తెలంగాణ పునర్వికాసోద్యమానికి పునాదులు వేసి విభిన్న జీవనరంగాలలో అపారమైన కృషిచేసి నలభైఆరు సంవత్సరాల జీవిత కాలంలోనే అసాధారణ విజయాలు సాధించిన మేధావి, ప్రజలమనిషి వట్టికోట ఆళ్వారుస్వామి.
కథ, నవల, విమర్శ, నాటకం, కవిత్వం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియలన్నిటిలోనూ ఆళ్వారుస్వామి ప్రవేశించారు. కొన్ని ప్రక్రియలలో చెప్పుకోదగిన ఫలితాలు సాధించారు. స్టేట్ కాంగ్రెస్, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమాస్తాల సంఘం, రిక్షాకార్మికుల సంఘం, గ్రంథాలయోద్యమం, పత్రికారచన, పత్రికా నిర్వహణ, సూచీ గ్రంథాలయ నిర్వహణ, తొట్టతొలి పౌరహక్కుల పరిరక్షణ యత్నాలు, పరిశోధన, ప్రచురణలు` తెలంగాణలో ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్ధభాగంలో ఇన్ని రంగాలలోనూ అరుదైన కృషి చేసిన వట్టికోట ఆళ్వారుస్వామిని గుర్తు చేసుకునేందుకు, గౌరవించుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
జీవితం మొత్తాన్ని సమాజసేవకు అంకితం చేసి దేశోద్ధారకుడు కాశీనాథుని నాగేశ్వరరావు పేరిట గ్రంథమాలను నిర్వహించి ఎన్నో ఆణిముత్యాలను ప్రచురించాడు. ‘ఉదయఘంటలు’ పేరిట మొదటిసారిగా ఆంధ్ర`తెలంగాణ ప్రాంత కవుల కవిత్వాన్ని పుస్తకంగా అచ్చేసిండు. పౌరహక్కుల ఉద్యమ నేతగా దొడ్డి కొమురయ్య హత్యోదంతాన్ని సాహసోపేతంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వ దురంతాల్ని ఎండగట్టిండు.
No comments:
Post a Comment