Sunday 15 June 2014

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా



Updated : 6/15/2014 1:19:56 AM (namaste telangaana)

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు తాము బానిసలుగా చూపెట్టిన వాళ్లే తెలంగాణ రాష్ట్రానికి పాలకులు కావడంతో పాచికల్లు, తాగుబోతోడికి తొక్కు పచ్చడి, మడిషి పెట్టుకోవడం లాంటి మాటలతో కావురాన్ని ప్రదర్శిస్తుం డ్రు. తెలుగు సమాజంలో తెలంగాణ వాళ్లను చులకన చేయడమే గాకుండా ఏహ్యభావం కలిగే విధంగా ఈ మీడి యా ఉద్దేశ్యపూర్వకంగా ప్రవర్తిస్తుంది.

తెలంగాణ ఆరణాల కూలీ అంజయ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయితే ఆయన్ని ఒక బఫూన్‌గా ఈ మీడి యా చిత్రించింది. బుడ్డర్‌ఖాన్, జోకర్‌గా ఆయన్ని ప్రచారం చేసింది. సముద్రంల తేల్ పడ్డది అంటే తేలు ఎట్ల పడ్తది? అని వ్యంగ్యంగా ప్రచారం చేసిండ్రు. తేల్ అంటే నూనె అనే సంగతి మరిచిండ్రు. ఇదంతా ఆయన తెలంగాణ భాషలో మాట్లాడ్డం మూలంగా చేసిన పరేషాన్. దానికి కొనసాగింపే టీవీ9 బుల్లెట్ న్యూస్ పేరిట కక్కిన కాలకూట విషం.పాశికల్లు తాగెటోనికి ఫారిన్ మందు ముందల బెట్టినట్టే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కత, మొకం గడుక్కోని వచ్చిండ్రు బానే కని ప్రమాణ స్వీకారం అయితె చెయ్యుండ్రి అనంగనె కాయితం సూసుకుంట సదువుతందుకు కూడ కొందరు తడపడ్డరు. అంతేనా ఇట్ల సూసుకుంటనే సదవరానోళ్ళకు లాప్‌టాప్ ఇచ్చిండ్రట. లంగోటి కట్టుకునేటోనికి లాప్‌టాప్ ఇస్తే మడిశి ఏడనో పెట్టుకున్నట్టు మరేం జేసుకుంటరో ఏడ అమ్ముకుంటరో ఆళ్లకే తెలవాలె అంటూ పైత్యం వెళ్ళగక్కిండ్రు. కేసీఆర్ మూడుగదుల ఇళ్ళు కట్టిస్తామన్నారని అబద్ధాన్ని శఠగోపం పేరిట ప్రచారం చేయడమే గాకుండా శిలువ్‌ు మొకవ్‌ు నిలువుటద్దంలో సూసుకో అంటూ వ్యక్తిగతంగా ఆయన్ని అవమానించిండ్రు. ముఖ్యమంత్రినే ఇట్లా అంటే ఇంక సామాన్యుల సంగతెట్లుంటదో ఊహించుకోవచ్చు.

ఆంధ్ర మంత్రులే సార్వభౌమాధికారం అనే పదం నోరు తిర్గక పలుకలేదు.తెలంగాణోళ్ళు అంటే అంత అలుసయ్యిండ్రా? టీవీ9 గేళి చేసింది అచ్చంగా తెలంగాణ బహుజన శాసనసభ్యుల్నే అన్న విషయం మరువొద్దు. తెలంగాణ మాదిగోళ్ల బిడ్డ చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రమాణం స్వీకారం చేసుకుంటూ తత్తరపడ్డది.దాన్ని టీవీల సూపించుకుంట అసెంబ్లీని ఫస్టుసారి దగ్గర్నించి సూశినందుకు సంతోషపడా ల్నో, ఏడవాల్నో, ఏంజేయాల్నో తెలవక, భయపడాల్నో అర్థంగాక బిత్తర సూపులు సూసిండ్రంటూ షార్ట్‌కట్ల అసెంబ్లీకి ఎన్నికయిండ్రూ అంటూ తెలంగాణ ప్రజల్ని, ప్రజా ప్రతినిధుల్ని ఎగతాళి చేసిండ్రు. అవును మేము మొదటిసారి అసెంబ్లీకొచ్చినం.

మా రాష్ర్టంలో మా అధికారం అని సంబురపడ్డం. తప్పా? దానికి బిత్తరచూపులు చూసిండ్రని దెప్పి పొడువాల్నా? తెలంగాణ బిడ్డల్ని దెప్పి పొడిచే మీరు మీ ఛానళ్లలో, పేపర్లలో వాడే భాష, భావం పట్ల ఏమాత్రం జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల మా మనసులు గాయపడుతున్నయి. ఆరి భడవా? అని మీ మామమియాలు అలవోకగా అనేస్తారు. తెలంగాణలో భడవా అంటే తార్పుడుగాడు అని అర్థం.

మిలియన్ మార్చ్‌లో భాగంగా టాంక్‌బండ్‌పై అహంకారపూరిత ఆధిపత్యాన్ని కూలగొట్టడానికి తెలంగాణ బిడ్డలు తమవి కాని విగ్రహాలను తొలగించిండ్రు. న్యాయంగా, హక్కుగా తమ వైతాళికులకు దక్కాల్సిన స్థానాన్ని 25 ఏం డ్లుగా సీమాంధ్ర ప్రాంతం వారే కబ్జా చేసిండ్రు.

దీంతో ఉద్యమకారులు సహజ న్యాయంగా సీమాంధ్ర ప్రతీకల్ని తొలగిస్తే దాన్ని ఆంధ్రా ఆధిపత్యానికి పరాకాష్ఠగా ఇదే టీవీ9 ఛానల్ తాగుబోతులు, కల్లు తాగిన కోతులవలె, ఉన్మాదులవలె, తాలిబన్ల వలె అంటూ తెలంగాణ ఆకాంక్షపై విషంగక్కింది. తాము ఎన్ని కుట్రలు చేసి, ఎంత రెచ్చగొట్టినా 1969లో మాదిరిగా విధ్వంసం సష్టించి, ఉద్యమాన్ని చప్పున చల్లార్చాలని చూసినా వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉద్యమం ముందుకు సాగింది. అందుకే తెలంగాణ అంటే కక్షతో వ్యవహరిస్తుండ్రు.
సీమాంధ్ర పత్రికలల్లో, ఛానళ్లలో పనిచేస్తున్న తెలంగాణ వారి గొంతు నొక్కడమే గాకుండా వారిని ఉద్యోగాలనుంచి తీసేసినా మొక్కవోని ధైర్యంతో అందరూ ఉద్యమానికి అండగా నిలిచారు. నాడు అధికారపక్షం, ప్రతిపక్షం తో కలిసి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ ఏర్పాటుని అడ్డుకోలేకపోవడంతో ఇప్పుడు ఆ అక్కసునం తా తెలంగాణ శాసనసభ్యులపై మీడియా వెళ్లగక్కుతోంది.

పత్రికలు సైతం తెలంగాణ పంట రుణ మాఫీలపై ప్రభు త్వం ఎలాంటి పాలసీ ప్రకటన చేయనప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ రాసిండ్రు. ఇవే పత్రికలు ఆంధ్రప్రాంతంలో అక్కడి ముఖ్యమంత్రి రుణమాఫీకి కమీటీ వేస్తే దాన్ని మెచ్చుకొని ప్రజాభిప్రాయంగా ప్రచారం చేస్తుండ్రు. ఇన్నేండ్లు తమ కనుసన్నల్లో ఇంకా చెప్పాలంటే తమ సలహాలు, ఆదేశాలతో నడిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం స్వతంత్రగా వ్యవహరిస్తుండటంతో ఈ పత్రికలు, ఛానళ్లు సహించలేకపోతున్నాయి. ఎటు తిరిగీ తెలంగాణ వారికి పరిపాలన దక్షత లేదు, వాళ్లు అసమర్థలని ఉద్దేశ్యపూర్వకంగా, వివక్షతోఈ మీడియా వ్యవహరిస్తోంది.

రాజ్యాంగంలో అందరికీ భావాల్ని వ్యక్తీకరించడానికి స్వేచ్ఛనిచ్చింది. కాని ఈ స్వేచ్ఛను సీమాంధ్ర మీడియా దుర్వినియోగం చేస్తుంది. తమ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని బట్టకాల్చి మీదేసే పనిజేస్తుంది. తెలుగు ప్రింట్, విజువల్ మీడియాలో 90శాతం ఒకే సామాజికవర్గం చేతిలో ఉండడం, వారి ప్రయోజనాలన్నీ ఆంధ్ర ప్రాంతంతో ముడిపడి ఉండడంతో తెలంగాణను నెగెటివ్ దక్కోణంతోనే చేస్తున్నారు. తెలంగాణ కళలు, సంస్కతి, భాష, ఆచార వ్యవహారాలు అన్నీ ఆంధ్రప్రాంతంతో పోలిస్తే కచ్చితంగా భిన్నమైనవే! ఈ భిన్నమైన సంస్కతిని కాపాడడానికి, ప్రోత్సహించడానికి ఏనాడు ఈ మీడియా ప్రయత్నించలేదు. భాష అర్థంగాక కేసీఆర్ ఏ బూషీ అంటే దాన్ని ఏబీసీడీలుగా కులపరమైన విభజనగా ప్రచారం చేసిండ్రు. మీదు మిక్కిలి 150 ఏండ్ల నుంచి హైదరాబాద్‌లో బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేపమందుపై దుష్ర్పచారం చేసిండ్రు. ఎందుకంటే తమ ప్రాంతంలో లేనిది ఏదీ వాళ్లకు గొప్ప కాదు. తమది మాత్రమే గొప్పది అనే అహంభావం నరనరాన జీర్ణించుకుపోయి ఉండడంతోనే సమస్య ఉత్పన్నమౌతుంది.

ఇది ఇవ్వాళ్టి సమస్య కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచే ఇది ప్రారంభమయింది. 1983 మార్చి10 న ఆనాటి ఈనాడు పత్రిక పెద్దల గలాబ అని శీర్షిక పెట్టింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా జరిగిన విషయాల్ని ఈ పత్రిక పై శీర్షికతో ప్రచురించడాన్ని తప్పుపడుతూ పత్రికపై, దాని అధినేత రామోజీరావుపై సభ్యులు ప్రివిలెజ్ మోషన్ ఇచ్చారు. దీనిపై సభ చైర్మన్ ఒక ప్రివిలెజ్ కమిటీని ఏర్పాటు చేసిండు. ఈ కమిటీ ఒక ఏడాది తర్వాత తమ తీర్పుని వెల్లడిస్తూ పత్రిక తప్పు చేసిందని వెల్లడించారు. తన చర్యలకు గాను రామోజీరావు సభకు హాజరై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందిగా ఇందుకు అనుగుణంగా 1984మార్చి 28 నాడు అప్పటి నగర పోలీసు కమిషనర్‌ని ఆదేశించారు. ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది.

చివరికి ఎన్టీఆర్ జోక్యం చేసుకొని రాష్ర్టపతికి లేఖ రాయడంతో విషయం సద్దుమణిగింది గలాబ అన్న పదాన్ని ఉపయోగించినందుకే ప్రివిలెజ్ మోషన్ ఇచ్చినప్పుడు మడిషి యాడ బెట్టుకుంటరో, పాశికల్లు తాగే మొకాలు శిలుం మొకవ్‌ు అంటూ సభలోని 119 మంది సభ్యుల్ని ఎగతాళి చేసిండ్రు. ప్రోటెవ్‌ు స్పీకర్ స్థానంలో ఉన్న సీనియర్ సభ్యుడు జానారెడ్డిని, కొత్తగా ఎన్నికైన సభ్యుల్ని సూపిస్తూ తమ అహంకారాన్ని ఈ చానల్ ప్రదర్శించింది. ఈ అహంకారం అణగాలంటే కచ్చితంగా ప్రివిలెజ్ మోషన్ ఇచ్చి తీరాల్సిందే! సభకు పిలిపించి శిక్షించాల్సిందే! మీడియా స్వేచ్ఛ తెరచాటున తమ అక్కసు వెళ్లగక్కే వారికీ, పక్షపాతంతో, వక్రీకరణలతో తెలంగాణను బద్‌నావ్‌ు చెయ్యాలని చూసే వారికి ఈ చర్య గుణపాఠంగా ఉండాలి. చేయకూడని అనుచిత, అవాంఛిత పనులన్నీ చేసి ఇప్పుడు తీరిగ్గా టీవీ9 యాజమాన్యం కేవలం అనుచిత వ్యాఖ్యలు ప్రసారం కావడంపై చింతిస్తున్నాంఅని ఒక్క స్క్రోలింగ్ ఇచ్చి సరిపెట్టుకుంటామంటే కుదరదు.

కేవలం స్క్రోలింగ్ కాకుండా రవిప్రకాశ్ స్వయంగా తెలంగాణ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు బేషరతుగా క్షమాపణ చెప్పడమే గాకుండా ఇలాంటి ఎపిసోడ్లు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వాలి. తమ బుల్లెట్లతో గాయపడ్డ దళిత బిడ్డ బొడిగె శోభకు క్షమాపణ చెప్పాలి. ఆమె అభిప్రాయాన్ని కూడా ప్రసారం చేయాలి. తెలంగాణ ప్రజలు, ఉస్మానియాలో విద్యార్థులు బుల్లెట్ల ప్రభుత్వాలు పోయి బ్యాలెట్ల ప్రభుత్వం వచ్చిందని పండుగ జేసుకుంటుంటే మీడియా మాత్రం తమ బుల్లెట్లను, బులిటెన్‌లను తెలంగాణపై ప్రయోగిస్తున్నారు. సహనానికీ ఒక హద్దు ఉంటది. ఆ హద్దుని చెరిపేసే విధంగా మీడియా ప్రవర్తిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు.

-సంగిశెట్టి శ్రీనివాస్

No comments: