Saturday 25 August 2012


Rally taken at tankbund by noted writers and activists

టాంక్‌బండ్‌ మీ భారాన్ని మొయ్యలేదు!

    అహంకార పూరిత ఆధిపత్యాన్ని సీమాంధ్ర ప్రభుత్వం మళ్లొక్క సారి తెలంగాణ ప్రజలమీద ప్రదర్శించడానికి పకడ్బందీ పథకాలు రచిస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను పున: ప్రతిష్టించడానికి ఆగమేఘాల మీద జీవోలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని, సింగిడి, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ప్రజాఫ్రంట్‌, తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి, ఇతర తెలంగాణ సంఘాలు, వ్యక్తులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం పంతానికి పోతోంది. మొండిగ ముందడుగేస్తుంది. ఈ విషయంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ‘విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శకాలు’ నిర్ణయించేందుకు ఐదుగురు సభ్యులతో కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించింది. పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో తెలంగాణకు బద్ధవ్యతిరేకులైన ఎం.మహేందర్‌ రెడ్డి, ఎన్‌. రఘువీరా రెడ్డి, ధర్మాన ప్రసాదరావులున్నారు. వీరితో పాటుగా తెలంగాణ కాడెత్తేసిన జానారెడ్డి కూడా కమిటీలో ఉన్నాడు.
    కొమరం భీమ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పుతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ అందుకోసం ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. అయితే కూలిన 16 విగ్రహాలను మళ్లీ పెట్టేందుకు మాత్రం యుద్ధ ప్రాతిపదికన 76 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం అందులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదల చేసింది కూడా. మూడు నెలల కాలంలో విగ్రహాల ఏర్పాటు పూర్తి చేసేందుకు ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. ఒక వైపు తెలంగాణలోని అన్ని విద్యార్థి జేఏసీలు విగ్రహాల పున: ప్రతిష్టను వ్యతిరేకిస్తున్నాయి. ఒక వేళ ప్రజాభీష్టాన్ని కాదని ప్రతిష్టించినా వాటిని కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నాయి కూడా.
    అసలు ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాల తొలగింపుకు ప్రధాన కారణం తెలంగాణ వాళ్లుండాల్సిన స్థలాల్ని సీమాంధ్రులు కబ్జా చేయడం. తెలంగాణ వెలుగులతో నిండాల్సిన ట్యాంక్‌బండ్‌ని తమ ప్రాంతం వారితో నింపుకున్నందుకు ప్రజల్లో భావోద్వేగాలున్నాయి. దీనికి తోడుగా మార్చి పదిన ప్రజల్ని ఎక్కడికక్కడ నిర్బంధించి, వేదించడంతో నిగ్రహం కోల్పోయిన ప్రజలు తమ ఆగ్రహాన్ని సీమాంధ్ర విగ్రహాలపై వెళ్లగక్కారు. అది కూడా అత్యంత విచక్షణతో. ఆగ్రహంలో కూడా తెలంగాణ వాదులు కచ్చితమైన విచక్షణ పాటించారు. ఒక్క మహిళ విగ్రహాన్ని కూడా ముట్టు కోలేదు. దళిత, ముస్లిం, బీసీలకు చెందిన ఏ విగ్రహాన్ని తొలగించలేదు. వేమన, పోతులూరి, శ్రీశ్రీ, వరంగల్‌ వచ్చిపోయాడన్న ఒకే ఒక్క కారణంతో తిక్కన విగ్రహాన్ని కూడా స్పేర్‌ చేసిండ్రు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యను కూడా తాకలేదు. అయినా మొత్తం 33 విగ్రహాల్లో కేవలం ఏడుగురే తెలంగాణ వాళ్లెందుకున్నరు? జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ బిడ్డలు కనీసం 15 మందైనా ట్యాంక్‌బండ్‌పై ఉండాల్సింది. అలా కాకుండా కేవలం రుద్రమ, మహబూబ్‌ అలీఖాన్‌, మగ్దూం, సురవరం, రామదాసు, తానీషా, పోతన మాత్రమే ఎందుకున్నారని తెలంగాణ వాదులు నిలదీస్తున్నారు. మార్చి 14నాడు స్వాభిమాన్‌ యాత్ర జరిపి తెలంగాణ కవులు, రచయితలు, మేధావులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ట్యాంక్‌బండ్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని డిమాండ్‌ చేసిండ్రు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి విగ్రహాలను పున: ప్రతిష్టిస్తే అవి మళ్లీ కూలుతాయని కూడా తెగేసి చెప్పిండ్రు. అయినప్పటికీ సీమాంధ్ర ప్రభుత్వం, అధినేతలు ప్రజల కోరికను ఏమాత్ర ఖాతరు చేయకుండా తమ ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆరునూరైనా, తెలంగాణ ప్రజల డిమాండ్‌ను కాలరాయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 
    ట్యాంక్‌బండ్‌లో తెలంగాణ బిడ్డలు శవాలై తేలుతూ ఉంటే, కట్టమీద మాత్రం సీమాంధ్ర విగ్రహాలు వెలిగిపోతున్నాయి. 700ల మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే ఏనాడు సంతాపం ప్రకటించని, కనీసం ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చని వాళ్లు ఈనాడు నీతులు చెబుతుండ్రు. కట్టమీద కాళోజి విగ్రహం లేదు, దాశరథి విగ్రహం లేదు అంటే దానికి దీర్ఘాలు తీస్తూ విగ్రహాలు పెట్టే నాటికి వాళ్లు బతికే ఉన్నారు. అందుకే పెట్టలేదని ప్రభుత్వం తరపున సిపిఎం మేధావులు వకాల్తా పుచ్చుకుంటుండ్రు. పోనీ వాళ్లని వదిలేద్దా! మరి 1986కు ముందే లబ్ద ప్రతిష్టులయిన తెలంగాణ బిడ్డలు వందల మంది ఉన్నరు. వారెందుకు యాదికి రాలేదనే అడుగుతున్నాం. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్‌ వారిని, అందుకు వంత పాడిన నిజాం పాలకులను గడగడలాడిరచిన తుర్రెబాజ్‌ఖాన్‌, పత్రికా స్వేచ్ఛకోసం దేశంలోనే మొట్టమొదటి బలిదానమిచ్చిన షోయెబుల్లాఖాన్‌, అంతెందుకు హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్‌షా, గోలకొండ నవాబుల నెదిరించిన సర్వాయి పాపన్న, రాంజీ గోండు, కొమురం భీమ్‌, అంబేద్కర్‌ కన్నా ముందే దేశవ్యాప్తంగా దళిత చైతన్యాన్ని రగిలించిన భాగ్యరెడ్డి వర్మ, దేశీ వాఙ్మయానికి పట్టం కట్టిన పాల్కురికి సోమనాథుడు, కాశీలో పీఠం ఉన్నా రాష్ట్రంలో గుర్తింపు లేని మల్లినాథసూరి, తొలి అచ్చతెనుగు కావ్యకర్త పొన్నిగంటి తెలగన్న, అంతెందుకు ఆంధ్ర ప్రాంతానికి కూడా సంబంధమున్న ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు, జాతీయ రాజకీయాల్లో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడిరచిన సరోజిని నాయుడు, ‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి ఇట్లా కొన్ని వందలు, వేల మంది తెలంగాణ వైతాళికులు ట్యాంక్‌బండ్‌పై నిలబడ్డానికి అర్హులైనవారున్నారు. అయినప్పటికీ వారికెవ్వరికీ అక్కడ చోటివ్వకుండా తమ ప్రాంతం వారిని ప్రతిష్టించుకొని తెలంగాణలో వీరితో సరితూగగలిగే వారు లేరు అనే సంకేతాన్ని ఈ 25 యేండ్లుగా పంపించారు. ‘మేమూ చరిత్రకు ఎక్కదగిన వారమే’ అని చెప్పుకోవాల్సిన దయనీయమైన పరిస్థితిని తెలంగాణ వాళ్లకు కల్పించారు.
    తెలంగాణ తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నినదించిన ప్రతిసారీ మీరు అందుకు అనర్హులు అని వేలేత్తి చూపే ప్రయత్నం సీమాంధ్ర మేధావులు కుట్రపూరితంగా చేస్తూనే ఉన్నారు. అందులో భాగమే కాళోజి, దాశరథిల ప్రస్తావన అనేది గ్రహించాలి. అవును వీరితో పాటు 1952 ముల్కీ ఉద్యమంలో, 1969 ఉద్యమంలో, ప్రస్తుత ఉద్యమంలో బెల్లి లలితతో సహా ప్రాణాలర్పించిన వీరులందరూ విగ్రహాలై వెలగడానికి అర్హులైన వారే! ‘థాట్‌ పోలిసింగ్‌’ ద్వారా తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణలోనే అభిప్రాయాన్ని కూడగట్టాలని కుట్రలు పన్నుతున్నరు. వాళ్ల కుట్రలు, కుతంత్రాలు ఇక సాగవని తెలంగాణ తెగేసి చెబుతుంది.
    మార్చి పది నాడు తెలంగాణ ప్రజలు చావో రేవో తేల్చుకునే విధంగా టాంక్‌బండ్‌పై జమయ్యిండ్రు. ప్రభుత్వంపై, దాని వివక్షా పూరిత చర్యలపై ఆగ్రహం చెందిన తెలంగాణ వాదులు అందుకు ప్రతీకారం తీసుకోవాలని చూసిండ్రు. అప్పుడు వాళ్లకు కనిపించిన ఏకైక సీమాంధ్ర ప్రతీకలు విగ్రహాలు. అంతే విగ్రహాలు ప్రజల ధర్మాగ్రహానికి బలయ్యాయి.  ప్రజలు వాటిని కేవలం సీమాంధ్రుల విగ్రహాలుగా కాకుండా ఆధిపత్య చిహ్నాలుగా మాత్రమే చూసిండ్రు. అందుకే వాటిని అక్కడి నుంచి తప్పించిండ్రు. అయితే తొలగించిన వాటి స్థానంలో మళ్లీ కొత్తవి మా కడుపుల బల్లెంలాగా దించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే కచ్చితంగా ప్రజలు ప్రతిఘటిస్తారు. తెలంగాణ వచ్చేవరకు ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి విగ్రహాలు నిర్మించాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అక్కడ ఎవ్వరి విగ్రహం ఉండాలనేది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల ఇష్టాఇష్టాలను గ్రహించి మెలగాల్సిన ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది కాబట్టి ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
    తెలంగాణ బిడ్డల్ని ఏకాణకు కూడా కొరిగాకుండా చేస్తూ, మా మాటకు విలువ లేకుండా చేస్తూ, మా మనోభావాల్ని గుర్తించ నిరాకరించిన మీ బొమ్మల్ని మా టాంక్‌బండ్‌ మొయ్యడానికి సిద్ధంగా లేదని తెలంగాణ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇకనైనా వివక్షాపూరిత ఏకపక్ష దోరణికి స్వస్తి పలకాలని డిమాండ్‌ చేస్తున్నరు.
                                                                                                                                       -సంగిశెట్టి శ్రీనివాస్‌  

No comments: