చాడు. అలాగే గోలకొండ పత్రిక ద్వారా, విజ్ఞానవర్ధినీ పరిషత్తు ద్వారా వారి పుస్తకాలను అచ్చువేసి వారి రచనలకు శాశ్వతత్వాన్ని కల్పించాడు. అట్లాంటి ప్రతాపరెడ్డి ఎట్లా తెలుగు వారందరికీ తెలియకుండా పోయిండో, అందరివాడిగా కాకుండా పోయిండో తెలుగు సాహితీవేత్తలు ‘ఆత్మవిమర్శ’ చేసుకోవాలి. దార్శనికుడు, ప్రతిభాశాలి అయిన ప్రతాపరెడ్డి ఒక్క సాహిత్య రంగంలోనే కాకుండా అనేక ఇతర రంగాల్లో కూడా విశేషమైన కృషి చేసిండు.ఒక వైపు ప్రతాపరెడ్డికి ఆచరణలో అన్యాయం చేస్తూనే మరోవైపు కొందరు ఈ మధ్య కాలంలో ప్రేమను నటిస్తున్నారు.  తెలంగాణవాదం బలంగా ఉండి సీమాంధ్ర సాహిత్యకారులకు తెలంగాణలో కాలుబెట్టడానికి, కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకపోవడంతో వాళ్లు ప్రతాపరెడ్డి జయంతి/తెలుగు భాష దినోత్సవాల పేరిట అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంతో కలిసి కార్యక్రమాలు తమ స్వీయ ప్రయోజనాల కోసం చేపడుతున్నారు. ఇట్లా కార్యక్రమాలు చేసేవాళ్లు తమ ప్రాంతంలో ఏ ఒక్క గ్రంథాలయానికి గానీ, విద్యాలయానికి గానీ ప్రతాపరెడ్డి పేరుని పెట్టుకోలేదు. అలాగే సీమాంధ్రల్లో ఎక్కడ కూడా ఆయన విగ్రహం ప్రతిష్టించలేదు. కడుపులో విషందాచుకొని, పెదాలపై ప్రేమ ఒలికించడం వల్ల తెలంగాణ సాహిత్యకారులకు, సంస్కృతికి, సమాజానికి ఏమాత్రం మేలు జరుగదనే విషయం గత 60 యేండ్లుగా రూఢీ అయ్యింది. ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత ‘మేధావులు’ అన్యాయం జేశారు.  కొందరు తెలంగాణ వాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వాళ్ళు తాము పదవుల్లో ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళ సేవలో తరించడమే తప్ప తెలంగాణకు న్యాయంగా చేయాల్సిన మేళ్లు కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడెమీ ‘ఆంధ్రపత్రిక’ చరిత్ర రాయించి, ‘గోలకొండ పత్రిక’ను విస్మరించడమంటేనే అందులో ఏదో మతలబున్నదని అర్థమవుతుంది. అలాగే మిగతా విషయాల్లో అటు ఆంధ్ర, తెలంగాణ అనే తేడా లేకుండా కమ్యూనిస్టులు, రైటిస్టులు అందరూ ప్రతాపరెడ్డి ప్రతిభను గుర్తించ నిరాకరించారు. వివక్షాపూరిత సీమాంధ్రులకు, స్వపక్షంలో విపక్షంగా వ్యవహరించే కమ్యూనిస్టులకు ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ లేదు. దొందూ దొందే!
    హైదరాబాద్‌ నగరంలో కుల సంఘాల తరపున స్థాపించబడ్డ ప్రతి హాస్టల్‌ ప్రారంభానికి ప్రతాపరెడ్డి సలహాలు, సూచనలు అందాయి. అరుంధతీయ మహాసభకు గౌరవాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇంత ప్రజాస్వామికంగా, తన కాలానికి కన్నా ముందు నడిచిన, సమాజంలోని అన్ని వర్గాల వారితో కలుపుగోలుగా వ్యవహరించిన ఆయన వ్యక్తిత్వానికి పాఠ్యపుస్తకాల్లో సరైన స్థానం దొరకలేదు. సమాజంలోని అన్ని వర్గాల వారికి మంచికోసం జరిగే మార్పుల్లో న్యాయమైన వాటా దక్కాలని కోరుకున్న గొప్ప మనీషి సురవరం. అందుకోసం తాను కార్యకర్త మొదలు నాయకుడి వరకు వివిధ పాత్రలు పోషించేవాడు. ఎప్పుడూ ఏదో ఒక ఉద్యమం లేవదీస్తూ అది ఆశించిన ఫలితాలు సాధించేవరకు పోరాటం చేయడం ఆయన పంథా. మహిళాభ్యున్నతికి ఆయన చేసికృషి కూడా దాదాపు అట్లాంటిదే! ఎట్లాగైనా గోలకొండ పత్రికలో మహిళల చేత రచనలు చేయించాలనే ఉద్దేశ్యంతో ప్రతాపరెడ్డ తానే మారు పేరుతో స్త్రీలకు తమ సంస్కరణపట్ల పట్టింపు లేదని వారిని ప్రేరేపిస్తూ వ్యాసాలు అచ్చేశాడు. దీనికి ప్రతిస్పందనగా ఎల్లాప్రగడ సీతాకుమారి లాంటి వారు వ్యాసాలు రాసిండ్రు. మహిళల అభ్యున్నతికి కాన్షియస్‌గా పనిచేసిన ఆయనకు ఆ సమాజం నుంచి కూడా తగిన గుర్తింపు దక్కలేదు. వీటన్నింటికి మించి తాను చదువుకున్న అడ్వకేట్‌ వృత్తికి న్యాయం కలిగించే విధంగా పౌరహక్కుల కోసం బహుశా దేశంలోనే మొట్టమొదటి పౌరహక్కుల పుస్తకం ‘ప్రజాధికారములు’ రాసిండు. ఆయన పుస్తకం రాసేనాటికి ఇంకా ఐక్యరాజ్యసమితి కూడా హక్కుల గురించి తీర్మానం చేయలేదంటే ఆయన ముందుచూపు అర్థమవుతుంది. పౌర, మానవ హక్కుల కోసం ప్రాణాలర్పించిన నేల ఇది. హక్కుల సంఘాలు ప్రజా చైతన్యం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టాయి. అయితే ఈ సంఘాలు ఎన్నడూ పొరపాటున కూడా హక్కుల ఉద్యమానికి సంబంధించి తెలుగులో మొట్టమొదటి పుస్తకం రాసింది సురవరం ప్రతాపరెడ్డి అని ఎక్కడా పేర్కొనలేదు. అట్లాగే ఆ పుస్తకాన్ని పునర్ముద్రించడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతటి ప్రజాస్వామిక వాది, పీడిత ప్రజల పక్షపాతి, పౌరహక్కుల చైతన్యానికి  పునాదులేసిన రచయిత, కందుకూరి వీరేశలింగం కన్నా ముందే తెలంగాణలో సంఘసంస్కరణ ఉందని నిరూపించిన సంస్కరణవాది, చేయితిరిగిన చరిత్రకారుడు, కవి, ప్రజా ఉద్యమ నిర్మాత, రచయిత, కథకుడు, పరిశోధకుడు, వ్యాసకర్త, సంపాదకుడు, వక్త, హైదరాబాద్‌లో తొలి వికాస కేంద్రాల్లో ఒకటైన ‘రెడ్డి హాస్టల్‌’ నిర్వాహకుడిగా, తొలి ఆంధ్రమహాసభ ప్రథమాధ్యక్షుడిగా, ఆంద్రవిద్యాలయ స్థాపకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, అస్పృశ్యత, మద్యపానానికి వ్యతిరేకంగా, ఫ్యూడల్‌ నిజాం ప్రభుత్వానికి  వెరవకుండా, వెన్ను చూపకుండా ప్రజాచైతన్యాన్ని ప్రోది చేసిన సురవరం ప్రతాపరెడ్డిని అటు లెఫ్టిస్టులు, ఇటు రైటిస్టులు ఏనాడు పట్టించుకోలేదు.
    ప్రతాపరెడ్డి ‘సెంట్రిస్ట్‌’గా ఎవరు తప్పుచేసినా స్పేర్‌ చేయకుండా తూర్పారా బట్టడంతో ఆయన్ని ‘ఓన్‌’ చేసుకోవడానికి లెఫ్టిస్టులు ఇష్టపడలేదు. రైటిస్టులు పట్టించుకోకుంటే వచ్చే నష్టమేమి లేదు గానీ, న్యాయం వైపు నిలబడుతారని ప్రచారంలో ఉన్న వామపక్షవాదులు పట్టించుకోక పోవడమే విషాదం. ఈ విషాదం తెలంగాణకే ప్రత్యేకం. కమ్యూనిస్టులు ఎంత అన్యాయంగా వ్యవహరించినా ఆయన మాత్రం వారి అభిప్రాయాలతో విభేదించినా వారి రచనలకు గోలకొండ పత్రికల్లో సముచిత స్థానం కల్పించాడు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి రచనలకు గోలకొండ పత్రికలో స్థానం కల్పించడమే ఇందుకు నిదర్శనం. తప్పుచేసిన వారిని ఎలా స్పేర్‌ చేయలేదో అలాగే మంచి చేసిన వారినికూడా అది ఎవ్వరైనా అదే రీతిలో కొనియాడారు.
    బ్రిటీషాంధ్రలో బ్రాహ్మణేతర ఉద్యమంలో నార్ల వెంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు లాంటి వారు అటు పత్రికా సంపాదకులుగా ఉంటూ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో బ్రాహ్మణేతర సామాజిక చైతన్య కార్యక్రమాలకు పునాది వేసింది కొత్వాల్‌ వెంకటరామారెడ్డి. ఆయన స్ఫూర్తితో దాన్ని ఉద్యమంగా కొనసాగించింది సురవరం ప్రతాపరెడ్డి. ఇందులో భాగంగానే కొత్వాల్‌ వెంకటరామారెడ్డి జీవిత చరిత్రను ప్రతాపరెడ్డి రాసిండు. కుల సంఘాలు వారు ఏర్పాటు చేసిన హాస్టల్స్‌కు గానీ, అరుంధతీయ సంఘ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం గానీ, భాగ్యరెడ్డి వర్మ లాంటి దళితులకు ఆంధ్రమహాసభలో స్థానం కల్పించడం గానీ సంఘం సీతారామయ్య యాదవ్‌, కే. రాములు లాంటి వారి రచనలకు, వారి కుల ఉద్యమాల వార్తలను గోలకొండ పత్రికల్లో అచ్చేయడం గానీ, మున్నూరు కాపు సంఘంలో కీలక పాత్ర పోషించిన బొజ్జం నర్సింలుని గోలకొండ పత్రిక మేనేజర్‌గా నియమించుకోవడం తదితర కార్యక్రమాలన్నీ ఆయన బ్రాహ్మణేతర ఉద్యమాలకు ఊపిరి పోసిన తీరుని చిత్రిక గడతాయి. నిజానికి ప్రతాపరెడ్డి తరచుగా ‘చిన్నప్పటి నుండి బ్రాహ్మణ సహవాసంతో భ్రష్టుడనైనాను’అని తన గోలకొండ దర్బారులో ఆసీనులైన మిత్ర బృందంతో అనేవాడు. ఈ మిత్ర బృందంలో బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సుజాత పత్రిక సంపాదకుడు పసుమాముల నృసింహశర్మ తదితరులుండే వారు. ఇదే విషయాన్ని ఇల్లిందల సరస్వతీదేవి రాస్తూ ‘‘పైకి గునుపే గాని మనసులో వారిపట్ల ఎనలేని గౌరవాభిమానములు రెడ్డిగారికి’’ అని తన ‘తేజోమూర్తులు’ పుస్తకంలో పేర్కొన్నారు.
    ప్రజాస్వామ్య బద్ధంగా, నిష్పాక్షికంగా పేదలు, పీడితుల పక్షాన నిలబడ్డ ప్రతాపరెడ్డికి అటు రాజకీయ రంగంలో ఎంతటి అన్యాయం జరిగిందో ఇటు సాహిత్య రంగంలో అంతకన్నా ఎక్కువ ద్రోహం/మోసం జరిగింది. బహుశా ఆయన బ్రాహ్మణేతరుడు కావడం అందుకు కారణం కావచ్చు. 1927 నుండి 1975 వరకు దాదాపు 50 యేండ్ల పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ఒక్క తెలంగాణ వాడు కూడా అధ్యక్షుడు కాలేకపోయినందు వల్ల ఆ శాఖను 50 యేండ్లు ఆక్రమించి ఏలిన వాండ్లు అంతా ఆంధ్రప్రాంతం నుంచి వలసొచ్చిన బ్రాహ్మణులే అయినందువల్లా ప్రతాపరెడ్డి గురించిన పరిశోధన వారి జమానాలో జరుగలేదు.బహుశా ప్రతాపరెడ్డి బ్రాహ్మణేతరుడు కావడం మూలంగానే ఆయన ప్రతిభకు విశ్వవిద్యాలయాల్లో తగిన గుర్తింపు దక్కలేదు. ఆయన రచనలు ఆ విశ్వవిద్యాలయాల తరపున వెలుగులోకి రాలేదు. వాటిపై సరైన పరిశోధన జరుగలేదు. ఎందుకంటే 1970ల వరకూ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఉన్నత స్థానంలో పనిచేసింది తెలంగాణేతర బ్రాహ్మణులే. వారికి ఆయన పట్ల పట్టింపు లేదు. అలాగే గతంలో కాకతీయ విశ్వవిద్యాలయం పూనుకొని రాయప్రోలు సుబ్బారావు, కొడవటిగంటి కుటుంబరావు, విశ్వనాథ సత్యనారాయణల రచనల సూచీని వెలువరించాయి. అయితే ప్రతాపరెడ్డి రచనల గురించి ఏ విశ్వవిద్యాలయం పట్టించుకోలేదు. ఇంత వరకూ ఆయన ‘సమగ్ర రచనల సూచీ’ ప్రచురించలేదు. దీన్ని బట్టి బ్రాహ్మణ, తెలంగాణేతర వ్యక్తుల మీద ఉన్న సానుకూల ధృక్పథం ఇక్కడి భూమిపుత్రులపౖౖె ఉండదు అనడానకి ఇదే నిదర్శనం.
    తెలంగాణ`ఆంధ్రల మధ్యన పోలిక తీసుకువచ్చిన ప్రతి సందర్భంలో ఆంధ్రను, ఆ ప్రాంత వైతాళికులను ఉన్నత స్థానంలో నిలబెడుతూ అక్కడి మీడియా/ పత్రికలు/ ప్రచురణ సంస్థలు/ వ్యక్తులు పనిచేస్తారు. ఈ వివక్షా పూరిత ధోరణి తెలంగాణ ప్రతిభను పూర్తిస్థాయిలో ఎరుకలోకి రాకుండా తొక్కిపెట్టింది. ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు అని ప్రచారంలో ఉన్నవాళ్లు సైతం (ఒకరిద్దరు మినహా) ఆచరణలో మాత్రం తమ సీమాంధ్ర పక్షపాతాన్ని ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రాంతానికి చెందిన సామినేని ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ పేరిట ఆ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధుల కవిత్వాన్ని సంపుటిగా వెలువరించారు. ఇందులో అప్పటికే ప్రసిద్ధుడైన దళితుడు గుర్రం జాషువా కవిత చోటు చేసుకోలేదు. అంటే ఆయన దళితుల  పట్ల వివక్షతో వ్యవహరించిండు అనేదానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. ఈ వైతాళికులు పుస్తకాన్ని ‘విశాలాంధ్ర’ వారు పనిగట్టుకొని పదుల సంఖ్యలో పునర్ముద్రణ చేసిండ్రు. అదే కాలంలో హైదరాబాద్‌ నుంచి అరిగె రామస్వామి లాంటి దళితులకు,  దళితుల నుంచి కన్వర్ట్‌ అయిన క్రిస్టియన్లకు, బీసీలకు కూడా స్థానం కల్పిస్తూ సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన ‘గోలకొండ కవుల సంచిక’ తెలంగాణ కవిత్వాన్ని ఇంత వరకు అటు విశ్వ విద్యాలయాలు కానీ, ఇటు విశాలాంధ్ర ప్రచురణ సంస్థ కానీ ప్రచురించలేదు. ఇది వారి పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక వైఖరికి అద్దం పడుతుంది. ఒక విధంగా ప్రతాపరెడ్డి ‘గోలకొండ కవుల సంచిక’ ప్రచురించడానికి కూడా ఆంధ్రుల అహంకారమే కారణం.
    ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అని ముడుంబై రాఘవాచార్యులు అనే విమర్శకుడు గోలకొండ పత్రిక వార్షిక సంచికలో (10, మే 1934) ఒక సాహిత్య సమీక్షలో రాసిండు. అంతేకాదు ఆంధ్రప్రాంతానికి చెందిన రాయప్రోలు సుబ్బారావు లాంటి వాళ్ళే ఇక్కడ రాణిస్తున్నారు అని కూడా అందులో పేర్కొన్నాడు. ఒక సంపాదకుడిగా ఆ వ్యాసాన్ని సంచికలో అచ్చేసి ప్రతాపరెడ్డి తన నిష్పాక్షికతను చాటుకున్నాడు. అదే సమయంలో ఒక తెలంగాణ భూమి పుత్రుడిగా స్పందించిండు. సగర్వంగా, సమున్నతంగా తెలంగాణ కీర్తిని దశదిశలా వ్యాపింప జేసేందుకు పునాదులు వేసిండు. ముడుంబై వ్యాసానికి ఘాటుగా జవాబిస్తూ ఇక్కడ కవులు పూజ్యం కాదు, పూజనీయులు అని ‘గోలకొండ కవుల సంచిక’ని వెలువరించి చెప్పిండు. ఈ సంచిక 1934 డిసెంబర్‌, 12నాడు అచ్చయ్యింది. అంటే కేవలం ఏడ్నెల్ల వ్యవధిలోనే తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి కవుల రచనల్ని తెప్పించి వాటిని ఒక్క దగ్గర చేర్చి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే సంచికను ప్రచురించాడు. అట్లాంటి ప్రతాపరెడ్డి చనిపోయి దాదాపు 60 యేండ్లు కావస్తుంది. అయినప్పటికీ ఆయన రాసిన కవిత్వం ఇంతవరకు పుస్తక రూపంలో రాలేదు. ‘ఎండిన పూలు’ పేరిట తన కవిత్వాన్ని తీసుకురావడానికి ఆయన కొంత ప్రయత్నం చేసిండు కానీ ఎందుకో సఫలీకృతుడు కాలేదు. బహుశా ఇందుకు ప్రతాపరెడ్డి ప్రజా ఉద్యమాల్లో తలమునకలుగా ఉండడం,  పత్రికా సంపాదకుడిగా క్షణం తీరిక లేకపోవడం అందుకు కారణం కావచ్చు. అలాగే ‘కవిత్వం’ పత్రికల్లో అచ్చయింది కదా, పాఠకులకు చేరుకున్నది కదా అని సంతృప్తి చెందడం కూడా కారణం కావచ్చు. ప్రతాపరెడ్డి మరణానంతరం ఆయన మీద పరిశోధన చేసిన ఇందుర్తి ప్రభాకరరావు గానీ, పుస్తకాలు రాసిన ఎల్లూరి శివారెడ్డి, ముద్దసాని రామిరెడ్డి, గోపీకృష్ణ తదితరులందరూ కవిత్వానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. కేతవరపు రామకోటి శాస్త్రి కొంత మేరకు ఆయన కవిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నించారు. కాని అది కూడా అసమగ్రమే. ఏది ఏమైనప్పటికీ కవిగా ప్రతాపరెడ్డికి దక్కాల్సిన గుర్తింపు ఈనాటికి దక్కలేదు. సంపాదకుడిగా కొందరు, చరిత్రకారుడిగా మరికొందరు ఆయన్ని గురించి రాసిండ్రు కానీ ఆయన సమగ్ర సాహిత్య మూర్తిమత్వాన్ని ఇంతవరకు ఎవ్వరూ రికార్డు చేయలేదు. గతంలో ‘సురవరం సాహితీ వైజయంతి’ ద్వారా కొంత పని జరిగింది కానీ అదీ అసమగ్రమే. సురవరం సాహిత్యం సమగ్రంగా వెలుగులోకి రావాలనే ఆశయంతో గతంలో ‘తెలంగాణ ప్రచురణలు’ తరపున ఆయన అముద్రిత ‘తెలంగాణ వ్యాసాలు’ తీసుకు రావడమయింది. ప్రస్తుత కవిత్వ పుస్తకం దానికి కొనసాగింపు. కవిగా ప్రతాపరెడ్డి ప్రతిభను అంచనా వేయడానికి, విశ్లేషించడానికి, తొలితరం తెలుగు కవుల్లో న్యాయమైన, సముచిత స్థానం ఆయనకు దక్కాలనే ఉద్దేశ్యంతో కూడా ఈ కవితల్ని ఒక్కదగ్గరికి తేవడంలో ఉంది. దాదాపు 15  యేండ్ల వెతుకులాట/ పరిశోధన ఫలితం ఈ పుస్తకం.
    అయినప్పటికీ ఇది ‘సమగ్రం’ కాదు అని నాకు తెలుసు. కృష్ణాపతిక్రలో 1918లో వచ్చాయని చెబుతున్న కవితలు నాకు అందుబాటులోకి రాలేదు. అలాగే చాలా కవితలు అసంపూర్తిగా దొరికాయి. ఇప్పుడీ పుస్తకం వెలుగులోకి రానట్లయితే భవిష్యత్తులో ఈ మాత్రం కవిత్వం కూడా అందుబాటులో లేకుండా పోతుందనే ఉద్దేశ్యంతోనే వీటి ముద్రణకు పూనుకోవడమయ్యింది. ప్రతాపరెడ్డి లేఖిని నుంచి వెలువడ్డ రెండు పద్యకావ్యాలు చంపకీ భ్రమర విషాదము, హరిశర్మోపాఖ్యానము ఆయన బతికున్న కాలంలోనే పోగొట్టుకున్నాడు. వీటి పేర్లు తప్ప వాటిలోని పద్యాలు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయాయి. 1948లో గోలకొండ పత్రికలో వెలువడ్డ ‘ఆస్తినాస్తి విచికిత్స’ అనే పద్యాలు కూడా నాకు దొరకలేదు. ఇది దేవుని అస్తిత్వానికి సంబంధించి అనుమానాస్పదముగా, చమత్కార గర్భితంగా వ్రాయబడ్డ పద్యాలు. సూతాఖ్యాయిక పద్యాలను సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా చండూరు నుంచి పంపించారు. ఆ పద్యాలు కూడా మొత్తం దొరకలేదు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదంలోని కొన్ని కవితలు ఆ యా కథాక్రమం నుంచి విడదీసి, ఉత్తమ కవితలను అనుబంధంలో చేర్చడమయింది. మద్యపానము లాంటి పద్యాలు గత 90 ఏండ్లలో మొట్టమొదటిసారిగా ఈ పుస్తకంలోనే చోటు చేసుకున్నాయి.
    లిలిలి
    అడ్డదారి, దొంగదారి, దొడ్డి దారి అది ఏదైతేనేం, ‘ఉత్తర’మో ‘దక్షిణ’ మో, కుడి, ఎడమ అది ఏ మార్గమైతేనేమి తమ స్వీయ ప్రయోజనాలు, స్వలాభమే పరమావధిగా ఊరేగుతున్న సాహిత్యకారుల కార్యాల వల్ల నిజమైన వైతాళికులకు దక్కాల్సిన గౌరవం గతంలో దక్కలేదు. వర్తమానంలోనూ ఆ పరంపర ఇంకా కొనసాగుతోంది. యూనివర్సిటీలు, అకాడెమీలు, భాషా సంఘాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ గిరిగీసుకొని ప్రజ్ఞకు తావుఇవ్వకుండా పనిచేస్తున్నాయి. నిజానికి పరిశోధనతో కూడిన రచనలు వెలువరించాల్సిన తెలుగు విశ్వవిద్యాలయం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. తెలుగునాట ఒకప్పటి సాహిత్య అకాడెమీలు చేసినంత పాటి కృషి కూడా రాష్ట్రవ్యాప్తమైన ఈ యూనివర్సిటీ చేయలేకపోతున్నదంటే దిగజారిన నేటి స్థితి తెలుస్తుంది. అకడమిక్‌ రంగంలో 99శాతం ‘మేధావులు’ ముఠాలు, కుమ్ములాటలు, పై పోస్టులకు పైరవీలు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించటానికి వ్యూహాలు, ఎత్తుగడలు, పన్నాగాలు తప్ప పని మాత్రం సున్నా. ఇక ‘అధికార భాషా సంఘం’ వంధిమాగధుల సమాగమంగా మారింది. ప్రాంతీయ స్పృహ పెరిగిన తర్వాత వివిధ అంశాల పట్ల ఆసక్తితో పరిశోధకులుగా మారిన వారే ఎక్కువ సాహిత్యాన్ని, రచనలను వెలుగులోకి తెస్తున్నారు. నిజంగా ఈ పరిశోధనంతా ‘కృతజ్ఞత లేని కృషి’. అయినా కూడా సాహిత్యం, చరిత్ర, సంస్కృతి పట్ల సాహితీవేత్తల కృషి పట్ల మమకారం, అభిమానం కొత్త వెలుగుల్ని ప్రసరింపజేస్తున్నాయి. ‘మనం కూడా చరిత్రకెక్కదగిన వారమే’ అని ఘంటాపథంగా ఉద్ఘాటించి ఆంధ్రుల సాంఘిక చరిత్రను అద్భుతంగా రికార్డు చేసిన సురవరం ప్రతాపరెడ్డి గురించి ఇప్పటికే కొంత సమాచారం, సాహిత్యం వెలుగులోకి వచ్చింది. ఇలా ఎంత చరిత్ర వెలుగులోకి వచ్చినా ఏదో ఒక పార్శ్వం మిగిలిపోయే బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి. ఆంధ్రుల సాంఘిక చరిత్రను అచ్చేయాల్సిన తెలుగు విశ్వవిద్యాలయం చేతులెత్తేసింది. కేవలం తెలుగు శాఖలోనే కాదు, అటు రాజనీతి, సామాజిక, ఆర్థిక శాఖల్లో కూడా ఆయన ‘కాంట్రిబ్యూషన్‌’ గురించిన పరిశోధన జరగాల్సి ఉండిరది. ‘తెలుగు అకాడమి’ ఆంధ్రప్రాంత సాహితీవేత్తల ‘పీఠాలు’ ఏర్పాటు చేసింది గానీ ‘సురవరాన్ని’ విస్మరించింది. నిజాయితీపరులు, నిష్పాక్షికంగా వ్యవహరించే వాళ్లు లేకపోవడంతో అన్ని రంగాల్లో సీమాంధ్రులదే హవా నడిచింది. దురదృష్టవశాత్తు తెలుగు నేలంతటా పరుచుకుపోయిన సీమాంధ్ర సాహిత్యవేత్తల వలస ధృక్పథం మూలంగా తెలంగాణ మూలవాసులపై ముఖ్యంగా వైతాళికులపై వారి రచనలపై తగినంత కృషి, పరిశోధన, విశ్లేషణ, విమర్శ, ప్రచారం జరుగలేదు. దీనికి ప్రధాన కారణం మూల రచనల అలభ్యత. ఎప్పుడో 50`60 యేండ్ల క్రితం ప్రచురితమైన పుస్తకాలు నేడు సాధారణంగా అందుబాటులో ఉండవు. సీమాంధ్ర రచయతలను భుజాన మోసుకొని ప్రచారం చేసే ప్రచురణ సంస్థలు లాంటివి తెలంగాణకు లేకపోవడం కూడా మరో కారణం. ప్రభుత్వ డబ్బుతో నడిచే తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడెమీల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రచనలు చాలా అరుదుగా అచ్చవుతాయి. ఈ సంస్థలు ప్రచురించిన పుస్తకాలే ప్రామాణికమైన గ్రంథాలుగా చలామణి అవుతాయి. కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ల్లో గానీ, యూనివర్సిటీల సిలబస్‌లో, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఈ పుస్తకాలే పాఠ్యాంశాలై వెలుగుతాయి. అందువల్ల తెలంగాణ ప్రతిభకు, వైభవానికి గుర్తింపు లేకుండా పోతుంది. ఇదంతా తెలంగాణలో ప్రతిభను అణచివేయడానికి పాలకవర్గాలు, వారికి తాబేదార్లుగా వ్యవహరించే అధికారులు, వారికి సలహాలిచ్చే పక్షపాత మేధావి వర్గం వల్ల వచ్చిన సమస్య. ఈ పరిస్థితిని అధిగమించడానికి తెలంగాణ సోయితోటి వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్థలు పనిచేయాల్సి వస్తున్నది. వీరి నిరంతర కృషి వల్ల ఇటీవలి కాలంలో ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావు,  కాళోజి నారాయణరావు తదితరుల రచనలు అచ్చయ్యాయి. దానికి జోడిరపుగా అస్తిత్వ స్పృహతో ఈ ‘సురవరం కవిత్వం’ పాఠకుల ముందుకు తెస్తున్న. అంటే పాలక వర్గం పట్టించుకోకుండా పోయిన సాహిత్యాన్ని వెలుగులోకి తెస్తున్న అనే సోయితో ఈ పని చేస్తున్నాను.
    25 యేండ్ల పాటు ప్రతిరోజూ సాహిత్య సృజన చేస్తూ, పీడిత ప్రజల పక్షాన నిలిచి యుద్ధం చేసిన కలం యోధుడు ప్రతాపరెడ్డి. ఆయన గురించిన ప్రాథమిక సమాచారం కొంత అక్కడక్కడా రికార్డయి ఉంది. కానీ ఆయన ప్రతిభను, వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని, కవిత్వాన్ని, పరిశోధన ప్రతిభ, ముక్కుసూటి విమర్శ, సాహిత్య ఆధారాల ద్వారా నిర్మించిన చరిత్రను జమిలిగా ఒకదానితో ఒకటి లింక్‌ చేసి చూసినప్పుడే ఆయన గురించి ఒక ప్రాథమిక అంచనాకు రావడానికి వీలవుతుంది. సంస్థానాధీశులు, దేశ్‌ముఖ్‌ల పెట్టుబడులు, ఆర్థిక సహాయ సహకారాలతో, ప్రోత్సాహంతో ప్రారంభమైన ‘గోలకొండ పత్రిక’లో ఎక్కడా కూడా వారిని ‘స్పేర్‌’ చేయలేదు. సందర్భానుసారంగా దొరలు, భూస్వాములపై తన సంపాదకీయాలు, వ్యాసాల ద్వారా తూర్పార బట్టిండు.  సంస్థానాధీశులు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండ్యాలు, జమిందారులు, భూస్వాములు పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, వారు తమ వైఖరిని మార్చుకోవాలంటూ వ్యాసాలు రాసిండు. ఇది గిట్టని వనపర్తి రాజా రామేశ్వరరాయలు పత్రిక యజమాని హోదాలో ప్రతాపరెడ్డి తన సొంత గ్రామం ఇటికాలపాడులో ఉన్న సమయంలో టెలిగ్రామ్‌ ఇస్తూ ఉన్నపళాన ఉద్యోగంలో చేరాలని హుకుం జారీ చేసిండు. దీనికి స్పందించి ప్రతాపరెడ్డి హైదరాబాద్‌ చేరుకునే లోగానే తన సహాధ్యాయి నూకల నరోత్తమరెడ్డిని రామేశ్వరరాయలు పత్రికా సంపాదకులుగా నియమించాడు.
    లిలిలి
    సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని మాత్రమే అంటే సరిపోదు. ఆయన చేపట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ నాయకుడిగా, ఆంద్రమహాసభ రూపకర్తగా, రచయితగా, నాటక కర్తగా, కవిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, పత్రికా సంపాదకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, తొలి పౌరహక్కుల రచయితగా, వివిధ దళిత, బీసీ కులసంఘాల గౌరవాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. అట్లాంటి వెన్నెముఖ ఉన్న ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి గురించి నేటి తరం తెలుగు వాళ్లకు తెలిసింది తక్కువ. తెలియాల్సిందే ఎక్కువ.
    సురవరం ప్రతాపరెడ్డి మరణించి 60 యేండ్లు గడిచాయి. అయినా నేటికీ ఆయన కవిత్వం పుస్తక రూపం దాల్చలేదంటే దానిక్కారణం ఎవరనేది తెలుగు సాహిత్యాభిమానులందరూ ప్రశ్నించుకోవాలి. కేతవరపు రామకోటి శాస్త్రి, ఇందుర్తి ప్రభాకరరావు, ఎల్లూరి శివారెడ్డి, ముద్దసాని రామిరెడ్డి, ఎన్‌.ఆర్‌. వెంకటేశం, చింతల యాదయ్య, తూర్పు మల్లారెడ్డి లాంటి వాండ్లు ‘సురవరం కవిత్వా’న్ని అంచనా వేయడానికి కొంత కృషి చేసిండ్రు. అయితే ఇందులో ఎవ్వరు కూడా ప్రతాపరెడ్డి ‘కవితాత్మ’ను పట్టుకోలేక పోయిండ్రు. అందుకు సురవరం కవిత్వం మొత్తం లభ్యం కాకపోవడం ఒక కారణమైతే ఆయన కవిత్వం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకపోవడం మరో కారణం.
    ఒక వ్యక్తి మీదగానీ, ఒక ప్రాంత సాహిత్యం మీద పూర్తి స్థాయి వివరాలు వెలుగులోకి రావాలన్నా, వారి కృషికి తగిన గుర్తింపు దక్కాలన్నా ప్రథమంగా జరగాల్సింది ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి అలభ్య రచనల గురించీ వివిధ మాధ్యమాల ద్వారా నలుగురికి తెలిసేలా చేయడం. రెండోది ఒక ప్రాంత సాహిత్యానికి న్యాయంగా దక్కాల్సిన గుర్తింపు దక్కాలంటే ముందుగా ఆ రచన అందరికీ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకోవాలి.
    తెలంగాణ వాళ్లకు ‘సెల్ఫ్‌ ప్రమోషన్‌’ తెలియదు. తాము రాసింది ఏదో తమ భావనను పేపర్‌పై పెట్టడమే తప్ప అది అందరికీ అందుబాటులోకి రావాలనే తహతహ ఏనాడూ ఉండేది కాదు. వట్టికోట ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావు లాంటి వారు ఈ కోవకు చెందినవారే. వారి గురించి, వారి సాహిత్యం గురించి ఇటీవలి కాలంలో పరిశోధన విస్తృతంగా జరగడం వల్ల మాత్రమే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొట్లపల్లి రామారావుపై, ఆళ్వారుస్వామిపై వచ్చిన పుస్తకాలు ఈ కోవలోనివే. అలాగే మరుగునపడ్డ కథకుడు ‘గూడూరి సీతారాం’ని ప్రయత్న పూర్వకంగా నిలబెట్టుకున్నాము.
    ఇక్కడ ప్రతాపరెడ్డి పరిస్థితి మరీ దారుణం. ఆయన బ్రతికున్న కాలంలోనే ఆయన రచనలు అగ్నికి ఆహుతి కావడం వల్ల, పిల్లలు పనికి రాని కాగీతాలని తీసి ఆడుకోవడం వల్ల ఆ రచనలు ఏనాడో పోయాయి. పోయినవి పోగా అక్షరబద్ధమైన సాహిత్యమంతా పుస్తకాలుగా వెలువడ్డాయా? అంటే అదీ లేదు. కొంతమేరకు ‘సురవరం సాహితీ వైజయంతి’ ఈ విషయంలో కృషి చేసింది. వ్యాసాలు, సంపాదకీయాలు, పీఠికలు, కథలు, నాటకాలు, హైందవ ధర్మపోలీలు పేరిట కొన్ని పుస్తకాలని అచ్చేసింది. అయితే ఇవి ఆయన రచనల్ని రేఖామాత్రంగా పరిచయం చేయడానికి పనికి వస్తాయి తప్ప సమగ్రం కాదు. గోలకొండ పత్రిక సంపాదకుడిగా 1925 నుంచి 1949 వరకు దాదాపు 25 ఏండ్లు ప్రతిరోజూ వివిధ రకాలైన రచనలు చేసిన ప్రతాపరెడ్డి సాహిత్యం ఇంకా వెలుగు చూడాల్సింది (సంపుటాలుగా) దాదాపు పదివేల పేజీలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రమహాసభల సమావేశాల సందర్భంగా చేసిన ప్రసంగాలు, ప్రవేశ పెట్టిన తీర్మానాలు, గోలకొండ పత్రికల్లోని సంపాదకీయాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆయన స్వయంగా రాసుకున్న ‘స్వవిషయ సంగ్రహం’ అనేక కొత్త విషయాల్ని తెలియచెబుతాయి. అలాగే ఎన్నో కొత్త ఆలోచనలను రేకిత్తిస్తాయి. రైతుల గురించి, మద్యపానం, సంఘోద్ధరణ,  నిజాం సంస్కరణలు మొదలగు అంశాలపై రాసిన పుస్తకాలు సంపుటాలుగా వెలువడ్డ నాడే ఆయన సమగ్ర సాహిత్యం అందుబాటులోకి వచ్చినట్లు. ఇవేవి లేకుండా ప్రతాపరెడ్డిని సాహితీవేత్తగా అంచనా వేయడం అసమంజసం, అసంభవం.
    ఇలాంటి సందర్భంలో ‘సురవరం సమగ్ర సాహిత్యాన్ని’ అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా గత 15 యేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాను. 1998లోనే సురవరం తనయుడు శ్రీ ఎస్‌.ఎన్‌.రెడ్డిని కలిసి ఇంటర్వ్యూ చేయడమైంది. అందులో భాగంగా వివిధ పత్రికల్లో సురవరం భిన్న పార్శ్వాలపై అనేక వ్యాసాలు వెలువరించడమైంది. ‘సురవరం తెలంగాణ వ్యాసాలు’ పుస్తకాన్ని మిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రచురించాము. అందుకు కొనసాగింపూ, ఒక విధంగా నూతన ఆవిష్కరణ ఈ ‘సురవరం కవిత్వం’ పుస్తకం. ఇంతవరకూ ఎక్కడా పుస్తక రూపం దాల్చని, పత్రికల ప్రతుల్లోనే మగ్గిపోయిన పద్యాలు, గేయాలు, గీతాలను, కవిత్వాన్ని ఇక్కడ ఒక్క దగ్గర చేర్చడం జరిగింది. కవిగా ప్రతాపరెడ్డి ప్రజ్ఞ ఇందులో తెలుస్తూంది.
    ఇన్నేండ్ల నుంచి లేంది ఇప్పుడే ఈ పుస్తకం ఎందుకు వస్తూంది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. 80 యేండ్లుగా ముద్దుకృష్ణ సంకలనం చేసిన ఆంధ్రప్రాంత కవుల సంకలనం ‘వైతాళికులు’ని పదుల సార్లు అచ్చేసిన విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఇంతవరకు తెలంగాణ ప్రాంత కవుల సంచిక ‘గోలకొండ కవుల సంచిక’ను అచ్చేయలేదు. తాము తలచుకుంటే చాలు దానికి పత్రికల ద్వారా, సదస్సుల ద్వారా విపరీతమైన ప్రచారం కల్పించేందుకు విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి ప్రచురణ సంస్థలు ప్రతిసారీ అందరికన్నా ముందుంటాయి. ప్రస్తుత సందర్భంలో ప్రత్యేక తెలంగాణ అనుకూల, వ్యతిరేక పార్టీల మౌత్‌పీస్‌లుగా పనిచేస్తున్న ఈ ప్రచురణ సంస్థలు సారంలో మాత్రం తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వైతాళికులకు వందకు తొంభై శాతం వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అలాగే వివిధ సాహిత్య పత్రికలు కూడా తగినంత గుర్తింపు తెలంగాణ వైతాళికులకు, సాహిత్యానికి ఇవ్వడం లేదు. ఇది వారి జ్ఞానంలోని ఖాళీలలకు గుర్తింపు మాత్రమే. ఈ ఖాళీలను పూరించి, తెలంగాణకు సంబంధించిన జ్ఞానాన్ని పంచే ఉద్దేశ్యంతోనే ఈ ‘సురవరం కవిత్వం’ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము. ఇది ఈనాటి ప్రయత్నం కాదు. గత 15 యేండ్లుగా తెలంగాణ సాహిత్యాన్నంతటిని వెలుగులోకి తీసుకురావాలని పడుతున్న తపనలోంచి వచ్చిన పుస్తకం. 
        లిలిలి
    తెగిస్తున్న ప్రస్తుత తెలంగాణ` మాయా, మర్మం, కుట్ర, మోసం, ద్రోహం, కుతంత్రం, పన్నాగం, స్వపక్షంలో ప్రతిపక్షం అన్నింటిని పసిగడుతోంది. అనుభవంలోకి వచ్చిన అన్యాయాల్ని ఎదిరించేందుకు, నోటికాడి బుక్క దక్కకుండా చేస్తున్న ఎత్తుగడల్ని పటాపంచలు చేయడానికి ఆయుధాల్ని తమ మూలాల్లో వెతుక్కుంటోంది. సీమాంధ్ర వలసాధిపత్య అహంకారుల ‘కొడవండ్ల’ గొడ్డళ్ళ దెబ్బకు తెగిన తల్లి వేర్లతో బంధాన్ని పునఃస్సంధానం చేసుకుంటోంది. వలసాధిపత్యంలో సర్వం దోపిడీ తప్ప ఒనగూడిరది ఏమీ లేదని ఇన్నేండ్ల సమైక్య పాలనలో అర్థమయింది. ఒక్కొక్క ద్రోహం అర్థమయిన ప్రతీసారి, అనుభవంలోకి వచ్చిన ప్రతీ మోసం పరాయి పాలకులపై కసిని మరింత పెంచుతోంది. పాలకులొక్కరి మూలంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పలేం. పాలకులకు దన్నుగా, అధికారుల వివక్షాపూరిత నిర్ణయాలు, సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ‘అంతా మేమే, మీదేమి లేదు’ అనే సంకేతాలిస్తూ ఇన్నేళ్లూ వెలిగిపోయిన వలసాంధ్రుల ఆధిపత్యం మనం కోల్పోయిన వైభవాన్ని సాటి చెబుతుంది.
    ఆ వైభవానికి అక్షరరూపం కల్పించడంలో భాగంగా వస్తున్న పుస్తకం ఈ ‘సురవరం కవిత్వం’. ఈ పుస్తకం తేవడానికి ప్రధాన ప్రేరకుడు, నిజానికి సహ సంపాదకుడిగా ఈ పుస్తకానికి వ్యవహరించాల్సినంత పనిచేసిన మిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి తోడ్పాటు మరువలేనిది. పుస్తకం ఎంతవరకొచ్చిందని వెంటబడుతూ, పుస్తకాన్ని తొందరగా, మేలైన రీతిలో తీసుకు రావడంలో విలువైన సూచనలు, సలహాలు అందించిన మిత్రుడు ఏశాల శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు. పుస్తకం ఈ రూపంలో రావడానికి ‘అన్ని’విధాల సహకరించడమే గాకుండా, తన సహాధ్యాయి, సురవరం ప్రతాపరెడ్డి తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి గారి నుంచి కొన్ని పద్యాలను తెప్పించి ఇచ్చిన గురుతుల్యులు కె.మదుసూధన్‌ రెడ్డి గారికి వందనాలు. నేను 1989`93 మధ్యకాలంలో ఆర్ట్స్‌ కళాశాలలో చదువుతున్న కాలం నుంచీ ఆయనంటే అభిమానమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణవాదాన్ని ఆవాహన చేసుకోవడంలో ఆయన ప్రభావం గణనీయంగా ఉంది. వారి ఆశీస్సులు, సహాయ సహకారాలతో ఆనాడు నడిచిన ‘తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌’లో నేను కూడా ప్రధాన పాత్ర పోషించాను. ప్రతాపరెడ్డిగారి అముద్రిత పద్యాలు ‘సూతాఖ్యాయిక’ అందించిన సురవరం విష్ణువర్ధన్‌ రెడ్డిగారికి, పుస్తక ప్రచురణకు ప్రోత్సహించిన సురవరం పుష్పలత గారికి, తెలుగు విశ్వవిద్లాయం వైస్‌ ఛాన్సలర్‌, ప్రతాపరెడ్డిగారిపై పరిశోధన చేసిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గార్లకు ధన్యవాదాలు. ఈ పుస్తకానికి ఆర్థిక వనరుల్ని సమకూర్చి పెట్టిన పెద్దలు డి.పి.రెడ్డి గార్కి హృదయ పూర్వక నమస్సులు. గతంలో మాదిరిగానే ఈ పుస్తకానికి కూడా ఆర్థికంగా చేదోడుగా నిలిచిన మిత్రుడు శ్రీధర్‌రావు దేశ్‌పాండే. తెలంగాణ ఉద్యమంలో తలకు మించిన భారాల్ని మోస్తూ కూడా అడిగిందే తడవుగా సమయమిస్తూ, వివిధ విషయాల్ని ఎప్పటికప్పుడు చర్చకు పెట్టే ప్రజాస్వామిక వాది శ్రీధర్‌కు నమస్తే.
    ప్రతాపరెడ్డి రచనలన్నీ రావాలని కోరుకొని ఈ కవితా సంకలనం వెలువరించడానికి విలువైన సూచనలిచ్చి ప్రోత్సహించిన ఆప్తుడు, మిత్రుడు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌కి శణార్థి. ఈ పుస్తకం ఎప్పుడొస్తుందని ఎప్పటికప్పుడు నా బద్ధకాన్ని ఒదిలిస్తూ వెంటబడి పనిచేయించిన మిత్రుడు డాక్టర్‌ గంటా జలంధర్‌ రెడ్డి, జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి గార్కి, కాసుల ప్రతాపరెడ్డి గార్కి నమస్సులు.
    ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ ప్రచురణలు, తెలంగాణ హిస్టరీ సొసైటీల్లోని మిత్రులు, వేముగంటి మురళీకృష్ణలకు థాంక్స్‌. వీరందరికీ మించి నా పుస్తకాలని అపురూపంగా కాపాడడమే గాకుండా, నేను రాసిన దానికి మొదటి చదువరి, తీర్పరి నా సహచరి స్వర్ణమంజరి. ఆమె సహకారం లేకుండా నా పరిశోధన సాగడం దాదాపు అసంభవం. ఈ అసంభవాన్ని సంభవం చేసినందుకు, చేస్తున్నందుకు కృతజ్ఞతలు. తెలంగాణ భాషను, సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్న నా పిల్లలు సిరి, శివలకు ఆశీస్సులు.

10`8`2012                                                                                                                 -సంగిశెట్టి శ్రీనివాస్

 

Foreword to the suravaram poetry being launched on 31st august 2012..

Saturday 25 August 2012



Rally taken at tankbund by noted writers and activists

టాంక్‌బండ్‌ మీ భారాన్ని మొయ్యలేదు!

    అహంకార పూరిత ఆధిపత్యాన్ని సీమాంధ్ర ప్రభుత్వం మళ్లొక్క సారి తెలంగాణ ప్రజలమీద ప్రదర్శించడానికి పకడ్బందీ పథకాలు రచిస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను పున: ప్రతిష్టించడానికి ఆగమేఘాల మీద జీవోలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని, సింగిడి, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ప్రజాఫ్రంట్‌, తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి, ఇతర తెలంగాణ సంఘాలు, వ్యక్తులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం పంతానికి పోతోంది. మొండిగ ముందడుగేస్తుంది. ఈ విషయంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ‘విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శకాలు’ నిర్ణయించేందుకు ఐదుగురు సభ్యులతో కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించింది. పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో తెలంగాణకు బద్ధవ్యతిరేకులైన ఎం.మహేందర్‌ రెడ్డి, ఎన్‌. రఘువీరా రెడ్డి, ధర్మాన ప్రసాదరావులున్నారు. వీరితో పాటుగా తెలంగాణ కాడెత్తేసిన జానారెడ్డి కూడా కమిటీలో ఉన్నాడు.
    కొమరం భీమ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పుతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ అందుకోసం ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. అయితే కూలిన 16 విగ్రహాలను మళ్లీ పెట్టేందుకు మాత్రం యుద్ధ ప్రాతిపదికన 76 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం అందులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదల చేసింది కూడా. మూడు నెలల కాలంలో విగ్రహాల ఏర్పాటు పూర్తి చేసేందుకు ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. ఒక వైపు తెలంగాణలోని అన్ని విద్యార్థి జేఏసీలు విగ్రహాల పున: ప్రతిష్టను వ్యతిరేకిస్తున్నాయి. ఒక వేళ ప్రజాభీష్టాన్ని కాదని ప్రతిష్టించినా వాటిని కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నాయి కూడా.
    అసలు ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాల తొలగింపుకు ప్రధాన కారణం తెలంగాణ వాళ్లుండాల్సిన స్థలాల్ని సీమాంధ్రులు కబ్జా చేయడం. తెలంగాణ వెలుగులతో నిండాల్సిన ట్యాంక్‌బండ్‌ని తమ ప్రాంతం వారితో నింపుకున్నందుకు ప్రజల్లో భావోద్వేగాలున్నాయి. దీనికి తోడుగా మార్చి పదిన ప్రజల్ని ఎక్కడికక్కడ నిర్బంధించి, వేదించడంతో నిగ్రహం కోల్పోయిన ప్రజలు తమ ఆగ్రహాన్ని సీమాంధ్ర విగ్రహాలపై వెళ్లగక్కారు. అది కూడా అత్యంత విచక్షణతో. ఆగ్రహంలో కూడా తెలంగాణ వాదులు కచ్చితమైన విచక్షణ పాటించారు. ఒక్క మహిళ విగ్రహాన్ని కూడా ముట్టు కోలేదు. దళిత, ముస్లిం, బీసీలకు చెందిన ఏ విగ్రహాన్ని తొలగించలేదు. వేమన, పోతులూరి, శ్రీశ్రీ, వరంగల్‌ వచ్చిపోయాడన్న ఒకే ఒక్క కారణంతో తిక్కన విగ్రహాన్ని కూడా స్పేర్‌ చేసిండ్రు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యను కూడా తాకలేదు. అయినా మొత్తం 33 విగ్రహాల్లో కేవలం ఏడుగురే తెలంగాణ వాళ్లెందుకున్నరు? జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ బిడ్డలు కనీసం 15 మందైనా ట్యాంక్‌బండ్‌పై ఉండాల్సింది. అలా కాకుండా కేవలం రుద్రమ, మహబూబ్‌ అలీఖాన్‌, మగ్దూం, సురవరం, రామదాసు, తానీషా, పోతన మాత్రమే ఎందుకున్నారని తెలంగాణ వాదులు నిలదీస్తున్నారు. మార్చి 14నాడు స్వాభిమాన్‌ యాత్ర జరిపి తెలంగాణ కవులు, రచయితలు, మేధావులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ట్యాంక్‌బండ్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని డిమాండ్‌ చేసిండ్రు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి విగ్రహాలను పున: ప్రతిష్టిస్తే అవి మళ్లీ కూలుతాయని కూడా తెగేసి చెప్పిండ్రు. అయినప్పటికీ సీమాంధ్ర ప్రభుత్వం, అధినేతలు ప్రజల కోరికను ఏమాత్ర ఖాతరు చేయకుండా తమ ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆరునూరైనా, తెలంగాణ ప్రజల డిమాండ్‌ను కాలరాయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 
    ట్యాంక్‌బండ్‌లో తెలంగాణ బిడ్డలు శవాలై తేలుతూ ఉంటే, కట్టమీద మాత్రం సీమాంధ్ర విగ్రహాలు వెలిగిపోతున్నాయి. 700ల మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే ఏనాడు సంతాపం ప్రకటించని, కనీసం ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చని వాళ్లు ఈనాడు నీతులు చెబుతుండ్రు. కట్టమీద కాళోజి విగ్రహం లేదు, దాశరథి విగ్రహం లేదు అంటే దానికి దీర్ఘాలు తీస్తూ విగ్రహాలు పెట్టే నాటికి వాళ్లు బతికే ఉన్నారు. అందుకే పెట్టలేదని ప్రభుత్వం తరపున సిపిఎం మేధావులు వకాల్తా పుచ్చుకుంటుండ్రు. పోనీ వాళ్లని వదిలేద్దా! మరి 1986కు ముందే లబ్ద ప్రతిష్టులయిన తెలంగాణ బిడ్డలు వందల మంది ఉన్నరు. వారెందుకు యాదికి రాలేదనే అడుగుతున్నాం. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్‌ వారిని, అందుకు వంత పాడిన నిజాం పాలకులను గడగడలాడిరచిన తుర్రెబాజ్‌ఖాన్‌, పత్రికా స్వేచ్ఛకోసం దేశంలోనే మొట్టమొదటి బలిదానమిచ్చిన షోయెబుల్లాఖాన్‌, అంతెందుకు హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్‌షా, గోలకొండ నవాబుల నెదిరించిన సర్వాయి పాపన్న, రాంజీ గోండు, కొమురం భీమ్‌, అంబేద్కర్‌ కన్నా ముందే దేశవ్యాప్తంగా దళిత చైతన్యాన్ని రగిలించిన భాగ్యరెడ్డి వర్మ, దేశీ వాఙ్మయానికి పట్టం కట్టిన పాల్కురికి సోమనాథుడు, కాశీలో పీఠం ఉన్నా రాష్ట్రంలో గుర్తింపు లేని మల్లినాథసూరి, తొలి అచ్చతెనుగు కావ్యకర్త పొన్నిగంటి తెలగన్న, అంతెందుకు ఆంధ్ర ప్రాంతానికి కూడా సంబంధమున్న ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు, జాతీయ రాజకీయాల్లో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడిరచిన సరోజిని నాయుడు, ‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి ఇట్లా కొన్ని వందలు, వేల మంది తెలంగాణ వైతాళికులు ట్యాంక్‌బండ్‌పై నిలబడ్డానికి అర్హులైనవారున్నారు. అయినప్పటికీ వారికెవ్వరికీ అక్కడ చోటివ్వకుండా తమ ప్రాంతం వారిని ప్రతిష్టించుకొని తెలంగాణలో వీరితో సరితూగగలిగే వారు లేరు అనే సంకేతాన్ని ఈ 25 యేండ్లుగా పంపించారు. ‘మేమూ చరిత్రకు ఎక్కదగిన వారమే’ అని చెప్పుకోవాల్సిన దయనీయమైన పరిస్థితిని తెలంగాణ వాళ్లకు కల్పించారు.
    తెలంగాణ తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నినదించిన ప్రతిసారీ మీరు అందుకు అనర్హులు అని వేలేత్తి చూపే ప్రయత్నం సీమాంధ్ర మేధావులు కుట్రపూరితంగా చేస్తూనే ఉన్నారు. అందులో భాగమే కాళోజి, దాశరథిల ప్రస్తావన అనేది గ్రహించాలి. అవును వీరితో పాటు 1952 ముల్కీ ఉద్యమంలో, 1969 ఉద్యమంలో, ప్రస్తుత ఉద్యమంలో బెల్లి లలితతో సహా ప్రాణాలర్పించిన వీరులందరూ విగ్రహాలై వెలగడానికి అర్హులైన వారే! ‘థాట్‌ పోలిసింగ్‌’ ద్వారా తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణలోనే అభిప్రాయాన్ని కూడగట్టాలని కుట్రలు పన్నుతున్నరు. వాళ్ల కుట్రలు, కుతంత్రాలు ఇక సాగవని తెలంగాణ తెగేసి చెబుతుంది.
    మార్చి పది నాడు తెలంగాణ ప్రజలు చావో రేవో తేల్చుకునే విధంగా టాంక్‌బండ్‌పై జమయ్యిండ్రు. ప్రభుత్వంపై, దాని వివక్షా పూరిత చర్యలపై ఆగ్రహం చెందిన తెలంగాణ వాదులు అందుకు ప్రతీకారం తీసుకోవాలని చూసిండ్రు. అప్పుడు వాళ్లకు కనిపించిన ఏకైక సీమాంధ్ర ప్రతీకలు విగ్రహాలు. అంతే విగ్రహాలు ప్రజల ధర్మాగ్రహానికి బలయ్యాయి.  ప్రజలు వాటిని కేవలం సీమాంధ్రుల విగ్రహాలుగా కాకుండా ఆధిపత్య చిహ్నాలుగా మాత్రమే చూసిండ్రు. అందుకే వాటిని అక్కడి నుంచి తప్పించిండ్రు. అయితే తొలగించిన వాటి స్థానంలో మళ్లీ కొత్తవి మా కడుపుల బల్లెంలాగా దించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే కచ్చితంగా ప్రజలు ప్రతిఘటిస్తారు. తెలంగాణ వచ్చేవరకు ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి విగ్రహాలు నిర్మించాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అక్కడ ఎవ్వరి విగ్రహం ఉండాలనేది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల ఇష్టాఇష్టాలను గ్రహించి మెలగాల్సిన ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది కాబట్టి ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
    తెలంగాణ బిడ్డల్ని ఏకాణకు కూడా కొరిగాకుండా చేస్తూ, మా మాటకు విలువ లేకుండా చేస్తూ, మా మనోభావాల్ని గుర్తించ నిరాకరించిన మీ బొమ్మల్ని మా టాంక్‌బండ్‌ మొయ్యడానికి సిద్ధంగా లేదని తెలంగాణ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇకనైనా వివక్షాపూరిత ఏకపక్ష దోరణికి స్వస్తి పలకాలని డిమాండ్‌ చేస్తున్నరు.
                                                                                                                                       -సంగిశెట్టి శ్రీనివాస్‌  

Friday 24 August 2012

JYOTHIBA PHULE AND TELANGANA

ఫూలేతో కలిసి నడిసిన తెలంగాణ


    నేటి భారతదేశ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సామాజిక విప్లవకారుడు జ్యోతిరావ్‌ ఫూలె. స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం నిత్యం నినదిస్తున్న తెలంగాణ బిడ్డలు ఇయ్యాళ ఆయన్ని అడుగడుగున యాద్జేసుకుంటున్నరు. ఆయన వర్ధంతిని (నవంబర్‌, 28) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘ఆత్మగౌరవ సభ’ నిర్వహించి బహుజనులు జరుపుకుంటున్నారు. అణచబడ్డ వారి హక్కుల కోసం, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బ్రాహ్మణ, అగ్రకుల దాష్టీకానికి వ్యతిరేకంగా ఫూలె చేసిన పోరాటంలో అందరికన్నా ఎక్కువగా ఆయన వెన్నంటి నిలిచింది తెలంగాణ బిడ్డలంటే ఆశ్చర్యం కలుగక మానదు. కాని ఇది నిఖార్సయిన నిజం. ఫూలె ఉద్యమాలకు అండగా నిలిచి, వాటికి జీవం పోసింది తెలంగాణ నుంచి వలసబోయిన తెలుగువారు, బహుజనులు. ఫూలె స్థాపించిన సంస్థలన్నింటిలోకి తలమానికమైనది ‘సత్యశోధక సమాజ్‌’. ఈ సమాజ్‌ స్థాపన నాటి నుండి, ఫూలె మరణానంతరం కూడా దాని కార్యకలాపాల్లో పాల్గొన్నది, ఉద్యమాన్ని నడిపింది తెలంగాణ బహుజనులు. పద్మశాలి, మున్నూరుకాపు, వంజరి తదితర కులాలకు చెందిన నాయకులు ఈ సమాజాన్ని బొంబాయిలో అనేక అడ్డంకుల్ని అధిగమించి నడిపించారు. ముంబయిలో ఫూలే కార్యకలాపాలకు ప్రాణం పోసిందీ, ప్రచారం చేసిందీ ‘మనోళ్లే’.
    భారతదేశంలో బ్రిటీష్‌ వారిపట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో లార్డ్‌ డల్‌హౌసీ తమ పాలనలో కొన్ని మార్పులు తీసుకువచ్చాడు. దీని వల్ల వ్యాపార, వాణిజ్య, రవాణ, ప్రసార వ్యవస్థల్లో మౌళికమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబయి నుంచి థానే వరకు రైలుమార్గ నిర్మాణం ప్రారంభమైంది. అలాగే బట్టల మిల్లుల స్థాపన కూడా ఈ కాలంలోనే జరిగింది. మొదట 1853లో ముంబయి`థానేల మధ్యన రైలు ప్రారంభం అయింది. ఆ మరుసటి సంవత్సరం మొట్టమొదటి బట్టల మిల్లు కూడా ముంబయిలోనే స్థాపితమయింది.  1865 నాటికి ఈ మిల్లుల సంఖ్య 10కి పెరిగింది. ఇందులో పనిచేసే వారి సంఖ్య 6600లకు పెరిగింది. వీరిలో అధిక భాగం తెలంగాణ నుంచి వలసబోయిన పద్మశాలీలే! వీరి కన్నా ముందు ముంబాయికి భవన నిర్మాణ కార్మికులుగా వలస వచ్చిన వంజరి, మున్నూరు కాపు కులస్థులు మొదట కామాఠిపురాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత కాంట్రాక్టర్లుగా ఎదిగారు. ఇప్పుడు ముంబయిలో వందేళ్ళ పైబడిన దాదాపు ప్రతి కట్టడాన్ని తెలంగాణ బిడ్డలే కట్టారంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎదిగి వచ్చిన వారే జ్యోతిరావ్‌ ఫూలెతో కలిసి నడిచారు. సమాజంలో అణచివేతకు గురైన అట్టడుగు వర్గాలకు అండగా నిలిచారు.
    బ్రాహ్మణ వర్గాల ఆధిపత్య ధోరణి వల్ల సమాజంలోని శూద్రులు, అతిశూద్రులకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించడానికి, వారిని సంఘటితం చేసి, చైతన్య పరిచే ఉద్దేశ్యంతో ‘సత్యశోధక్‌ సమాజ్‌’ని పూణెలో సెప్టెంబర్‌, 24, 1873నాడు స్థాపించారు. ఈ ప్రారంభ సమావేశానికి పూణె, ముంబయిల నుంచి దాదాపు యాభైమంది హాజరయ్యారు. ఈ సమావేశంలోనే ఫూలే ‘సత్య శోధక్‌ సమాజ్‌’ అధ్యక్షుడిగా, కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఫూలే కోశాధికారిగా ఎన్నికయినప్పటికీ దానికి ఆర్థికంగా ఆదుకున్నది, అండగా నిలిచింది మాత్రమే తెలుగువారే. ఈ ప్రారంభ సమావేశానికి ముంబయిలో భవన నిర్మాణ కాంట్రాక్టర్లుగా ప్రసిద్ధులయిన రామయ్య వెంకయ్య అయ్యవారూ, నర్సింగరావు సాహెబ్‌ వడ్నాల, జాయా ఎల్లప్పా లింగూ, వెంకూ బాలాజీ కాలేవార్‌లు తదితర తెలుగువారు హాజరయ్యారు. వీరందరూ తమ లేదా, తాత ముత్తాతల మూలాలు తెలంగాణలోనే ఉన్నాయని గర్వంగా చెప్పుకున్నారు.
    సమాజ స్థాపనకు పూర్వం నుంచే ఫూలేకు ముంబయి తెలుగువారితో మధ్య సంబంధాలున్నాయి. ఫూలే ఎప్పుడు ముంబయి వచ్చినా తాడ్‌దేవ్‌లోని తెలుగువాడు ‘నాగూ సయాజీ’ భవనంలోనే మకాం చేసేవాడు. ఇక్కడే రామయ్య అయ్యవారు, ఇతర సభ్యులు తరచూ కలుసుకునేవారు. నిజానికి ముంబయిలో ఫూలే తరపున ఉద్యమాన్ని నిర్వహించింది వలసబోయిన తెలంగాణ బహుజనులు. ‘కన్నీరు’ (రైతుల కన్నీరు) పేరుతో ఒక కరపత్రాన్ని తయారుచేసిన ఫూలే 1873లో ముంబయి వచ్చినప్పుడు సభ్యులకు వినిపించాడు. ఇందులో గ్రామాల్లోని కులకర్ణిలు, వకీళ్లు, ఉపాధ్యాయ జోషీలు రైతులను ఎన్ని రకాలుగా పీడిస్తున్నారో రుద్ధమైన కంఠంతో వినిపించారు. దీనికి  వెంటనే స్పందించిన నాగూరావ్‌ సయాజీ దాని ముద్రణకోసం డబ్బిచ్చారు. ఈ కరపత్రం ఆనాటి రైతుల దీనావస్థని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకి కట్టింది.
    తెలుగు వారు సత్యశోధక్‌ సమాజ్‌లో నిర్వహించిన కీలక భూమికను దాని కార్యదర్శి నారాయణ్‌ తుకారాం నగర్‌కర్‌ తన ద్వైవార్షిక రిపోర్టులో క్షుణ్ణంగా వివరించాడు. నిజానికి ముంబయిలో సమాజ్‌ శాఖను స్థాపించి, నడిపించాల్సిందిగా ఫూలే స్వయంగా రామయ్య అయ్యవారుకు లేఖ రాసిండు. ఆ పిలుపు మేరకు కామాటిపుర (కామ్‌Gమట్టిR మట్టి పనివారల పురం)లోని 18మంది తెలుగువారు సమాజ్‌ సభ్యత్వాన్ని స్వీకరించారు. అంతేగాకుండా సమాజ్‌ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ మరింతమందిని సభ్యులుగా చేర్పించారు. ఈ సమాజ్‌లో మొదట రామయ్య అయ్యవారూ, జాయా కారడిలింగూ, వెంకూ బాలాజీ కాలేవార్‌, జాయా నాగూ పర్‌బాజీ, నర్సింగరావు సాహెబ్‌ వడ్నాల, బాపూజీ ఈరప్ప కోర్బా, రాజూ బాబాజీ వంజరి, పోచెట్టి పోచయ్య నింగాల, ఈరప్ప మస్తాజీ పత్తీ, నరసూ నర్సప్ప నెల్ల, నాగూ సాయాజీ కాంట్రాక్టార్‌, ధర్మాజీ సరసూ, రాజన్నా సులూ, రాజన్నా సాయబు, డాక్టర్‌ గంగాజీ నర్సూ, మెనాజీ నర్సూ, వెంకూ నర్సూ, నాగూ నర్సూ, జిల్‌కర్‌ రాజన్నా మొదలైన వారు సత్యశోధక్‌ సమాజ్‌ ఉద్దేశ్యాలను వ్యాప్తిలోకి తీసుకొచ్చిన తీరుని 1877 మార్చి 20 నాటి సమాజ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే బాలాజీ కాలేవార్‌, రామయ్య అయ్యవారు తదితరులు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజానీకం భట్‌ భిక్షుక్‌, సర్కారీ బ్రాహ్మణ ఉద్యోగస్థుల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ప్రభుత్వానికి షికాయతులు, అర్జీలు చేస్తూ వచ్చిన తెలుగువారి పేర్లు మహారాష్ట్రలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నందున అక్కడి వారి ఉచ్ఛారణకు అనుగుణంగా అనేక మార్పులకు గురయ్యాయి. అందుకే తెలుగువారయినప్పటికీ వారి పేర్లలో భిన్నత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వారిలో ఒకరు వెంకూ బాలాజీ. 
    వెంకూ బాలాజీ సమాజ్‌ సభ్యుడిగా చేరక పూర్వం గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా వేలాది బ్రాహ్మణులకు పక్వాన్న భోజనాలు పెట్టించి భారీగా దక్షిణాలు సమర్పించుకునేవారు. అయన సత్యశోధక సమాజ్‌ సభ్యుడిగా చేరిన తర్వాత వాటన్నింటిని రద్దు చేసి వాటి స్థానంలో సమస్త కులాల వికలాంగులకి, అంధులు, చెవిటి వారిని ఆర్థికంగా ఆదుకునేవాడు. స్త్రీల కోసం ప్రత్యేకంగా చీరెలు, దుస్తులు, పురుషులకు ధోవతులు కొత్తగా పెళ్ళయిన జంటలకు వంటసామాగ్రి, వృత్తి పనివస్తువులను ఉదారంగా దానం చేసేవాడు. కాలేవార్‌ (1820`1898) పేద వంజరి కుటుంబంలో జన్మించాడు. స్వయం కృషితో తట్టలు మోసే వాడి నుంచి కాంట్రాక్టర్‌గా ఎదిగి ముంబయిలోని అనేక చారిత్రక కట్టడాలను నిర్మించిన కాంట్రాక్టర్‌గా ప్రసిద్ధి చెందాడు. ముంబాయి నగరపాలిక భవనం, బరోడా మహారాజు ‘లక్ష్మీవిలాస్‌’ భవనం మొదలు అనేక బట్టల మిల్లులను ఈయనే నిర్మించాడు. 1880లోనే 60 లక్షల రూపాయల వ్యయంతో లక్ష్మీవిలాస్‌ భవనం నిర్మితమయింది. అంటే ఆయన ఎంత పెద్ద కాంట్రాక్టరో అర్థమవుతుంది.
    అలాగే ప్రతి దీపావళికి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి దక్షిణ చెల్లించుకునే మరో వ్యక్తి జాయ ఎల్లప్ప లింగూ. ఈయన సమాజ్‌ సభ్యత్వం తీసుకున్న తర్వాత ‘సమాజ మండలి’లోని ఎ అబ్బాయి/అమ్మాయి మెట్రిక్యులేషన్‌ పాసవుతారో వారికి బంగారు పతకంతో పాటుగా 25 రూపాయల నగదు బహుమతి ఇచ్చే ఏర్పాటు కూడా చేసిండు. ఈయన తండ్రి హైదరాబాద్‌ సంస్థానం నుంచి ముంబయికి వలస వచ్చాడు. లింగూ ముంబయిలోని పుట్టి అక్కడే ఉన్నత విద్యనభ్యసించాడు. హైదరాబాద్‌ సంస్థానంలో మెజిస్ట్రేట్‌ ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. కాని రెండేండ్ల కన్నా ఎక్కువగా అక్కడ పనిచేయలేదు. తన కిష్టమైన భవన నిర్మాణ రంగాన్ని ఏరి కోరి ఎన్నుకొని గొప్ప కాంట్రాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబాయిలోని ‘రాయల్‌ యాట్‌ బాంబే క్లబ్‌’, పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా నివసించే ‘టాటా మిషన్‌’ భవనం, ‘హోటెల్‌ వాట్సన్‌ అనెక్స్‌’ భవనాన్ని కూడా ఈయనే నిర్మించాడు. ఇప్పటికీ ఈ భవనాలు చెక్కు చెదరక డిజైన్‌కు, నిర్మాణ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.
    1874లో ‘ముంబయి నివాస మండలి’ ఆహ్వానం మేరకు ఫూలే ముంబయిలో పర్యటించారు. ఈ పర్యటనలో ఫూలే ‘సత్యశోధక సమాజ్‌’ కార్యక్రమాల్ని మరింత బలంగా ముందుకు తీసుకు పోవాల్సిన బాధ్యతను బాలూజీ కాలేవార్‌, కారాడీ లింగూలపై పెట్టారు. దాదాపు ఇదే సమయంలో వెంకయ్య అయ్యవారు కొద్ది కాలం సమాజ్‌ అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఈయన హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ముంబయికి చేరుకొని మొదట వెంకూజీ దగ్గర పనిచేసిండు. ఆ తర్వాత అన్నీ తానే అయి ముంబయిలో ప్రసిద్ధిగాంచిన గార్డెన్‌ మిల్స్‌, జనరల్‌ పోస్టాఫీసుల్ని కట్టించిండు. ఈయన సత్యశోధక్‌ సమాజ్‌ అభివృద్ధిలోనూ, ముంబయిలోని తెలుగువారి అభ్యున్నతికీ చేసిన కృషి చిరస్మరణీయమైంది.
    సత్యశోధక సమాజ్‌ స్థాపన సమయంలో పత్రికలన్నీ బ్రాహ్మణులే నడిపేవారు. శూద్రులకు, అతి శూద్రులకు తమ భావ వ్యాప్తికోసం పత్రిక అవసరమని వెంకయ్య అయ్యవారూ, కాలేవార్‌ తదితరులు కలిసి 1200 రూపాయలు వెచ్చించి ఒక ముద్రణా యంత్రాన్ని కొని ‘సత్యశోధక సమాజ్‌’ కోసం బహూకరించారు. 1874 నవంబర్‌లో ఇది జరిగింది. ‘సర్కారు శాఖలోని వ్రాహ్మణుల నుంచి శుద్రాతిశూద్రులకు ఎన్ని కష్టాలు ఎదురవుచున్నావో బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియజేయాలి’ అన్న ఆలోచనతో పత్రిక నడపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ పత్రిక నడిపే శక్తి, ఆర్థిక వనరులు సరిపోవని భావించి పత్రిక స్థాపనను ఫూలే వ్యతిరేకించాడు. అయితే కృష్ణారావు బాలేకర్‌ పట్టుదలతో పత్రికను ‘దీనబంధు’ పేరిట నడిపించారు. అయితే చివరికి ఫూలే ఊహించినట్లుగానే అది ఎక్కువకాలం మనగలగ లేదు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే పత్రికకోసం ముద్రణాయంత్రాన్ని విరాళంగా ఇవ్వగలిగారంటే వారి ఆలోచన సరళి, సత్యశోధక సమాజ్‌ ఉద్యమం పట్ల వారి అనురక్తి అర్థమవుతుంది.
    సత్యశోధక సమాజ్‌ కార్యకలాపాలతో  పాటుగా ఫూలే నడిపిన ‘పూణె సుశిక్షణ గృహం’పేరిట ఒక విద్యార్థి హాస్టల్‌ని కూడా నిర్వహించారు. దీని నిర్వహణలో కీలక భూమిక పోషించింది ఫూలే సహచరుడు కృష్ణారావు బాలేకర్‌. విద్యార్థులను కేవలం చదువులో మేటిగా తీర్చిదిద్దడమే గాకుండా సమాజం పట్ల నైతికతతో, బాధ్యతతో మెదిలే వారిగా మలచడమనేది ఈ హాస్టల్‌లో జరిగేది. హాస్టల్‌కుండే ఆర్థిక ఇబ్బందుల మూలంగా విద్యార్థుల సంఖ్య తరచూ మారుతూ ఉండేది. పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపడానికి తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే ఇందుకు భిన్నంగా ముంబయిలోని కామాటిపురాలోని సంపన్న కుటుంబాల వారు తమ పిల్లల్ని పూణెలో బాలేకర్‌ హాస్టల్‌కు పంపించి విద్యాబుద్ధులు చెప్పించారు. ఇలా తెలుగువారు హాస్టల్‌ని ఆదుకున్నారు. ఆర్థికంగా కూడా అండగా నిలిచారు. అండగా నిలిచిన వారిలో కారాడి లింగూ జాయా, సేఠ్‌ రాజూ బాబాజీ తదితరులు ముఖ్యులు. ఫూలే చొరవతో ఆయన ఇంట్లోనే ఏర్పాటయిన ఈ పాఠశాలను తర్వాతి కాలంలో సావిత్రిబాయి ఫూలే నిర్వహించారు.దీని చొరవతో కామాటిపురాలో వసతిగృహం, స్కూల్‌ ప్రారంభించారు.
    కారాడి లింగూ జాయా కొడుకు ఎల్లప్ప లింగూ జాయ 1864లో మొట్టమొదటి సారిగా ‘సెకండ్‌ గ్రేడ్‌ ఆంగ్లో వర్నాక్యులర్‌ పాఠశాల’ పేరిట ఒక స్కూల్‌ని ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత విద్యాశాఖతో మాట్లాడి తెలుగు`మరాఠీ బోధనకు అవకాశం కల్పించాడు. ‘తెలుగు జ్ఞానోత్తేజక పుస్తకాలయము’, తెలుగు మహిళా మండలి అనే సంస్థల్ని కూడా స్థాపించి తెలుగువారు సమాజాభివృద్ధికి కృషి చేసిండ్రు. కేవలం తాము నివసిస్తున్న మహారాష్ట్రలోనే గాకుండా హైదరాబాద్‌లో ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు ముందున్నది తెలుగువారు.
    1908లో మూసీనదికి వరదలు వచ్చి హైదరాబాద్‌ నగరం సగం వరకూ కొట్టుకుపోయింది. ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డుమీదికి రావడంతో వారికి అండగా నిలిచింది మహారాష్ట్ర తెలుగువారు. రావుబహద్దూర్‌ ఎల్లప్ప బలరాం అధ్యక్షతన ఒక బహిరంగ సభ జరిపి అందులో వరద పీడితుల సహాయార్థం విరాళాల్ని సేకరించారు. వీటితో వంటపాత్రలు, బట్టలు, ధాన్యాన్ని సంభాజీ, డాక్టర్‌ నర్లు అనే నాయకులు ఖరీదు చేసి స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి అందజేసిండ్రు.
    ఇలా ఒక వైపు జ్యోతిరావ్‌ ఫూలేతో కలిసి పనిచేస్తూనే తమ తోటి తెలుగువారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన తెలుగువారు స్మరణకు నోచుకోలేదు. పరాయి రాష్ట్రంలో ఉన్నందున వారి సేవలకు సంబంధించిన వివరాలు అందరికీ అందుబాటులోకి రాలేదు. ఈ విషయాలపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరముంది. కానరాకుండా పోయిన మన కండ్లముందరి చరిత్రను రికార్డు చేసుకోవాల్సిన అవసరముంది. తెలుగు మహారాష్ట్రీయన్లు చేసిన ఉద్యమాలు, పోరాటాల తీరు తెన్నులు చరిత్రకెక్కాల్సిన సమయమిది.
    వీరు నిర్వహించిన ఉద్యమాల ప్రభావం తెలంగాణపై కూడా ఉండిరది. సికింద్రాబాద్‌నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన దళిత నాయకులు రాజారామ్‌భోలే, బి.ఎస్‌. వెంకట్రావులపై ఫూలే, అంబేద్కర్‌ ఉద్యమాల ప్రభావం ఉంది. అలాగే 1952లో హైదరాబాద్‌ రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి ఆ కూటమి తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలువడానికి కూడా స్ఫూర్తి ఫూలే`అంబేద్కర్‌ భావజాలం నుంచే వచ్చింది.  ఇదే స్ఫూర్తిని స్వీకరిస్తూ నేడు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతుండ్రు. దీనికి మహారాష్ట్రలో కూడా అక్కడి తెలుగువారు ధూమ్‌`ధామ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మమేకమయిండ్రు. 
                                                                                                                                        -సంగిశెట్టి శ్రీనివాస్‌
                                                                                                                        (ఫోరమ్‌ ఫర్‌ కన్సర్న్‌డ్‌ బీసీస్‌)

Hyderabad sirf hamara

బండీకే నీఛే కుత్తా .....

   
    ఇయ్యాల పది జిల్లల తెలంగాణ పిల్లలు ఒక్కతాటిపై నిలిచి మిన్నంటేలా ప్రత్యేక తెలంగాణ నినాదాలిస్తుండ్రు. ‘నూతిల గుండేసి తూటేది’  అనే రాజకీయ నాయకులతోటి తెలంగాణ వచ్చుడు కాదని ఇప్పుడు రోడ్ల మీద రోజూ ధర్నాలు, దీక్షలు, చేస్తున్న ప్రజలందికీ తెలిసిందే! తెలంగాణ బిడ్డలు ఆంధ్రోళ్ళ పాలనలో సచ్చినా బతికినా ఒక్కటేనని పాణం తీసుకుంటుండ్రు. బిడ్డల్ని కోల్పోయిన తల్లితండ్రులు తెలంగాణలోని 119 నియోజక వర్గాల్లో గోడుగోడున ఏడుస్తుండ్రు. 53 ఏండ్ల సంది ‘తెలంగాణ తల్లి’ తన బిడ్డల బతుకులు చూసి శోకం పెట్టని రోజు లేదు. తెలంగాణ తల్లి గుండెకాయ ‘హైదరాబాద్‌’ని సీమాంధ్రులు తూట్లు పొడిసి గాట్లు పెడుతుండ్రు. ఈ మానని గాయం నిత్యం సలుపుతనే ఉంది. బిడ్డల్ని కోల్పోతున్న తెలంగాణ తల్లి దుఖం ఆగకుండున్నది. నోటికాడి బుక్క ఎత్తగొట్టినోళ్లు పూటకో మాట మాట్లాడుతు ఇజ్జత్‌ పుచ్చుకుంటుండ్రు. తెలంగాణ బిడ్డల బలిదానాలను కూడా పజీత చేస్తుండ్రు. వీరభూమి మరు భూమిగా మారుతుంటే తల్లి తెలంగాణ కుముల్తుంది.
    హైదరాబాద్‌ యోధులు ఎనుకటి సంది ఉద్యమంలో ముందే ఉన్నరు. 1952లో ముల్కీ ఉద్యమంలో నలుగురు బిడ్డలు పోలిసుల కాల్పులకు బలయ్యిండ్రు. అప్పుడు షురువైన బలిదానాలు ఇంకా కొనసాగుతున్నయి. 1969లో 369, ఇవ్వాల్టి పోరాటంలో 300కు పైగా సోర సోర పొలగాండ్ల రక్తం తాగినా సీమాంధ్ర పాలకుల నెత్తుటి దాహం తీరలేదు. ఇత్తెయ్యకుండనే పొత్తుగూడి 1956 నుంచి లూటిపోయిన చేనుని దోసుకున్నట్లు తెలంగాణను కొల్లగొడుతున్న సీమాంధ్ర పాలకవర్గాలు, వారి పోషకులు చరిత్రను, సంస్క ృతిని కించపరుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండ్రు. సాంస్క ృతిక దాడిని వివిధ రూపాల్లో తీవ్రతరం చేసిండ్రు. ఆంధ్రోళ్ళు సమస్యగా చెబుతున్న ప్రత్యేక తెలంగాణే పరిష్కారంగా హైదరాబాద్‌ వాసులు నమ్ముతుండ్రు. తెలంగాణ ఏర్పాటో, సమైక్యాంధ్ర కొనసాగింపో అనేది ‘హైద్రాబాద్‌’పై ఆధారపడి ఉంది. ‘హైద్రాబాద్‌’ పంచాయితి తష్వ అయితే గానీ తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదు. కబ్జా పెట్టిన రాజధాని హైద్రాబాద్‌ని సాకుగా చూపించి సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తుండ్రు.
    హైద్రాబాద్‌ని అమాంతం మింగి మంచినీళ్లు తాగెతందుకు శాన ఇకమతులు జేస్తుండ్రు. తిమ్మిని బమ్మి చేస్తూ తీరొక్క ఏషం కట్టి మనల్ని తిప్పలు పెడ్తుండ్రు. కన్నమ్మ గోస పెడ్తుండ్రు. హైద్రాబాద్‌ నీ అబ్బ సొమ్మా? అని ఒగడు శిగమూగితే, ఇంకోడు తొండలు గుడ్లు పెట్టని భూమిని సవరించినమని కావురంతోటి వదురుతుండు. బాసినలుగ ఉన్న మిమ్మల్ని విముక్తి చేసినమని ఇంకొకయాన ఫోజులు కొడుతుండు. మీకు భాష నేర్పినమని బరితెగిస్తుండ్రు. తురుకోళ్లు తెలంగాణ కోరుతలేరని ఒక దగ్గర, తెలంగాణ వస్తే బిజెపి రాజ్యమొస్తదని, నక్సలైట్ల రాజ్యమొస్తదని అంతు పొంతు లేని , అడ్డూ అదుపు లేని కువ్వారపు మాటలు మాట్లాడుతుండ్రు. తినె తలెల ఊంచినట్టు రాజశేఖరరెడ్డి 2009లో తెలంగాణలో ఎలక్షన్లు అయ్యెదాకా ఓడ మల్లయ్య అంటూ వోట్లు ఇంక వొడువక ముందే నాలుగ్గంటలకే నంద్యాలల హైదరాబాద్‌పై యిసం గక్కిండు. ఇద్దరం కలిసుందమని చెప్తూ కావిలించుకొని ‘కుడి’ చెయ్యితోటి కడుపుల, ‘ఎడమ’ ‘చెయ్యి’తోటి ఈపుల కత్తి పోట్లు పొడుస్తుండ్రు. గద్దెనెక్కినోళ్ల మోసాలు ఇంకానా ఇక సాగవని తెలంగాణ గొంతెత్తి నినదిస్తోంది. ఈ నగరం మాది అని సవాల్‌ జేస్తుంది. దేశంలోనే భిన్నమైన హైదరాబాద్‌ భాషా, సంస్క ృతి, అవ్వల్‌ దర్జా అని తెలియజెప్పుతుంది.
    ఒక్కొక్కటి తఫ్సీలుగా చూస్తె హైదరాబాద్‌ ఎవ్వల్ది? దాని తహెజీబ్‌ ఏంది? అనేది సమజైతది. మేం డెవలప్‌ జేసినం అని విర్రవీగేటోళ్లు కండ్లు తెరిసి సూత్తే సత్తెము తెలుస్తది. అభివృద్ధి పేర్మీద ఆళ్లు ఏంజేసిండ్రో, ఎంత దోసుకుండ్రో లెక్క గట్టొచ్చు. ఎవ్వడు భూముల్ని అమ్ముకుండు, ఎవ్వలు కొనుక్కుండ్రు? ఎంత కబ్జ చేసిండ్రు, ఎవ్వల్ని ముంచి ఎవ్వల్ని తేల్చిండ్రో తెలుస్తది. హైదరాబాద్‌ల పబ్లిక్కు తాగేతందుకు కూడా నీళ్లియ్యలేని ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడ్డం మంచిగలేదు. భోలక్‌పూర్‌`ముషిరాబాద్‌ల గలీజు నీళ్లు తాగి సచ్చుడేరుగుడయిన సంగతి అందరికి మతిల ఉంది. నిజాం జమానాల సర్కార్‌ నల్ల చౌబీస్‌ గంట కుల్ల ఉండే సౌలత్‌ ఉండేది. ఇప్పుడు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ చుట్టూత ఇకమతులతోటి అనుతులు తెచ్చుకోని బిల్డింగ్‌లు కట్టి నీళ్ళన్నింటిని విషం చేసిండ్రు. ఈడ పుట్టి ఈడ పెరిగినోంది హైద్రబాదు కాకుంటే బతుకొచ్చి కిరాయింట్లో ఉన్నోడు మకాన్‌దార్‌ అయితడా? గుజరాతోల్లు బొంబాయి నుంచి అలగ్‌ అయినప్పుడు తట్టబుట్ట సదురుకొని ఖాళి చేసిండ్రు తప్ప పేచి పెట్టుకోలేదు. మా తాతల తాతలు, అమ్మమ్మలు, నాయినమ్మలు రాళ్లుమోసి కట్టిన హైద్రాబాద్‌ మాది గాకుంటే అన్ని తయారైనంక మెరిగెల గురిగోలె అమరించుకున్నోందయితదా? ఢంక బజాయించి చెబుతం హైద్రాబాద్‌ మా అబ్బదే. అవును హైద్రాబాద్‌ మా భాగమతి ప్రేమ నిషాన్‌. తుర్రెబాజ్‌ఖాన్‌ తుపాకి మోత, మా మహబూబ్‌ అలీఖాన్‌ మట్టి వాసన. బండ్లోల్ల కురుమన్న, జంపన్నల సాహస గీతం. కన్నతల్లిగ సూసుకునే హైద్రాబాద్‌ మాదిగాకుంటే బజారుల హర్రాజ్‌ చేసే నీదెట్లయితది?.
    తొండలు గుడ్లు పెట్టని భూముల్ని సవరించినమని అనేటోళ్లు ఆ భూమిని సీమాంధ్ర నుంచి కోసుకోని తీసుక రాలేదని గుర్తు పెట్టుకోవాలె. మా నిజాం రాజు సొంత ఆస్తి సర్ఫెఖాస్‌ భూముల్ని, భూదానోద్యమంలో భాగంగా మా తాతలు దానం చేసిన జాగను, కబ్జచేసి అప్పనంగా దక్కించుకుండ్రు. అసెంబ్లీలనే అవును అక్రమాలు జరిగినయని ధర్మాన ఒక్కసారన్న ధర్మంగా మాట్లాడిరడు. ఆకుల రాజయ్య లాంటోళ్లను ఆంధ్రోళ్ళు బంట్లుగా మార్సుకొని అత్రఫ్‌ బల్దా మొత్తం అమ్ముకుండ్రు. అయిన కాడికి కబ్జ పెట్టిండ్రు. ఏ రాష్ట్రానికైనా దాని రాజధాని సుట్టూతా ఇంత పెద్దమొత్తంలో గవుర్నమెంటు జాగా లింకెక్కడ్లేవు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు 1953 అక్టోబరు ఒకటి తర్వాత ఎన్ని రోజులు మద్రాసు నుంచి ఆఫీసులు ఖాళి చెయ్యకుంటే అన్ని రోజుల కిరాయి కట్టిండ్రు. కర్నూలుకు షిఫ్ట్‌ అయిన ఆంధ్ర ప్రభుత్వము హైదరాబాద్‌ మీద కన్నేసి దాన్ని కలుపుకుంటే తాము గుడారాల్లో ఆఫీసులు నడిపే బాధ తప్పుతదని మనమిద్దరమొక్కటే అని మెత్తటి కత్తితోటి తెలంగాణ కుత్తుక తప్పతీసిండ్రు. మాది తొండలు గుడ్లు పెట్టని భూమైతె ఎగేసుకొని ఈడికెందుకొచ్చిండ్రు. మాధాపూర్‌ల భూములమ్ముకున్న మావోళ్లు చాలమంది గుండెపగిలి సచ్చిండ్రు. మిగిలినోళ్లు మీ హై‘టెక్కు’ సిటీల వాచ్‌మెన్లుగా సస్తూ బతుకుతుండ్రు. ఇదే ఆంధ్రోళ్ళు చెప్పే అభివృద్ధి. హైటెక్కు సిటీ కట్టినంక హైదరాబాద్‌ అంటే ఆంధ్రోళ్ళదే అన్నట్టుగ చార్మినార్‌కు బదులుగ దాన్నే సూపించి పాత హైదరాబాద్‌ని పాతరపెట్టిండ్రు. మా భూములన్నింటిని సెజ్‌ల పేర్మీద, రింగురోడుల పొంటి, గురుకుల్‌ భూములు, భూదాన భూముల్ని ఆడిరది ఆటగా, పాడిరది పాటగా పట్ట చేసుకుండ్రు. 1948ల్నే దేశంల హైదరాబాద్‌ బలవంతపు విలీనం సందర్భంగా మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన ఆంధ్ర`ఆఫీసర్లు మంచి మంచి బిల్డింగుల్ని సొంతం జేసుకుండ్రు. విలీనం సందర్భంగా పైసలున్న ముస్లిములు లండన్‌లో సెటిలయ్యెతందుకు ఇక్కడి ఆస్తులమ్మడానికి ప్రయత్నిస్తే వాటిని అమ్మనివ్వకుండా ఎవాక్యూ ప్రాపర్టీ కింద స్వాహా చేసిండ్రు. ఇప్పటికీ జూబ్లిహిల్స్‌లో చేతులు మారిన పాత భవంతుల చూస్తే అవ్వెవ్వరియొ తెలుస్తది. ఈ తొండలు గుడ్లు పెట్టని భూములన్నింటిని వామనుడోతిగ దిగ మింగిండ్రు. భూములు, ఆకాశ హర్మ్యాలు ఆళ్ళవే. ఇగిప్పుడు తెలంగాణ బిడ్డల నెత్తిల పెట్టి అడుక్కు తొక్కుతుండ్రు.
    బానిసలుగ బతుకుతున్న మమ్మల్ని విముక్తి చేసింది ఆళ్ళేనట. అవును మరి తుపాకి ఎట్లపట్టుకోవాలో తెలువని పుచ్చలపల్లి సుందరయ్య మీకు హీరో లాగ కనబడుతడు. అసలు తూపాకి పట్టి జంగ్‌ చేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సుద్దాల హనుమంతు, దొడ్డి కొమురయ్య, బండి యాదగిరి లాంటి వందల వేల యోధులు మీ కంటికి ఆనరు. మా బతుకులు బాగు చేసుకునేందుకు తుపాకి పడితే నిజాం సైన్యం మూడొందల మందిని పొట్టన పెట్టుకుంటే నెహ్రూ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం`పటేల్‌ సైన్యం 1948`51 మధ్యల నాలుగు వేల మందిని సంపి  మా నెత్తురు తాగింది. అయినా కూడా మీవాళ్ళు రాసిన చరిత్ర పుణ్యాన ఇయ్యాల్టికి కూడా నిజాంనే నిందిస్తున్నాం తప్ప నెహ్రూని, కాంగ్రెస్‌ని పళ్లెత్తు మాట అనలేక పోతున్నం. అవును గాని ఆంధ్రోళ్లు ఈడ ఒక్క మాటకు జవాబు ఇచ్చి తీరాలి. ఈడ పుట్టి ఈడ పెరిగినోని పాలనల మేం బతికితే అది బానిస బతుకెట్ల అయితది. పరాయి దేశం నుంచి వచ్చి వనరుల్ని, నిధుల్ని తరలించుకోని పొయిన బ్రిటిషోని పాలనలో ఉన్న మీరు స్వతంత్రులెట్లయితరు? మీ చీరాల పేరాల రెండూర్ల కొట్లాట పెద్ద ఉద్యమమై చరిత్రకెక్కుతది. మా సాయుధ పోరాటం గురించి పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా ఒక్క ముక్కెందుకుండది?
    మాకు భాష నేర్పిన మని కూడా సీమాంధ్రులు కోతల కూతలు కూస్తుండ్రు. మా హైదరాబాద్‌ల ఎనుకట ప్రతి ఒక్కనికి ఐదు భాషలొచ్చేటియి. మాది పంచ భాషా సంస్క ృతి. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, ఇంగ్లీషు ఈ ఐదు భాషల్లో హైదరాబాద్‌ వ్యవహారాలు నడిచేటివి. కాళోజి అన్నట్టు రెండున్నర జిల్లాల వాళ్ళ భాషే ప్రామాణికమయింది. ఈ రెండున్నర జిల్లాల వాండ్లే హైదరబాద్‌ రాష్ట్రంలో దొంగ ముల్కీ సర్టిఫికెట్టు సంపాదించి ఉద్యోగాలు సంపాదించిండ్రు. పాఠశాలల్లో పంతుల్లై తమ భాషే గొప్పదని ఆ భాషలోనే సదువులు నేర్పి తెలంగాణ భాషకు గోరికట్టిండ్రు. మా తెలంగాణ భాషను మాగ్గాకుండా చేసి భాష నేర్పినమనే బైరూపులేషమేస్తుండ్రు.
    ఒకదానికొకటి పొంతన లేకుండ తెలంగాణొస్తె బిజేపి అధికారం లోకి వస్తదని, నక్సలైట్లు రాజ్యమేలుతరని బట్టకాల్సి మీదేసె మాటలు మాట్లాడుతుండ్రు. బిజేపి అధికారంలోకి వచ్చే అవకాశం వాళ్లే చేజేతుల కాకినాడ తీర్మానాన్ని వెనక్కు నెట్టి, రాజీనామాల్లో చీలిక తెచ్చి కాలరాసుకుండ్రు. ఇగ నక్సలైట్లు దేశమంతటున్నరు. అది కేంద్రం చేతిలోని ముచ్చట. ముస్లిముల తెలంగాణ కోరుకుంటలేరని మరొక దుర్మార్గమైన ముచ్చట ముందుకు తీసుకొచ్చిండ్రు. తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో, ముస్లిములున్న దాదాపు ప్రతి ఊర్ల ధర్నాకు దిగి ఎక్కడికక్కడ సంఘాల్ని స్థాపించుకొని ఉద్యమాల్జేస్తుండ్రు. జమాతె`హింద్‌ సంస్థ తరపున లక్షలాది ముస్లిం ప్రజానీకంతో ‘‘జస్టిస్‌ ఫర్‌ తెలంగాణ, తెలంగాణ ఫర్‌ జస్టిస్‌’ అనే నినాదమిచ్చి హైదరాబాద్‌లో భారీ గర్జన నిర్వహించి ముక్తకంఠంతో వారి వాణిని వినిపించిండ్రు. మా హైద్రబాద్‌ల ఎనుకటి సంది హిందూ`ముస్లిములం అన్నదమ్ముల్లాగున్నం. ఒకర్నొకరం ఆదుకున్నం. కాని మీరు ఫ్యాక్షన్‌ బుద్ధితోటి అధికారం కోసం హైదరబాద్‌ల మతకలహాలు సృష్టించి మా శవాల మీద్కెళ్లి మీరు గద్దెనెక్కిండ్రు. ఈ యాభై ఏండ్లల్ల మావోల్లు ఒక్కలు కూడా ఐదేండ్లు ముఖ్యమంత్రిగ లేడంటె మతలబేంది. 53 ఏండ్లల్ల మావాల్లు ఆరేండ్లు కూడా సక్కగా సిఎంగ లేరు.
    రాజశేఖరరెడ్డి తాను సిఎంగ కొనసాగెతందుకు తాను తింటున్న తలెల్నే ఊంచిండు. 2009 అసెంబ్లీ ఎన్నికలు  ఎప్పటి మాదిరిగానే తెలంగాణలోనే మొదట జరిగినయి. దీన్ని మొఖగ తీసుకున్న రాజశేఖరరెడ్డి తెలంగాణల ఎన్నికలు జరిగిన రోజే నాలుగ్గంటలకు ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టుగ ‘మీరు కాంగ్రెస్‌కు ఓటెయ్యనట్లయితె హైదరాబాద్‌లో విదేశీయుల్లాగ బతకాల్సి వస్తది. వ్యాపారాలు చేసుకోలేం. సదువులు సదువుకోలేం’ అని ప్రజల్ని రెచ్చగొట్టిండు. ఓట్ల పంట పండిరచుకుండు. రాజశేఖరరెడ్డి 32 యేండ్ల నుంచి హైదరాబాద్‌ గండిపేట నీళ్లు తాగిండు. కనీసం ఆ విశ్వాసమన్నా లేకుండా అన్నం బెట్టిన తల్లిలాంటి హైదరాబాద్‌ మీద యిషం గక్కిండు. హైదరాబాద్‌లనే కాదు, అదిలాబాదుల ఉన్న సింగరేణిల గూడా నీ కాంట్రాక్టర్లే, నీ మనుషులే దోసుకుంటున్నా నిన్నొక్క మాట అనలేక పోతిమి. ఓట్ల కోసం హైదరబాద్‌ తెహజీబ్‌ని అమ్మకానికి పెట్టిండు. ఇన్ని రోజులు ఆదుకొని ఆశ్రయమిచ్చిన హైదరాబాద్‌ని బెమ్మ రాక్షసిలా చిత్రీకరించిన రాజశేఖరరెడ్డి నియ్యత్‌ అందరికి తెలిషిపాయె.
    హైదరాబాద్‌ సంస్క ృతి ఆంధ్రోళ్ళకు ఎన్నడర్థం కాదు. ఏండ్ల సందున్నా ఒక్క ముక్క ఉర్దూ ఉచ్చరిచలేరు.  హైదరబాద్‌ల సిర్ఫ్‌ తెలంగాణ వాళ్లే కాదు అఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌, అరేబియా, ఆఫ్రికా, ఇంగ్లండ్‌ నుంచి వాళ్ళుకూడా అన్యోన్యంగా ఉండి ఇక్కడి భూమిని కండ్లకద్దుకున్నరు. అంతెందుకు పాకిస్తాన్‌ నుంచి వచ్చి కరాచీ బేకరి నడిపిస్తున్న వాళ్లు హైదరాబాద్‌తో మమేకమయిండ్రు. ఇరానీ చాయ్‌ జిందగీలో భాగమయింది. ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన కిర్క్‌ పాట్రిక్‌`ఖైరున్నీసా ప్రేమించి పెళ్ళాడి హైదరాబాద్‌ ప్యార్‌ని విశ్వవ్యాప్తం జేసిండు. గుజరాత్‌ నుంచి వచ్చిన మార్వాడీలయితే 1969 ఉద్యమానికి అండదండగా నిలిచిండ్రు. బెంగాళీలు, కేరళీయులు, తమిళులు, సిక్కులు, మహారాష్ట్రియన్లు, కన్నడిగులు అందరూ హైదరాబాద్‌ని ఓన్‌ చేసుకుండ్రు. ఇక్కడి చరిత్ర, సంస్క ృతి, చారిత్రక వారసత్వంతో మమేకమయ్యిండ్రు. హైద్రాబాద్‌ మాది, మాది హైద్రాబాద్‌ అని ఒక్క సుతితోటి చెప్పుతుండ్రు. ఒక్క ఆంధ్రోళ్ళు మాత్రమే ఎక్కడపోతే అక్కడ ద్వీపకల్పాల్ని సృష్టిస్తుండ్రు. తేడాలు పాటిస్తుండ్రు. ఒకవైపు హైదరాబాద్‌ కాస్మోపాలిటన్‌ కల్చర్‌ని, హైదరాబాద్‌ సమశీతోష్ణ స్థితిని ఎంజాయ్‌ చేస్తూ మరోవైపు తల్లిపాలు పిండుకొని అమ్ముకుందామనుకుంటుండ్రు. తమకు వర్తించిన నిబంధనలే ఇతరులకు కూడా వర్తించాలి, వర్తిస్తాయనే సోయి లేకుండా సీమాంధ్రులు చిందులేస్తుండ్రు. ఆంధ్రోళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు అందుకు వాళ్ళు చూపిన ప్రధాన కారణం రాజధాని తెలుగు ప్రాంతాలకు దూరంగా ఉందని చెప్పిండ్రు. అవును నిజమే శ్రీకాకుళం వాండ్లకు చెన్నయ్‌ ఎట్లాగు దూరమే. మరి అదే సూత్రం హైదరాబాద్‌ల ఎందుకు వర్తించదు. హైదరాబాద్‌ రావాలంటే ఎట్నుంచైనా కనీసం రెండువందల కిలోమీటర్లు దాటి వస్తెగానీ హైదరాబాద్‌ శివారు తగలదు. ఎట్ల చూసినా హైదరాబాద్‌ సీమాంధ్రులకు దోపిడి చేసుకునేందుకు ఒక  స్థావరం మాత్రమే. ఎవరైనా తమకేం కావాలో కోరుకోవడం న్యాయం. కాని నీది నాక్కావాలె అనడం అన్యాయం. ఈ అన్యాయపు పునాదులపైనే ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ నిలబడ్డది.
    మొత్తం భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా రాష్ట్ర రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోసం, అదే తెలంగాణ కోసం కొట్లాడుతుంది. 53 యేండ్ల సంది తెలంగాణ సంపదను కొల్లగొడుతూ, అదే డబ్బుతో తీసిన సినిమాల్లో బరితెగించి తెలంగాణోళ్లను తెలివిలేనోళ్లుగా చిత్రీకరించి పైసలు సంపాదించుకుంటుండ్రు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన నిజామ్‌ హైదరాబాద్‌ రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌గా ఉండి తన సర్ఫేఖాస్‌ ఆస్తినంతా ప్రభుత్వానికి అప్పగిస్తే దాన్ని ఆంధ్రోళ్లు సెక్రటేరియట్‌లో చక్రం తిప్పి, వక్ఫ్‌బోర్డులో రికార్డులు మాయం జేసి సొంతం జేసుకుండ్రు. ఇంతా జేసి దానికి అభివృద్ధి అనే ముసుగేస్తే హైదరాబాద్‌ ఎందుకు భరిస్తది. ఇంక సయించదు. అందుకే హైదరాబాద్‌ ప్రత్యేక తెలంగాణ జంగ్‌కు సైరనూదింది. తన అస్తిత్వం, ఆస్తి అన్ని కొల్లకొట్టబడిన హైదరాబాద్‌కు తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఆంధ్రులు తమ దోపిడి, దగా, మోసపు కార్యాల ద్వారా కల్పించిండ్రు.
    హైదరాబాద్‌ ఎన్నటికీ హైదరాబాదీయులదే. ప్రేమతో అమ్మా అని పిలిస్తే దాసుకున్నదంతా దోసిళ్లతో దానం చేసే గుణం హైదరాబాద్‌కుంది. హైదరాబాద్‌ నిజాం జమానాలో మొత్తం దేశంలోని నగరాల్లో నాలుగో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయింది. అంటే అభివృద్ధి చెందినట్టా? హైదరాబాద్‌ని డెవలప్‌ చేసినమన్నోళ్లు కళ్లుండి చూడలేని గుడ్లోళ్లు. బండీకే నిఛే కుత్తాలు. నిజమే నడుస్తున్న ఎడ్ల బండి కింద చల్లటి నీడలో అడుగులేసే కుక్క బండిలోని లోడ్‌నంతా తానే భరిస్తున్నట్టుగ అపసోపలు పడి పోయిందట. ప్రస్తుతం ఆంధ్రోళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉంది. కడుపుల సల్ల కదులకుండ అన్ని అమర్చి పెడితే, అజాంజాహిమిల్లు, ఆల్విన్‌ ఫ్యాక్టరీలను అమ్ముకోని మింగి అంతా అభివృద్ధి చేసినమని ఆంధ్రోళ్ళు అపసోపాలు పడి పోతుండ్రు.   
    హైదరబాద్‌కిది చాలా పరీక్షా సమయం. వందల యేండ్ల తమ చరిత్ర, సంస్క ృతి, వారసత్వ సంపద నాశనం గాకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత హైదరబాదీయులందరిపై ఉంది. అఘోరనాథ్‌ చటోపాధ్యాయ, ఆయన కూతురు సరోజిని నాయుడు, ఆమె కూతురు పద్మజా, లీలామణి నాయుడు, కొడుకు జయసూర్య నాయుడు, ఇంగ్లీషు రచయిత టి.ఎస్‌. ఇలియట్‌, ఎవరెస్టును అధిరోహించిన ఎడ్మండ్‌ హిల్లరీ, నోబెల్‌ గ్రహీత రోనాల్డ్‌రాస్‌,  ప్రపంచమంతా ఇస్లాం ఫిలాసఫీని ప్రచారం చేసిన జమాలుద్దిన్‌ అఫ్ఘానీ, క్రికెటర్‌ జయసింహ, అజరుద్దీన్‌, అమెరికాలో భారత అంబాసిడర్‌ అబిద్‌ అలీఖాన్‌, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, భారత్‌ ఏక్‌ కోజ్‌ శ్యామ్‌ బెనగల్‌, మాభూమి బి.నరసింగరావు ఇలా వందల వేల హైదరాబాదీయులతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్‌ తెలంగాణ వాళ్లు కాకపోయినా, హేగ్‌లోని ఇంటర్నేషనల్‌ కోర్టులో జడ్జ్‌గా పనిచేసిన జస్టిస్‌ కొమురయ్య ఇంకా ఇలాంటి ఎందరినో హైదరాబాద్‌ ఆదరించింది హక్కున చేర్చుకుంది. తమ బిడ్డలుగా చూసుకుంది. హైదరాబాద్‌ బచావో పేరిట ఏర్పాటయిన బినామీ సంస్థలు ఆంధ్రుల కొమ్ముకాస్తూ తెలంగాణను వంచిస్తున్నాయి. ఈ వంచనను పసిగట్టి ఎండగట్టాలి.  

-సంగిశెట్టి శ్రీనివాస్‌

KALOJI NARAYANA RAO AND HIS ACTIVITIES

వైతాళిక సమితి- KALOJI

కాళోజి    తెలంగాణ దృక్కోణంతో చరిత్రను, సాహిత్యాన్ని మూలాల్లోకి వెళ్లి పునర్మూల్యాంకనం చేస్తూ ఉంటే ప్రతి సారి మణి మాణిక్యాలు దొరుకుతూనే ఉన్నాయి. అయితే విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేయాల్సిన పనిని ఆసక్తిగల కొంత మంది పరిశోధకులు మాత్రమే చేస్తూ ఉండడంతో ఫలితాలు ఆశించిన స్థాయిలో/సంతృప్తికరంగా లేవు. పునాది పరిశోధన లేకపోవడంతో పైపై మాటలకు ప్రాధాన్యం పెరిగిపోయి, అసలు విషయానికి ఎసరు వస్తోంది. ఎవరైనా రికార్డయిన విషయాలపై వ్యాఖ్యానం చేయడం సులభం. అయితే ఈ రికార్డులే అరకొరగా దొరుకుతున్నప్పుడు సాధికారిక వ్యాఖ్యనం చేయడం దుర్లభం. తెలంగాణలో ప్రస్తుతం ఈ పరిస్థితే కొనసాగుతోంది. తెలంగాణలోని వైతాళికులందరి సాహిత్యానికి, సృజనకు, ఉద్యమ కార్యాచరణకు, సమాజ చైతన్యానికి వివిధ రూపాల్లో చేసిన కృషికి చరిత్రలో స్థానం దక్కలేదు. అంతెందుకు ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రాసి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్న తొలి తెలుగు వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన కవిత్వం నేటికీ సంపుటిగా రాలేదంటే బాధేస్తుంది. వెంటనే బాధ్యతను గుర్తు చేస్తుంది. వట్టికోట ఆళ్వారుస్వామి సమగ్ర కథలు ఇప్పటికీ సంకలనంగా రాలేదు. భాగ్యరెడ్డి వర్మ ఉపన్యాసాలు, వ్యాసాలు ఇప్పటి తరానికి అందుబాటులోకి రాలేదు. ఇలా చాలామంది తెలంగాణ వైతాళికుల పుస్తకాలు/రచనలు అచ్చుకు నోచుకోలేదు. అలాంటి వారిలో కాళోజి నారాయణరావు కూడా ఉన్నాడు. కాళోజి నారాయణరావు కూడా అని ఎందుకనాల్సి వస్తుందంటే 1934 నుంచీ ఆయన రాసిన ప్రతి అక్షరం అచ్చు రూపంలో శాశ్వతత్వాన్ని సంపాదించుకుంది. అటు అణా గ్రంథమాల ప్రచురించిన కాళోజి కథలు, దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించిన ‘నా భారతదేశ యాత్ర’ మొదలు 1953 నాటి ‘నాగొడవ’, చివరికి ఇదీ నాగొడవ ఇలా అనేక రచనలు అచ్చురూపంలో వచ్చాయి. అలాగే షష్టిపూర్తి సమయంలో వెలువరించిన సంచిక, నాట్యకళ ప్రభాకర్‌ ప్రచురించిన సమగ్ర సాహిత్యం కూడా కాళోజి రచనలను రికార్డు చేసింది. కాళోజి కథలు, శాసనమండలిలో కాళోజి ప్రసంగాలు కూడా అచ్చయ్యాయి. ఇవన్నీ ఆయన గురించి, రచనల గురించీ విశ్లేషణకు, విమర్శకు ఉపయోగ పడ్డాయి. అయితే కాళోజి కీలక పాత్ర పోషించి  తెలంగాణలో చైతన్యానికి, కళా, సాహిత్య వికాసానికి విశేషంగా కృషి చేసిన ‘వైతాళిక సమితి’ గురించి తెలిసింది మాత్రం చాలా తక్కువ. గతంలో కాళోజి గురించి పరిశోధన చేసిన వారు (ఒక్క  కే.శ్రీనివాస్‌ తప్ప) గానీ, స్వయంగా కాళోజి ‘ఇదీ నాగొడవ’లోగానీ లోతుగా రికార్డు చేయని అంశాలు ఈ వ్యాసంలో వివరించడం జరిగింది. దీని ద్వారా కాళోజి కార్యాచరణ, సమిష్టి కృషి, ఆలోచనా సరళిని మరింత లోతుగా అర్థంచేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ వ్యాసంలో కాళోజి`వైతాళిక సమితి`దాని కార్యక్రమాలు గురించి వివరంగా చర్చించడమైంది. ప్రతి చిన్న అంశంపై ప్రత్యేక శ్రద్దతో అభిప్రాయాలను వ్యక్తం చేసి తద్వారా కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అప్పటి వారి ఆలోచనా ధోరణి దానిలోని ప్రజాస్వామ్య విలువల్ని అర్థం చేసుకోవడానికి ఈ ‘వైతాళిక సమితి’ కార్యాచరణ ఒక పనిముట్టుగా ఉపయోగపడుతుంది.

    ఈ ‘వైతాళిక సమితి’ మొదట 1935 ఆ ప్రాంతంలో ప్రారంభమయింది. (1938 ఆ ప్రాంతం అని కాళోజిపై పరిశోధన చేసిన తూర్పు మల్లారెడ్డి పేర్కొన్నాడు. కాని దానికి ఆధారాలు ఇవ్వలేదు. అలాగే కాళోజి, దేవులపల్లి రామానుజరావు ఇద్దరూ 1935అని పేర్కొన్నారు) ప్రారంభ దినాల్లో కథలు, కవిత్వం ద్వారా సాహిత్య వ్యవసాయం చేసి కొంతకాలం స్థబ్దుగా ఉన్నారు. మళ్ళీ 1945 ఉగాది (పార్థివ) నాడు తమ పున: ప్రస్థానాన్ని ప్రారంభించింది. సమాజ సేవే ధ్యేయంగా, సాహిత్యం, కళలే మార్గంగా పనిచేసిన సంస్థ ఇది.
     కాళోజి నారాయణరావు హైదరాబాద్‌లో వకాలత్‌ విద్య చదువుతున్న కాలంలో ఈ వైతాళిక సమితిని ప్రారంభించారు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా రికార్డు చేసిండు. జూలై ఏడు, 1966నాడు రచయిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్యకు రాసిన లేఖలో చెప్పిండు. ‘‘1935 ఆ ప్రాంతంలో హైద్రాబాద్‌లో ఓ నలుగురు పిచ్చివాళ్లు ఒకచో చేరివుండిరి. వారు ఆనాటికి తమ్ము తాము వైతాళికులుగా ప్రకటించుకొని ప్రతి పదిహేను రోజుల కొకసారి సమావేశమై, నలుగురు మిత్రులను కూడ వేసుకొని కథలు, గేయాలు వ్రాసి చదివి వినిపించేవారు. అడపాదడపా హైద్రాబాదుకు వచ్చిన మహారాష్ట్ర, హిందీ, ఆంధ్ర కవి మిత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారి రచనలు వినిపించీ, ఉపన్యాసం చేసే ఏర్పాటు చేసేవారు. వారిలో కాళోజితో బాటు తక్కిన ముగ్గురు (1) వెల్దుర్తి మాణిక్యరావు (2) వెంకటరాజన్న అవధాని, (3) గంటి లక్ష్మినారాయణ (గలన)’’. అని రాసిండు. ఈ విషయాన్ని గొర్రెపటి ‘మిత్రులూ`నేనూ’ అనే తన పుస్తకంలో రికార్డు చేసిండు. ఇందులో వెంకట రాజన్న అవధాని ఆరుభాషల్లో పండితుడు. వకీలు, వైద్యుడు. కాళోజి అభిప్రాయం ప్రకారం బహుకుటుంబి, దరిద్రుడు. ఈయన 1909లో మంథెన (కరీంనగర్‌ జిల్లా)లో జన్మించిండు. ఆర్యసమాజం చేత ప్రభావితుడైన అవధాని అంధ, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమాల్ని చేపట్టిండు. దళితుల్ని దేవాలయ ప్రవేశాల్ని చేయించడమే గాకుండా, స్త్రీ విద్య కోసం కృషి చేసిండు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చిండు. ఈయన కథలు, నవలలు కూడా రాసిండు. 1995లో చనిపోయిండు.  ఇక వెల్దుర్తి మాణిక్యరావుకిది శతజయంతి సంవత్సరం. ఆయన 1912 డిసెంబర్‌ 12న మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో జన్మించిండు. కథలు, కవిత్వం రాయడమే గాకుండా చాలా కాలం మద్యపాన వ్యతిరేకంగా ప్రజా చైతన్యానికి పునాదులు వేసిండు. పత్రికా విలేఖరిగా, కాలమిస్టుగా, జర్నలిస్టుగా, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ చరిత్ర రచయితగా చిరపరిచితులు. ఇక నాలుగో వ్యక్తి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకులు గంటి లక్ష్మినారాయణ. 1904లో జన్మించిండు. 1920 నుంచే కాంగ్రెస్‌లో చేరి దాని అభివృద్ధికి కృషి చేసిండు. వల్లూరి బసవరాజుకు అండగా నిలబడి ఆయన్ని పైకితెచ్చిన నిరాడంబరుడు. మంచి వ్యవహర్త అని కాళోజి రాసిండు.
    ఈ సంఘం తరపున కేవలం కవి, పండిత సమ్మేళనాల్ని ఏర్పాటు చేయడమే గాకుండా ముగ్గురు కలిసి, కథలు, కవిత్వం రాయడం అనే నూతన ప్రక్రియకు నాంది పలికిండ్రు. (ఇటీవలి కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ఆవాహన చేసుకున్న శ్రీశిరసులు పేరిట నలుగురు కవులు కలిసి నల్ల వలస కవిత్వాన్ని అక్షరీకరించిండ్రు) వీరు రాసిన ‘తిరుగుబాటు’, విభూతి లేక ఫేస్‌ పౌడర్‌ లాంటి కథలు అప్పటి పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి.  వీరి రచనలకు ప్రోత్సాహకంగా నిలిచింది గోలకొండ పత్రిక. అయితే 1938 తర్వాత ఆంధ్రకేసరి మాస పత్రిక ప్రారంభం కావడం ఒకవైపు, మరోవైపు వందేమాతర ఉద్యమం మరోవైపు వీరి సాహిత్య కార్యకలాపాలకు తాత్కాలిక విరామాన్నిచ్చాయి. అణా, దేశోద్ధారక గ్రంథమాల ప్రారంభం కావడంతో వీరి కార్యకలాపాలకు కాసింత బ్రేక్‌ పడిరదని చెప్పవచ్చు. వైతాళిక సమితిలో ఉన్న వారే ఈ పత్రిక, గ్రంథమాలల నిర్వహణలో నిమగ్నం కావడంతో కార్యక్రమాలు తగ్గాయి. 1945 నాటికి ఒకవైపు నిజాంరాష్ట్రాంధ్ర మహాసభ కమ్యూనిస్టుల చేతికి రావడం, 1943లో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు ప్రారంభం కావడం కూడా వీరు తిరిగి చురుగ్గా సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి దోహదం చేసిన అంశాలుగా చెప్పవచ్చు.
    ఈ ‘వైతాళిక సమితి’ 1945 ఉగాది (పార్థివ సంవత్సరం) నాడు పున:ప్రారంభమైంది. ఇందులో ఐదుగురు సభ్యులున్నారు. వారి అసలు పేర్లని ఎక్కడా రికార్డు చేయలేదు. ఏప్రిల్‌ రెండు నాటి గోలకొండ పత్రికలో ‘వైతాళికుడు’ పేరిట కాళోజి నారాయణరావు రాసిన వ్యాసంలో ఈ సంఘం ఉద్దేశ్యాలు వివరంగా పేర్కొన్నాడు. మేము చేసే పనితోనే సంబంధమున్నందున మా చిరునామాలు, పేర్లు కూడా అంతం ముఖ్యం కావని అందులో రాసిండు. మేము చేసే పని వల్ల ‘‘మాకు లాభం లేకున్నను ఇతరులు (అంటే తెలంగాణలోని ఆంధ్రులకు) లాభం పొందిన చాలు’’ అని తమ ఆశయాన్ని ప్రకటించారు. ఇందుకు మమ్మల్ని అవమానింతురో, బహుమానింతురో అనే సంశయాన్ని కూడా వ్యక్తం చేసిండు.
    తమ గురించి ఇలా రాసిండు. ‘‘మేము మే’’ మనగా మాలో అయిదుగురమున్నాము. అడవిలోని ఉసిరిలవలె అక్కడక్కడి వాండ్ల మైనను అందరము నీనాడు ఒక్క చోటికి చేరినాము. మా కాపురపు స్థలము హైదరాబాదు. మీతో మాకు ఉత్తర ప్రత్యుత్తరములుండవు కనుక మే ముండెడి బజారు, గల్లీ, యింటి సంఖ్య యివన్నియు మీ కనవసరమని తెలుపుట మాని వైచుచున్నాను. అని చెబుతూ తమలోని అయిదుగురి గురించి వివరంగానే రాసిండు. అందులో మొదట తన పేరు ‘వైతాళికుడు’ గురించి ఇలా చెప్పుకుండు. ‘‘సోదరులారా! నన్ను ‘‘వైతాళికు’డందురు. ఆది మా తల్లిదండ్రులు బొడ్డుగోసి పెట్టిన పేరు గాకున్నను, ఇప్పటికి నాకాపేరే రూఢjైు పోయినది. అందుచే నా అసలుపేరు మీకు చెప్పకున్నను అపచారము కాదు గదా. చిన్నప్పుడు ‘నాకు మాతాత యనగా ఎక్కువ మాలిమి యుండెడిది. ఆయన యెప్పుడును నామీద ఈగ వ్రాలనిచ్చెడివాడు గాదు. ఆయన యనగా మా యింటిలో సింహస్వప్నము. అందుచే నేనాయన యొద్ద ఉన్నంత సేపు, నా వైపు తేఱిపాఱి చూచుటకు గూడ ఎవ్వరికిని గుండె అనెడిదికాదు. (ధైర్యముండెడిది కాదు!) నాకు మొదటి నుండియు నిద్రమెలకువ యెక్కువ. కోడి కూతతోనే లేచి తాత ప్రక్కలోనికి చేరి ‘‘తాతా తెల్లవార వచ్చినది. లే నాకు పద్యాలు చెప్పు’’మని వేధించెడి వాడను. కాసంత ప్రొద్దెక్కగనే ‘‘తాతా? భోజనానికి వేళjైునదిలే యని యిట్లు ఆయన వెంబడి బడుచుండెడివాడను. ఒకప్పుడాయన ‘‘ఏమిటిరా? వైతాళికుని లాగున నా వెంటబడినా!’’వని వేళాకోళము చేయగా అదిమొదలు ఆ పేరే పట్టుకొని అందఱు నన్ను పిలువసాగినారు.’’ అని తన పేరు వెనుక ఉన్న వృత్తాంతాన్ని వెలువరించాడు. ఈ వైతాళిక సమితిలోని మరో సభ్యుడి పేరు    ‘మేధావి శాస్త్రి’. ఈయన గురించి చెబుతూ. పేరుకు తగిన ప్రతిష్ట కలవాడు. ఎట్టి వారితోను చేయి కలుపుకొను సామరధ్యము కలవాడు. ఇంగ్లీషు, ఆంధ్రము, సంస్కృతము ఈ మూడు భాషలలోను కొంత ప్రజ్ఞ కలవాడు. అని పేర్కొన్నడు. ఇగ మూడో వ్యక్తి ‘ఇతిహాసరావు’. ‘‘ఈతడు చరిత్ర యనిన ప్రాణములు విడుచువాడు. చారిత్రిక దృష్టి ప్రమాణములను నిలువని యెడల ఎట్టి యుత్కృష్ట గ్రంథములను గూడ తృణీకరించి వైచుటలో ఇతనిని మించిన వారుండరు. ఇతని ఉచ్వాస నిశ్వాసములు గూడ చరిత్ర గ్రంథమునే వివుచుననిన మీ రాశ్చర్యపడగూడదు.’’ అని అభిప్రాయ పడిరడు. వైతాళిక సమితలోని నాలుగో వ్యక్తి ‘విజ్ఞాన శర్మ’. ‘‘ఇతడు యూనివర్సిటీలో ఎం.ఎ. పట్టము పొందినవాడు. మంచివాడు. దేశసేవపరాయణుడు. ఆధునిక విజ్ఞానమున ఆఱితేఱిన ప్రజ్ఞాధురీణుడు. విజ్ఞానమని పెరుచెప్పగనే ఇతని దృష్టియంతయు పాశ్యాత్య దేశములవైపు ఒగ్గి చూచు స్వభావము గలవాడు. స్నేహపాత్రుడు.
    ఇగ చివరగా ఐదో వ్యక్తి పేరు ‘చిత్రగుప్తుడు.’’ చిన్నప్పటి నుండి తెనుగు వ్రాత ముత్యాలకోవవలె ముద్దులు మూటగట్టునట్లు వ్రాయు చుండుట వల్లను, ఎవ్వరెంత వేగముగా మాట్లాడినను ఉత్త లేఖనము చెప్పినను, కలమెత్తకుండ నిలువకుండ తీగెతీసినట్లు వ్రాయు అలవాటు గలిగి యుండుటచేతను’’ అతనికి చిత్రగుప్తుడు అనే పేరొచ్చిందని చెప్పిండు.
    ఈ అయిదుగురు కూడా విద్యావంతులు కావడమే గాకుండా సమాజం పట్ల బాధ్యతతో మెలగాలనే భావనతో ఉన్న వారు కావడంతో పార్థివ ఉగాది నాడు ‘వైతాళికు’డి ఇంట్లో సమావేశమై ‘తెలంగాణలో విద్యావ్యాప్తి’కి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది తమ వంతు దేశోపకార సేవ అని వీరు భావించారు. ఈ దేశోపకారం కోసం కొత్త సంస్థను ఏర్పాటు చేయాల్నా? లేదా ఇది వరకే నడుస్తున్న ఏదైనా సంస్థ ద్వారా ఆ పని చేయాల్నా? అని తర్జన భర్జన పడ్డారు. కొత్త సంస్థ అంటే కొత్త గొడవలు మీదికి తెచ్చి పెట్టుకోవడమే అని భావించి. ఈ ఐదుగురు సభ్యులు ఒక కూటమిగా ఏర్పడి ‘‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’’ ద్వారా విద్యావ్యాప్తికి కృషి చేసిండ్రు. అంతకు ముందు పరిషత్తు ద్వారా పనిచేయాలనే తమ వాంఛను దాని అధ్యక్షుడికి (మాడపాటి హనుమంతరావు?)  తెలియజేసిండ్రు. జీతంలేకుండా ప్రచారకులు దొరికినందుకు ఆయన సంతోషించి వారిని ప్రోత్సహించిండు. వివిధ ప్రదేశాల్లో ‘వైతాళిక సమితి’ నిర్వహించే సభలు, సమావేశాలకు, వారి వ్యాసాలకు గోలకొండ పత్రికలో ప్రముఖంగా వచ్చేలా ప్రయత్నం చేస్తామని కూడా అధ్యక్షుడు హామి ఇచ్చాడు. బహుశా దాన్ని ఆయన నేరవేర్చాడు కూడా.
    వైతాళిక సమితి ఏర్పాటు విషయం పత్రికలో ప్రముఖంగా రావడంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సమావేశాల్లో పాల్గొనవలసిందిగా అనేక ఆహ్వానాలు అందాయి. ఎక్కడి మీటింగ్‌కు పోయినా అందరూ కలిసేపోయేవారు. మాట్లాడేవారు. ఈ వైతాళిక సమితి పాల్గొనే సమావేశాలకు ‘అధ్యక్షుడు’ ఉండేవారు కాదు. ఎందుకంటే అధ్యక్షుల స్థానంలో ఉన్న వారు నిరంకుశంగా వ్యవహరించినట్లయితే వక్తలకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో ‘అధ్యక్షుడి’ పదవిని రద్దుచేసిండ్రు. మొదటి సమావేశాన్ని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో ఏర్పాటు చేసిండ్రు. అయితే కరపత్రాలు పంచకున్నా కేవలం భాషా నిలయం బోర్డుపై ప్రకటన ద్వారా, మౌఖికంగా జరిగిన ప్రచారంతో మీటింగ్‌కు అనేకమంది హాజరయ్యిండ్రు. స్త్రీలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యిండ్రు అని   19, ఏప్రిల్‌ నాటి ‘గోలకొండ’ సంచికలో మరోసారి వైతాళికుడు రాసిండు.
    పరిషత్‌ ప్రార్థన గీతం ఆలాపతో సమావేశం ప్రారంభమైతుంది. ఈ గీతం అందరి ప్రశంసలందుకుంది. ఈ పరిషత్‌ ప్రార్థన గీతం గురించి కూడా ఇంతవరకు ఎక్కడా రికార్డు కాలేదు.
ఆ గీతమిది.
    ఆంధ్ర సారస్వతపరిష`న్మాతడు,
            ధీరోదాత్తకు. జై
    1.    సాహీత్య`చరిత`విజ్ఞాన`కళలు
        చతుర్ముఖములై సౌరు గులుకంగా?
        ‘‘సత్యమ్‌`శివమ్‌ సుందర’మను మంత్రము
        చక్కని మకుటముగాగల, ఆంధ్ర॥సా॥

    2.    ఆఱువిధములగు సారస్వత పరీ
        క్షారంభములే మణిహారములుగ
        బాల`ప్రజా`పండిత సారస్వత
        పాయిన పాత్రలు చేగల ఆంధ్ర।సా॥
   
    3.    ఎనుబది లక్షలు మించిన ఆంధ్రుల
        హృదయరత్న సింహాసన మందున
        మన ప్రభువు కృప ఛత్రముగాÑ
        వినుతొగొన్న జగదీశ్వరి ఆంధ్ర॥సా॥   అని పాడి సభను దిగ్విజయంగా నిర్వహించారు.
    పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాల మాదిరిగా రచనలున్నప్పటికీ ఇది నిజంగా నిర్వహించబడిన సంస్థ. ఈ సంస్థలో కాళోజి నారాయణరావుతో పాటుగా వెల్దుర్తి మాణిక్యరావు, వెంకటరాజన్న అవధాని, గంటి లక్ష్మినారాయణ, సురవరం ప్రతాపరెడ్డి (వట్టికోట ఆళ్వారుస్వామి?)లు సభ్యులుగా ఉండేవారు.
    ఈ ఐదుగురు తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో పర్యటనలు చేస్తూ అక్కడ సారస్వత, సాహిత్య పరిషత్‌ సభలు నిర్వహిస్తూ అక్షరాస్యతను పెంచడమే గాకుండా సాహిత్యవాతావరణాన్ని సృష్టించారు. ఇందులో వెల్దుర్తి మాణిక్యరావు అణాగ్రంథమాల స్థాపకుల్లో ఒకరు. అలాగే పరిషత్‌ సాహిత్య కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడమే గాకుండా మొత్తం తెలంగాణ భాషలో మొట్టమొదటి నాటకం ‘దయ్యాల పన్గడ’ రచయితగా కూడా ఆయన ప్రసిద్ధుడు. కథలు కూడా రాసిండు. వేంకట రాజన్న అవధాని 1926 నాటికే మంథనిలో ‘ప్రబోధ చంద్రోదయం’ అనే లిఖిత పత్రికను నిర్వహించడమే గాకుండా గోలకొండ పత్రికలో పనిచేసిండు. వీరంతా అడ్వకేట్‌ విద్యను అభ్యసించి దానిని ప్రాక్టీస్‌గా మార్చకుండా సాహిత్య రంగంలోకి దిగిండ్రు. తెలంగాణ ప్రజలకు అత్యావశ్యకమైనది విద్య. ఆ విద్య ద్వారానే సమాజాన్ని మార్చొచ్చు అని నమ్మి అందుకు నడుంబిగించిన ‘ద్రౌపది లేని పంచపాండవులు’ అని తమని తాము వర్ణించుకున్నారు.
    ఈ వైతాళిక సమితి తెలంగాణలో సాహిత్య, సాంస్కృతిక పునర్వికాసానికి దారులు వేసిందంటే అతిశయోక్తి కాదు. అప్పుడప్పుడే గ్రంథాలయం, పత్రికోద్యమం ఊపందుకొని మారుమూల గ్రామాల్లో సైతం చదువుకున్న విద్యార్థులు జట్లుగా ఏర్పడి తమ గ్రామానికి ఏదైనా మంచి చేయాలనే కుతూహలంతో ఒకవైపు చరిత్రను తవ్వి తమ మూలాల్ని వెతికి పట్టుకున్నారు. అలా వచ్చినవే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని విరాట్రాయాంధ్ర భాషా నిలయం. ఇలా ప్రతి పట్టణంలో ఆంధ్రమహాసభ తరపున కార్యకలాపాలు చేపట్టి సమాజ శ్రేయస్సుకు తమదైన శైలిలో కృసి చేసిండ్రు. ‘‘హైద్రాబాద్‌లో సారస్వత ప్రియులైన యువకులు వైతాళిక సమితిని యనునొక సంస్థను స్థాపించిరి. సాహిత్యము , కళలు వీరి ప్రచారము యీ సంస్థ ముఖ్యోద్దేశ్యము’’ అని ఈ సంస్థ గురించి ఆంధ్రసారస్వత పరిషత్తుని తీర్చి దిద్దిన దేవులపల్లి రామానుజరావు తన ‘‘తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం’’ అనే పుస్తకంలో రాసిండు. తెలంగాణ పునర్వికాసంపై సమగ్ర పరిశోధన చేసిన పత్రికా సంపాదకులు కె.శ్రీనివాస్‌ మొదట ఈ ‘వైతాళిక సమితి’ గురించి తన పరిశోధన గ్రంథంలో రాసిండు. వైతాళిక సమితి సభ్యుడైన వెల్దుర్తి మాణిక్యరావు ఇలా రాసిండు. ‘‘1934`36లో కాలోజీ ‘వకాలత్‌’ చదవటానికి హైదరాబాద్‌ వచ్చినాడు. వెంకటరాజన్న అవధాని కూడా అందుకే వచ్చినాడు. నాకూ బుద్దిపుట్టింది. గంటి లక్ష్మీనారాయణ గంటు పడ్డాడు. నలుగురం రోజూ కలిసేది. చేతుల్లో ‘ఖానూన్‌’ పుస్తకాలున్నా, మాట్లాడేది లోకాభి రామాయణం. ‘వైతాళిక సంఘం’ అని ఓదాన్ని సృష్టించినాము. కాళోజి, వెల్దుర్తి, అవధాని’ అని ముగ్గురం కలిసి కథలు రాసేది. ఈ పద్దతి నాటికి నేటికి సరికొత్తదనే చెప్పాలి. అప్పటి నుంచి రచనా వ్యాసాంగంలో కాళోజీకి అభిరుచి కలిగిందంటే అతిశయోక్తి కాదనుకొంటాను.’’ అని రాసిండు. అంటే వైతాళిక సమితి కాళోజి మీద వేసిన ప్రభావం అర్థమవుతుంది.
    ఈ వైతాళిక సమితి తెలంగాణ సాహిత్య చరిత్రలో ఓ చిరస్మరణీయమైన ఘట్టం. సాహిత్యం ఓ సాహస కార్యంగా మారిన కాలంలో దానికి పూనుకొని ప్రచారం చేసిన వారిలో కాళోజి ముందంజలో ఉన్నాడు. ఈ సందర్భంగా కాళోజి తెలంగాణ చరిత్రతో నడిచిన తీరుని రికార్డు చేసుకోవాల్సిన అవసరముంది. ఆ చరిత్రను రికార్డు చేసుకోవడానికి ఇది ఏమాత్రం ఉపయోగపడిన అది తెలంగాణ సాహిత్యానికి మేలిమి చేర్పే అవుతుంది. 

-సంగిశెట్టి శ్రీనివాస్‌

THIS ARTICLE IS SUBMITTED FOR THE SEMINAR CONDUCTED BY A.V. COLLEGE ON KALOJI NARAYANARAO AND HIS CONTRIBUTION


BARMAR/ The EXPLOSIVE BOOK PUBLISHED IN SUPPORT OF REMOVAL OF STATUES AT TANKBUND BY SINGIDI

   

    సోకం     

   అణచివేత, ఆధిపత్యం, దోపిడీ మొదలు పెట్టాలన్నా, కొనసాగించాలన్నా ముందుగా ఆ ప్రాంతాన్ని, ప్రజల్ని ఆత్మన్యూనతా భావనలోకి నెట్టివేయాలనేది అంతర్జాతీయ సిద్ధాంతం. రంగు, రూపం, ప్రాంతం, భాష, పుట్టుక ఆధారంగా ఈ అణచివేత కొనసాగుతోంది. మీ భాష సరిగ్గా లేదు, మీ యాస బాగా లేదు. మీ కట్టూ బొట్టూ ఎబ్బెట్టుగా ఉంది. మీకు చరిత్ర లేదు, మీకు వైతాళికులు లేరు. అసలు మీరు ఏ విషయంలోనూ మాకు సమఉజ్జీలు కారు అంటూ సీమాంధ్ర ఆధిపత్య వర్గాలు తెలంగాణపై సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా దోపిడీని, అణచివేతను, వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు.
    సాంస్కృతిక ఆధిపత్యం, అజమాయిషీ, అణచివేతలపై తిరుగుబాటే ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ ఘటన. ప్రపంచంలో ఎక్కడైనా మొదట తిరుగుబాటు సాంస్కృతిక రంగంలోనే వ్యక్తమవుతుంది. ట్యాంక్‌బండ్‌పై మార్చి 10, 2011 నాడు కూడా అదే జరిగింది. ఆరు దశాబ్దాలుగా తమ మాటకు, ఉనికికి గుర్తింపు లేకపోవడాన్ని జీర్ణించుకోలేక తెలంగాణ బిడ్డలు విచక్షణ, విజ్ఞతతో విగ్రహాలను తొలగించారు. ఈ తొలగింపు విచక్షణ, విజ్ఞతతో జరిగిందని చెప్పడానికి ఆనాటి ఘటనలే ఆధారం. ట్యాంక్‌బండ్‌ చుట్టూ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను నిలిపిండ్రు. తెలంగాణలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న తెలంగాణ వాదులతో నిండిపోయాయి. ఇలాంటి సమయంలో వేలమంది తెలంగాణవాదులు తమ ప్రాణాలకు రక్షణ లేదని తెలిసి కూడా సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరసించేందుకు ట్యాంక్‌బండ్‌ ఎక్కిండ్రు. కుమ్మరి మొల్ల, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, గుర్రం జాషువా, శ్రీశ్రీల విగ్రహాలకు ఎలాంటి హాని తలపెట్టలేదు. దీని ద్వారా తాము ఆధిపత్య వర్గాలకు, దోపిడి దారులకు మాత్రమే వ్యతిరేకమనే సంకేతాన్ని తెలంగాణ వాదులిచ్చినట్లయింది. ఇది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది. ఈ పునాదుల్లోంచే సామాజిక చైతన్యం విస్తృతమవుతోంది. తెలంగాణ వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది అనే పూర్తి అవగాహనతో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలోని దళిత, బహుజన, ముస్లిం మైనారిటీ, అభ్యుదయ శక్తులు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే సీమాంద్ర నుంచి ‘కావడి కుండలు’ సంకలనం వచ్చిందని గ్రహించాలి. దాని కొనసాగింపే ఈ ‘బర్మార్‌’. సామాజిక చైతన్యం కచ్చితంగా ఆర్థిక తిరుగుబాటుకు బాటలు వేస్తుంది. ఆ రహదారుల నిర్మాణంలో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిమగ్నమై ఉంది. ఒక్క సారి సీమాంధ్ర ఆర్థికాధిపత్యంపై తిరుగుబాటు షురువయ్యిందంటే దాని పరిణామాలు ఊహించడం కష్టం. తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నీ దోసుకుంటున్న వర్గాల్ని ప్రజలు అంతా తేలిగ్గా వదిలిపెట్టబోరని గతానుభవం చెబుతూనే ఉంది.
    సంస్కరణలు, అభివృద్ధి పేరిట సీమాంధ్ర ఆధిపత్య వర్గాలు చేస్తున్న వాదనల్ని కూడా ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు.  ఎవరికెంత ఏ రూపంలో ముట్టాలో ఆ రూపంలో చెల్లించేందుకు తెలంగాణ సమాజం సిద్ధమయింది. ఎందుకంటే గ్లోబలైజేషన్‌ అనంతరం పదాలకు అర్థాలు మారాయి. హైటెక్కు పాలన అసలు రంగు అర్థమయింది. గతంలో ‘సంస్కరణ’ అంటే పాజిటివ్‌ అంశం. ఇవ్వాళ ‘సంస్కరణ’ అంటే పేదల దోపిడి. అడవుల్లోని వనరుల, సంపద దోపిడి. ఒకప్పుడు అభివృద్ధి అంటే సమాజ ప్రగతి. చంద్రబాబు పాలన నాటినుంచే ‘అభివృద్ధి’ అంటే వినాశనం, ‘విధ్వంసం’ అనేవి పర్యాయ పదాలుగా మారాయి. అభివృద్ధి అంటే తమ భూములు ఎపిఐఐసీకి ఇచ్చి అక్కడ సీమాంధ్రులు కట్టిన భవంతుల్లో వాచ్‌మెన్‌ ఉద్యోగం చేయడమనే విషయం తెలంగాణ బిడ్డలకు అనుభవంలోకి వచ్చింది. అవును భవంతులు కట్టి బాగా బలిసిన వాళ్లు దోసుకోవడమే అభివృద్ధి అయితే అది తెలంగాణ వారికి ‘దోపిడి’ గానే అర్థమవుతుంది. అట్లానే చూస్తారు.
    ఆధిపత్య సీమాంధ్రులు ‘తెలంగాణ’ను చూసే దృక్కోణాన్ని మార్చుకోవాలని అందుకే చెబుతున్నాం. విగ్రహాల తొలగింపు సంఘటన ఆరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా జరిగి వుండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా జరిగి వుండేది. అప్పుడయితే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేబట్టేది కాబట్టి ‘తొలగింపు’ అనే వాళ్ళు. ఇప్పుడు అమానవీయమైన దౌర్జన్యం రాజ్యమేలుతుంది కాబట్టి ‘కూల్చివేత’ అంటున్నారు.
    ఆధిపత్యానికి, అణచివేతకూ ప్రజలు ఎప్పుడూ తమ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. అవి కొన్ని సార్లు ఆశ్చర్యం గొలిపేవిగా కూడా ఉండొచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటరీ అకృత్యాలకు వ్యతిరేకంగా అయిదుగురు మహిళలు చేసిన నగ్న ప్రదర్శన దేశాన్ని కుదిపేసింది. అమెరికా(మాజీ)అధ్యక్షుడు జార్జిబుష్‌ మొదలు చిరంజీవి వరకు ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి చెప్పులు విసిరిండ్రు. అంటే అది హత్యాప్రయత్నం కాదు. తమ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న నిరసనను తెలియజేయడమే. మిలియన్‌ మార్చ్‌ సంఘటన కూడా ఒక నిరసన రూపమే. తైనాన్‌మెన్‌ స్క్వేర్‌  నుంచి తెహరీర్‌ స్క్వేర్‌ వరకు అది కొనసాగుతూనే ఉంది. విగ్రహాల నిమజ్జనం అనేది సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించి, దోపిడి, వివక్ష, సీమాంధ్ర పెత్తనం అంతమవ్వాలని కోరుకున్న వేలాది మంది సమక్షంలో జరిగిన సంఘటన. ఉద్యమ చైతన్యంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయడంతో తమ నోళ్ళకు తాళాలు వేసుకున్న సీమాంధ్ర కుహనా మేధావులు ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని మళ్ళీ విజృంభించారు. తమ ‘మేతావిత్వ’ నగ్న స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. ఈ సాకుతోనైనా తెలంగాణ ప్రజల వాదనల్ని తప్పుడు వ్యాఖ్యానాలు, వాదనల ద్వారా పక్కదోవ పట్టించాలని ప్రయత్నించారు. కాని సఫలీకృతులు కాలేక పోయారు. అంబేద్కర్‌ విగ్రహాల ‘విధ్వంసం’ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని మరొక్కసారి తెలంగాణ వాదులపై దాడికి దిగాలని విఫల ప్రయోగాన్నే మళ్ళీ చేస్తున్నారు.
    ఇవ్వాళ అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసాన్ని మిలియన్‌ మార్చ్‌ ఘటనలతో కొంతమంది కుహనా మేధావులు పోలుస్తున్నారు. రూపంలో రెండూ విగ్రహాల కూల్చివేతగా కనబడినా, సారంలో మాత్రం రెండూ వేర్వేరు. ఈ దేశంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌ మీద కొంత మంది స్వార్థ రాజకీయ నాయకులు, కొన్ని సంఘ విద్రోహ శక్తులు తమ రాజకీయాల కోసం చేసిన దాడులివి. మిలియన్‌ మార్చ్‌ ఘటన సామూహిక ఉద్విగ్నత, 60 యేండ్ల ఆకాంక్షలోంచి వచ్చిన అద్వితీయమైన నిరసన రూపం. గంప గుత్త పెత్తనానికి చెప్పుదెబ్బ.
    సీమాంధ్ర మీడియా, ఆధిపత్య వర్గాలు ఈ సంఘటనను ‘విధ్వంసం’ అని నెత్తినోరు కొట్టుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. ఒక మీడియా చానల్‌ అయితే తెలంగాణ వాదుల్ని కోతులు కొండముచ్చులు, తాగుబోతులు అంటూ తూలనాడుతూ కథనాలను ప్రసారం చేసింది. 600 మంది బలిదానాలను ఏనాడు పట్టించుకోని వీళ్లు ‘నీతులు’ వల్లె వేయడం తెలంగాణపై వారి వివక్ష, కక్షపూరిత వైఖరికి అద్దం. ఎవరెంత రాద్ధాంత చేసినా ఇది విచక్షణ, విజ్ఞతతో చేసిన ‘తొలగింపు’ మాత్రమే. ‘విధ్వంసా’న్ని సమర్ధిస్తారా అని అమాయకంగా ప్రశ్నించేవారికి ఇది వినిర్మాణ ప్రక్రియలో భాగమని అర్థచేసుకోవాలని చెబుతున్నాం. ఉన్నవాటిని బద్దలు కొట్టకుండా కొత్తవాటిని మేలైన పద్ధతిలో నిర్మించుకోలేమనే అవగాహనతో చెబుతున్నాం. ఇది ఇక్కడితో ఆగిపోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ‘సామాజిక తెలంగాణ’ కోసం జరగాల్సిన ప్రక్రియగా భావిస్తున్నాం.

GGGGG

    కరువుతో తల్లడిల్లుతున్న భారతదేశాన్ని ఆదుకునే ఉద్దేశ్యంతో పి.ఎల్‌.480 అనే పథకం ద్వారా అమెరికా కొన్ని వేల క్వింటాళ్ల గోధుమల్ని 1954లో ఉచితంగా సరఫరా చేసింది. అమెరికా అధ్యక్షుడు ఐషనోవర్‌ ఆదేశంలోని ప్రభుత్వ`ప్రయివేటు( స్వచ్ఛంద) సంస్థల భాగస్వామ్యంతో వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా తిండిగింజలు అందజేసేందుకు గాను అమెరికా పబ్లిక్‌ లా( పి.ఎల్‌) 480 అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ననుసరించి అమెరికా మొదటి సాయం భారతదేశానికే అందించింది. అయితే ఈ గోధుమలతో పాటుగా విత్తనాల రూపంలో ప్రవేశించిన మొక్క ‘పార్థీనియం హిస్టిరొఫరస్‌’. తెలుగులో దీన్ని ముద్దుగా ‘వయ్యారి భామ’ అని పిలుస్తాం. చూడ్డానికి ముచ్చటగా నక్షత్రాల్లాంటి తెల్లటి పూలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దేశమంతటా విస్తృతంగా పరుచుకుపోయింది. దీన్ని భారతదేశమంతటా ‘కాంగ్రెస్‌ ఘాస్‌’ అని పిలుస్తారు.
    ఈ ‘వయ్యారిభామ’ ఒక ‘రోగాల మహమ్మారి’. దీనివల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్త్మా, జ్వరం రావడం, చర్మం చిట్లిపోవడం, ముక్కు వాచిపోవడం, తమ్ములు, దగ్గులు, ఒక్కటేమిటి సర్వరోగాలు దీని మూలంగా వస్తాయి. దీన్ని నాశనం చెయ్యాలని దేశంలోని చాలా ప్రయోగశాలలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నా అది దిన దినం వృద్ధి చెందుతూందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. వ్యవసాయ రంగంలో పంటలు తక్కువ దిగుబడి కావడానికి, పండిన కూరగాయలు విషపూరితం కావడానికి ఇది కారకం. అంతేగాకుండా దీనిపై నుంచి వచ్చిన గాలి పీల్చి రోగగ్రస్తులైన వారు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు మందుల కోసం ఖర్చు పెడుతున్నారు. కొసమెరుపేందంటే ఈ మందులు ఎక్కువగా తయారయ్యేది అమెరికాలోనే. అంటే కుట్రపూరితంగా గోధుమలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి భారతదేశాన్ని రోగాలపుట్టగా తయారుచేసింది అమెరికా.
    సరిగ్గా భారతదేశం పట్ల అమెరికా ఏ విధంగా వ్యవహరించిందో, తెలంగాణ పట్ల గూడా సీమాంధ్ర నేతలు అలానే వ్యవహరించారు. ‘వయ్యారిభామ’ లా వచ్చి తెలంగాణను మొత్తం గుళ్ల చేసిండ్రు. చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కి ఇక్కడి ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన వాటా ఎందులోనూ దక్కకుండా చేసిండ్రు. పైకి చూడ్డానికి, చెప్పడానికి ‘వయ్యారిభామ’లాగా ముచ్చట ముద్దుగానే ఉంటది. కాని ఆచరణలోకి వచ్చేసరికి తెలంగాణ మొత్తాన్ని విషతుల్యం చేసిండ్రు. ఇక్కడి వారికి చరిత్ర లేదు. ఇక్కడ వైతాళికులు లేరు. ఇక్కడి సంస్కృతి మోటు అని తీర్పులిచ్చిండ్రు. తమ ఆధిపత్యాన్ని చాటుకుండ్రు.
    ఈ అహంకార పూరిత ఆధిపత్యాన్ని కూలగొట్టడానికే తెలంగాణ బిడ్డలు మార్చి 10, 2011నాడు ట్యాంక్‌బండ్‌పై తమవి కాని విగ్రహాలను తొలగించిండ్రు. న్యాయంగా, హక్కుగా తమ వైతాళికులకు దక్కాల్సిన స్థానాన్ని గత 25 ఏండ్లుగా సీమాంధ్ర ప్రాంతం వాళ్ళే కబ్జాచేసిండ్రు. అందుకే ఈ తొలగింపు అని తేల్చి చెప్పిండ్రు. 25 ఏండ్లుగా ఈ విగ్రహాలు తెలంగాణలో వైతాళికులు లేరు, కేవలం తాము మాత్రమే మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ‘వెలుగులం’ అనే సంకేతాలిచ్చాయి. ఇక్కడి మట్టిమనుషుల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపించాయి. విగ్రహాల తప్పేమి లేకున్నా వాటి ప్రతిష్టాపకుల వివక్ష ముప్పు తెచ్చింది. కొంతమంది అమాయకంగా అయ్యో ఆ ప్రాణం లేని విగ్రహాలు ఏంజేసినవి అని అంగలారుస్తున్నరు. ప్రాణంలేని విగ్రహాల పట్ల అంత ప్రేమ నటించే వీళ్లు తెలంగాణ కోసం తమను తగలబెట్టుకున్న శ్రీకాంతచారి, యాదయ్య, వేణుగోపాలరెడ్డి లాంటి బిడ్డలు ఎన్నడు కండ్లకు కనబడరు. వాళ్ల బలిదానానికి అటు ప్రభుత్వం కాని, ఇటు ప్రతిపక్ష నాయకులు గానీ కనీస సంతాపం కూడా వ్యక్తం జేయరు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే సిపిఎం పార్టీ ఒకటి ఈ మధ్యన కోట్లకు కోట్లు చందాలు వసూలు చేసి భారీగా రాష్ట్ర మహాసభలు నిర్వహించింది. తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదుల్ని వేధిస్తున్న ప్రశ్నేందంటే ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ప్రజోపయోగ పనైనా వీళ్లు జేసిండ్రా అంటే సమాధానం పెద్ద గుండు సున్న. అదే చత్తీస్‌ఘడ్‌లో షాహిద్‌ హాస్పిటల్‌ కట్టించి ఉద్యమకారులు ప్రజలకు సేవ జేసిండ్రు.  వీరు మాత్రం హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున భవంతులు నిర్మించుకొని వాటికి తమ ప్రాంతానికి చెందిన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరి ఉదయల పేర్లు పెట్టుకుండ్రు. నిత్యం పొద్దున లేస్తే సాలు తమది తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం అని చెప్పుకునే పార్టీ ఏనాడు ఇక్కడి వారిని గౌరవించిన పాపాన పోలేదు. సాయుధ పోరాటానికి పునాది వేసిన దొడ్డి కొమురయ్య పేరుగాని, చాకలి ఐలమ్మ పేరుగాని వీరికెప్పుడూ అంటరానిదే. వీళ్లు ప్రజాస్వామ్యంగా ఎన్నడూ వ్యవహరించలేదు. తెలంగాణ ప్రజల న్యాయమైన  డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్న ఈ పార్టీ కనీసం తెలంగాణ సాయుధ పోరాట ప్రతీకల్ని సీమాంధ్రల్లో ప్రతిష్టించే పనికూడా చేయలేదు. ఇది వీరి జ్ఞానంలోని డొల్లతనాన్ని తెలియజేస్తోంది. మరోవైపు తెలంగాణకు ఏ మాత్రం సబంధంలేని విగ్రహాలు పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు, సుందరయ్యల విగ్రహాలు తెలంగాణ అంతటా పరుచుకున్నాయి. కానీ సమ్మక్క, సారలమ్మ, సర్వాయి పాపన్న, కొమురంభీమ్‌, వట్టికోట ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, షోయెబుల్లాఖాన్‌, బందగీ, తుర్రెబాజ్‌ఖాన్‌, సుద్దాల హనుమంతు, కాళోజీల్లాంటి వందలమంది వైతాళికుల్లో ఒక్కరి విగ్రహం కూడా సీమాంధ్రల్లో ప్రతిష్టకు నోచుకోలేదంటేనే ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్న వాదనలోని బలాన్ని తెలియకనే తెలియ చెబుతుంది. ఇంత ప్రస్ఫుటంగా వివక్ష కనబడుతున్నా, తాము ఉద్ధరించేవాళ్లము అనే ‘సంస్కర్త’ రూపాల్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.
    ఈ వివక్ష ఇవ్వాళిటిది కాదు. 1948 నుంచే ఈ వివక్ష షురువయ్యింది. కలో, గంజో తాగుతూ గుట్టు చప్పుడు గాకుండా ఉన్న తెలంగాణను, హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించడంతోనే అహంకార పూరిత ఆధిపత్యానికి తెరలేసింది.
    1948లోనే ఇక్కడి వారికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు కాబట్టి తాము మెజారిటీ ప్రజలకు అర్థమయ్యే భాషలో వ్యవహారాలు జరిపేందుకు ఇంగ్లీషు తెలిసిన తెలుగువారిని నియమిస్తున్నామని అప్పటి హైదరాబాద్‌ మిలిటరీ ముఖ్యమంత్రి ఎం.కె.వెల్లోడి వెల్లడిరచాడు. ఇగో అప్పటినుంచి ఆరంభమైన సీమాంధ్ర వలస, ఆధిపత్యం ఎవ్వరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. హక్కుగా దక్కాల్సినవి కూడా అడుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది.
    ఈ దుస్థితి నుంచి బైటపడి ఆత్మగౌరవంతో, వెన్నెమక ఉన్న మనిషిగా నిలబడ్డానికి తెలంగాణ తల్లి బిడ్డలు నేడు ఒక్క సుతితోటి కొట్లాడుతున్నరు. లేకుంటే తెలంగాణ వ్యతిరేకులు మింగి మంచినీళ్లు తాగేటోళ్లు. 1948 నుంచి తెలంగాణకు ఈ దుస్థితి దాపురించినాదాదిగా భారతదేశ, సీమాంధ్ర నాయకులు అనేక విధాలుగా తెలంగాణను వంచించారు. మోసం చేశారు. చివరకు ఇక్కడి వారిని చరిత్ర హీనులుగా చిత్రించారు. తెలంగాణ వారికి నలుగురైదుగురికి మించి వైతాళికులు లేరు అని ట్యాంక్‌బండ్‌ ద్వారా సందేశమిచ్చారు.
    ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల్ని నిమజ్జనం చేసిన వాళ్లు ఒక డజన్‌కు మించి ఉండరు. ఆ పని చేయడానికి వాళ్లకు ఆయుధాలు అవసరం రాలేదు. తెలంగాణలోని నాలుగుకోట్ల ప్రజల ఇమ్మతి, సమ్మతే వారికి బలంగా ఉపయోగపడిరది. సీమాంధ్ర పెత్తనంపై ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతే ఈ కూల్చివేతకు ఊతమిచ్చింది. ఈ వివక్ష, తెలంగాణపై పెత్తనం ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని ఆధిపత్య ప్రతీకలు ధ్వంసం అవుతాయని తెలంగాణ బిడ్డలు హెచ్చరించిండ్రు. బుద్దిగా మసులుకోవాలని ప్రభుత్వానికి సవాలు విసిరిండ్రు. దీని నుంచి తెలంగాణవాదులతో సహా వ్యతిరేకులూ కూడా గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది.
****
 అందరి కన్నా ముందుగా ట్యాంక్‌బండ్‌పై ఆధిపత్య ప్రతీకల్ని నిమజ్జనం చేసిన ఉద్యమకారుల కాళ్లకు మొక్కుతున్నం. అట్లాగే ఈ పుస్తకం ఇంత అందంగా రూపుదిద్దుకోవడంలో మాకు హమేషా అండగా నిలబడే ఆర్టిస్టు అక్బర్‌ గారికి, ఆర్థికంగా ఆదుకున్న ఆదిలాబాద్‌ మిత్రుడు మోహన్‌, హైదరబాద్‌లో జర్నలిస్టు దోస్త్‌ పి.వేణుగోపాల స్వామి, కేంద్ర సాహిత్య అకాడెమి గ్రహీత భూపాల్‌ గార్లకు వెనుకమాట రాసిచ్చిన సుంకిరెడ్డి నారాయణరెడ్డిలకు శణార్థులు. మేము అడిగిన వెంటనే ఎంతో శ్రమకోర్చి వ్యాసాలు రాసిచ్చిన రచయితలందరికీ, ఈ పుస్తకం ఈ మాదిరిగా రావడానికి తమ వంతు బాధ్యతలు నిర్వహించిన ‘సింగిడి’ మిత్రులకు కృతజ్ఞతలు.
    ఈ పుస్తకంలోని బాగోగులు పట్టించుకొని మరిన్ని మంచి పుస్తకాలు రావడానికి మా లోటుపాట్లను సరిదిద్దవలసిందిగా పాఠకులకు, విజ్ఞులైన మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
-సంగిశెట్టి శ్రీనివాస్‌
-ఏశాల శ్రీనివాస్‌