Saturday 8 September 2012

Telangana son of the soil:Guduri

మట్టి మనిషి గూడూరి


    ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కారణంగా తెలంగాణ భాషకు, యాసకు సీమాంధ్ర పాలకులు, వారికి వత్తాసు పలికే పత్రికలు, పాఠ్యపుస్తకాలు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. అసలు తెలంగాణలో మాట్లాడే భాష తెలుగే కాదని, ఇక్కడ ఉర్దూ మిశ్రమ, తౌరక్యాంధ్రము (తురకముGఆంధ్రము) మాట్లాడుతారని ఎద్దేవా చేసిండ్రు. మీకు భాష రాదు,  కాబట్టే మేం నేర్పించడానికే వచ్చాం అనే ఆధిపత్య, అహంభావాన్ని సీమాంధ్ర పంతుళ్లు, అధికారులు, ఆఖరికి వలస జీవులు కూడా ప్రదర్శించారు. ఎవ్వరెన్ని రకాలుగా తెలంగాణ భాషను ఎక్కిరించినా అదే భాషను, మట్టి పరిమళాన్ని తన రచనల ద్వారా బతికించిన గొప్ప కథకుడు గూడూరి సీతారాం.
    మొన్న ఆదివారం (25, సెప్టెంబర్‌, 2011) హైదరాబాద్‌లో క్యాన్సర్‌తో కన్నుమూసిన గూడూరి సీతారాం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కాలంలో ఒక దశాబ్ద కాలం పాటు రాసిన కథలు తెలంగాణ నుడికారాలతో, మూలవాగు వాసనలతో, ఇక్కడి మట్టి పరిమళాన్ని, వెట్టి బతుకుల్ని, వ్యథల్ని రికార్డు చేసినవి. తెలంగాణ మీది ప్రేమతో, సోయితో ప్రత్యేక తెలంగాణవాదులు చేసిన పరిశోధన, కృషి వల్ల ఆయన కథలు సంకలన రూపం తీసుకున్నాయి. ఇది విస్మృత తొలితరం తెలంగాణ కథకుణ్ణి తెలుగు కథానిక రంగంపై చిరస్థాయిగా నిలిపింది. అప్పటి వరకూ విస్మరించిన సీమాంధ్ర సంకలనకర్తలు సిగ్గుతో తలదించుకునేలా జేసింది. నిజానికి తొలితరం తెలంగాణ రచయితలకు తమ స్వీయ రచనల మీద ప్రత్యేక అభిమానం ఏనాడూ లేదు. తాము రాసింది ప్రజలకు చేరేంత వరకే తమ పని అని భావించారు. అందుకే ఆనాటి రచయితలు తమ రచనల్ని సంపుటాలుగా తీసుకురావడానికి పెద్దగా ప్రయత్నించలేదు. సురవరం ప్రతాపరెడ్డి మొదలు గూడూరి సీతారాం వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. 354మంది కవుల కవిత్వాని ‘గోలకొండ కవుల సంచిక’ పేరిట 1934లోనే వెలువరించిన సురవరం ప్రతాపరెడ్డి తాను రాసిన కవిత్వాన్ని అచ్చేసుకోలేక పోయాడు. అలాగే గూడూరి సీతారాం కూడా దాదాపు 80 కథలు కేవలం ఒక (1954`1964) దశాబ్దకాలంలో రాసినప్పటికీ వాటిని ఏనాడు పుస్తకంగా తీసుకురాలేదు. అయితే కొంతమంది మిత్రులం వత్తిడి తీసుకొచ్చి మీ కథలు వెలుగులోకి రావాలని చెవినిల్లుకట్టుకొని పోరితే గాని ఆయన కథలు పుస్తకంగా వెలువడలేదు. కథలు రాసిన ఐదుదశాబ్దాల తర్వాత వాటిని వెతికి పట్టుకోవడం చాలా కష్టమయ్యింది. అందుకే సీతారాం 80 కథలు రాసినా కేవలం 14 కథలే అందుబాటులో ఉండడంతో వాటినే పుస్తకంగా మానేరు రచయితల సంఘం ప్రచురించింది. ఇందుకు క్రెడిట్‌ పత్తిపాక మోహన్‌కు దక్కుతుంది. 
    అందుబాటులో ఉన్న 14 కథలూ ఆణిముత్యాలే. తెలంగాణ సామాజిక చరిత్రకు చిత్రిక గట్టాయి. తెలంగాణ జీవితంలోని ఒడిదొడుకుల్ని, గ్రామీణ స్త్రీలు, రైతులు, పేదలు, విద్యార్థులు,ప్రేమలు, పెండ్లిళ్లు, కులవృత్తులు, వలసలు, అన్నీ ఆయన కథల్లో ప్రాణం పోసుకున్నాయి. తెలంగాణ జీవద్భాషలో తనదైన కథనంతో మట్టిమనుషుల్ని అత్యంత సహజంగా గుండెలకత్తుకునే విధంగా మలిచిండు. తాను పుట్టిన కులమైన పద్మశాలీయుల జీవితాలనే గాకుండా పిచ్చుకుంట్ల, గౌడుల దయనీయ స్థితుల్ని, లచ్చి లాంటి కథలో ఫెమినిజాన్ని కూడా మానవీయ కోణంలో ఆవిష్కరించిండు.
    కథా రచయితగా ప్రసిద్ధుడైన సీతారాం నాటకాలు, కవిత్వం, నవలలు కూడా రాసిండు. ఆయన సేకరించిన పల్లె పదాలు ఎన్నో బిరుదురాజు రామరాజు పరిశోధనకు ఉపయోగపడ్డాయి. రామరాజు తన సాంపాదకత్వలో వెలువరించిన ‘త్రివేణి’ సంకలనంలో ఇవి చోటు చేసుకున్నాయి. తెలంగాణ మట్టిపరిమళాలను జానపదాలు, గేయాల రూపంలో ఆనాడు సేకరించి రికార్డు చేయడంతో మన మూలాల్ని మనం ఈనాడు  తెలుసుకోవడానికి వీలవుతోంది. సీమాంధ్రులు కప్పెట్టిన ఖజానా ఇప్పుడిప్పుడే సోయితో చేస్తున్న పరిశోధనల వల్ల వెలుగులోకి వస్తూంది. ఈ ఖజానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరెవరి ప్రతిభ ఏంటిదో విడమర్చి చెప్పెటోడు సీతారాం. పరిశోధకులకు ప్రాథమిక సోర్స్‌గా ఉండిన సీతారాం ఎన్నో సభలు సమావేశాల్లో ఎన్కటి తెలంగాణ కథగురించి వివరంగా చెప్పెటోడు. అందరికీ అర్థమయ్యే రీతిలో ముచ్చట పెట్టినట్టు గిది గిట్ల గదిగట్ల అని తెలుగు కథకుల గురించి, తెలంగాణ సాహితీవేత్తల గురించి వందల కొద్ది ‘అనెక్‌డోట్స్‌’ చెప్పెటోడు.
    గూడూరి సీతారాం సాహితీవేత్తగానే కాకుండా మానేరు రచయితల సంఘ స్థాపకుడిగా, నిర్వాహకుడిగా, విశాల సాహిత్య అకాడెమీ కార్యక్రమాల్లో ఎడతెరిపి లేకుండా పనిచేసిండు. మరుగున పడ్డ తెలంగాణ కథానికా సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలని నిరంతరం పరితపించిండు. ఆ తపనలోంచే జి.రాములు కథలు ‘పెరటి చెట్టు’ వెలువరింప జేసిండు. మరో కథకుడు సురమౌళి కథలు కూడా వేయాలని ప్రయత్నం చేసిండు.
    1953లో తెలంగాణ రచయితల సంఘం స్థాపన నాటి నుంచే వట్టికోట ఆళ్వారుస్వామి, బిరుదురాజు రామరాజు, దాశరథి కృష్ణమాచార్య, వానమామలై వరదాచార్యులు, పల్లా దుర్గయ్య, కాళోజి నారాయణరావు లాంటి వారితో కలిసి పనిచేసిండు. సిరిసిల్లలో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి దాని తరపున అనేక పుస్తకాలు ఆ కాలంలోనే తెలంగాణ వాళ్ల పుస్తకాలు అచ్చేసిండు. తన చిన్ననాటి మిత్రుడు కవి సి.నారాయణరెడ్డి ప్రోత్సాహంతో నిజాం కాలేజిలో చదువుకునే రోజుల్నుంచే సాహిత్య రంగంలోకి అడుగిడిన సీతారాం చివరి వరకూ ఆ దోస్తానీని విడువలేదు.
    75 ఏళ్ళ సీతారాం మృతితో తెలంగాణ ఒక కథా శిఖరాన్ని కోల్పోయింది. ఆయన మృతి మొత్తం తెలుగు కథానికా సాహిత్యానికి కూడా లోటే. ఈ లోటుని పూడ్చే పనిని ‘గూడూరి సీతారాం కథలు’ పేరిట వై.సత్యనారాయణ కొంత చేసిండు. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సబ్మిట్‌ చేసిన ఎం.ఫిల్‌ సిద్ధాంత గ్రంథం. అలాగే సీతారాం గురించిన విశేషాలు, వివరాలతో ‘కానుగ చెట్టు’ (స్వర్ణోత్సవ సంచిక) 2005లో వెలువడిరది. ఇటువంటి పరిశోధనలు మరిన్ని జరిగినట్లయితే సీతారాం కథల్లోని భిన్న పార్శ్యాలు వెలుగులోకి వస్తాయి. గూడూరి సీతారాం స్మృతిలో తెలుగు అకాడెమీ గానీ, తెలుగు యూనివర్సిటీ గానీ ఆయన పేరిట ‘తెలుగు కథా అకాడెమీ’ని ఏర్పాటు చేసి కథా సాహిత్యంలో పరిశోధనలకు వీలు కల్పించాలి. అలాగే జాతీయ సాహిత్య అకాడెమీ వారు గూడూరి సీతారాం జీవితాన్ని పుస్తకంగా వెలువరించి అన్ని భాషల్లోకి తర్జుమా చేసినట్లయితే తెలంగాణ వాడి ప్రతిభ భారతదేశ వాసులందరికీ తెలుస్తుంది. సీతారాం కథల్ని ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో పాఠ్యాంశాలుగా నిర్ణయించాలి. ఇదే మనం ఆ మట్టిమనిషికి అందించే నివాళి.
    ఎప్పుడూ చిర్నవ్వు చెరగకుండా, చెలిమిని చాటి చూపులతో, తెల్లటి పంచెకట్టుతో, నుదుట బొట్టుతో తెలంగాణ సాహితీ లోకానికి పరిచయమైన గూడూరి సీతారాం ‘కాక’ లేని లోటు పూడ్చలేనిది. నాకు వ్యక్తిగతంగా తీర్చలేనిది. మాట్లాడితే సాలు కొత్త ముచ్చట్లు సాక వోసే గొంతు శాశ్వతంగా మూగ వోయింది. గొంతు మూగబోయినా ఎట్లనన్న జేసి తెలంగాణ తెచ్చుకోవాలె! అని ఆయన జెప్పిన మాటలు దిశా నిర్దేశం చేస్తున్నయి. -సంగిశెట్టి శ్రీనివాస్‌

తెలంగాణ ‘పగడం’ సుబ్బారావు

    తమను గురించి తాము చెప్పుకునే, ప్రచారం చేసుకునే అలవాటు, కీర్తి కాంక్ష తెలంగాణ కవులకు లేకపోవడంతో అది అంతిమంగా ఈ ప్రాంతంలో కవులు లేరు అని ఆంధ్రులు గుడ్డి నిర్ధారణ చేయడానికి దారి తీసింది. పూర్వ నిర్ధారణకు వచ్చి తెలంగాణ కవులు, రచయితలు, వైతాళికులకు చరిత్రలో తగిన స్థానం దక్కకుండా చేయడంలో ఆంధ్రుల ఆధిపత్య, అహంకార పూరిత రచనలు, ప్రచారాలే ప్రధాన కారణం. ఈ తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ సురవరం ప్రతాపరెడ్డి 354 మంది తెలంగాణ కవుల కవిత్వాన్ని సంకలనం చేసి వారికి ప్రాణం పోసిండు. అట్లా ప్రాణం పోసుకున్న వాళ్లలో ఒకరు పైడిమర్రి వెంకట సుబ్బారావు(1916`1998).
    కవిత్వం, కథలు, నాటకాలు, నవలలు, పద్యకావ్యాలు, వ్యాసాలు, అనువాదాలు వందలాదిగా రాసిన పైడిమర్రి వెంకటసుబ్బారావు నేటి తరం పాఠకులకు అంతగా పరిచయం లేరు. ‘ప్రతిజ్ఞ’ను అక్షరబద్ధం చేసి ప్రతిరోజూ బడిపిల్లల నోళ్లలో నానుతున్న ఈయన పుట్టింది నల్లగొండ పక్కనున్న అన్నేపర్తిలో. విస్మృత సాహితీవేత్త పైడిమర్రి గురించి తెలిసింది తక్కువ. తెలియాల్సింది, పరిశోధన జరగాల్సింది చాలా ఉంది. ఉద్యోగ రీత్యా ఖమ్మం నుంచి విశాఖపట్నం వరకు వివిధ ప్రాంతాలు తిరిగిన సుబ్బారావు సృజించని సాహిత్యం లేదంటే అతిశయోక్తి కాదు. తల్లి వేర్లను కత్తిరించి భాషా పరంగా, సాహిత్య పరంగా తెలంగాణను గత 60 యేండ్లుగా ఈ మట్టి పరిమళానికి దూరంగా ఉంచింది సీమాంధ్ర సాహిత్య కారులు, వారి తాబేదార్లుగా ఉన్న పాఠ్యపుస్తక నిర్ణేతలు, అధికారులు. సుబ్బారావు పేరు, ఆయన పని చేసిన ప్రాంతం రెండూ ఆంధ్రతో ముడిపడి ఉండడంతో తెలంగాణ పరిశోధకులు గానీ, సాహిత్యవేత్తలు గానీ ఈ విషయమై లోతుగా పరిశీలించలేదు. ఈ విషయాన్ని మొదటిసారిగా నేను 2004లో ప్రచురించిన ‘దస్త్రమ్‌’ తెలంగాణ తొలితరం కథల సూచిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన కథల జాబితా కూడా ఆ పుస్తకంలో ఇచ్చాను. ‘‘పైడిమర్రి వెంకటసుబ్బారావు జీవితం`సాహిత్యం’’ అనే అంశంపై పిహెచ్‌డీ పరిశోధనకు తగినంత సమాచారముంది. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన ప్రస్తుత తరుణంలో ఈ పనిని మరింత బాధ్యతతో చేయాల్సిన అవసరముంది. తన మూలాల్ని తాను మళ్లీ వెతికి పట్టుకుంటున్న తెలంగాణ నేడు స్మరణకు నోచుకోకుండా పోయిన దీపధారుల్ని వెతికి వెలుగులోకి తెస్తోంది. అందులో భాగంగా  వెలుగు చూసిన పగడం ఈ పైడిమర్రి.
    నౌకరి, పిల్లిపోడు, రాజులు, బడిగంటలు కథలు ఈయన కలం నుంచి వెలువడ్డాయి. అయితే ఇవి గాకుండా ఉషస్సు సంకలనంలో ఈయన కథ చోటు చేసుకుంది. నౌకరి కథలో 1952 నాటి ముల్కి ఉద్యమాన్ని ఉర్దూ`తెలుగు మిశ్రమ భాషలో చిత్రించిండు. ఈ ఉద్యమంలో ఏడుగురు మంది సిటీకాలేజి విద్యార్థులు అమరులయ్యిండ్రు. ఉద్యమం చేసిన వారికి ఉద్యోగాలు రాకపోవడం, ఆంధ్ర అధికారుల ఛీత్కారాన్ని పైడిమర్రి రికార్డు చేసిండు. రాజులు అనే కథలో పుట్టుపూర్వోత్తరాలు ఏవీ తెలియని ఒక వ్యక్తి ఊళ్లో వాళ్లందరికి తలలో నాలుకలా ఉంటూ, అందరికీ పనుల్లో ఆసరా అవుతూ ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం గురించిన కథ ఇది. ఇందులో బియ్యం పోటేయ్యడం దగ్గరి నుంచి పేడకళ్లు ఎత్తే వరకు అన్ని పనులు చేసే రాజులు ఆకస్మాత్తుగా అనారోగ్యం పాలయి చనిపోవడంతో ‘‘ వాడికి యిల్లు లేదు. డబ్బు లేదు. బిడ్డలు లేరు. చుట్టాలు లేరు. వాడెవరో? ఏ గ్రామమో తెలియని పిచ్చివాడు రాజులు. నల్లా తెల్లా తెలియకుండా సేవచేశాడు. వాడి సేవకు ఋణపడ్డ ఆ అగ్రహారమే వాడి సర్వస్వము. పెండ్లి పల్లకీలాగా జనమంత వెళ్లి వాడి భౌతిక దేహానికి సంస్కారం చేశారు’’ అని అంతిమ ఘట్టాన్ని వెంకటసుబ్బారావు వర్ణించాడు. కథలో భాగంగా చిన్న చిన్న పాటలు రాయడం సుబ్బారావుకు అలవాటు ఈ రాజులు కథలోనే ఇలా రాసిండు.
    పాడి పంటలు మాకు భగవంతుడిస్తాడు
    వాని దయ ఉంటేను లోప మేమీ లేదు,
    బీద సాద మాకు సోదరీసోదరులు.
    పెట్టిపోతలు మాకు విడిపోని ధర్మాలు
    లేదు లేదను మాట లేదు మామాటల్లో..’’ అంటూ తెలంగాణ ఆత్మీయతను ఆయన పాటల్లో వ్యక్తీకరించాడు.
   
    1956 నాటికే బ్రహ్మచర్యము, గృహస్థ జీవితము, స్త్రీ ధర్మము, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాల్ని రచించిన సుబ్బారావు వాటిని ప్రదర్శన యోగ్యంగా కూడా తీర్చి దిద్దాడు. 1951 నాటి సుజాత పత్రికలో శ్రీమతి అనే నాటకాన్ని వెలువరించాడు. ఇందులో బింబిసారుని అనంతరం రాజ్యాధికారంలోకి వచ్చిన ఆయన కొడుకు అజాత శత్రువు కాలంలో బౌద్ధమతం విద్రోహద్యమంగా నిర్ణయించబడడం, బౌద్ధ స్థూపాలను పూజించేవారిని నిర్దాక్షిణ్యంగా వధింపబడే సంఘటనలను తీసుకొని నాటకాన్ని రాసిండు. ఆనాటి కాలాన్ని బౌద్ధం బోధించిన ప్రదేశంలోనే హింస చోటు చేసుకోవడాన్ని ఆయన రికార్డు చేసిండు. నాటకాలతో పాటుగా కాలభైరవుడు అనే చిన్న నవలను 1934 నాటికే సుబ్బారావు వెలువరించిండు. అంటే 18 యేండ్లు కూడా నిండకముందే ఈయన నవల వెలువడిరది.    
    నవలతో బాటుగా ప్రతికృతి, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకృతులు కూడా సుబ్బారావు కలం నుండి వెలువడ్డాయి. వీటితో పాటుగా సింగపురీ నృకేసరీ శతకము, బాలరామయణము, వెంకటేశ్వరస్తుతి భక్తి రచనలు కూడా ఆయన రచించారు. అలాగే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల ప్రతిభను, కీర్తిని పొగడ్తూ ‘‘శ్రీకృష్ణదేవరాయల’’ పేరిట 11 పద్యాలను వెలువరించాడు. అందులో అల్లసాని పెద్దన గూర్చి ఇలా రాసిండు.

    మా కవితా పితామహుడు మంజుల భాషలతో వరూధినీ
    వ్యాకుల మోహరక్తి బ్రవరాఖ్యు పరాజ్ముఖ ధీరవృత్తి నీ
    లోకములో జిరమ్ము రసలుబ్ధుల చిత్తము లుల్లసిల్లగా
    నీకతనన్‌ రచించె నొక నిస్తుల చిత్రము లీలదీర్చునన్‌.
దీనితో పాటుగా పల్లెటూరు పత్రికలో 1952లో పద్యాలు వెలువరించాడు. కవీ పేరిట వెలువరించిన ఈ పద్యాల్లో కవియొక్క గొప్పతనాన్ని, ఆయన సృజనాత్మకతను అక్షరీకరించాడు. పద్యాలతో పాటుగా అనేక భాషల నుంచి  ముఖ్యంగా, హిందీ, ఉర్దూ భాషలనుంచి అనువాదం చేసిండు. హిందీ నుంచి గీతామీమాంస (1938), దైవభక్తి (1938), మీమాంస త్రయము (1936) అనువాదం చేసిండు. ఆధ్యాత్మిక రచనలతో పాటుగా ‘‘మనిషికెంత భూమి కావాలి’’ అనే విప్లవాత్మక రచనలు కూడా సుబ్బారావు అనువాదం చేసిండు.
    సుబ్బారావు రచనలు తెలంగాణ నుంచి వెలువడ్డ గోలకొండ, సుజాత, పల్లెటూరు పత్రికలతో పాటుగా ఆంధ్రప్రాంతంలోని ఆంధ్రపత్రిక, భారతి, నవజీవన్‌, ఆనందవాణి పత్రికల్లో అచ్చయ్యాయి.
    ఎప్పటికైనా సుబ్బారావు సమగ్ర రచనలు ఒక్కదగ్గర వెలువడినట్లయితే అటు ఆయన ప్రతిభకు నిదర్శనమేర్పడుతుంది. అలాగే పరిశోధకులకు, విమర్శకులకు మరింత లోతుగా సుబ్బారావుని అంచనా వేయడానికి వీలవుతుంది. అందుకు ఈ వ్యాసం ఒక ప్రేరణగా నిలవాలని ఈ రేఖామాత్ర పరిచయం. 

                                                                                                                                -సంగిశెట్టి శ్రీనివాస్‌  

Century old awakening centre, Srikrishnadevarayaadhra bhasha nilayam

తెలంగాణ పునర్వికాసోద్యమానికి పునాది భాషానిలయం


    వందకు 90శాతం మంది ప్రజల మాతృభాష తెలుగు అయినప్పటికీ, పాలన భాషగా ఉర్దూ ఉండడం, అచ్చతెనుగు కావ్యానికి జన్మనిచ్చిన ప్రాంతంలోనే తెలుగు సాహిత్యానికి, భాషకు దక్కాల్సిన గౌరవం, కీర్తి దక్కలేదనే కసితో ఏర్పాటు చేసిందే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం. నిజాం ప్రాంతంలో ఎక్కడ తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేసినా ప్రభుత్వం నుండి అడ్డంకులు వస్తాయనే ఉద్దేశ్యంతోనే హైదరాబాద్‌ రాజ్యంలో బ్రిటీష్‌ వారి ద్వీపంగా వెలిగిన ‘రెసిడెన్సీ బజార్‌’ (ఇప్పటి కోఠీ, సుల్తాన్‌ బజార్‌ ప్రాంతం)లో ఈ గ్రంథాలయాన్ని నెలకొలిపారు.
    మునగాల జమీందారు రాజా నాయని వెంకటరంగారావు, ఆయన మిత్రుడు, మంత్రి కూడా అయిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మైలవరపు నరసింహశాస్త్రిల పూనిక మేరకు ఈ గ్రంథాలయం స్థాపించబడిరది. వీరికి అండగా ముత్యాల గోవిందరాజులు నాయుడు (సరోజినిదేవి నాయుడు భర్త), ఆదిపూడి సోమనాథరావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు నిలిచిండ్రు. 1901 సెప్టెంబర్‌ ఒకటిన రెసిడెన్సీ బజార్‌లోని రావిచెట్టు రంగారావు బంగళాలో పాల్వంచ సంస్థానాధీశుడు రాజా పార్థసారథి అప్పారావు బహదూర్‌ అధ్యక్షతన ఏర్పాటయిన సభతో భాషానిలయం ఉనికిలోకి వచ్చింది. పరిశోధకుడు, రచయిత ఆదిరాజు వీరభద్రరావు చిన్నవాడైనప్పటికీ ఈ నిలయం స్థాపన నాటి నుంచీ బాధ్యతలు పంచుకున్నాడు.
    మొత్తం తెలుగుసీమలోనే ఈ నిలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. తెలుగు పుస్తకాలు విశేషంగా ఉన్న గ్రంథాలయాల్లో ఇదే మొదటిది. దీని స్థాపనతో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి తెర లేచిందంటే ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టుగా ఈ నిలయం స్థాపన తెలంగాణలో మరిన్ని విజ్ఞాన జ్యోతులు వెలగడానికి, వెలిగించడానికి ఇది స్ఫూర్తిగా నిలిచింది. 1927లో నిలయం రజతోత్సవాలు జరిగే నాటికి తెలంగాణలో 100కు పైగా గ్రంథాలయాలు స్థాపించబడ్డాయంటే దీని ప్రభావం అర్థమవుతుంది. అలాగే ఈ గ్రంథాలయాల స్థాపన పుస్తకాలు, పత్రికల ప్రచురణకు దారులు వేసింది. ముద్రణా యంత్రాల స్థాపనకు దారి తీసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రంథాలయాలే తర్వాతి కాలంలో ప్రజల రాజకీయ కూడలి ప్రదేశాలుగా మారాయి. ఈ రాజకీయ చైతన్యమే 1926లో గోలకొండ పత్రిక స్థాపనకు కారణమయ్యింది. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయానికి అనుబంధంగా ‘‘ఆంధ్ర భాషోజ్జీవని నాటక సంఘం’ ఏర్పాటయింది. అలాగే తెలుగులో శాస్త్ర గ్రంథాలను ప్రచురించే పనిని కూడా ఈ గ్రంథాలయ నిర్వాహకులు స్థాపించిన ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమాల’ తరపున 1906లో ప్రారంభమయింది. తెలుగులో శాస్త్ర గ్రంథాలు మొట్టమొదటి సారిగా ఈ గ్రంథమాల తరపునే వెలువడ్డాయి. దీని తరపున మొదట హైదరాబాద్‌నుంచి, ఆతర్వాత మద్రాసు నుంచి పదుల సంఖ్యలో పుస్తకాలు అచ్చయ్యాయి. రావిచెట్టు రంగారావు, కొమర్రాజు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి తదితరులు గ్రంథమాల నిర్వహణలో పాలు పంచుకున్నారు.  అలాగే భాగ్యరెడ్డి వర్మ లాంటి దళితులకు రావిచెట్టు రంగారావు ఆశ్రయం కల్పించి నిలయం నిర్వహణలో భాగస్వామిని చేసిండు. 1925 నాటికే మహిళల కోసం గ్రంథాలయంలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి వారిలో పఠనాసక్తిని పెంచారు. ఇవన్నీ తెలంగాణ సమాజం చైతన్యం చెందడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడ్డాయి.
    ఈ గ్రంథాలయం ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ`సీమాంధ్ర ప్రాంతానికి వారధిగా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రంథాలయంలో ఉపన్యాసం ఇవ్వని తెలుగు సాహితీవేత్త, సన్మానం పొందని కవి, పండితుడు, ప్రసిద్ధుడు తెలుగునేలలో 1990లకు ముందు లేడు. చిలకమర్తి, జాషువా, శ్రీపాద, కావ్యకంఠ గణపతి ముని, కట్టమంచి, దువ్వూరి, కోడి రామ్మూర్తి నాయుడు ఇలా ఒక్కరేమి లబ్ధప్రతిష్టులయిన ప్రతి ఒక్కరూ ఈ నిలయంలో ఏదో ఒక సమయంలో సన్మానం పొందినవారే!
    సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, వడ్లకొండ నరసింహారావు, వేలూరి రంగధామనాయుడు,  ఆదిరాజు వీరభద్రరావు, రావిచెట్టు లక్ష్మీనరసమ్మ ఇలా ఎందరో ఈ నిలయ అభివృద్ధికి కృషి చేసిండ్రు. అలాంటి భాషానిలయం నేడొక పురాస్మృతిగా మిగిలింది.
    ఇరవై యేళ్ల క్రితం వరకూ హైదరాబాద్‌లో ఏ సాహిత్య సభ జరిగినా, సమావేశం జరిగినా అది కచ్చితంగా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలోనే జరిగేది. ఇప్పుడు ఆ శోభ పోయింది. పాత భవనం స్థానంలో జీవంలేని నూతన భవనం నిర్మాణమయింది. ఇందులో ఇప్పటికీ వేలాది ‘రేర్‌’ పుస్తకాలు అల్మారాల్లోనే ఉండిపోయాయి. ఇవన్నీ పరిశోధకులకు అందుబాటులోకి రావాల్సిన అవసరముంది. ఈ భవనంలో సాహిత్య సభలు, సమావేశాలు, పుస్తకావిష్కరణలు చేసుకోవడానికి తక్కువ ధరకు హాల్‌ కేటాయించి రచయితలను ప్రోత్సహించాలి. రేర్‌ పుస్తకాలన్నింటిని డిజిటైజ్‌ చేయించి నిలయం తరపున వెబ్‌సైట్‌లో ఉంచి అందరికీ అందుబాటులోకి తేవాలి. ఈ చర్యల ద్వారా 110 యేండ్ల ఈ గ్రంథాలయానికి పూర్వశోభ సంతరించుకుంటుంది. అలాగే ఈ నిలయంతో సంబంధం ఉన్న వారి లిస్ట్‌ తయారు చేసినట్లయితే చాలు అలనాటి తెలంగాణ సాహిత్యకారుల పట్టిక తయారవుతుంది. వారి ఫోటోలన్నింటిని ఎగ్జిబిట్‌ చేయడమే గాకుండా వాటిని నిలయం వార్షికోత్సవాల్లో ప్రదర్శనకు పెట్టాలి. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు ఇది దోహదపడుతుంది. 

                                                                                                      -సంగిశెట్టి శ్రీనివాస్‌

Telangana 'gem' veldurthi manikya rao's centenary

     తెలంగాణ మట్టిలోని    ‘మాణిక్యం’ వెల్దుర్తి

     తెలంగాణ ఆర్తి, ఆత్మీయత, ఆప్యాయతలు మేళవించి సాహిత్య, సామాజికోద్యమాల్ని నిర్మించి నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి వెల్దుర్తి మాణిక్యరావు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో ప్రత్యక్ష పరిచయముండి వివిధ కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహించిన ప్రతిభావంతుడు. కవిగా, కథకుడిగా, రచయితగా, చరిత్రకారుడిగా, గ్రంథమాల నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, ఆంధ్రమహాసభ కార్యదర్శిగా, పౌరహక్కుల నేతగా, గోలకొండ పత్రికలో జర్నలిస్టుగా, పలు పత్రికల సంపాదకుడిగా, అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడిగా, ప్రభుత్వోద్యోగిగా విభిన్న పాత్రలు పోషించి సమర్ధుడనిపించు కున్నాడు. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. సురవరం, మాడపాటి, కాళోజి, వట్టికోట మొదలైన మహామహులతో సన్నిహిత సంబంధాలుండేవి. వారు నిర్వహించిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన ఉద్యమశీలి వెల్దుర్తి. తెలంగాణ భాషలో నాటకాన్ని రాసి దానికి ప్రాచుర్యం కల్పించిన ప్రయోక్త. తెలుగు, ఉర్దు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో రచనలు చేయగలిగినంత ప్రతిభ కలిగిన వెల్దుర్తి శతజయంతి సంవత్సరమిది. 12 డిసెంబర్‌, 1912లో వెల్దుర్తి జన్మదినం. తెలంగాణలో తెలుగువారి సాహిత్య సృజనకు ప్రోత్సాహమిచ్చేందుకు, వివిధ అభ్యుదయాంశాలపై చర్చలు జరిపేందుకు గాను మిత్రులు కాళోజి నారాయణరావు, గోలకొండ పత్రికలో జర్నలిస్టుగా ఉన్న మంథనికి చెందిన వేంకట రాజన్న అవధానిలతో కలిసి 1935లో హైదరాబాద్‌లో ‘వైతాళిక సమితి’ని ఏర్పాటు చేశారు. అభ్యుదయ భావాలు వ్యాప్తి చేసేందుకు తెలంగాణలో ఏర్పడ్డ మొట్టమొదటి సారస్వత సమితి ఇదే. ఈ సమితి సభ్యులుగా వీరు ముగ్గురు కలిసి కథలు రాశారు. ఇవి గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి. జంట కవుల్ని చూశాము కానీ వీరు ‘కథక త్రయం’గా వెలిగారు. వీరు రాసిన ‘భూతదయ’ కథ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ తర్వాతి కాలంలో వెల్దుర్తి కతలు అనేకం గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి. హిందూ`ముస్లింల సాన్నిహిత్యాన్ని తన కథల్లో చక్కగా మలిచారు. భారం, ఏయిర్‌మెయిల్‌ కథలు వివిధ కథా సంకలనాల్లో చోటు చేసుకోగా, ఇప్పటికీ పత్రికల పుటల్లో ఎవ్వరికీ అందుబాటులో లేని కథలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా 1934`36 మధ్య కాలంలో గోలకొండ పత్రికలో వచ్చిన కథలు చాలా మందికి తెలియవు. అశోకుడు, కళోపాసన, నాదేశపు బట్ట, నిష్కామకర్మ, పిల్లలు`సొమ్ములు, చిన్న కల ఇలా ఎన్నో కథలు ఆయన కలం నుంచి జాలువారాయి. తెలంగాణ భాషలో మొట్టమొదటి సారిగా పుస్తకం రాసిన ఘనత కూడా వెల్దుర్తికే దక్కుతుంది. ‘దయ్యాల పన్గడ’ పేరిట వెలువడ్డ నాటకంలో అచ్చమైన పచ్చి పల్లెటూరి భాషను ఉపయోగించానని ఆయన చెప్పుకున్నారు. ఆరు అంకాలు, 80పేజీలు గల ఈ పుస్తకం రష్యన్‌ రచయిత టాల్‌స్టాయ్‌ పుస్తకం ‘ద ఫస్ట్‌ డిస్టిలర్‌’కు అనుసరణగా రాసిన ఈ నాటకంలో మద్యపాన నిరోధం ఆవశ్యకత గురించి తెలిపారు. తాగుడుకు మనిషి బానిసకావడం వల్ల జీవితం ఎలా పతనమవుతుందో ఇందులో చెప్పాడు. తాను మధ్యపాన నిరోధక సంఘ ఉద్యోగిగా ఉంటూ ఆ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఈ నాటకం రాసిండు. ఇది దేవరాజు మహారాజు పూనిక వల్ల ‘మా తెలంగాణ’ పత్రికలో సీరియల్‌గా పునర్ముద్రించబడిరది. కథకుడిగానే గాకుండా జీవిత చరిత్రల రచయితగా కూడా వెల్దుర్తి చేసిన సేవ తక్కువదేమీ కాదు. దయానందుల చరిత్ర, మాడపాటి హనుమంతరావుగారి జీవితం, ఎం.ఎన్‌.రాయ్‌, నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, వీర సావర్కర్‌ జీవితం, నిరంతర కృషి పేరిట సంస్కర్త, 1969 ఉద్యమ నాయకుడు బొజ్జం నర్సింలు జీవిత గాథల్ని అక్షరీకరించాడు. సుభాష్‌ చంద్రబోస్‌ పుస్తకం నిషేధానికి గురయింది. ప్రచురణ కర్తల్లో ఒకరైన కె.సి.గుప్త ఖైదు కావడానికి ఈ పుస్తకమే కారణం. జీవిత చరిత్రలతో పాటుగా వెల్దుర్తి కవిత్వం కూడా రాశాడు. ‘మాణిక్య వీణ’ పేరిట కవితా సంకలనాన్ని వెలువరించాడు. అలాగే హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ చరిత్ర గ్రంథాన్ని ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కొత్త విషయాలతో వెలుగులోకి తెచ్చాడు. వీరి తెలంగాణ స్వాతంత్య్రోద్యమ చరిత్రను అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్‌ ఆవిష్కరించారు. వందల సంఖ్యలో వ్యాసాలు వివిధ పత్రికల్లో అనేంకాంశాలపై ప్రచురించాడు. ఆలిండియా రేడియోలో ఆయన చేసిన ప్రసంగాలు, నాటకాలు అన్నీ ఆణిముత్యాలే. మల్లి, చేనుకాడ, మంచెమీద నాటికలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆయన రాసిన వందలాది బాల గేయాల్ని ‘హసీనా’ పేరిట వెలువరించాలనుకున్న కల తీరనే లేదు. దాశరథి కృష్ణమాచార్య, కాళోజి, శివశంకరశాస్త్రి, సానె గురూజీ, ప్రేంచంద్‌ మొదలైన తన అభిమాన రచయితల స్ఫూర్తితో ఎన్నో రచనలు వెలువరించాడు. కథలు, నాటకాలు, కవిత్వం, గేయాలు  ఇలా ఒక్కటేమిటి అనేక ప్రక్రియల్లో పలు రచనలు చేసిండు. గోలకొండ పత్రికలో ఉపసంపాదకులుగా పనిచేస్తున్న కాలంలో అనేక మంది పెద్దలతో పరిచయముండేది. సురవరం, మాడపాటి, బూర్గుల, పండిత నరేంద్రజీ, శివశంకర శాస్త్రి ఇంకా ఎందరో గోలకొండ దర్బారులో పాల్గనేవారు. తన రచనలు కేవలం గోలకొండ పత్రికలోనే గాకుండా సుజాత, శోభ, తెలుగు స్వతంత్ర మొదలైన పత్రికల్లో వెలువరించేవాడు. సంఘసేవకు మద్యపాన నిరోధక ప్రచార మార్గాన్ని ఎంచుకున్నాడు. నిజాం ప్రభుత్వం వివిధ భాషల్లో మద్యపాన నిరోధ ప్రచారానికి గాను పోస్టర్లు, కళాజాతలు, పాటలు, సభలు, సమావేశాలు, పత్రికల ద్వారా ఊరూరా ప్రచారం చేయించేవారు. ఈ శాఖలో పౌరసంబంధాల అధికారిగా ఉంటూ తెలుగులో వెలువడ్డ ‘మద్యపాన నిరోధక పత్రిక’కు సంపాదకులుగా వ్యవహరించారు. ముస్లిం మత పెద్దలు, సంఘ సంస్కర్తలతో కూడిన ప్రచార కమిటీకి సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సభలు, సమావేశాలు, కళాజాతల ద్వారా మద్యపాన నిరోధాన్ని వెల్దుర్తి ప్రచారం చేసేవారు. అందులో భాగంగానే ‘దయ్యాల పన్గడ’ నాటకాన్ని వెలువరించాడు. హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన తర్వాత హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వోద్యోగిగా షాద్‌నగర్‌, మహబూబునగర్‌ లాంటి ప్రాంతాల్లో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి స్థాయిలో పనిచేశారు. దాదాపు ఇదే కాలంలో హైదరాబాద్‌ కో`ఆపరేటివ్‌ జర్నల్‌, గ్రామసుధార్‌, రిసాల తర్కె`ముస్కిరాత్‌ పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టి సమర్దవంతంగా నిర్వహించాడు. విజయవాడ నుంచి వెలువడ్డ ‘యుగవాణి’ పత్రికకు ‘హైదరాబాద్‌ లేఖలు’ కాలమ్‌ని నిర్వహించాడు.    1938లో కె.సి.గుప్తతో కలిసి హైదరాబాద్‌లో కేవలం ఒక్క అణాకే పుస్తకాన్ని అందివ్వాలన్న ఉద్దేశ్యంతో ‘అణా గ్రంథమాల’ను స్థాపించారు. సాధన సమితి, ఆంధ్రసారస్వత పరిషత్‌ నిర్వాహణలో కూడా వెల్దుర్తి పాలు పంచుకున్నాడు. సారస్వత, సాంస్కృతిక రంగాలతోపాటుగా రాజకీయ రంగంలో కూడా వెల్దుర్తి తన ముద్రను చాటుకున్నాడు. 1938లోనే ఆంధ్రమహాసభ కార్యదర్శిగా పనిచేశాడు. ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే పౌరహక్కుల కోసం ఉద్యమాలు చేశాడు. హైదరాబాద్‌లో రజాకార్ల చర్యల్ని ఎండగట్టిన అతి కొద్దిమందిలో ఈయనొకరు. చెన్నారెడ్డి తాను రాసిన దయ్యాల పన్గడలో వేషం వేసేవాడు. అలాగే అనంతర కాలంలో చెన్నారెడ్డి విజయవాడ నుంచి హైదరాబాదీయుల కోసం నిర్వహించిన ‘హైదరాబాద్‌’ పత్రిక నిర్వహణలో కూడా వెల్దుర్తి పాలు పంచుకున్నాడు.
    వెల్దుర్తి మాణిక్యరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి ఎం.ఎల్‌. నరసింహారావు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటయ్యింది. ఇందులో దేవులపల్లి ప్రభాకరరావు, వెల్దుర్తి అన్నపూర్ణ, సంగిశెట్టి శ్రీనివాస్‌, వాసిరెడ్డి నవీన్‌, పాశం యాదగిరిలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వారు వెల్తుంర్తి రచనలన్నింటిని సంకలనాలుగా వెలువరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ చరిత్ర పుస్తకాన్ని మొదటి సంపుటిగా వెలవరించనున్నారు. 
    1912లో మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో  రుక్మిణమ్మ, వెంకటేశ్వరరావు దంపతులకు జన్మించిన మాణిక్యరావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో గల మున్సిపల్‌ క్వార్టర్స్‌లో నివసించిన వెల్దుర్తి జూలై 28, 1994నాడు మరణించారు. ఆయన భార్య విమలాదేవి కూడా సారస్వత, రాజకీయోద్యమాల్లో భర్తకు అండగా నిలిచింది. తండ్రి నుంచి సాహిత్యాన్ని వారసత్వంగా స్వీకరించిన వీరి కుమారుడు హర్షవర్ధన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉన్నతోద్యోగంలో ఉన్నారు. పాత తరం తెలంగాణ సాహితీ వేత్తలెవరికీ తమ రచనల్ని అచ్చేసుకోవాలనే కోరిక ఉండేది కాదు. అందువల్ల వారి రచనలు చాలా వరకు పుస్తకం రూపంలో రాకుండా పోయాయి. వెల్దుర్తి రచనలు కూడా అధిక భాగం అచ్చుకు నోచుకోలేదు. ఈయన రాసిన కథలు నలభైకి పైగా ఉన్నప్పటికీ ఇప్పుడు అందుబాటులో ఉన్నవి పదికి మించవు. ఇప్పటికైనా ఆయన రచనలన్నీ సేకరించి ఆయన శతజయంతి నాటికి పూర్తి స్థాయిలో అచ్చేసి నట్లయితే పాత తరం తెలంగాణకు సంబంధించిన ఎన్నో కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశముంది. అలాగే ఏదైనా విశ్వవిద్యాలయంలో ఆయనపై పి.హెచ్‌.డీ పరిశోధన జరిపించేలా తెలంగాణాభిమానులు, సాహితీ వేత్తలు, ప్రొఫెసర్లు కృషి చేయాలి. 

                                                                                                                             -సంగిశెట్టి శ్రీనివాస్‌


Saturday 1 September 2012

SAAKSHI LO REPORT

NAMASTE TELANGANA PATRIKALO REPORT ON 01-09-2012