Thursday 12 June 2014

తన కాలానికన్నా ముందున్న కథకుడు ఆళ్వారు

తన కాలానికన్నా ముందున్న కథకుడు ఆళ్వారు

సంక్షుభిత సమయంలో తెలుగు సమాజం ఎదుర్కొన్న పీడన, ఘర్షణనలను చిత్రిక గట్టి గతాన్ని వర్తమానంలో సైతం ‘రిలవెంట్‌’ చేసిన ఉత్తమ సాహితీవేత్త వట్టికోట ఆళ్వారుస్వామి. 1945-1960ల మధ్య కాలంలో కథలు, నవలలు, నాటికలు, సమీక్షలు, వ్యాసాలు రాసిన వట్టికోట ఆళ్వారుస్వామి తెలుగు సాహిత్యంలో తనదంటూ ముద్ర వేసిండు. ఈ వ్యాసంలో కథకుడిగా తెలుగు సాహిత్యంలో వట్టికోట ఆళ్వారుస్థానం గురించి చర్చించడమైంది. మిగతా తెలుగు కథకులు/రచయితలతో పోలిస్తే ఆళ్వారుస్వామి ఎందుకు భిన్నమైన వ్యక్తి అనే అంశం కూడా ఇందులో చోటు చేసుకుంది. తెలంగాణ సాహితీ రంగంలో ఆళ్వారుస్వామి భూమిక గురించి ఈ వ్యాసంలో వివరించడమైంది.
ఆనాటి స్థల, కాలాలతో పాటుగా ఆయన రచనలూ ఇతర ప్రాంత సాహిత్యకారుల రచనల్ని తులనాత్మకంగా అంచనావేసినప్పుడుగాని కొత్త విషయాలు వెలుగులోకి రావు. ఆంధ్రప్రాంతం వారి సృజనతో ఆళ్వారు రచనల్ని పోల్చి చూసినప్పుడే వాస్తవాంశాలు తెలుస్తాయి. ఆళ్వారుని సగౌరవంగా, సమున్నతంగా నిలబెట్టుకోవాలంటే ఈ పనిజేయాల్సే ఉంటది. తెలంగాణ కథకులు ముఖ్యంగా సాయుధపోరాట కాలపునాటి వారి రచనల్ని ఆనాటి కోస్తాంధ్ర కథకులు వారి కథలతో పోలిస్తే ఎందుకు, ఎవరు భిన్నమైనవారో తెలుస్తుంది. ఆంధ్రప్రాంతానికి చెందిన శారద, ప్రయాగ, తెన్నేటి సూరి, తుమ్మల వెంకటరామయ్య, అట్లూరి పిచ్చేశ్వరరావు, రాంషా తదితర కథకులందరూ తాము తెలంగాణను చూడకుండానే పత్రికల్లో వార్తలు, కమ్యూనిస్టు నాయకులు చేసే ఉపన్యాసాలు అచ్చేసే పార్టీ కరపత్రాలు ఉపయోగించే ప్రచార సామాగ్రీ ఉద్యమ ఉధృతికి ఎత్తుగడగా వ్యాప్తిలో పెట్టే సంఘటనలు, ఆలోచనల్ని ఆసరాగా చేసుకొని రచనలు చేసిండ్రు. బొల్లిముంత శివరామకృష్ణ, మహీధర రామమోహనరావు లాంటి నవలాకారులు తెలంగాణ పోరాటాన్ని ‘పార్టీ’ప్రచార ప్రభావంతోనే అక్షరీకరించారు.
ఆరుద్ర, సోమసుందర్‌, కుందుర్తి, కె.వి.ఆర్‌, గంగినేని, రెంటాలలు తెలంగాణ కవిత్వాన్ని ఈ ప్రాంతాన్ని చూడకుండానే రాసిండ్రు. నాటకాల్ని రాసిన సుంకర, వాసిరెడ్డిలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ విషయాన్ని ఆరుద్ర తన ‘త్వమేవాహమ్‌’లో రికార్డు కూడా చేసిండు. చిత్రకారుడు చిత్తప్రసాద్‌, విశ్వవిఖ్యాత ఫోటోగ్రాఫర్‌ సునీల్‌జెనా లాంటి ఒకరిద్దరు కమ్యూనిస్టు పార్టి ప్రభావంతో స్వయంగా తెలంగాణలో పర్యటించారు. తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయమైన కృషిని ప్రపంచానికి అందించారు. అయితే పైన పేర్కొన్న ‘ఆంధ్ర’ సాయుధ పోరాట సానుభూతిపరులెవ్వరూ తెలంగాణను అప్పటివరకు చూడలేదు. అయినా వారి కవిత్వం, కథలు, నవలలకు విమర్శకులు, సాహితీవేత్తలు ప్రథమ ప్రాధాన్యత నిస్తారు. వీరి దృష్టిలో కాళోజి, సుద్దాల, దాశరథి, ఆళ్వారుస్వామిల రచనలు అంత ‘గొప్ప’వి కావు. నిజానికి ఆళ్వారుస్వామి కథలే కాదు, ధాశరథి కృష్ణమాచార్య లాంటి వారెందరో రాసిన కథలు కూడా తెలుగు పాఠకులకు అందుబాటులో లేవు. అట్లాంటప్పుడు తుది తీర్పులిచ్చేముందు తమ జ్ఞానంలోని ఖాళీల్ని పూరించుకొని మాట్లాడాల్సి, రాయాల్సి ఉంటది. అయినా ప్రాంతేతర సాహిత్యకారులు తమకు తెలిసింది మాత్రమే చరిత్ర, రచన అన్నట్టుగా తుది తీర్పులిస్తారు. ఇచ్చారు కూడా.
ఆంధ్రప్రాంతం వారి రచనలు, సాయుధ పోరాటాలు విశాలాంధ్రలో భాగంగానే, విశాలాంధ్ర కోసమే జరిగిందనే తప్పుడు భావనను ప్రచారంలోకి తెచ్చారు. ఇంకా తెస్తున్నారు కూడా. ప్రజాశక్తి, విశాలాంధ్ర సంస్థలు ఈ భావనను యథాస్థాయి పెంచి పోషించాయి. సాయుధ పోరాటం పేరుమీద తెలంగాణ చరిత్రను కమ్యూనిస్టులు తమకు అనుకూలమైన సాహిత్యాన్ని ఒక వైపూ, మరోవైపు ఇక్కడి స్థానిక ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన సాహిత్యాన్ని 1969 నుండీ ఎక్కువ రాశిలో ఎక్కువగా ప్రచురించారు. ఎలాంటి వివక్షకూ, విస్మరణకూ తావులేని విజ్ఞతగల్ల అసలు సిసలైన చరిత్ర ఆళ్వారు రచనల్లో కనిపిస్తాయి.
తెలంగాణ` రజాకార్లు
నిజాం పాలనలోని ముస్లింలు, రజాకార్ల గురించి ఇప్పటికీ ఏకపక్షమైన, సర్వాంగీకారం లేని, వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యానాలు, అసమంజస నిర్ధారణలు అటు హిందూత్వవాదులు, ఇటు కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు కూడా చేస్తున్నారు. ఈ విషయంలో ‘కుడి’ ‘ఎడమ’ భావజాల పార్టీలందరిదీ ఒకటే దారి. ఆళ్వారుస్వామి తన కథల్లో మజ్లిస్‌ భావజాలం ఉన్న ముస్లిలంపై సైతం దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, ప్రభుత్వం` పోలీసులతో కుమ్మక్కై దాడులు చేయించిన సంగతులను రికార్డు చేసిండు. ముస్లింలుగా
మారిన దళితుల దౌర్భాగ్య స్థితిని ‘కాఫిర్లు’ ‘రాజకీయ బాధితులు’ కథల్లో చెప్పిండు. ముఖ్యంగా రాజకీయ బాధితులు’ కథలో కమ్యూనిస్టులు సాయుధ రైతాంగ పోరాట విరమణ అనంతరం అడవుల్లో ఉండి సాయుధులై కొట్లాడిన కార్యకర్తల్ని విస్మరించిన తీరు, పోరాట విరమణ తప్పు అన్నవాళ్ళని పార్టీ నుంచి వెలివేయడాన్ని నిలదీసే విధంగా చిత్రీకరించిండు. విరమణను పట్టించుకోకుండా కొట్లాడిన దళిత పోరాట యోధుని భార్య పెంటమ్మ, కాంగ్రెస్‌, మిలిటరీ వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పెళ్ళాం పిల్లల్ని తలుచకుంటూ తల్లడిల్లుతున్న దస్తగీర్‌గా మారిన దళితుని వ్యథను ఈ కథలో అక్షరీకరించిండు ఆళ్వారుస్వామి.
ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో ‘రజాకార్ల’ గురించి సరైన అంచనా వేస్తూ ఒక్క పుస్తకం కూడా రాలేదు. మొత్తం హైదరాబాద్‌ రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశపై హిందీ, ఉర్దూ, ఇంగ్లీషుల్లో అనేక నవలలు, కథలు, విమర్శనాగ్రంథాలు, చారిత్రక పుస్తకాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు, వైట్‌పేపర్లూ వెలువడ్డాయి. ‘అక్టోబర్‌ కూ’, ‘మర్డర్‌ ఆఫ్‌ ఎ స్టేట్‌’, ‘ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌’ (లాయక్‌ అలీ జీవిత చరిత్ర), కెప్టెన్‌ పాండురంగారెడ్డి రాసిన ‘ది ఫస్ట్‌ టెర్రరిస్ట్‌ మూవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’ లాంటి కొన్ని పుస్తకాలు రజాకార్ల గురించి చర్చించాయి. తెలుగు సాహిత్యంలో హిందూ`ముస్లింల సాన్నిహిత్య జీవితం, సామరస్య వైఖరిని నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు తదితరులు తమ రచనల్లో చిత్రించారు. నెల్లూరి కేశవస్వామి తన కథల సంపుటికి ‘చార్మినార్‌’ అని పేరు పెట్టడమే కాదు దాన్ని రజాకార్ల కాలంలో పాకిస్తాన్‌కు వలసెళ్లిన తన ముస్లిం మిత్రుడికి అంకితమిచ్చిండు. అదీ 1980 ప్రాంతంలో అంటే ఆ జ్ఞాపకాలు ఎంతగా వెంటాడాయో అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. హైదరాబాద్‌పై పోలీస్‌యాక్షన్‌ తర్వాత ఉర్దూ ప్రాధాన్యత కోల్పోయింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉర్దూ స్థానాన్ని తెలుగుతో పూర్తి చేశారు. అయితే కేవలం ఉర్దూ తెలిసిన ఉద్యోగులు ‘తెలుగుతో’ ఇమడ లేక ఉద్వాసనకు గురయ్యారు. ఇట్లా ఉద్వాసనకు గురైన వారిలో దాదాపు 95వేల మంది పాకిస్తాన్‌లోని ఒక్క కరాచీ నగరానికి వలసపోయిండ్రనే విషయం 1951 నాటి పాకిస్తాన్‌ జనాభాలెక్కలు తీస్తే తెలిసింది. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
‘‘ఇత్తెహాదుల్ముసలీమన్‌ వారు కొన్నాళ్ళు పాత మసీదుల నిర్మాణానికై పూనుకొన్నారు. కొన్నాళ్ళు పాత దేవాలయాల పునర్నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన సాగించారు. పట్టణాల్లో హిందూ, మహమ్మదీయ వైషమ్యాలు పెరిగిపోయి, సంఘర్షణలు జరుగుట సామాన్య విషయమై పోయింది.
రెండో వైపు హిందువుల రక్షణ పేర, మహమ్మదీయ వ్యతిరేకోద్యమం కూడా బలపడసాగింది. ఒకే ఊరిలో, ఒకే పాఠశాలలో చదువుకున్న హిందూ, మహమ్మదీయ బాలురల్లో కూడా వైషమ్యాలు జీర్ణించుకు పోయినవి. పట్టణాల్లో చదివిన గ్రామీణ హిందూ, మహమ్మదీయ విద్యార్థులు సెలవుల్లో ఇండ్లకు చేరి తమ మతాల ప్రచారం, ఇతరుల మతాలను ద్వేషించడం జరుగుతుండేది’’ అంటూ ఇరు మతాల వారి చాంధస ప్రవృత్తిని ‘కాఫిర్లు’ కథలో రికార్డు చేసిండు. ‘పైస దగ్గర ఎవరూ మనవాడు కాదోయ్‌’ అని ఈ కథలో చాంద్‌సాహెబు ద్వారా చెప్పించాడు. అలాగే ఊరికి వచ్చిన పోలీసు సిబ్బందికి భోజన ఏర్పాట్లు దేశముఖు జగన్మోహనరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేయడంతోటే ఎవరి కనుసన్నల్లో అధికారులు నడుస్తున్నారో అర్ధమయ్యేలా చెప్పిండు. బాధితులు ముస్లింలైనప్పటికీ ఇక్కడ మతంతో సంబంధం లేకుండా ఆధిపత్యం దొరలు, దేశ్‌ముఖ్‌లదే నడుస్తది అని తేల్చేసిండు.
హిందూ నుంచి ముస్లిం మతంలోకి, ముస్లిం మతం నుంచి తిరిగి హిందూ మతంలోకి మార్పిడులకు (‘శుద్ధి’, ‘తబ్లీగ్‌’) గురవుతన్న‘హరిజనుల’ (దళితుల) జీవితాల గురించి ‘కాఫిర్లు’ కథలో చిత్రీకరించిండు. ఎన్ని మార్పిడులు జరిగినా ఆర్థికంగా ఏ మాత్రం ఎదుగు బొదుగూ లేని జీవితాన్ని, మారని సామాజిక స్థితిని, సాంఘిక కట్టుబాట్లను గురించి కూడా చెప్పిండు. లంచగొండి అధికారులు హిందువైనా, మహమ్మదీయుడైనా ప్రజలను పీడిరచే విధానంలో ఏమాత్రం తేడా ఉండబోదని తేల్చిండు. అలాగే పెట్టుబడిదారుడు ఏ మతస్థుడైనా స్వీయ లాభం కోసమే తపిస్తాడు తప్పితే కార్మికుల మేలుని కాంక్షించబోడు అని కూడా చెప్పాడు. కార్మికుల మతాలు వేరైనా వాళ్ళు ఐక్యంగా ఉండాలని కూడా కోరుకున్నాడు.
ప్రభుత్వాధినేతలు ముస్లింలే అయినప్పటికీ వారు గ్రామాల్లోని దేశ్‌ముఖ్‌ల తాబేదార్లుగా వ్యవహరిస్తారని ‘కాఫిర్లు’ కథలో చెప్పిండు. చివరికి ఇత్తెహాదుల్‌ సభ్యుడైనా దేశ్‌ముఖ్‌ల ఆగ్రహానికి బలికాక తప్పదని తేల్చి చెప్పిండు.
ఇది ఇత్తెహాదుల్‌ పార్టీ ‘ముస్లింలంతా పాలకులే’ (అనల్‌ మాలిక్‌) అనే సిద్ధాంతానికి విరుద్ధమనే విషయాన్ని గమనించాలి. మతంతో సంబంధం లేకుండా ప్రజలందరూ లంచగొండి అధికారుల చేతుల్లో, దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసే దేశ్‌ముఖ్‌ల వెట్టికి బలైతున్న విషయాన్ని వివరంగా చెప్పిండు. దేశ్‌ముఖ్‌ల వెట్టి నుంచి విముక్తి పొందేందుకు, కొన్నిసార్లు సామాజిక హోదా కోసం, మరి కొన్ని సార్లు తాత్కాలికంగా దొరికే ఆర్థిక సహాయం ఆశించీ, బూటకపు వాగ్దానాలను నమ్మి మతం మార్చుకున్న హిందువులు, చివరికి గ్రామ పెత్తందార్లు, భూస్వాములు విధించే కట్టుబాట్లు, వత్తిళ్ళు, బెదిరింపులు వాళ్ళని తిరిగి ‘శుద్ధి’ చేసి ‘హిందూ’ మతంలోకి మారేలా చేస్తున్న పరిస్థితికి కూడా అక్షర రూపమిచ్చిండు. రైతులు హిందువులైనా, ముస్లింలైనా వాళ్ళని ప్రభుత్వానికి పన్నులు చెల్లించే వారిగానే చూశారు. మతం మార్చుకున్న వారికి కొంతమేరకు వెట్టినుంచి విముక్తి దొరికతే దొరికిందేమోగానీ ఎక్కువ మందికి మతమార్పిడి వల్ల దక్కుతుందనుకున్న సామాజిక హోదా భ్రమగానే మిగిలింది.
అందుకే ‘కాఫిర్లు’ కథలో ఈవిషయంపై పెద్ద చర్చ చేసిండు. చాంద్‌సాహెబ్‌ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో మిలిటరీలో పనిచేసిండు. అందుకు గాను ప్రభుత్వమిచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే మజ్లిస్‌ ప్రభావం పెరుగుతున్న దశలో చాలా సార్లు మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించేవాడు. తన కొడుకు నిజాం ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగం చేస్తున్న బందగీ ఫలానా గ్రామంలో హిందువులు పందిని కోసి మసీదులో వేసిండ్రనీ, మరో చోట మసీదు ముందట వాయిద్యాలు వాయించారనీ, ఇంకోచోట ఆవుని కొయ్యనియ్యలేదనీ చెబుతూ ఉండేవాడు.
దీనికి చాంద్‌ సాహెబ్‌ నచ్చచెప్పే విధంగా ఇలా జవాబు చెప్పాడు. ‘‘బందగీ! చూడు!! ఒక సంగతి చెప్తాను. నేను సిపాయిగా పనిచేస్తున్నప్పుడు మిలిటరీలో హిందూ, మహమ్మదీయ అధికారులు ఒకే బల్లపై కూర్చొని డబ్బాల్లో ఎక్కడినుంచో వచ్చిన మాంసాన్ని తినడం నేను కళ్ళారా చూశాను. దాంట్లో అన్ని రకాల మాంసాలుంటాయట. వాండ్లెట్లా తింటారో? వారెప్పుడూ జగడమాడలేదు.’’ అని తన అనుభవాన్ని చెప్పిండు. అలాగే మరో కథ ‘మెదడుకు మేత’ కథలో కూడా ఈ విధమైన చర్చ చేసిండు ఆళ్వారుస్వామి.
కథాంశంగా ఎద్దుమాంసం
తెలుగు సాహిత్యంలో ఎద్దు మాంసం గురించి చర్చ చేసిన మొట్టమొదటి సృజనకారుడు ఆళ్వారుస్వామి. ఎవరెవరి ఇష్టాయిష్టాల మేరకు ఏదైనా తినొచ్చని తీర్పిస్తూ, దీనికి మతం రంగు పూయడానికి చేసే కుట్రలో పావులు కావొద్దని బోధ చేసిండు. ఇప్పటికీ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో, మత సంఘాలు, మఠాధిపతులు, ముల్లాలు, మతోన్మాదులు, చాంధసులు ఎద్దు మాంసం, పంది మాంసం విషయంలో తగాదా పడుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘పెద్దకూర’ పండుగ చేసుకుంటే ఏబీవీపీ, భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు వండుకున్న కూరలో మన్ను కలిపి నానా బీభత్సం సృష్టించిండ్రు. ఇదే రగడను అంతకుముందు ఎఫ్లూలోనూ కొనసాగించారు. ఇంత సున్నితమైన విషయాన్ని కూడా ఆళ్వారుస్వామి తన కథల ద్వారా విశ్లేషించి తన అభిప్రాయం చెప్పిండు.
మత వైషమ్యాలను పెంచిపోషిస్తున్న వారి గురించి, అందుకు కారణాలను, వాటిని అరికట్టాలని కూడా ఆళ్వారుస్వామి గట్టిగానే చెప్పిండు. ‘‘మహమ్మదీయులంతా ఒకటి కావాలి. కత్తితో సాధించిన మహమ్మదీయ రాజ్యాన్ని కాపాడు కోవాలె. మహమ్మదీయులంతా అన్నదమ్ముల వలె మెలగాలి’’ అని ఇత్తెహాదుల్ముసల్మీన్‌ చేసే ప్రచారాన్ని గురించీ చెప్పిండు. మత కలహాలాల్లో అమాయక, అజ్ఞాన ప్రజలే వీధుల్లో తలలు బద్దలు కొట్టుకుంటారన్నాడు. ఇప్పటి వరకూ ఏ మత కలహంలోగానీ మసీదు ఇమాంగానీ, మందిర పూజారి గాని పాల్గొనలేదు. ముల్లాలు పండితులు ముష్టియుద్ధాలకు దిగలేదు అని బోధ చేసిండు. మత స్వాతంత్య్రం అంటే ‘నీ శక్తి సామర్ధ్యాలను బట్టి, నీ శారీరక స్థితినిబట్టి, నీ దుస్తులు, నీ ఆహారము, నీవు ఉపయోగించుకున్నట్లే నీ విశ్వాసం, నీ విజ్ఞానాన్ని బట్టి నీవు నమ్మే మతవిధులను నీవు ఆచరించుకోవచ్చు. కానీ నీ మత స్వాతంత్య్రం ఇతరుల మత స్వాతంత్య్రాన్ని హరించుటకు మార్గం మాత్రం కాకూడదు’’ అని మెదడుకు మేత కథలో మోహన్‌బాబు పాత్ర ద్వారా చెప్పిస్తాడు. మతస్వేచ్ఛకు సంబంధించిన విషయంలో ఆళ్వారు తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం జేసిండు. అందుకే ఆయన దార్శనికుడు, వైతాళికుడు.
ఆవును తినడం మోక్షానికి మార్గమని చేసిన తప్పుడు ప్రచారాన్ని చైతన్యంతో ఎదుర్కోవాలని చెప్పిండు. ‘ప్రజలలో చైతన్యం, విజ్ఞానం, వికాసం కలుగుటతో వారి భావనా శక్తి ప్రధాన సమస్యలపై ప్రసరించి, విశాల హృదయముతో ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తారు. అప్పుడు ప్రజల నైతిక, రాజకీయ ఆర్థిక సమస్యలే ప్రధాన విషయాలుగా పరిగణించబడతాయి’’ అంటూ దృష్టిని కేంద్రీకరించాల్సిన అంశాలను తేటతెల్లం జేసిండు. వర్తమాన కాలంలో ఈ ‘ఫుడ్‌ రాజకీయాల’పై బుద్ధిజీవులు సవ్యంగానే స్పందిస్తున్నారు. దానికి నిదర్శనమే ‘అన్వేషి’ సంస్థ ప్రచురించిన ప్రత్యేక సంచిక.
ఫ్యూడలిజం`ఆళ్వారు కథలు
అప్పటి ఫ్యూడల్‌, దోపిడీ సమాజానికి లాభాలే తప్ప కార్మికుల శ్రేయస్సు అప్రధానమని కూడా ఆళ్వారుస్వామి తన కథల్లో బలంగా చెప్పిండు. పెట్టుబడిదారునికి దోపిడీ తప్ప మతం ఉండదని కూడా రాసిండు. మిల్లు యజామానులు ఏ మతస్థుడైనా దోపిడీ అతని ప్రధాన ఉద్దేశ్యమంటూ, ఇది ‘‘నవాబుగా, బంజరుదారుగా, మఖ్తదారుగా, లంచగొండి అధికారిగా ఉండే హిందూ మహమ్మదీయులకు`పన్నుభారంతో, లంచాలతో, దండుగలతో, నజరానాలతో కృంగి కృశించిపోతున్న హిందూ మహమ్మదీయ కూలీ రైతుల మధ్య ఐక్యత అంటే పిల్లికి ఎలుకకు ఐక్యత అనే విషయం ఇంకా అవగాహన కాలేదు జనసామాన్యానికి’’ అంటూ రావాల్సిన మార్పుల గురించి చెప్పిండు. రంజాన్‌ మాసంలో జైల్లో ఉన్న ఖైదీలకు బిర్యానీ, అరటిపండు, ఒక ఖర్జూరపండు ఇచ్చినతన్ని ఒక ఖైదీ దీవిస్తాడు. దీనికి అదే జైల్లో ఉన్న రాజకీయఖైదీ అభ్యంతరం చెబుతూ ‘‘పొట్టకు పెడ్తే దీవించావు? పొట్ట మాడినవాండ్లు దూషిస్తారు? అయితే అతనికి నీ దీవెన ఫలితమా? వాండ్ల దూషణ ఫలితమా కలిగేది? నీకు తెలియదు లతీఫ్‌. అతడు తన ఫ్యాక్టరీలో కూలీలకు, ఇంట్లో పనివాండ్లకు సరిగా జీతాలివ్వడు. అక్కడ వాండ్ల నెత్తికొట్టి యిక్కడ యీ విధంగా మీ పొట్ట నింపుతున్నాడు’’ అని కూడా తన కథల్లో చెప్పిండు.
‘‘ఈ విధంగా ఖర్చు పెట్టేవాడు తన నౌకరులకు సరిగా జీతాలెందుకివ్వడు నీ మాటలు కాని’’ అన్న లతీఫ్‌ మాటలకు జవాబు చెబుతూ ‘‘అక్కడే కిటుకంత. దానము, ధర్మము, కారుణ్యము పేర వేలు ఖర్చుపెట్టి వాండ్ల వల్ల వచ్చే కీర్తి ప్రతిష్టల ముసుగులో కష్టజీవుల నెత్తికొట్టి కోట్ల రూపాయలు గడిస్తారు. అంటే వాండ్లీవిధంగా ఖర్చుపెట్టే డబ్బు వాండ్ల విపరీత లాభాల కింద చేతిమైలతో సమానము’’ అని మోహన్‌బాబు ద్వారా భూస్వాముల దోపిడీని ఎండగట్టిండు. గ్లోబలైజేషన్‌ వచ్చిన తర్వాత ఇట్లాంటి కథలు మనం చూస్తున్నాము. కానీ 1950వ దశకంలోనే గుత్తాధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ గురించీ అందులో శ్రమజీవుల దోపిడీ గురించి కూడా చర్చించిండు. ఫ్యూడల్‌ వ్యవస్థనీ వ్యతిరేకించిండు. పై అధికారులు, వారి భార్యలు కిందిస్థాయి నౌకర్లని పీడిరచడాన్ని ‘బదనిక’ కథలో నిక్షిప్తం చేసిండు.
సంఘం పేరిట కమ్యూనిస్టుల సాయుధ`రైతాంగ పోరాటాలను, ప్రజాభ్యున్నతికి చేపడుతున్న చర్యలను, కార్యక్రమాలను ‘రాజకీయ బాధితులు’ ‘అంతా ఏకమైతే’, ‘ఆలుకూలి’, ‘చిన్నప్పుడే’, ‘ఆక్షేపణలేదు’ ‘గిర్దావర్‌’ లాంటి కథల్లో రికార్డు చేసిండు.
గిర్దావర్‌ కథలో ఆళ్వారుస్వామి గ్రామాల నుంచి దొరలను తరిమేసిన తీరు, ‘పోలీస్‌యాక్షన్‌’ తర్వాత మిలిటరీ అండతో గ్రామాలకు తిరిగొచ్చి తమ భూముల్ని స్వాధీనం చేసుకున్న భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల గురించి, వారి ఆధిపత్య పోకడల గురించీ మానవీయంగా రికార్డు చేసిండు. అలాగే పోలీస్‌ యాక్షన్‌ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉర్దూ భాష పట్ల చూపుతున్న నిరాదరణను, ప్రాంతీయ భాష`తెలుగు నేర్చుకోవాలనే నిబంధన తీసుకొచ్చి ఉర్దూమాత్రమే తెలిసిన వారి ముఖ్యంగా ముస్లింల ఉద్యోగాలను కొల్లగొట్టిన తీరు ‘పరిసరాలు’ కథలో రాసిండు. ఇదంతా చరిత్రకెక్కని మార్జినలైజ్‌డ్‌ సంఘర్షణ.

అస్తిత్వానికి ఆనవాళ్ళు తొలి తెలంగాణ కథలు


సంగిశెట్టి శ్రీనివాస్‌
సంగిశెట్టి శ్రీనివాస్‌
నిజాం పాలనలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌/సికింద్రాబాద్‌ నగరాల్లో కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వెల్లి విరిసింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారితో పాటు అటు ఇరాన్‌ నుంచి ఇటు ఫ్రాన్స్‌ ఇంకా అనేక దేశాల నుంచి వలస వచ్చిన వారు హైదరాబాద్‌ని తమ శాశ్వత ఆవాసంగా మార్చుకున్నారు. అంతకు ముందరి కుతుబ్‌షాహీల పాలన కూడా విదేశీ పర్యాటకుల పొగడ్తలతోపాటు, దేశీయుల మన్ననలందుకుంది.
ఇబ్రహీం కులీ కుతుబ్‌షాను కవులు మల్కిభరాముడు అని కొనియాడిండ్రు.  హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన మొహమ్మద్‌ కులీకుతుబ్‌షా చంచల్‌గూడా బిడ్డ భాగమతిని వివాహమాడిండు. భాగమతి ` కుతుబ్‌షాహీ ఖాందాన్‌లో వీరమాతగా, వీరపత్నిగా వెలుగొందారు. తారామతి, ప్రేమావతిలు గోల్కొండ కోటలో నృత్య ప్రతిభతో దేశదేశాల్లో పేరు పొందిండ్రు. అక్కన్న మాదన్నలు కుతుబ్‌షాహీల సేవలో తరించారు. ఉన్నత పదవుల్ని అధిష్టించారు.  ఖైరున్నీసా బేగమ్‌ని పెళ్ళి చేసుకొని బ్రిటీష్‌ రెసిడెంట్‌ కిర్క్‌ పాట్రిక్‌ చరిత్రలో నిలిచి పోయాడు. స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌లో చైనీస్‌ రెస్టారెంట్స్‌ ఉండేవి. కరాచీ బేకరీ ఇప్పటికీ ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన సైనిక యోధుడు రేమండ్‌ సమాధి హైదరాబాద్‌ ఆస్మాన్‌ఘడ్‌లో ఇప్పటికీ ఉంది. బ్రిటీష్‌ ప్రధాని చర్చిల్‌ తాను సైన్యంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌లో నివాసమున్నాడు.   ఆయన కూడా హైదరాబాద్‌లో సర్వేయర్‌గా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత కవి టేలర్‌ ఇక్కడుండి కవిత్వం రాసిండు. తెలుగులో నవలలు రాకముందే హైదరాబాద్‌ నగర జీవితం ఇంగ్లీషు నవలల్లో రికార్డయింది.
బ్రిటీష్‌ రెసిడెంట్‌ హాలండ్‌ బంధువు వాల్టర్‌ స్కాట్‌ ఈ నవల రాసిండు. ఇలా ఎంతో మంది హైదరాబాద్‌ ‘షాన్‌’, ‘నిషాన్‌’ని విశ్వవ్యాప్తం చేసిండ్రు. తమ స్వీయ ‘అస్తిత్వా’న్ని ‘పోలీస్‌ యాక్షన్‌’ వరకూ ఇక్కడి ప్రజలు కాపాడుకున్నారు. ఈ కాపాడుకున్న అస్తిత్వం కథా సాహిత్యంలో కూడా ప్రతిఫలించింది. మాజీ మంత్రి, 1969 ఉద్యమ నేత టి.ఎన్‌. సదాలక్ష్మి మామ నిజాం మిలిటరీలో పనిచేస్తూ మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో పర్యటించాడు. ఆఫ్రికన్‌ కావల్రీ గార్డ్స్‌లో పనిచేసేందుకు అఫ్ఘనిస్తాన్‌, ఈజిప్ట్‌, గల్ఫ్‌, ఇథియోపియాల నుంచి సిద్దీలు, పఠాన్‌లు ఇంకా ఎంతోమంది తమ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిండ్రు. ఇలా వచ్చిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ట్రెంచ్‌, టస్కర్‌లతో పాటు అనేక మంది యూరోపియన్‌ అధికారులూ ఉన్నారు. అలాగే సరోజిని నాయుడు, డాక్టర్‌ మల్లన్న తదితరులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ నుంచి యూరోప్‌కు వెళ్ళిండ్రు.
హైదరాబాద్‌ నుంచి చదువుకునేందుకు ఇంగ్లండ్‌ వెళ్ళిన సంస్కర్త రాయె బాలకిషన్‌ విదేశాల్లో గదర్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. కొన్ని వేల మంది హైదరాబాదీలు విదేశాల్లో చదువుకున్నారు. హైదరాబాద్‌ ఉప ప్రధాని పింగళి వెంకటరామారెడ్డి కుమారుడు యూరోప్‌లో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల సందర్భంగానే దెబ్బలు తగలడంతో బాక్సింగ్‌ రింగ్‌లోనే ప్రాణాలు వదిలాడు. ఇదంతా హైదరాబాద్‌ ప్రజలకు ప్రపంచం చేరువైన తీరు. మిగతా తెలుగు వాళ్లందరికన్నా ముందుగానే బాహ్య ప్రపంచం పరిచయమైందనే వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఈ పరిచయం, చైతన్యం, భాషా విశేషాలు, భావాల మేలు కలయిక, కోర్టుల్లో వాడే ఇంగ్లీషు, ఉర్దూ భాషలు అన్నీ కలగలిసి తెలుగులో ఆనాడు కథలు రాసిన వారిపై గాఢమైన ప్రభావాన్నే వేశాయి. అందుకే నందగిరి వెంకటరావు లాంటి వారు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో 1930కి ముందే కథలు రాసిండ్రు. భాస్కరభట్ల కృష్ణారావు ఆరేడు భాషల్లో నిష్ణాతుడు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు, ఉర్దూ, ఫార్సీల్లో సమాన ప్రతిభ కలవాడు. వీరందరూ ఆనాడు సాహితీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుండ్రు.
585_luther_1
హైదరాబాద్‌పై పోలీసుచర్యకు పూర్వం అంటే 1948 సెప్టెంబర్‌ 13 కన్నా ముందు రాసిన తెలంగాణ` తెలుగు కథల్లో ప్రముఖంగా చోటు చేసుకున్న అంశం ఇక్కడి తెహజీబ్‌. హిందూ`ముస్లిం సోదరుల్లా కలిసిపోయిన సంస్కృతి. దాదాపు ఆనాటి తెలంగాణ కథకులందరూ తెలుగు`ముస్లిం జీవితాలను తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. నందగిరి వెంకటరావు, సురవరం ప్రతాపరెడ్డి, భాస్కరభట్ల కృష్ణారావు, నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, వెల్దుర్తి మాణిక్యరావు, కాంచనపల్లి చినవెంకటరామారావు, నందగిరి ఇందిరాదేవి ఇంకా చాలా మంది ఈ జీవితాలకు తమ కథల ద్వారా శాశ్వతత్వాన్ని కల్పించిండ్రు.
ముస్లింల అబ్బాయిలతో తెలుగమ్మాయిలు, తెలుగువారితో ముడిపడ్డ ముస్లిం అమ్మాయిల జీవితాలు, ఉద్యోగాలు, కలివిడితనం, విద్య, సంస్కరణ, ఆత్మగౌరవం ఇవన్నీ ఈ కథల్లో ప్రతిఫలించాయి. గంగా జమునా తెహజీబ్‌తో పాటు 1945 తర్వాత మూడేళ్ళ కాలంలో నిజాం ప్రభుత్వ అసహాయ వైఖరిని కూడా తమ కథల్లో ఎత్తి చూపిండ్రు. దొరలు, పాలకులు చేస్తున్న దగా, దోపిడీ,  మోసాలను నిలదీసిండ్రు. రైతుల దీనావస్థను కళ్ళకు కట్టిండ్రు. ఆంధ్రమహాసభ కార్యక్రమాలు తీసుకొచ్చిన చైతన్యంతో కొంతమంది కథకులు గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, పుస్తక పఠనం, వెట్టి చాకిరి, రాజకీయ చైతన్యాన్ని తమ కథల్లో వస్తువుగా తీసుకున్నారు. కనుమరుగౌతున్న భాష పట్ల అవగాహన కల్పించే విధంగా కథలల్లిండ్రు. ఈ దశలో తెలంగాణ కథల్లో అనివార్యంగా జైలుకు సంబంధించిన జీవితాలు, పోరాటాలు చోటు చేసుకున్నాయి. పొట్లపల్లి రామారావు ‘జైలు’. వట్టికోట ఆళ్వారుస్వామి’ ‘జైలు లోపల’తో పాటు కాంచనపల్లి వెంకటరామారావు, ఆవుల పిచ్చయ్య తదితరుల కథలే దానికి సాక్ష్యం.
తొలి తెలుగు కథ రాసిన భండారు అచ్చమాంబ మొదలు 1948లో కథలు రాసిన నందగిరి ఇందిరాదేవి వరకూ 25మందికి పైగా రచయితలు తమ కథల్లో తెలంగాణ/హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని రికార్డు చేసిండ్రు.   1899 నాటికే తెలుగులో తొలి కథలు రాసిన భండారు అచ్చమాంబ హైదరాబాద్‌లో అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ (ఆంధ్రలో) బతుకలేని పరిస్థితి వస్తే హైదరాబాద్‌కు వలస వెళ్ళయినా జీవితాన్ని వెళ్ళదీయొచ్చు అని ‘సతాప్రత్రదానము’ (1902) కథలో చెప్పారు. అచ్చమాంబ బాల్యము ఒకప్పటి మునగాల, దేవరకొండలో గడిచింది. వివాహానంతరం మహారాష్ట్రలో గడిపింది. అందుకే ‘ధనత్రయోదశి’ ‘బీద కుటుంబం’ కథలో బొంబాయి, మహారాష్ట్ర ప్రజల జీవితాన్ని రికార్డు చేసింది. ఆనాడు హైదరాబాద్‌ రాజ్యంలో మరాఠీలు కూడా భాగమే. హైదరాబాద్‌లో మెరుగైన జీవన స్థితిగతులు ఉన్నందువల్లనే ఆమె తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల జమిందార్‌ రాజా నాయని వెంకటరంగారావు హైదరాబాద్‌ ఆవాసంగా చేసుకొని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (1901`హైదరాబాద్‌) తో పాటు అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వంహించారు.
అచ్చమాంబ తర్వాత తెలంగాణ జీవితాల్ని ప్రతిఫలించే విధంగా కథలు రాసింది మాడపాటి హనుమంతరావు. ఆయన ‘హృదయశల్యము’ కథలో కాకతీయుల చారిత్రక మహిళ ‘రుద్రమదేవి’ గురించి రాసిండు. ఈయన రాసిన ‘నేనే’ కథలో కృష్ణాథియేటర్‌కు రమ్మని హీరోయిన్‌ హైమవతి తానెవరో చెప్పకుండా న్యాయవాది గణపతిరావుకు లేఖ రాస్తుంది. షోకుగా తయారై వెళ్ళిన రావుకు అక్కడ తన భార్య కనబడడంతో తమాయించుకొని ‘ఈ కొంటె తనము చేసింది నువ్వేనా?’ అని అడుగుతాడు. దానికి ఆమె ‘నేనే’ అని జవాబు చెబుతుంది. ఆనాటికి ఈనాటికి కృష్ణా థియేటర్‌ చార్మినార్‌ దగ్గర చరిత్రకు సాక్ష్యంగా నిలబడి ఇంకా సజీవంగా ఉంది. ‘నేనే’ కథ పురుషుల బలహీనతల్ని చెబుతుంది. ఇది ఆనాటి సమాజంలో వ్యాప్తిలో ఉన్న విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఆ లౌల్యానికి సాహిత్యంలో స్థానం దక్కింది. ఇదే కాలంలో బడారు శ్రీనివాసరావు అనే మహబూబ్‌నగర్‌కు చెందిన జర్నలిస్టు, ఆయుర్వేద వైద్యుడు, నాటకకర్త తాను వెలువరించిన ‘హితబోధిని’ (1913`15) పత్రికలో కథలు వెలువరించాడు. రాజయ్య సోమయాజులు, విషాదము, మృత్యువు దాని జ్ఞాపకము అనే కథలు వెలువరించాడు. ఇందులో మృత్యువు దాని జ్ఞాపకము మ్యూజింగ్స్‌ మాదిరిగా ఉంటుంది. ఈ కథలో దొరతనము గురించీ, దానికి గ్రామంలోని కరణాలు, ఆయుర్వేద వైద్యులు తమ స్వలాభం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసే జీవితాల్ని, దాసిరాండ్రని వాడుకునే స్థితిని, ఆనాటి పాలమూరు జిల్లా సంఘటనల్ని రికార్డు చేసిండు.
1921లో ప్రారంభమైన నీలగిరి, తెనుగు పత్రికల్లో కథకుల పేర్లు లేకుండా తెలంగాణ జీవితాల్ని ప్రతిబింబించే విధంగా అనేక కథలు వెలువడ్డాయి. నీలగిరిలో నైజగుణము, సాతాని జియ్యర్‌, కాపు, దురాశ తదితర కథలు అచ్చయ్యాయి. ఇందులోని పాత్రలన్నీ హైదరాబాద్‌, వరంగల్‌, తెలంగాణ జీవితాలనే ప్రతిబింబించాయి. అలాగే తెనుగు పత్రికలో ఒద్దిరాజు సోదరులు తమ పేరు లేకుండానే స్థానిక అంశాలపై అన్యాపదేశంగా కథనాలు వెలువరించారు. ఇవి విషయాల్ని కథలుగా చెప్పాయి. ఇదే పత్రికలో ఇతరుల కథలు కూడా అచ్చయ్యాయి. 1927`30 మధ్యకాలంలో హైదరాబాద్‌ నుంచి సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడ్డ ‘సుజాత’ పత్రికలో వీరి రచనలు చాలా వెలువడ్డాయి.
భారతి పత్రికలో మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణ వాడి కథలు అచ్చుకావడమనేది వాసుదేవరావుతో ప్రారంభమయింది. పక్కా హైదరాబాదీ అయిన వాసుదేవరావు తొలి కథ ఆగస్టు,1924 భారతి సంచికలో ‘నేను జొన్నరొట్టె’ శీర్షికన అచ్చయింది. 1924`33 మధ్య కాలంలో డజనుకు పైగా కథలు అచ్చయ్యాయి. ఇందులో ఒకటి రెండు కథలు ప్రేమ్‌చంద్‌ కథలకు అనుసరణలు కాగా మిగతావన్నీ పక్కా హైదరాబాద్‌ ఠీవిని, ఆహార్యాన్ని, ఆహారపు అలవాట్లని పట్టిచ్చాయి. ‘ఆలోచన’, ‘ప్రయాణం’, ‘వివాహం’ సీక్వెల్‌ కథలు.
మూడిరటిలోనూ పెళ్ళిచూపులు, పెళ్ళి ఇతివృత్తం. ఒక దాంట్లో పెళ్ళి చూపులకు ఆంధ్ర ప్రాంతంలోని తన మామయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం, రెండో దాంట్లో అందుకోసం చేసిన ప్రయాణంలో జరిగిన సంఘటనలని, మూడో దాంట్లో పెళ్ళికి సంబంధించిన విషయాల్ని రికార్డు చేసిండు. బి.ఎ. పూర్తి చేసిన కథానాయకుడు ఇంగ్లండ్‌ వెళ్ళి ఎం.ఎ. చదవాలనుకుంటాడు. అలాగే హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.
సూటూ, బూటు నీటుగా టై వేసుకోవడం, విదేశీ అధికారుల మాదిరిగా తయారు కావడం, ఆంగ్ల భాషాభిమానం, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ సంస్కరణపట్ల ఆసక్తి, వితంతువివాహాలు, రజస్వాలానంతర వివాహాలకు సంబంధించిన విషయాలు ఈ కథల్లో ప్రస్తావనకు వస్తాయి. హైదరాబాద్‌ అస్తిత్వాన్ని, సంస్కృతిని, మాట తీరుని, భాషని, వ్యంగ్యాన్ని చాలా హృద్యంగా వాసుదేవరావు ‘‘నేనా? నేనా? నేను హైదరాబాదు `దక్కనీ! నా హృదయం వేరే. వాళ్ళ హృదయం వేరే. నేనూ వాళ్ళవంటి వాణ్ణే అయితే అయిదు కాదు పదేను వేలిస్తే గాని పెళ్ళి చేసుకోనని పట్టుబట్టి కూర్చుందును. పెద్ద పెద్ద సభలలో వేదికల మీద నెక్కి సంఘసంస్కర్తలని పేరు పెట్టుకొని, సంస్కార విషయాలు పెద్ద పెద్ద లెక్చర్లిచ్చి (బహిరంగంగా) లోలోపల, వందలు వేలు కట్నాలు పుచ్చుకొనే ఆంధ్ర బ్రాహ్మణులెక్కడ? నేనెక్కడ ఈ వ్యత్యాసం నీకు కనబడలేదామ్మా?’’ అంటూ హైదరాబాద్‌(దీ) ఔన్నత్యాన్ని ‘ఆలోచన’ కథలో చాటి చెప్పిండు.
కథానాయకుడి డ్రెస్సింగ్‌ చూసి అతను యూరోపియనా? అనే అనుమానం కలిగిందంటే ఆనాటి హైదరాబాదీ ఆహార్యాన్ని అర్థం చేసుకోవచ్చు. బడాయి కూడా అలానే ఉండేదని తల్లి పాత్ర ద్వారా వాసుదేవరావు చెప్పిస్తాడు. ఇవి గాకుండా ‘నేను జొన్నరొట్టె’, ‘పిశాచం’, ‘ఇదియేనా పునర్వివాహం’, మాటీలు, సుప్రభాతము, ముద్దుటుంగరము, అనర్థం, సంశయం తదితర కథలు హైదరబాదీ హృదయంతో వెలువడ్డాయి. వాసుదేవరావు లాగానే పక్కా హైదరాబాదీ తర్వాతి కాలంలో జడ్జిగా పనిచేసిన నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథానికలు రాసిండు.
నందగిరి వెంకటరావు (1909`1985)  తెలంగాణ తొలితరం కథకుల్లో అగ్రగణ్యుడు. 1926`35 సంవత్సరాల మధ్యకాలంలో 50కి పైగా కథలు రాసిన ఈయన రచనలేవి పుస్తక రూపంలో రాకపోవడంతో వాటికి తగిన గుర్తింపు దక్కలేదు. ‘గిరి’ అనే కలం పేరుతో భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికల్లో ఈ కథలు అచ్చయ్యాయి. 1935లోనే ప్రథమ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిన వెంకటరావు భార్య నందగిరి ఇందిరాదేవి కూడా చాలా కథలు రాసింది.
ఆంధ్రమహాసభ నాయకుడిగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జైలుకెళ్లిన స్వాతంత్య్ర యోధుడిగా, జడ్జిగా, గ్రంథాలయోద్యమ కార్యకర్తగా, స్త్రీవిద్య ప్రచారకుడిగా నందగిరి వెంకటరావు చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథా సాహిత్యాన్ని సృజించిన అరుదైన ప్రతిభాశాలి నందగిరి వెంకటరావు.
తెలుగు సాహిత్యం ముఖ్యంగా కథానికా సాహిత్యం దేదీప్యమానంగా వెలుగడానికి చమురునెంతో సరఫరా చేసిన వాడు నందగిరి. కథానికా సాహిత్యంలో తనకంటూ ఒక శైలిని ఏర్పర్చుకొని లో చూపుతో విశ్లేషించి, మానవ సంబంధాల్ని మానవీయ కోణంలో సున్నితంగా సృజించి జీవితాల్ని చిన్న కాన్వాస్‌పై ‘కథ’గా చిత్రీకరించిన అక్షర పెయింటర్‌ నందగిరి. హైదరాబాద్‌ హిందూ`ముస్లిం సంస్క ృతి, తెలంగాణ జీవితాల్ని కథలుగా మలిచిండు. 1935కు ముందే హైదరాబాద్‌ కేంద్రంగా జరిగే జాతీయ ఉద్యమాల్ని తన కథల ద్వారా అక్షర రూపమిచ్చిండు.
హైదరాబాద్‌ తెహజీబ్‌, హిందూ`ముస్లిం పండుగలు, సంస్కృతి, మతాలకతీతమైన రొమాన్స్‌, హిందూ`ముస్లిం ప్రజల సంబంధాల్ని, జీవన విధానాన్ని నందగిరి చిత్రికగట్టినంత సున్నితంగా ఇంకెవ్వరూ రాయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతిఫలం, నూర్జహాన్‌, తప్పేమి, జరిగిన కథ మొదలైన కథల్లో హైదరాబాదీ ముస్లిం జీవితం, సంస్కృతి వ్యక్తమయ్యింది. నందగిరి అటు ఆంద్రమహాసభ ఉద్యమంలోనూ, గ్రంథాలయోద్యమంలోనూ, పత్రికోద్యమంలోనూ చురుగ్దా పాల్గొన్న వాడు కావడంతో ఆయన రచనలు అందరికన్నా ఒక అడుగు ముందున్నాయి. చలంతో పోటీపడి తెలంగాణ నుంచి కథలు రాసి యావత్తెలుగు ప్రజల్ని మెప్పించిన కథకుడు నందగిరి వెంకటరావు.
తెలంగాణ సాయుధపోరాటారంభానికి 15 యేండ్ల ముందే దొరల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ‘పటేలుగారి ప్రతాపం’ పేరిట కథ రాసిండు. గ్రామ పటేలు తన మాట వినని రామయ్య అనే రైతును కొట్టడమే గాకుండా వితంతువైన ఆయన సోదరిని అల్లరి చేయడం. దీనికి పటేలు తల్లి కూడా మద్దతుగా ఉండి నీ తండ్రి కాలంలో  ఎదురు తిరిగి మాట్లాడిన వాడు లేడు అని కొడుకుని రెచ్చగొట్టడం, అడ్డు వచ్చిన వారిని బెదిరించడం జరిగింది. దాదాపు ఇలాంటి ఘటనే సాయుధ పోరాట కాలంలో జరిగింది. ఈ కాలంలో విసునూరి దొరలు ఇలాగే దౌష్ట్యానికి దిగారు. విసునూరి ‘బాబుదొర’ను ప్రజలు చంపేసినట్లుగానే ఈ కథలో కూడా ప్రజలు దొరను చంపేస్తారు. అయితే వాస్తవానికి జరిగిన సంఘటనకన్నా 15 యేండ్లకు ముందే నందగిరి వెంకటరావు పటేలుగారి ప్రతాపంలో ఇవే సంఘటలను చిత్రీకరిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పరోక్షంగా చెప్పిండు. చిత్రచోరులు కథలో ఒక అంశాన్ని భిన్న కోణాల్లో చూసే తెలంగాణ`ఆంధ్రవారిని గురించి రాసిండు.
తెనుగు పత్రికలో డిటెక్టివ్‌ కథలు కూడా అచ్చయ్యాయి. హైదరాబాద్‌ అమ్మాయి సినిమాల పట్ల వ్యామోహంతో ఆనాడే బొంబాయికి వెళ్ళి ఆ మాయలో చిక్కుకు పోయిన విషాదాన్ని నందగిరి వెంకటరావు తన కథల్లో చెప్పిండు. ఇదే కాలంలో ఒద్దిరాజు సోదరులు వివిధ పత్రికల్లో తమ రచనలు వెలువరించారు. వీరి కథలు ఎక్కువగా వారు వెలువరించిన తెనుగు పత్రికతో పాటు ‘సుజాత’ పత్రికలో అచ్చయ్యాయి. ఒద్దిరాజు సీతారామచంద్రరావు తెలుగులో తొలిసారిగా వైజ్ఞానిక కథలు రాసిన వాడిగా ప్రసిద్ధుడు. దీనికి నిదర్శనం ‘అదృశ్యవ్యక్తి’ కథానిక. ‘నటి’ కథలో జమీందారి కుటుంబానికి చెందిన నళినీకాంతుడు నటి తారాదేవితో సాన్నిహిత్యంగా ఉంటాడు. నళినీకాంతుడి సోదరులు తారాదేవిని వదిలిపెట్టాలని వత్తిడి తీసుకొస్తారు. కొంతమంది యూరోపియన్‌ మిత్రులు పెళ్ళి చేసుకొమ్మని సలహా ఇస్తారు. దాంతో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతాడు, అయితే తార పశ్చాత్తాపంతో నళినీకాంతుడికి ఉత్తరం రాస్తుంది. ప్రేమానుభవం కంటే ప్రేమ స్మృతి గొప్పదని అదే అధిక మాధుర్యం కలదిగా తోస్తుందని, వివాహమాడి భార్యతో సుఖంగా ఉండమని రాస్తుంది. హితబోద చేసినట్టుగా కథ ముగుస్తుంది. ఈయన కథలపై బెంగాళీ రచనల ప్రభావముంది. ఇక సీతారామచంద్రరావు సోదరుడు రాఘవరంగారావు తెలంగాణలో దేశ్‌ముఖ్‌ల, జమీందారుల జీవితాల్ని కథల్లోకి తెచ్చిండు. ‘లండన్‌ విద్యార్థి’ కథలో దేశ్‌ముఖ్‌ల సోమరితనం, విలాసాలు, మరో వైపు ఇంగ్లండ్‌లో విద్యాభ్యాసంపై మోజుని చెప్పిండు.
భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు. అంబేద్కర్‌ కన్నా ముందు మొత్తం జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాయకుడు. ఈయన హైదరాబాద్‌ నుంచి ‘భాగ్యనగర్‌’ అనే పత్రిక తీసుకొచ్చాడు. ఇందులో వెట్టిమాదిగ పేరిట ఆనాటి సమాజంలో ఉన్నటువంటి దళితుల దుర్భర జీవితాన్ని తెలియజెప్పిండు. రామిరెడ్డి దురహంకారానికి బలయిన వంతు మాదిగ మల్లయ్య గురించి ఇందులో వివరించిండు. దీనికి కొనసాగింపుగా సురవరం ప్రతాపరెడ్డి అనేక కథలు రాసిండు. ప్రతాపరెడ్డి కథలు ముఖ్యంగా ‘సంఘాల పంతులు’ కథలో పంతులు ఊరి మాదిగలను, కోమట్లను కూడగట్టి వెట్టిచాకిరి, సప్లయిలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాడు. సంఘం అంటే కమ్యూనిస్టు సంఘమనే భావనలోనే ఆ పదాన్ని సురవరం వాడారు. తెలంగాణ వాతావరణ నేపథ్యంతో పాటు, పదాలు, తెలంగాణ ఆత్మని పట్టిస్తాయి. ఈయన మొగలాయి కథలు కూడా ఆయన విశిష్టతను చాటి చెబుతాయి. కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందిన వెంకట రాజన్న అవధాని ‘తిరుగుబాటు’ కథలో స్త్రీ విద్య, సంస్కరణ గురించి రాసిండు. ఖమ్మంకు చెందిన దాశరథి కవిత్వంతో పాటు కథలు కూడా రాసిండు.
వీరితో పాటు మాడపాటి రామచంద్రుడు, జి.రాములు, జమలాపురం వెంకటేశ్వర్లు, శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు, జమలాపురం వెంకటేశ్వర్లు, తదితరులు ఖమ్మం, కరీంనగర్‌, నల్లగొండ ప్రాంతాల్లోని జీవితాలను రికార్డు చేసిండ్రు. నల్లగొండకు చెందిన బోయనేపల్లి రంగారావు, గం. గోపాలరెడ్డి తదితరులు కూడా ఆనాడు తెలంగాణ తనాన్ని కథల్లో చిత్రించారు. వీరిలో కథకుడు జి.రాములు మాజీ జడ్జి జీవన్‌ రెడ్డి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, ఎన్నో వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన జి. రాంరెడ్డిలకు విద్యా గురువు. ఈయన పెరటి చెట్టు, బ్రహ్మపుత్ర భక్త సమాజం, ఆత్మఘోష, పిచ్చి శాయన్న, కొత్తదాసి కనకం తదితర కథలు బహుజన దృక్కోణం నుంచి తెలంగాణను ఆవిష్కరించాయి. పెరటిచెట్టు కథలో గౌడ కులస్థుల జీవన వ్యథల్ని చెప్పిండు. ఇందులో దున్నేవాడిదే భూమి అన్నట్టు గీసేవాడిదే చెట్టు అని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
1943లో ఆంధ్రప్రాంతంలో ఆరంభమయిన అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలకు తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధిగా వట్టికోట ఆళ్వారుస్వామి హజరయ్యిండు. ఆ తర్వాత ఆంధ్రలో జరిగిన ప్రతిసమావేశానికీ విధిగా ఆళ్వారుస్వామి హాజరయ్యిండు. 1944 నాటి భువనగిరి ఆంధ్రమహాసభల్లో కమ్యూనిస్టులు`కాగ్రెస్‌ వారికి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జేసిండు. కాంగ్రెస్‌లో కమ్యూనిస్టుగా, కమ్యూనిస్టుల్లో కాంగ్రెస్‌ ఆలోచనాపరుడిగా సంఘసంస్కరణకు పాటుపడే విమర్శకుడిగా, కార్యశీలిగా ఆళ్వారుస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, సత్యాగ్రహాల్లో విశిష్ట భూమిక పోషించిండు. పౌరహక్కుల కోసం పోరాడిరడు. జైల్లో దాశరథితోపాటు ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిండు.
తెలుగుతల్లి పత్రిక ప్రచురణ ద్వారా హైదరాబాద్‌లో అడివిబాపిరాజు, రాంభట్ల కృష్ణమూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు తదితరులతో కలిసి నగరంలో అభ్యుదయ రచయితల సంఘానికి ప్రాణం పోయడమే గాకుండా, ఆంధ్రప్రాంతంలో కూడా అరసంకు ఆసరాగా నిలిచిండు. ఈ సమయంలోనే వరంగల్‌లో జరిగిన మజ్లిస్‌ సభల్లో బహదూర్‌ యార్జంగ్‌ తన ఆవేశ పూరిత ప్రసంగంలో ‘‘హైదరాబాద్‌ రాజ్యం ఆలాహజ్రత్‌ సొంత జాగీరు కాదు. ఈ రాజ్యం ఏ ఒకరిదో అనుకుంటే అందుకు బలికావాడానికి నేను సిద్ధంగాలేను. ఇది ముస్లిం ప్రజలందరి ఆస్తి’’ అని చెప్పిండు. ఆ తరువాతి సంవత్సరం నిజాం ఇచ్చిన విందులో హుక్కా పీల్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు. అనంతరం మజ్లిస్‌ పగ్గాలు కాసీంరజ్వీ చేతుల్లోకి వెళ్ళాయి. ఆయనే రజాకార్ల ఉద్యమాన్ని లేవదీసిండు. మత పరమైన ఉద్రిక్తతలు ఒకవైపూ, అరసం కార్యకలాపాలు మరోవైపూ హైదరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహించాయి.
1946లో సాయుధ రూపం తీసుకున్న ‘రైతాంగ పోరాటం’, 1948లో ‘పోలీస్‌ యాక్షన్‌’, 1951లో పోరాట విరమణ, 1952లో మిలిటరీ పాలన, ఎన్నికలు, మిత్రుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పాలన, ముల్కీ ఉద్యమం, 1953లో ఆలంపూరులో అఖిలాంధ్ర సారస్వత సభ, 1955లో ఆంధ్రలో ఎన్నికలు, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు 46 ఏండ్ల ఆళ్వారుస్వామి జీవితంపై ప్రభావం చూపిన అంశాలు. ఇవి ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. అలాగే రెండు విడతలుగా జైలుశిక్ష, కమ్యూనిస్టుల ఏకపక్ష ధోరణి, బాధ్యతారాహిత్యం అన్నీ కలగలిసి ఆళ్వారుస్వామిని చివరి పదేళ్ళు పుస్తక ప్రచురణ, రచనా రంగానికే పరిమితం చేశాయి. ఈ కాలంలోనే ఆళ్వారుస్వామి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రవేసే, ఉన్నత విలువల్ని ప్రతిష్టించే రచనలు చేసిండు.
‘తెలంగాణ మంటల్లో’ అనే కథా సంకలనాన్ని 1948లోనే వెలువరించిన అడ్లూరి అయోధ్యరామకవి స్వతహాగా కవి, గాయకుడు, జర్నలిస్టు. ‘నైజాం ప్రజావిజయం’ అనే బుర్రకథ, ఘంటారావంతో పాటు అనేక ఖండికలను రాసిన ఈయన బాంబుల భయం, కాలాన్ని తేవాలి, తల్లి ప్రేమ, చీకటి రాజ్యం, జనానా రజాకార్‌, అమరలోక యాత్రికులు అనే కథలు రాసిండు. ఇందులో ‘బాంబుల భయం’ కథలో సాయుధ పోరాట సమయంలో గ్రామ రక్షణ దళాలు సిరిపురం పై రజాకార్ల దాడిని అడ్డుకున్న అంశాన్ని చిత్రించాడు. సాయుధ పోరాట కాలంలో కాంగ్రెసు కార్యకర్తగా, దాశరథి కృష్ణమాచార్యతో కలిసి ప్రచారకుడిగా పనిచేసిన అడ్లూరి కథలన్నీ ఆనాటి పోరాటాన్ని చిత్రీకరించాయి.
కమ్యూనిస్టులు, ప్రజలు, కాంగ్రెస్‌, రజాకార్లు, దొరలు, గడీలు, సాయుధ పోరాటం, జైలు అన్నీ ఈయన కథాంశాలయ్యాయి. ఈయనతో పాటు కాళోజి నారాయణరావు కూడా సాయుధ పోరాట సమయంలో కథలు రాసిండు. కాళోజి రాసిన లంకాదహనం ఉద్యమానంతర పరిస్థితుల్ని రికార్డు చేశాయి. ఆశించిన ఫలితాలు అందకుండా పోయిన స్థితిని ఇందులో కాళోజి రికార్డు చేసిండు.
సాయుధ పోరాటం కన్నా ముందు నుంచే గోలకొండ పత్రికలో కథలు రాసిన వారిలో అగ్రగణ్యుడు భాస్కరభట్ల కృష్ణారావు. 1939 నుంచీ కథలు రాస్తూ వచ్చిన భాస్కరభట్ల మూడు కథా సంపుటాలు ప్రచురించాడు. మొదటి సంపుటం 1955లో ‘కృష్ణారావు కథలు’ పేరిట, తర్వాత ‘చంద్రలోకానికి ప్రయాణం’, ‘వెన్నెల రాత్రి’ పేరిట మిగతా రెండు సంపుటాలు ప్రచురితమయ్యాయి. ఈయన మొత్తం తెలంగాణ కథకుల్లో ముందు వరుసలో నిలబడాల్సిన వాడు. జన్మత: తెలంగాణ వాడు కావడంతో ఆయన కథల్లో తెలంగాణ మట్టి వాసన కనబడుతుంది. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, బాధలు, సంతోషాలు అందులో కనిపిస్తాయి.
భాస్కరభట్లకు బాగా పేరు తీసుకు వచ్చిన కథ ‘ఇజ్జత్‌’. ఇందులో కౌలుకు తీసుకున్న భూమిలో పంటలు సరిగా పండక పోవడంతో మల్లయ్య అనే రైతుల కౌలు చెల్లించ లేక పోతాడు. ఇందుకు అతనికి ‘శిక్ష’ వేస్తారు. ఆ అవమానాన్ని భరించలేక ఉరిబెట్టుకున్న రైతు కథను ఇందులో చిత్రీకరించాడు. భూసంస్కరణల అమలు చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో  పేద రైతు దీనస్థితిని ఈ కథలో భాస్కరభట్ల కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఈ కథ 1944లో మీజాన్‌ పత్రికలో అచ్చయ్యింది. మల్లయ్య అనే రౌతు రంగారావు పొలం కౌలుకి తీసుకొని క్రమం తప్పకుండా కౌలు గింజలు చెల్లిస్తూ ఉండేవాడు. అయితే కాలం సరిగా కాకపోవడంతో, కుంటకు గండిపడడం లాంటి ఇబ్బందులకు తోడుగా ఈ మధ్యనే కూతురు పెళ్ళి చేశాడు. దీంతో ఖర్చులో పడ్డాడు. అందువల్ల కౌలు గింజలు ఇవ్వలేక పోయాడు. గండి పూడ్చగల తాహతు మల్లయ్యకు లేదు. పైగా భూసంస్కరణల చట్టం ఒకటి వచ్చి పడుతోంది. ఈ పరిస్థితిలో తన కౌలుగింజల బకాయి రాబట్టుకోవడానికి రంగారావు గట్టి ప్రయత్నం చేస్తాడు. మల్లయ్య ఎంత ప్రాధేయపడినా ఫలితం లేక పోయింది. అతనికి శిక్ష వేస్తారు. వంగబెట్టి వీపుమీద బండ పెట్టించారు.
కొంత సేపటికి మల్లయ్య స్పృహ తప్పి పడిపోయాడు. సేదదీర్చి ఎవరో పుణ్యం గట్టుకున్నారు. అతని భార్య గొల్లున ఏడుస్తూ వస్తుంది. ఆమెతో ‘ఇజ్జత్‌’ పోయిందే పిల్లా అని చెబుతూ పరువు పోవడంతో బతకడం కష్టమని తలంచి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని చనిపోతాడు. ఇందులో రైతుల కష్టపడే గుణాన్ని, కౌలుదారీ విధానం గురించి కథకుడు చెబుతాడు. ఆఖరికి ఆత్మాభిమానం మెండుగా గల రౌతు ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఇది 1944నాటి తెలంగాణ రైతుల స్థితిగతుల్ని లెక్కగడుతుంది.    మీజాన్‌ పత్రికలోనే 1945లో వెలువడ్డ మరో కథ ‘మార్పు’. ఇందులో దేవుడి మొక్కును వాయిదా వేసుకునేందుకు సాకులు వెతికే భర్త గురించి చెప్పాడు. చివరికి ఖైరతాబాద్‌లోని ఆంజనేయ గుడికి వచ్చి మొక్కు చెల్లించుకునేలా భర్తని మార్చిన భార్య గురించి చెప్పాడు. ఖైరతాబాద్‌లో ఆంజనేయ స్వామి గుడి ఇప్పటికీ ప్రతి శనివారం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది.
అలాగే మరో కథ ‘సానుభూతి’, ‘హృదయ పరివర్తనం’ కథల్లో మధ్యతరగతి ప్రజల్లోని అవకతవకలను ఎత్తి చూపిస్తూ వాటి నుంచి విముక్తులు కావాలని హెచ్చరిస్తాడు. ‘అవమానం’అనే కథలో స్వార్థపరుల నీచత్వాన్ని నగ్నంగా చూపించి, ఆత్మవంచన చేసుకునే వారికి గుణపాఠం చెప్పాడు.
హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలల్లో, కథల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయి. ‘యుగసంధి’ నవల్లో రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ఆధునిక భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి. భాస్కరభట్ల  మీద ఉన్న ప్రేమతో నెల్లూరి కేశవస్వామి తన ‘పసిడి బొమ్మ’ కథా సంపుటిని అంకితమిచ్చాడు.
నెల్లూరి కేశవస్వామి కూడా పక్కా హైదరాబాదీ. ఈయన కథల్లో హిందూ`ముస్లింల మైత్రి, ప్రేమ, ఆచార వ్యవహారాలు, అంతర్లీనంగా నవాబుల పోకడలు అన్నీ ప్రతిఫలిస్తాయి. ‘పోలీసుచర్య’కు పూర్వం హైదరబాద్‌ నగరంలో ఉన్న జీవన స్థితిగతుల్ని ముఖ్యంగా ముస్లింల జీవితాలని నెల్లూరి కేశవస్వామి హృద్యంగా చిత్రీకరించాడు. ‘యుగాంతం’ అనే పెద్ద కథలో పోలీసుచర్య నాటి జీవన విధ్వంసాన్ని చిత్రించాడు. ‘చార్మినార్‌’, ‘పసిడి బొమ్మ’ పేరిట కథా సంపుటాలను వెలువరించాడు. సంపుటాల్లో చేరని కథలు ఇంకా చాలా ఉన్నాయి.
వీరితో బాటుగా వరంగల్‌కు చెందిన పెండ్యాల చినరాఘవరావు, ఖమ్మంకు చెందిన బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, హీరాలాల్‌ మోరియా, ఊటుకూరి రంగారావు, కవిరాజమూర్తి, దాశరథి తదితరులు తెలంగాణ జీవితాల్ని తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. వీరందరూ ఉర్దూలో కూడా నిష్ణాతులే కావడం విశేషం. బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి స్వయంగా కథలు రాయడమే గాకుండా ఉర్దూ కథల్ని తెలుగులోకి అనువదించారు. హీరాలాల్‌ మోరియా ఎక్కువగా ఉర్దూలో కథలు రాసిండు. వీటిని ఊటుకూరి రంగారావు తెలుగులోకి అనువదించేవారు. ఈయన స్వయంగా కథకుడు కూడా. ఇక కవిరాజమూర్తి అయితే ఏకంగా ఉర్దూలో నవలలే రాసిండు. ఇవి కూడా ఉర్దూ నుంచి తెలుగులోకి తర్జుమా  చేయబడ్డాయి.
హైదరాబాద్‌లో మొదటి నుంచీ పంచభాషా సంస్కృతి ఉండేది. హైదరబాదీయులందరికీ గతంలో ఐదు భాషలు అవలీలగా వచ్చేవి. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడం, ఇంగ్లీషు భాషలు హైదరాబాద్‌లో నివాసముండే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాట్లాడగలిగేవారు. నిజాం ప్రభుత్వం విధిగా తమ కార్యకలాపాలన్నింటినీ ఈ ఐదు భాషల్లో నిర్వహించేది. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నందగిరి వెంకటరావు, నెల్లూరి కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, కాళోజి నారాయణరావు, పొట్లపల్లి రామారావు, బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి, కవిరాజమూర్తి, ఊటుకూరి రంగారావు, హీరాలాల్‌ మోరియా, బూర్గుల రంగనాథరావు, వట్టికోట ఆళ్వారుస్వామి,  కాంచనపల్లి చినవెంకటరామారావు ఇంకా అనేకమంది తెలుగుతో పాటుగా ఉర్దూలో కూడా రచనలు చేయదగ్గ సమర్ధులు. నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథలు రాసిండు. కవిరాజమూర్తి, పొట్లపల్లి రామారావులు తెలుగుకన్నా ఎక్కువగా ఉర్దూలో తమ రచనలు వెలువరించిండ్రు.
అయితే ఈ బహుభాషా సంస్కృతి హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం అంతరించి పోయింది. పోలీసుచర్య తర్వాత ఏర్పడ్డ పరాయి పాలన, వలసాంధ్రాధిపత్యం, హిందీ ప్రాభవం అన్నీ కలగలిసి పంచభాషా సంస్క ృతిని మట్టుబెట్టాయి. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు హైదరాబాద్‌ రాజ్యంలో అంతో ఇంతో ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీలకు ఆదరణ లభించినప్పటికీ తర్వాత కనుమరుగయ్యాయి.
1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డ తర్వాత తెలుగుని మాత్రమే ముందుకు తీసుకువచ్చి ఆ భాషలోనూ తెలంగాణేతరులు రాసిన రచనలే గొప్పగా ప్రచారం కావడంతో వాటికి మాత్రమే గౌరవం దక్కింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడం వల్ల తెలంగాణకు జరిగిన పెద్ద నష్టమిది. బహుభాషా సంస్కృతి, కాస్మోపాలిటన్‌ కల్చర్‌కి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గొడ్డలి పెట్టయ్యింది. 1956 కు ముందు ఇంకా చెప్పాలంటే 1948 సెప్టెంబర్‌కు ముందు హైదరాబాద్‌ రాజ్యం నుంచి తెలుగులో వెలువడ్డ కథ, నవల, కవిత్వానికి తర్వాతి కాలంలో సరైన ఆదరణ లభించలేదు. ఇప్పటికైనా ఆనాటి అమూల్యమైన రత్నాలను వెతికి వెలుగులోకి తీసుకొచ్చి మన సాహిత్య చరిత్రను పునర్నిర్మించుకోవాలి. తెగిన తల్లివేరు భాషను బతికించుకోవాలి. ఇవన్నీ ఆనాటి రచనలను ఒక్కొక్కటిగా సంకలనాలుగా వెలువరించడం ద్వారా సాధించవచ్చు.
ఆనాటి రచనలను పునర్ముద్రించుకోవడం ద్వారా కనుమరుగై, గౌరవానికి నోచుకోకుండా పోయినా తెలంగాణ అస్తిత్వానికి చిత్రిక గట్టవచ్చు. మనమూ చరిత్రకెక్కదగిన వారమే, ఎవరికీ ఎందులోనూ తీసిపోము, మీదు మిక్కిలి ఆగమైన మన ఘనమైన చరిత్రను చెక్కిలిపై రాపాడిరచుకోవడానికి, నెత్తిన పెట్టుకొని ఊరేగించడానికి  ఈ అస్తిత్వ కథలు సమగ్ర సంకలనాలుగా వెలువడాల్సిన అవసరముంది.
-సంగిశెట్టి శ్రీనివాస్‌

హైదరాబాద్‌ చెప్పుకున్న ఆత్మకథ ‘యుగసంధి’

హైదరాబాద్‌ చెప్పుకున్న ఆత్మకథ ‘యుగసంధి’

sangisetti- bharath bhushan photoహైదరాబాద్‌ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక జీవనానికి అక్షరరూపం భాస్కరభట్ల కృష్ణారావు నవలలు. 1950-66ల మధ్య మొత్తం నాలుగు నవలలు రాసిన ఈయన పైదాయిషీ హైదరాబాదీ.
నగరం స్మృతిని, జీవితాన్ని, జీవితాల్లోని సంఘర్షణలను, ఆలోచనలను, ఉన్నత ఆదర్శాలను, అంతకుమించి అత్యున్నత జీవిత విలువల్ని ఒకవైపూ ఛిద్రమవుతున్న బతుకుల్ని, చిదిమేస్తున్న దోపిడీ వ్యవస్థ, దానికి అండగా నిలిచిన వెన్నెముకలేని రాజకీయాలు, అన్ని విధాలుగా భాగ్యవంతులైన వారు అభాగ్యులుగా మారిన అమానవీయతను మరోవైపూ తన నవలల్లో కృష్ణారావు అక్షరీకరించారు.
హైదరాబాద్‌ నగర జీవితానికి సంబంధించినంత మేరకు భాస్కరభట్ల కృష్ణారావు నవలలు ఒక డాక్యుమెంటరీ. ప్రస్తుతం ‘అభివృద్ధి’ ఆవరించి మెట్రో రైలుపేరిట నగరాన్ని దిగమింగుతున్నాయి. చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. సుల్తాన్‌ బజార్‌లాంటి నవలల్లోని ప్రదేశాలు రూపుమారనున్నాయి. కోఠీ విమెన్స్‌ కాలేజి కళావిహీనం కానుంది. వందల యేండ్లుగా సజీవ సంఘటనలకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రదేశాలు మూగగా రోదిస్తూ రూపు మార్చుకుంటున్నాయి. తరిగిపోతున్న, నాశనం అవుతున్న ఒక చారిత్రక వారసత్వాన్ని ఈ నవలలు దివిటీపట్టి ఆకాశమెత్తు ఎత్తి చూపించాయి. ఇట్లాంటి నగరంపై, నగర చరిత్రపట్ల, సంస్కృతి పట్ల ఎలాంటి పట్టింపులేని పాలకులు, ప్రతిపక్షాలు ఒకేరీతిలో ప్రజాభిప్రాయాన్ని ‘బుల్‌డోజ్‌’ చెయ్యడమే పనిగా పెట్టుకున్నాయి.
‘బుల్‌డోజ్‌’కు గురవుతున్న చరిత్ర, సంస్కృతిని, సాహిత్యాన్ని కాపాడుకునేందుకు కొత్తతరం నడుంకట్టేందుకు కృష్ణారావు నవలలు స్ఫూర్తి కావాలి. యుగసంధి  నవల మొదట 1956లో ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో సీరియలైజ్‌ అయింది. తర్వాత 1957లో నవలగా వెలువడింది. ఇందులో 1920- 48 మధ్య కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా మొత్తం తెలంగాణలో చోటుచేసుకున్న సకల మార్పులు, ఉద్యమాలు, ఉద్వేగాలు, జీవితాలు, ఆర్థిక ప్రగతి, ఆదర్శాలు అన్నీ కలగలిసి ‘యుగసంధి.’.
ఐదారు దశాబ్దాల క్రితం వచ్చిన నవలల గురించి వర్తమానంలో చర్చించి, వ్యాఖ్యానించడం అంటేనే చరిత్రతో సంభాషించడం! ఈ సంభాషణలో గతంలో పాదుకొని ఉన్న కొన్ని ఉన్నత విలువలు ఈనాడు ఎక్కడా వినబడడం లేదు. మీదుమిక్కిలి ఆనాడు సమాజంలో ఉన్న అవలక్షణాలు ఈ ఆరున్నర దశాబ్దాల ప్రజాస్వామిక పాలన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువగా వేళ్ళూనుకు పోయాయి. ఇది జాతి ప్రయాణిస్తున్న తిరోగమన దిశను సూచిస్తుంది. ఈ తిరోగమనానికి అనేక కారణాలు ఉన్నాయి. విలువలు నశించడం ఒక కారణం. నాశనం చేయడమే విలువలుగా చలామణి అవుతున్న కాలంలో మనం ఉన్నాము.
ఇట్లాంటి సందర్భంలో చారిత్రక విషయాలపై అవగాహన రాహిత్యంతో చేసే వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలిస్తాయి. నిజానికి ఒక సంఘటన జరుగుతున్నకాలంలో వాటిని చూసి అనుభవించి వ్యాఖ్యానిస్తే వాటిపై భావోద్వేగాల ప్రభావం ఉంటుంది. అందువల్ల రచయితకు ఆనాడు ఉన్న అభిప్రాయం భవిష్యత్తులో మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంఘటన వాడి వేడిలో రూపుదిద్దుకునే అభిప్రాయం ఆ తర్వాతి కాలంలో పరిశోధనలు, భిన్న పార్శ్వాల నుంచి వ్యక్తుల వ్యాఖ్యానాల, విశ్లేషణ మూలంగానూ, స్వయంగా వ్యక్తి జ్ఞానం, ఆలోచనల్లో మార్పు మూలంగానూ మార్చుకునే అవకాశముంది.
ఆనాటి వుద్యమాల డాక్యుమెంటు
1921 మొదలు 1948 వరకు తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ ‘యుగసంధి’ నవలలో రికార్డయ్యాయి. ఉద్యమాలకు నవలలోని పాత్రలకు విడదీయరాని సంబంధం ఉండడంతో ఈ అంశాలు చొప్పించినట్లుగాకుండా సాఫీగా సాగిపోతాయి. ఆంధ్రమహాసభ మొదలు హైదరాబాద్‌పై పోలీసు చర్య వరకు వివిధ ఉద్యమాలు ఇందులో విస్తృతంగా చర్చకు వచ్చాయి. మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సందర్భంలో సంప్రదాయ, అంధ విశ్వాసాల/ మూఢనమ్మకాలను ఆచరించే వర్గానికి, ‘అభ్యుదయ’ భావాల ఆచరించే వారి మధ్యన జరిగే ఘర్షణను ‘యుగసంధి’గా ఆవిష్కరించాడు రచయిత. నిజానికి ఈ రచయిత కథలు, నవలలు 1940-60వ దశకంలో చదువుకున్న తెలంగాణ వారందరికీ గ్రాహ్యమే. గోలకొండ పత్రిక, దక్కన్‌ రేడియో ద్వారా తెలంగాణ సాహితీ ప్రియులందరికీ పరిచయమే!
హైదరాబాద్‌ స్టేట్‌ అస్తిత్వం కనుమరుగై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరిస్తున్న సందర్భంలో వచ్చిన ‘యుగసంధి’ నవలలో ఒక రాజ్యం అంతర్థానమై ఇంకొక రాష్ట్రం ఏర్పాటు సంధి కాలంలో హైదరాబాద్‌ ముఖ చిత్రాన్ని నవలాకర్త ఆవిష్కరిస్తాడు. నవల హైదరబాద్‌పై పోలీసు చర్యతో ముగిసినా ఆ తర్వాతి కాలంలో ఈ అంశాలేవి తెలుగు సమాజానికి పాఠ్యపుస్తకంగా గానీ, సాహిత్య రూపకంగా గానీ అందుబాటులోకి రాకపోవడంతో దీనిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. ఇది ఒక్క భాస్కరభట్ల కృష్ణారావుకు జరిగిన అన్యాయం కాదు. 1956కు ముందు సాహిత్యసృజన చేసిన తెలంగాణ సాహితీవేత్తలందరికీ జరిగిన అన్యాయం. ఇక్కడి వారు ప్రచారానికి విముఖులు కావడం ఒక కారణం కాగా, వారి గురించి, వారి రచనల గురించి విమర్శ, విశ్లేషణ, చర్చ తెలుగు పత్రికల్లో తగినంతగా జరుగకపోవడం మరో కారణం.
ఈ కారణంగానే అటు ఒద్దిరాజు సోదరులు మొదలు సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి తదితరులెవ్వరికీ న్యాయంగా తెలుగుసాహిత్యంలో న్యాయంగా దక్కాల్సిన స్థానం దక్కలేదు. తెలంగాణ సాహిత్యాన్ని కేవలం సాయుధ పోరాటంతో ముడివేసి చూడడం కారణంగానే అంతకుముందూ ఆ తర్వాత వచ్చిన సాహిత్యానికి గుర్తింపు లేకుండా పోయింది. తెలంగాణ సాహిత్యం తెలుగు సాహిత్యంలో ఉపశీర్షికలకు, ఫుట్‌నోట్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త పరిశోధనలకు, కొత్త రచనలకు ఊతమిస్తున్నాయి. ఇదే విషయాన్ని భాస్కరభట్ల కృష్ణారావు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘న్యూరైటింగ్‌’ పేరిట అనేక రచనలు వెలువడ్డాయని, ఎక్కడైనా పోరాటం ఉంటేనే సాహిత్య సృజన ఎక్కువగా ఉంటుందని చెప్పకనే చెప్పిండు.
bhaskerabhatla-1
అందుకే ఇప్పటికీ తమ హక్కుల కోసం, పీడన నుంచి విముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆఫ్రికన్స్‌, ‘బ్లాక్స్‌’ (పాజిటివ్‌ అర్థంలోనే) సృష్టిస్తున్న సాహిత్యం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది. ఈ సాహిత్యం మాదిరిగానే ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో వందల సంఖ్యంలో సంకలనాలు పది జిల్లాల నుంచి వెలువడుతున్నాయి. సంవేదనతో, ఆగ్రహంతో, పీడన నుంచి విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం పది జిల్లాల కవులు, కథకులు, రచయితలు తమ గళాన్ని, కలాల్ని, పిడికిళ్ళను ఎత్తిపడుతున్నారు. అదే విధంగా గతకాలపు ఆణిముత్యాలు కూడా కొత్తగా వెలుగులోకి తెస్తున్నారు. ఇప్పుడిక్కడ చర్చించుకుంటున్న ఈ నవలలు కచ్చితంగా జనం మరిచిన తెలంగాణను తెలుసుకునేందుకు అకరాలు అవుతాయి. గత కాలపు విస్మృత తెలంగాణను దర్శించేందుకు దివిటీలవుతాయి.
సరిగ్గా ఇవే విషయాలు ఇక్కడ మనం చర్చించుకుంటున్న నవలలకు కూడా వర్తిస్తాయి. ఇక్కడ గత కాలపు సంఘటన లేదా సంఘటనలను వర్తమానకాలంలో విశ్లేషించడమంటేనే వాస్తవాల్ని వాస్తవాలుగా వెలుగులోకి తేవడమే. ఈ వాస్తవాలు, ఉద్వేగాలు, ఉద్యమాలు, జీవన్మరణ సంఘర్షణలు అన్నీ కలగలిసి ‘యుగసంధి’, ‘వెల్లువలో పూచిక పుల్లలు’ నవలలుగా రూపుదిద్దుకున్నాయి ఈ రెండు నవలలు ఆనాటి తెలంగాణ పరిస్థితులకు అద్దం పట్టాయి. రచయిత వీటిల్లో మానసిక సంఘర్షణలను, పరిస్థితులు, వ్యక్తులు, సమాజంపై వేసిన ప్రభావాల్ని భిన్న పార్శ్వాల నుంచి తడిమి పాఠకుణ్ని తనతో పాటు నడిపించాడు. చైతన్యస్రవంతి శిల్పంతో, అధివాస్తవికత భావనలతో తన నవలల్ని తీర్చి దిద్ది తెలుగు పాఠకులకు ఒక కొత్త తరహా సాహిత్య రుచిని చవి చూపించాడు.
అక్షరమక్షరం పాతల్ర మానసిక సంఘర్షణను, జీవన పోరాటాలను, నింపాదిగా ఉండనివ్వని ఆలోచనలు, ఆదర్శాలు అన్నింటినీ ఈ నవలలు చిత్రించాయి. యుగసంధి నవలలో పైరవీలు, పటేలు`పట్వారీ తగాదాలు మొదలు, కొంతమంది రొహిలాలు, అరబ్బుల దౌర్జన్యాలు, విధవా వివాహాలు, ఆర్యసమాజ్‌, ఆంధ్రమహాసభ, వందేమాతరం, కమ్యూనిస్టులు, రజాకార్లు, అతలాకుతలమైన హైదరాబాద్‌ జీవనం, అవి ఆయా కుటుంబాల్లో తీసుకువచ్చిన మార్పులు, కాలంతో పాటు సమాజంలో చోటుచేసుకుంటున్న` మారుతున్న విలువలు, ఒకవైపు శుద్ధశ్రోతియ బ్రాహ్మణులు పాటించే ఆచారాలు, మరో వైపు బ్రాహ్మణుడైనప్పటికీ జంధ్యంతో పాటు అన్నీ త్యజించి తాగుడు, డిబాచిరీకి అలవాటు పడ్డ ‘లంపెన్‌’ వ్యక్తి విశ్వేశ్వరరావునీ ఇందులో చిత్రించాడు.
మంచీ చెడుల సహ గమనం
హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలలో ప్రధానంగా చోటు చేసుకున్నాయి.
ముఖ్యంగా రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ప్రగతిశీల భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి.భాస్కరభట్ల మొత్తం నాలుగు నవలలు రాసిండు. అవి వింతప్రణయం, భవిష్యద్దర్శనం, యుగసంధి, వెల్లువలో పూచిక పుల్లలు. భాస్కరభట్ల నవలల్లో మొదటగా చెప్పుకోవాల్సింది యుగసంధి. ఇందులోని రఘు, రుక్మిణి, రమణ, పద్మ పాత్రలు భిన్న ధృక్కోణాల్లో ఆనాటి సమాజాన్ని ఆవిష్కరిస్తాయి. భిన్నమైన ఆలోచనలు కలవాళ్ళని ఒక్కదగ్గర చేర్చి నవల నడిపించడమంటే చాలా క్లిష్టమైనపని. ఆ పనిని భాస్కరభట్ల విజయవంతగా చేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ‘యుగసంధి’ నవల్లో రఘుపాత్రలో అక్కడక్కడ భాస్కరభట్ల కనిపిస్తాడు.‘యుగసంధి’ నవల హీరో రఘు స్వయంగా ఇంగ్లీషు ఎమ్మే ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. రఘు పాత్ర  ద్వారా ఆనాటి తెలంగాణ సమాజానికి పరిచయమైన పాశ్చాత్య సాహిత్యాన్ని గురించి రచయిత విశ్లేషిస్తాడు.
నిజానికి హైదరబాద్‌లో 1917లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడే వరకు కూడా ఇంగ్లీషు మాధ్యమంగానే ఉన్నత చదువులు కొనసాగేవి. అయితే బ్రిటీషిండియాలో గాంధీ లేవదీసిన ‘ఉర్దూ`హిందుస్థానీ’ జాతీయ ఉద్యమాల ప్రభావంతో ఉస్మానలీఖాన్‌ తన పేరిట ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడంతో ఇక్కడ విద్యాబోధన ఉర్దూమాధ్యమంగా ప్రారంభమయింది. ఈ విశ్వవిద్యాలయం ఉర్దూ మాధ్యమంగా ఆరంభం కావడానికి ప్రధాన కారకుడు రవీంద్రనాథ్‌ టాగోర్‌. ఆయన సూచనల మేరకే ఉర్దూ మాధ్యమంగా యూనివర్సిటీని ప్రారంభించారు. అయినప్పటికీ నిజాం కాలేజి, దాంతోపాటు మరి కొన్ని కళాశాలల్లో బోధన పూర్తిగా ఇంగ్లీషులోనే కొనసాగేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ బోధనా భాష చేయడంతో హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు దెబ్బతిన్నాయని కూడా రచయిత చెప్పిండు.
ఎన్ని అవరోధాలు ఉన్నా నిజాం కాలంలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పంచభాషా సంస్కృతి ఉండేది. నగరంలోని దాదాపు చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఫార్సీ భాషలు వచ్చేవి. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత ప్రభుత్వాలు ఎకాఎకిన తెలుగును అధికార భాష చేయడంతో ఈ భాష తెలిసిన ఆంధ్రప్రాంతీయులు ఇబ్బడి ముబ్బడిగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు సంపాదించారు. అంతేగాకుండా స్థానిక పంచభాషా సంస్కృతి కూడా సర్వ నాశనమయింది. భాషారాష్ట్రాల పేరిట ఐదారు భాషలు, కలిసిమెలిసి ఉండిన సంస్కృతిని భ్రష్టుపట్టించి ఏకైక భాష ‘తెలుగు’కు మాత్రమే పట్టం కట్టారు. ఉర్దూ మూలంగా కన్నా ‘తెలుగు’ మాత్రమే వెలిగించే ప్రభుత్వాల మూలంగా హైదరాబాద్‌ పంచభాష సంస్కృతి, తెహజీబ్‌ కనుమరుగయ్యింది.
హైదరబాద్‌ నగరంలో ఉద్యోగం చేయాలంటే కేవలం ఉర్దూ, కొంత ఫార్సీ వస్తే చాలు అన్న పరిస్థితులున్న కాలంలోనే భాస్కరభట్ల కృష్ణారావు కలకత్తా వెళ్ళి అక్కడ బి.ఎస్‌.సి చదివాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి లా చదివాడు. దక్కన్‌ రేడియోలో ఉద్యోగం సంపాదించి ఎందరో తెలుగువారికి అవకాశం కల్పించాడు. స్వయంగా తన నాటకాలు ప్రసారం చేయడమే గాకుండా, పాటలకు ప్రథమ స్థానం కల్పించాడు. హైదరాబాద్‌ రాజ్యం తన అస్తిత్వాన్ని కోల్పోయి భారతదేశంలో విలీనం కావడంతో ‘దక్కన్‌ రేడియో’ కూడా ఆలిండియా రేడియోలో సంలీనమయింది. దీంతో తనదైన హైదరాబాద్‌ ముద్ర చెరిగిపోయి ప్రాంతేతర ‘తెలుగు ముద్ర’ పడింది.
అప్పటివరకూ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నందగిరి ఇందిరాదేవి, మాడపాటి సత్యవతి లాంటి వారికి పుట్టినిల్లుగా ఉండిన ‘రేడియో’లో ప్రాంతేతరుల ప్రవేశం ప్రారంభమయింది. దీంతో ఉర్దూ, తెలుగు మిశ్రిత భాష క్రమంగా తెరమరుగయింది. ఇవే విషయాల్ని నేడు తెలంగాణవాదులు ఉద్యమ సందర్భంలో పదే పదే ముందుకు తీసుకువస్తున్నారు. తెలంగాణ తనదైన తెలుగుభాషను కోల్పోయిందని చెబుతున్నారు. కేవలం భాష విషయమే గాకుండా ‘యుగసంధి’ నవల ద్వారా అనాటి అనేక సమకాలీన అంశాలను కూడా చరిత్రకెక్కించాడు.
‘యుగసంధి’ నవలలో రెండున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమాలను ఆంధ్రమహాసభ మొదలు పోలీసు చర్య వరకు సుదీర్ఘంగానే చర్చించాడు. ఆంధ్రమహాసభ వారు ‘వర్తక స్వాతంత్య్రం’, ‘వెట్టిచాకిరి’, మగ్గంపన్ను, పేరిట వేసిన చిన్న పుస్తకాలు ఆనాడు ఉద్యమానికి ఎలా ఊతమిచ్చాయో ఈ నవల ద్వారా తెలుస్తుంది. అలాగే బహద్దూర్‌ యార్జంగ్‌ మజ్లిస్‌ పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వం వాక్‌, సభా స్వాతంత్య్రాలను అరిగడుతూ గస్తీనిషాన్‌`53 పేరిట వెలువరించిన జీవో, పాఠశాలలు స్థాపించుకోవాలంటే అనుమతి తప్పనిసరి, వార్షికోత్సవాలు జరుపుకోవాలంటే లిఖితరూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాలు ఉండబోవని రాసివ్వడం అన్నీ ఇందులో చర్చకు వచ్చాయి.
బ్రిటీషాంధ్రలో గాంధీజి పిలుపుమేరకు ఉద్యమాలు జరుగుతూ ఉండటం వాటి ప్రభావం హైదరబాద్‌లో ఏమాత్రం లేకపోవడంతో ఒక దశలో స్వయంగా ఉద్యమాన్ని లేవదీద్దామనే ఆలోచన కూడా ‘రఘు’కు వస్తుంది. అయితే అనంతర కాలంలో గోవిందరావ్‌ నానల్‌ వంటి వారు హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌లో ‘సత్యాగ్రహం’ చేపట్టడంతో తాను కూడా అందులో చేరాలని భావిస్తాడు. ఇలాంటి సందర్భంలోనే తాను ఎమ్మే చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం ప్రారంభం కావడంతో దానికి ‘రఘు’నాయకత్వం వహించి విజయవంతంగా ఒక సంవత్సరం పాటు నడిపిస్తాడు.
చందాలు వసూలు చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకుండా నాగపూర్‌లాంటి ప్రాంతాలకు పంపించి అక్కడ విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. అలా నాగపూర్‌ వెళ్ళి చదివిన ఉస్మానియా విద్యార్థుల్లో పి.వి. నరసింహారావు లాంటి వారు కూడా ఉన్నారు. ఆనాటి విద్యార్థుల కష్టాలు, విద్యార్థినులచే వందేమాతర ఉద్యమం చేయించాలని ప్రయత్నించి విఫలమైన తీరు అన్నీ ఇందులో చోటు చేసుకున్నాయి.
స్వయంగా వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించడంతో, ఎమ్మే ఇంగ్లీషు ఫస్ట్‌ క్లాస్‌లో పాసయినా ఏ కళాశాల వారు కూడా రఘుకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆనాటికి ఈనాటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పేమి లేదనడానికి ఇదే సూచన. ఈనాడు కూడా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల్ని అక్రమ కేసుల పేరిట భయపెడుతూ, మీకు ఉద్యోగాలు రావు అని హెచ్చరిస్తున్నారు. ఈ దశలో రఘుకి హైదరాబాద్‌ సివిల్‌సర్వీసెస్‌ రాయడానికి అవకాశమున్నా నిర్దయగా ఉన్న ప్రభుత్వంలో పనిచేయడానికి ఆయనకు మనస్కరించలేదు. నిజానికి ఒక మధ్యతరగతి హైదరాబాదీ ‘సివిల్‌ సర్వీస్‌’ ఉద్యోగం చేయాలని కలగనడమే ఒక అభివృద్ధి సూచిక. ప్రధాన పాత్ర పద్మ తండ్రి కూడా డాక్టర్‌ కావడం కూడా చూస్తే ఇది ఆనాటి ఉన్నత మధ్యతరగతి జీవితాలను చిత్రించిందనడంలో అతిశయోక్తి లేదు. అవినీతి, ఆశ్రితపక్షపాతం కారణంగా యూనివర్సిటీకంతటికీ ప్రథముడిగా నిలిచినా లెక్చరర్‌ ఉద్యోగం కూడా రాని సందర్భంలో రఘు ఉద్యోగ ప్రయత్నాలే విరమించుకున్నాడు.
ఆనాడు తెలంగాణలో స్వతంత్రప్రతిపత్తితో పనిచేసే అవకాశమున్న ఏకైక వృత్తి న్యాయవాదం. అందుకే స్వాతంత్య్ర సమరయోధులందరూ లా చదివిన వారే. అడ్వకేట్లుగా రాణించిన వారే. ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించిన దాదాపు అందరూ న్యాయవాదులే కావడం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే రఘు చివరికి లా చదివి అడ్వకేటుగా స్థిరపడాలని నిర్ణయించుకుంటాడు. స్వాతంతత్య్రోద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగాలు రాని పరిస్థితే గాకుండా, జపాన్‌ సైనికులు మణిపూర్‌పై దాడి మొదలు, హైదరాబాద్‌ స్వతంత్ర ప్రతిపత్తి, సిడ్నీకాటన్‌ ఆయుధాల సరఫరా, రజాకార్లు ఇలా హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమంలోని అన్ని అంశాల గురించి ఈ నవల చర్చించింది. వందేమాతరం ఉద్యమంలో పాల్గొనే మహిళల గురించి ఒకవైపు, మరోవైపు సిగరెట్‌ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల్ని చిత్రించిండు.
స్త్రీల ఆధునిక జీవన దృశ్యం
మహిళలు కార్మికులుగా పనిచేయడమంటేనే అది అభివృద్ధికి చిహ్నం. ఎందుకంటే నగరాల్లో ఫ్యాక్టరీలు వెలువడడం, వారు తమ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకోవడానికి స్వీయ సంపాదనపై ఆధారపడడమంటేనే మారుతున్న సమాజానికి ఆనవాలు. ఇదే విషయాన్ని రమణ పాత్ర గురించి రచయిత ఇలా చెప్పాడు. ‘‘… తాను 20వ శతాబ్దపు యువతిగా బ్రతకదలచింది. తనకాళ్ళపై తాను నిలబడదలచింది. నేడు స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం వుంటేనే గాని ఆమెకి సంఘంలో గౌరవం లేదు. తాను ఆర్థిక స్వాతంత్య్రం కోసం పాటు పడదలచింది’’. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి సంఘంలో గౌరవం వుంటుందనే విషయాన్ని 60యేండ్ల కిందనే గుర్తించి ప్రచారం చేశాడంటే ఆయన దార్శనికత అర్థమవుతుంది. నవలల్లో స్త్రీ పాత్రలను తీర్చి దిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడని అనిపిస్తుంది. పదికి పైగా ఉన్న మహిళా పాత్రలను ఒకదానితో ఒకటి ఎక్కడా సారూప్యత లేకుండా భిన్నంగా మలిచాడు. వీటన్నింటిలోకి రుక్మిణి పాత్ర విశిష్టమైనది.
ఎనిమిదో ఏట పెళ్ళయి ఆర్నెల్లకే ‘మొగుడ్ని’ కోల్పోయిన రుక్మిణికి విధవా పునర్వివాహం గురించి, దాన్ని ఆంధ్రదేశంలో ప్రచారం చేసిన కందుకూరి వీరేశలింగం గురించీ, హైదరబాద్‌లో కూడా వాటిని చేసుకున్న వాళ్ళ గురించీ ‘బావ’ రఘు ద్వారా తెలుసుకుంది. నిజానికి సరోజిని నాయుడు` ముత్యాల గోవిందరాజుల వివాహం కందుకూరి వీరేశలింగం చేయించిన నాటినుంచే ఆయన గురించి తెలంగాణ వారికి కూడా కొంత తెలిసింది. ఆర్యసమాజ పద్ధతిలో వివాహం చేసుకుంటానని చెప్పిన ‘విశ్వేశ్వరరావు’ తుదకు డొక్కలో తన్ని మానవ మృగంలా తనని ఆక్రమించుకున్నా ఏమిజేయలేని స్థితికి చేరుకుంటుంది. నమ్మి విశ్వేశ్వరరావుతో వచ్చినందుకు మానంతో పాటు కంటె, గొలుసు కూడా అర్పించుకుంది. ఇలాంటి అభాగ్యురాళ్లు అప్పటికీ, ఇప్పటికీ మన కండ్లముందు కనబడుతూనే ఉంటారు. అయితే వారి పట్ల సంవేదనతో, సానుభూతితో, సాంత్వనతో రాసిన వాళ్ళు అరుదు. ఆ అరుదైన ఘట్టానికి ‘యుగసంధి’లో భాస్కరభట్ల జీవం పోసిండు.
చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో ‘విధవ’ అయిన రుక్మిణి లంపెన్‌ ‘విశ్వేశ్వరరావు’ చేతిలో బలయిన తీరు. విశ్వేశ్వరరావు లైంగిక వాంఛను తీర్చడానికి అనుభవించిన హింసను నవలాకర్త భాస్కరభట్ల కృష్ణారావు మనస్సుల్ని కదిలించే విధంగా చిత్రిక గట్టిండు. ఈ నవల తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులను చిత్రిక గట్టాయి. తెలంగాణలో జరిగిన ఉద్యమాలను, భాష, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలను చర్చించాయి. భిన్న దృక్కోణాల్లో భిన్నమైన రీతిలో నవలలోని పాత్రలు సమాజాన్ని దర్శించాయి.
‘యుగసంధి’ నవల్లో ఈ భిన్నత్వాన్ని సహజసిద్ధంగా తీర్చిదిద్దిన పాత్ర రమణ. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి గౌరవం దక్కుతుందని నమ్మి దాన్ని సాధించుకునేందుకు ఆత్మగౌరవంతో ముందడుగేసిన మహిళ రమణ. త్యాగం, ఆత్మగౌరవం, పట్టుదల, తిరుగుబాటు, అభ్యుదయ భావాలు అన్ని కలగలిపిన పాత్ర రమణ.ఇక పోతే ‘పద్మ’ పాత్రలో ఆనాడు ‘స్త్రీ’ స్వతంత్రంగా ఎదగడానికి తండ్రి తోడ్పాటు, దాన్ని దుర్వినియోగం కాకుండా ఆమె ఉపయోగించిన తీరు నవలలో ప్రస్తావనకు వస్తాయి. మనసులో ఉన్నది ఎదుటివారికి సూటిగా చెప్పే పాత్రగా పద్మని తీర్చాడు. రఘు డబ్బు తీసుకొని బాగా చదువుకున్నాడు. అదే డబ్బుని తీసుకోవడానికి కనీసం అప్పుగా కూడా తీసుకోవడానికి నిరాకరించి ‘రమణ’ తన ఆత్మగౌరవాన్ని చాటుకుంది.
రజాకార్ల రాజ్యంలో
ఇక్కడ రజాకార్ల గురించి కొంచెం విపులంగా చర్చించుకోవాలి. హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగిన నాడే రఘు`పద్మలకు కూతురు పుడుతుంది. ఆమె పేరు కళ్యాణి అని పెడతారు. లోక కళ్యాణం కోసం హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టారని రచయిత చెబుతాడు. అయితే తర్వాతి కాలంలో ఇది తప్పని రచయిత తెలుసుకొని ఉంటాడు. ఎందుకంటే అప్పటికప్పుడు రజాకార్ల దౌర్జన్యాలు, దుర్మార్గాలు మాత్రమే రచయితకి కనబడ్డాయి. నిజానికి 1948లో రజాకార్ల గురించి కాళోజి ‘నల్లగొండలో నాజీల కరాళ నృత్యం ఇంకెన్నాళ్ళు’ అని నిరసించాడు. అయితే 1969 వచ్చే సరికి రజాకార్లే నయం ఈ ఆధిపత్య ఆంధ్రులకన్నా అనే అభిప్రాయాన్ని వ్యక్తం జేసిండు. 1956లో సమైక్యవాదిగా ఉన్న కాళోజి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటికి తెలంగాణవాదిగా మారిండు. దాశరథి 1964 నాటికి కొంత తెలంగాణ బాటపట్టిండు. ఇలా రజాకార్ల విషయంలో గానీ, తెలుగు భాష విషయంలో గానీ, పోలీసుచర్య విషయంలోగానీ అందరికీ ఎప్పటికీ ఒకే అభిప్రాయం లేదు. అది విషయపరిజ్ఞానంతో పాటు మారుతూ వచ్చింది. నిజానికి పోలీసుచర్య మూలంగా వేలాది కమ్యూనిస్టు వీరులు తెలంగాణలో పటేల్‌ సైన్యం చేతిలో హతులయ్యారు. నిజాం సైన్యం చేతిలో పదులు, వందల సంఖ్యలో కమ్యూనిస్టు నాయకులు/కార్యకర్తలు చనిపోతే అదే భారత ప్రభుత్వ సైన్యం చేతిలో ఒకవైపు వేలాది ముస్లింలు మరఠ్వాడా, హైదరాబాద్‌`కర్నాటక ప్రాంతాల్లో హతమయితే, మూడు వేలకు పైగా తెలంగాణ సాయుధ పోరాటవీరులు అమరులయ్యారు. ఇంతమందిని చంపి బలవంతంగా కైవసం చేసుకున్న హైదరాబాద్‌పై పోలీసుచర్య ఆక్షణంలో ‘లోకకళ్యాణం’ కోసం జరిగిందనే అభిప్రాయం కలిగి వుండవచ్చు.
అయితే దీన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే హైదరాబాద్‌పై పోలీసుచర్య ఒక్క రాజ్యాధినేత ఉస్మాన్‌అలీఖాన్‌ని మాత్రమే మార్చింది. (ఇది కూడా పూర్తి నిజం కాదు. ఎందుకంటే 1956 వరకు హైదరాబాద్‌ రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌ ఉస్మానలీఖానే) నిజానికి మిలిటరీ, ప్రజాస్వామ్యం పేరిట నియంతృత్వ పాలనను కొనసాగించింది. ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని అధికారుల్ని రుద్దింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వెల్లోడి లాంటి అధికారులు ముఖ్యమంత్రులుగా చలామణి అయ్యారు. రజాకార్ల అణచివేత పేరిట వేలాది మంది కమ్యూనిస్టుల ప్రాణాలను హరించిన జె.ఎన్‌.చౌదరి సైన్యం హీరోలుగా వెలిగిపోయారు. ఇంత విషాదం దాగి ఉన్న హైదరాబాద్‌పై పోలీసుచర్యపై ఇప్పటికీ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, మరాఠీ భాషల్లో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే పోలీసుచర్య, రజాకార్లపై 1948`56ల కాలంలో చేసిన వ్యాఖ్యానంలో కొన్ని ఖాళీలున్నాయి. కొన్ని మార్పులున్నాయి. మరి కొన్ని చేర్పులున్నాయి. ఇవన్నీ మేళవించి ఆలోచిస్తే గానీ అసలు విషయం అర్థం కాదు. ఇట్లా కొత్త సమాచారం అందుబాటులోకి రావడం మూలంగా భాస్కరభట్ల కృష్ణారావు వ్యక్తపరచిన అభిప్రాయాల్లో కొన్ని ఖాళీలున్నాయి. వాటిని పూరించే పని ఇప్పుడు జరుగుతోంది.
60 యేండ్ల కాలంలో రజాకార్ల విషయమై ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజాకార్లలో కేవలం ముస్లింలే గాకుండా దొరలు, దేశ్‌ముఖ్‌లు, దళిత, బీసీలు కూడా ఉన్నారనే విషయం రూఢీ అయింది. ముస్లిం మతంలోకి మారిన వారు కూడా చాలామంది దళితులే అనే విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రజాకార్ల అణచివేత పేరిట వేలాదిమందిని భారతసైన్యం ఊచకోత కోసిందనే విషయం ప్రభుత్వం నియమించిన కమిటీలే నిర్ధారించాయి. అంతేగాకుండా హిందూత్వవాదులు ప్రచారం చేసినట్లుగా ఈ రజాకార్లకు నిజాం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందేది కాదు. అందువల్లనే వాళ్ళు నవలలోని పద్మ తండ్రి దేశ్‌ముఖ్‌ ఆంజనేయుల్ని కూడా డబ్బులివ్వమని డిమాండ్‌ చేస్తారు.
అలాగే సిగరెట్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ రషీద్‌ని కూడా డబ్బులు డిమాండ్‌ చేస్తారు. అంతేగాకుండా రుక్మిణిని మత మార్పిడి చేయించాలని కూడా హెచ్చరిస్తారు. దీనికి రషీద్‌ తిరస్కరిస్తూ నేను జాతీయవాదిని రుక్మిణిని మతం మార్చుకొమ్మని చెప్పేది లేదని తెగేసి చెబుతాడు. తెగేసి చెప్పినందుకు గాకుండా అడిగిన డబ్బు ఇవ్వనందుకే ఆగ్రహంతో రజాకార్లు రషీద్‌ని కూడా చంపేస్తారు. అంటే రజాకార్లకు మతంతో సంబంధంలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తమ పబ్బం గడుపుకునేందుకే ముస్లింలీగ్‌ రాజకీయాల్ని హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి బహద్దూర్‌ యార్‌జంగ్‌ ఇత్తెహాదుల్‌ పార్టీని ఏర్పాటు చేసిండు. ఇట్లాంటి సందర్భంలో మజ్లిస్‌పార్టీ, మతతత్వాన్ని బాహాటంగా ప్రచారం చేసిన కాసిం రజ్వీ చర్యల్ని తప్పకుండా ఖండిరచాల్సిందే. అయితే ఇక్కడ ముస్లింలందరూ కాసిం రజ్వీ అనుచరులే అన్న రీతిలో ఇప్పటికీ కొన్ని సంస్థలు, పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే లేదా వారి ఆలోచనల్లోని డొల్ల తనాన్ని బయటపెట్టాలంటే ఇందులోని రషీద్‌ పాత్ర, రజాకార్ల చర్యల్ని రెండిటినీ జమిలిగా విశ్లేషించాల్సి ఉంటుంది. నగరానికి జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల వలస వారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం కూడా ఈ న వల ద్వారా మనకు తెలుస్తాయి. వెలమ సామాజిక వర్గం అప్పటికే హైదరాబాద్‌ చేరుకోవడం తమ పిల్లల్ని చదివించడం, వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడం కూడా అర్థమవుతుంది.

బానిసల్లారా సోయి తెచ్చుకోండి!

బానిసల్లారా సోయి తెచ్చుకోండి!

sangisetti- bharath bhushan photo
1970ల కన్నా ముందు అధికారం కేంద్రీకృతమై ఉండిది. ఇది విశ్వవ్యాప్తమైన భావన. దాన్ని కూలదోస్తే సమసమాజం ఏర్పడుతుందనే అవగాహన ఉండిది. అయితే అధికారం వికేంద్రీకృతంగా ఉంటుందనే వాస్తవాన్ని అస్తిత్వ రాజకీయ ఉద్యమాలు ముందుకు తీసుకొచ్చాయి. అది ‘బ్లాక్స్‌’ పోరాటం కావొచ్చు, ఫెమినిజమ్‌ కావొచ్చు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమూ కావొచ్చు. అస్తిత్వ ఉద్యమాలకు ఒక ‘పరిధి’ ఉంటుంది. ఆధిపత్యాన్ని, అణచివేతను ధిక్కరించేందుకు పోరాటం జరిగింది. కళ్ళముందర కనబడే శత్రువుతో ఉద్యమం కొనసాగింది. ఈ అస్తిత్వ రాజకీయాల్లో సామూహికతకు స్థానం లేదు. కానీ ఇవ్వాళ కొంతమంది భాష పేరిట, జాతి పేరిట, సమాజం పేరిట ‘సామూహికత’ను తీసుకొస్తున్నారు. దీని వల్ల తెలంగాణ వాళ్లకే గాదు సీమ, డెల్టా, ఉత్తరాంధ్రవారి ఉనికికి కూడా ప్రమాదమేర్పడనుంది.
స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకునే వారెవ్వరూ పరాయి ఆధిపత్యాన్ని, అణచివేతను, నిరాకరణను సహించలేరు. అంతేగాదు దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. అయితే తెలంగాణ విషయంలో ‘పరాయి’ ఎవ్వరు అని తెలుసుకునే లోపలే జరగరాని నష్టమంతా జరిగిపోయింది. 1956 నుంచీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లెక్కలేసుకొని చరిత్రలో రికార్డు చేయాల్సిన ప్రస్తుత తరుణంలో కొందరు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. అంతర్లీనంగా తమ కోస్తాంధ్ర బానిసభావజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.
భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్లమంతా ఒక్కటే, తెలుగాజాతి అంతా ఒక్కటే, ఆధిపత్యాలు లేకుంటే అంతా మళ్ళీ కలిసిపోవొచ్చు, సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు, తెలుగు ప్రజల ఐక్యత కేవలం ఒక భావనగా కాకుండా భౌతిక వాస్తవికంగా మారాలని వ్యాఖ్యానిస్తూ, భవిష్యవాణి చెబుతూ, ఆకాంక్షిస్తున్న వాళ్లలో తెలంగాణ వాదులు, బుద్ధిజీవులు, సాహిత్యకారులు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండు రాష్ట్రాల్లో తమ సంఘాలు, సంస్థలు, పార్టీలు ఉండీ, రెండు ప్రాంతాల్లో వాటి మనుగడ కోరుకునే వారు, రెండు రాష్ట్రాల్లోనూ తమకు ప్రచారం, ప్రాధాన్యత, గుర్తింపు లభించాలని  ఆశించే పచ్చి అవకాశవాదులు ఈ మాటలు మొదటి నుంచీ చెబుతుండ్రు, ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు అవకాశవాదులు కాబట్టి పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
ఈ అవకాశవాదుల్లోనే ఇంకొందరు పెండ్లినాడే సావుడప్పుకొట్టినట్లు అవసరమైతే ‘తెలుగువాళ్ళం మళ్ళీ కలువొచ్చు’ అంటుండ్రు. పేచీ అంతా తెలంగాణవాదుల ముసుగులో రంగంమీదికి వస్తున్న ఆధిపత్యాంధ్రుల బృందగానం ఆలపించే వంధిమాగదుల తోనే! తెలంగాణ సోయితో ఎన్నడూ మెలగని వాళ్ళు రాష్ట్రమొచ్చినాక ప్రత్యేక సంచికలు తీసుకొస్తూ తాము మాత్రమే ఉద్యమంలో ముందున్నట్టు, తమ కృషితో మాత్రమే తెలంగాణ సాధ్యమయింది అనే భావన కలిగిస్తుండ్రు. తెలంగాణ గురించి కూడా ఇందులో ఆంధ్రోళ్ల తోటి రాయిస్తుండ్రు. ఇలాంటి నయా సీమాంధ్ర బానిసలు రేపు తెలంగాణలో కోకొల్లలుగా పుట్టుకొచ్చి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తాము అభిమానించే ఆంధ్రాధిపత్య సాహిత్యకారుల కాళ్ల దగ్గర కట్టిపడేస్తారు. ఎందుకంటే వీళ్ళెవరూ తెలంగాణ కోసం ఎన్నడూ ఒక్క మాట మాట్లాడిరది లేదు, రాసిందీ లేదు, కనీసం సంఫీుభావంగా ఒక్క సమావేశంలో పాల్గొన్నదీ లేదు. ఇప్పుడు వలస పాలన మాత్రమే పోయింది. ఈ వలసాధిపత్యులు స్థానిక బానిసలను ప్రోత్సహించి, మెచ్చి మెడల్స్‌ ఇప్పించి తమ పెత్తనాన్ని శాశ్వతంగా కొనసాగించే ప్రమాదముంది. అందుకే అటు రాజకీయాల్లో గానీ ఇటు సాహిత్య, సాంస్క ృతిక రంగంలో బానిసల పట్ల జాగరూకతతో మెలగాలి. నిజానికి వెన్నెముఖలేని సాహిత్యకారులు ఎంతటి తెలంగాణవాది అయినా సారాంశంలో సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చే పనిముట్టుగానే మిగిలిపోతాడు.
రెండు ప్రాంతాల్లోనూ తమ కులం వాళ్ళు ఉండడం, ఉమ్మడి రాష్ట్రంలో తమకు దక్కిన గౌరవానికి లోటు రాకుండా చూసుకోవడానికి, రాష్ట్ర, కేంద్ర అవార్డులు నిర్ణయించడంలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి తెలంగాణలోని ఆధిపత్యులు  సీమాంధ్రుల మనసెరిగి మసులుతుండ్రు. అనివార్యంగా తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించిన వీళ్ళు తమకు అవసరమనిపిస్తే తిరుపతి ప్రపంచ సభలకు వెళ్ళినట్టే ఇక్కడి ప్రజలకూ పంగనామాలు పెట్టగల సమర్ధులు. భాషకు పట్టం కట్టే పేరుతో తిరుపతికి వెళ్ళినామనే వాళ్ళు రేపటి తెలంగాణలో అదే భాష పేరిట స్థానికుల ‘హిందూత్వ’ వైఖరి అవలంభించే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే వీళ్లు ఇదివరకే ఉర్దూని ముస్లిముల భాషగా ముద్రేసిండ్రు.
తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచీ ఆంధ్రాధిపత్యులు, వారికి వంతపాడే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ కేవలం తెలుగువారి రాష్ట్రంగానే పరిగణించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలుగు మాట్లాడేవారే కాదు ఉర్దూ మాతృభాషగా మాట్లాడే వాళ్ళు దాదాపు 15శాతం మంది ఉన్నారనే సోయి బుద్ధిజీవులకు లేకుండా పోయింది. తెలంగాణలో ఉర్దూమాట్లాడే ముస్లిములే గాకుండా కాయస్థులు, హిందీ మాత్రమే మాట్లాడే లోధీలతోపాటు భిన్నమైన ఇతర భాషలు మాట్లాడే రంగ్రేజ్‌, ఆరెమరాఠీలు, లంబాడీ, కోయ, గోండు, చెంచులు కూడా తెలంగాణలో భాగమనే గ్రహింపు కూడా వీరికి లేదు. తెలుగువాళ్లంతా ఒక్కటే అని కూడా టీవి చర్చల్లో అటు ఆంధ్రవాండ్లు, ఇటు తెలంగాణ వాండ్లు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు ఆంగ్ల విద్యార్జనతో ఒకవైపు, మరోవైపు ఆంగ్లేయుడు కట్టిన కాటన్‌ కట్టతో బాగుపడి భాష మీద అజమాయిషీ చలాయించారు. వీళ్ళే ‘రేట్‌’స్కూల్స్‌ ద్వారా పాఠశాలల్లో కొంతమేర తెలుగులో బోధన, మరికొంత పత్రికల ద్వారా తమ భాషకు ‘ప్రామాణికత’ సంపాదించిండ్రు.
సంపాదించిండ్రు అనేకన్నా ఆపాదించిండ్రు. ఇప్పటికీ అదే ప్రామాణిక తెలుగుభాషగా కొనసాగుతోంది. మిగతావన్నీ మాండలికాలు, యాసలుగానే ఉన్నాయి. భాషకు కూడా కులముంటదని బుద్ధిజీవులు గుర్తించరు. ముఖ్యంగా బీసీల్లోని దాదాపు ప్రతి కులానికి వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష, అవసరాల రీత్యా మిగతా వారితో మాట్లాడుకునే భాష భిన్నంగా ఉంటుంది. స్వర్ణకారులకు వృత్తిపరంగాను, వ్యాపార పరంగానూ ప్రత్యేకమైన భాష ఉంది. అది తమ వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణది పంచభాషా సంస్క ృతి. మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రజలపై ఎక్కువగా కన్నడ, మరాఠీ భాషల ప్రభావం కూడా ఉంటుంది. ఆ భాషలు వారికి పరాయివి కావు. హైదరాబాద్‌లో ఇప్పటికీ పాతబస్తీకి వెళితే ఉర్దూ మాట్లాడే కాయస్థులు, తెలుగు మాట్లాడే కన్నడిగులు, కన్నడ మాట్లాడే మరాఠీల కనబడతారు. అందుకే నిజాం జమానాలో ప్రతి ఫర్మాన్‌ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో వెలువడేది. ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ పత్రిక ‘హైదరాబాద్‌ సమాచారము’ ఈ అన్ని భాషల్లో ప్రచురితమయ్యేది. ఈ పంచభాష సంస్క ృతిని పక్కనబెట్టి కేవలం ఒక్క భాషనే అందరి భాషగా బలవంతంగా రుద్దడమంటే ఆ భాషలవారి హక్కుల్ని కాలరాయడమే. తమిళనాడు, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలలో తెలుగు భాషని కాపాడలనే వారెవ్వరూ హైదరాబాద్‌లో తెలంగాణలో ఉర్దూని కాపాడలనీ, కన్నడను కాపాడాలని ఎన్నడూ అడుగరు.
తెలంగాణలో పాఠ్యపుస్తకాల్లో ఒకరకమైన భాష ఉంటుంది. అది బోధించే ఉపాధ్యాయుడు తనదైన భాషలో చెబుతాడు. తనదైన భాష అన్నప్పుడు అతని కులం, పుట్టి పెరిగిన ప్రాంతం ప్రభావం వల్ల అబ్బిన భాష. చదువుకునే విద్యార్థికి ఇవి రెండూ కొత్తగానే ఉంటాయి. ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియంలో చదువుకుంటున్నది బహుజనులు మాత్రమే. అదీ తమ తరంలో మొదటి వారు మాత్రమే! ఈ పాఠ్యపుస్తకాల్లో విషయం ఎట్లాగూ తెలంగాణకు సంబంధించినది ఉండదు. కనీసం వాటిని వ్యక్తికరీంచేందుకు తెలంగాణ నుడికారానికి కూడా చోటులేదు.
అందుకే రెండు ప్రాంతాల్లో ఉనికిలో ఉండే (అగ్ర)కులాల వాండ్లకు తప్ప తెలుగు వాళ్ళమంతా ఒక్కటే అనే భావన బహుజనుల్లో ముఖ్యంగా బీసీల్లో ఏర్పడలేదు. మెజారిటీగా 50శాతానికి పైగా ఉన్న బీసీలు (ఉర్దూ మాట్లాడే ముస్లిములను మినహాయిస్తే ఈ శాతం ఇంకా పెరుగుతది) తాము స్వతహాగా మాట్లాడుకునే భాష ఎక్కడా లేదు. తెలుగుభాషగా చలామణిలో ఉన్న భాషలో బహుజనుల నుడికారం, పదసంపద కానరాదు. అలాంటప్పుడు భాష కలిపి ఉంచే సూత్రం ఎంతమాత్రం కాదు. ఇది బలవంతంగా, కృత్రిమంగా కల్పించిన బంధం మాత్రమే. ఈ బలవంతపు బంధం విడిపోయిందంటే సంతోషపడాలి తప్ప బాధపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ భాష గురించి గుండెలు బాదుకుంటుంది కూడా అగ్రకులస్తులే అనే విషయాన్ని అవగాహనలో ఉంచుకోవాలి. బహుజనులు తెలుగుకన్నా ఇంగ్లీషుపై దృష్టి కేంద్రీకరించాలనేది నేటి డిమాండ్‌.
తెలుగుజాతి అంతా ఒక్కటే అనే సూత్రాన్ని కూడా ఇదివరకే కొందరు తెలంగాణవాదులు కొట్టిపారేసిండ్రు. అయినా తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ఇరు ప్రాంతాల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి కొందరు, తమ పార్టీ, సంఘం ప్రయోజనాలను కాపాడడానికి కొందరు, ఇంకా చెప్పాలంటే రెండు ప్రాంతాల్లోనూ తమ ఆధిపత్యం యథాతథంగా కొనసాగాలనుకునేవారు (వీళ్లు ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నారు) ఈ తెలుగు జాతి సిద్ధాంతాన్ని వల్లె వేస్తున్నారు. ఒక జాతికి తనదైన ప్రత్యేక గుర్తింపు రావాలంటే ఒకే జాతీయ నాయకులను ఆరాధించడం, ఒకే భాష, ఒకే సంస్క ృతి, ఒకే చరిత్ర కలిగి ఉండడమే గాకుండా ‘అంతా ఒక్కటే’ అనే భావన కూడా ప్రజల్లో ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల వారికి లేదు.
ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్
ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్
తెలంగాణకు సంబంధించిన సర్వాయి పాపన్న, తుర్రెబాజ్‌ఖాన్‌, కుతుబ్‌షాహీలు, మహబూబ్‌అలీఖాన్‌, కొమురం భీమ్‌ ఎవ్వరూ కూడా ఆంధ్రప్రాంతంలో తెలిసిన వారు కాదు. వారి గురించి ఎన్నడూ వినలేదు. కనీసం పాఠ్యపుస్తకాల్లోనూ వారి గురించి పాఠాలు లేవు. ఆంధ్రప్రాంతానికి చెందిన పొట్టి శ్రీరాములు (ఈయన ఎక్కువ కాలం జీవించింది తమిళనాడులోనే) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడి ప్రాణాలు వొదిలిండు. ఈయనెవరికీ తెలంగాణలో తెలువదు. తెలంగాణవాళ్లు ఆయనతో మనకెలాంటి సంబంధం లేదు అనుకుంటారే తప్ప మనవాడు అనుకోరు. ఆయన్ని సమైక్యవాదిగా సీమాంధ్రులు ముందుకు తీసుకురావడం వల్ల కోమట్లు తమ వాడు అనే గౌరవంతో పల్లెల్లో నిలబెట్టిన ఆయన విగ్రహాలకు కష్టకాలం వచ్చి పడిరది. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కూడా తెలంగాణ వాళ్ళకు (కొంతమంది రెడ్లు మినహాయింపు) అదే భావన ఉంది. ఈ ‘జాతి’ నాయకుల గురించి ఎన్నడూ ఎవ్వరూ అందరికీ పరిచయం చేయాలని ప్రయత్నించలేదు. రెండు ప్రాంతాల ప్రజల మధ్యన భావ సమైక్యత ఎన్నడూ కలుగలేదు. అంతెందుకు వల్లభ్‌భాయి పటేల్‌ సీమాంధ్రులకు జాతీయ నాయకుడు కావొచ్చు కానీ తెలంగాణ వాళ్ళకు ముఖ్యంగా ముస్లిములకు ఒక విలన్‌. పటేల్‌ అటు సాయుధ పోరాట యోధులను చంపించడమే గాకుండా పోలీస్‌ యాక్షన్‌ పేరిట వేలాది ముస్లిముల ప్రాణాలు తీసిండు.
అలాగే భాష ఒక్కటి కాదని పైన చర్చించుకున్నాము. ఇక సంస్క ృతి ఒక్కటి కాదనే విషయాన్ని 1969 నుంచి ఇప్పటి దాకా ప్రతి తెలంగాణ వాదీ రాసిండు.  మా పండుగలు వేరు, మా ఆచార వ్యవహారాలు ఆఖరికి మేము మొక్కే దేవతలు కూడా వేరు అని తెలంగాణ వాదులు తేల్చి చెప్పిండ్రు. నిరూపించిండు. అంతేగాదు తెలంగాణది హీన సంస్కతి అని కూడా ఆధిపత్యులు ప్రచారం చేసిండ్రు. మీరు కోడిపుంజుల కొట్లాట పెడితే మేం బతుకమ్మలు ఆడుతాం అని తెలంగాణ వాళ్ళంటే అది సంస్కతిలోని భిన్నత్వాన్ని పట్టిస్తుంది తప్ప కించపరచడం కాదని అర్థం చేసుకోవాలి. అలాగే ఆధిపత్య వాదులు తెలంగాణ సంస్క ృతిపై మరో నింద కూడా వేసిండ్రు. మీదంతా దొరలు, నవాబుల సంస్కృతి రాములమ్మ సినిమాలోని సంస్క ృతి అంటూ నిందించిండ్రు. రాములమ్మ సినిమాలోని సంఘటనలు వాస్తవ సంఘటనలు అని ప్రచారం చేసి, తెలంగాణ దొరలంతా స్త్రీలను చెరబట్టే వారిగా చూపించిండ్రు. ఇది వాస్తవం కాదు. (ఈ విషయం గురించి మరోసారి వివరంగా చర్చిద్దాం) ఇంత భిన్న సంస్క ృతి ఉన్న వాళ్ళమధ్య భావసారుప్యత రావడమనేది అసంభవం.
ఇక చరిత్ర విషయానికి వస్తే తెలంగాణ ఆధునిక చరిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంవత్సరాలను లెక్కేసి మరీ మీ చరిత్ర వేరు మా చరిత్ర వేరు అని తేల్చి చెప్పిండు. అన్ని విషయాలు భిన్నంగా ఉన్నప్పుడు జాతి ఒకటే అనే భావన ఎలా కలుగుతుంది. నిజానికి పురాణ కాలం నుండి తెలంగాణ జాతి భిన్నమైనదే! షోడశ జానపదాల్లో అశ్మక సామ్రాజ్యం ఒకటి. ఇందులో తెలంగాణ ప్రాంతాలే ఉన్నాయే తప్ప ఆంధ్రప్రాంతాలు లేవు. ఆంధ్ర అంటే నిఘంటువుల్లో అర్థాలు కూడా ఏమంత వీనుల విందుగా లేవు. అట్లాంటిది జాతి భావన పేరిట మళ్ళీ జత కట్టాలని ప్రయత్నించడమేంటే 60 యేండ్లుగా దేనికి వ్యతిరేకంగా తెలంగాణ భూమి పుత్రులు, కులాలు మతాలకు అతీతంగా కొట్లాడారో మళ్ళీ అదే పాలన, ఆధిపత్యాన్ని, ఆణచివేతను తీసుకొచ్చేందుకు చేసే కుట్రగానే భావించాలి.
ఇంకొందరు సాహిత్యకారులు ‘సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు’ అనే అసమంజసంగా మాట్లాడుతున్నారు. సాహిత్యం తెలంగాణ`సీమాంధ్ర మధ్యన ఎన్నడూ కలిసి లేదు. కలిసి ఉంటే అసలు తెలంగాణ అస్తిత్వ ఉద్యమమే వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పది జిల్లాల నుంచి పదివేలకు పైగా కవిత్వ, వ్యాస, కథా, నవలా పుస్తకాలు, సంకలనాలు, సంపుటాలు, సీడీలు వెలువడ్డాయి. ఇందులో ఏవి కూడా సీమాంధ్రలోని పుస్తకాల షాపుల్లో ఎక్కడ కూడా అందుబాటులో లేవంటే ఆశ్చర్యం కలుగక మానదు. అంతెందుకు నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడలో దగ్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే! తెలంగాణ సాహిత్యాన్ని ఆంధ్ర కొలమానాల్లో తూచి, శైలి, శిల్పం, వస్తువు, వ్యక్తీకరణ పేరిట కథల్ని, కవిత్వాన్ని అంచనా వేసి నాసిరకం అని తేల్చేస్తుండ్రు. తెలంగాణ భాషలో రాసిన కథలేవి మాకు పంపొద్దని పత్రికా సంపాదకులు నిర్ద్వందంగా తేల్చి చెబుతుండ్రు. మన ప్రతిభను అంచనాగట్టడానికి పరాయి వాళ్ళకు పెత్తనమిస్తే వాళ్లు నెత్తంతా కొరిగి పెట్టడమే తప్ప ఒరగబెట్టేదేమీ లేదు. అసలు తెలంగాణ ఉద్యమమే మాది వేరు మీది వేరు, వివక్ష, విస్మరణ, వక్రీకరణలకు వ్యతిరేకంగా జరిగింది. తెలంగాణ`సీమాంధ్ర సాహిత్యం నిట్టనిలువునా చీలి ఉన్న ప్రస్తుత సమయంలో సాహిత్యం విడిపోవాలన్నా విడిపోవడం సాధ్యంకాదు అనే తీర్పు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడమే!
పోరాట ప్రతీక కొమరం భీమ్
పోరాట ప్రతీక కొమరం భీమ్
ఆధిపత్యం లేకుంటే ఆంధ్రవాళ్ళతో కలిసిపోవచ్చు, తెలుగువారి ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కూడా అత్యాశే! అంతేకాదు అవాంఛనీయం కూడా! ఎవరికి వారు విడిపోయిన తర్వాత పోటీ తెలంగాణ సాహిత్యకారుల మధ్యన ఉండాలి కాని మళ్ళీ ఆంధ్రావాళ్ళతోటి, ఆంధ్రావారి సాహిత్యం తోటి పెట్టుకోవలనడం అసమంజసం. పోటీకి రూల్స్‌ని మనమే నిర్ణయిద్దాం. సీమాంధ్రుల స్థల, కాలాల కనుగుణంగా నిర్ణయించబడ్డ రూల్స్‌ని మనం పాటించాల్సిన అవసరం లేదు. ‘కలిసిపోవొచ్చు’ అనే భావన తెలంగాణవారి మనస్సులో లక్షలో ఒక వంతు కలిగిన దాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకొనేందుకు సీమాంధ్రులు సిద్ధంగా ఉంటారు. రేపు తెలుగుభాషకు సాహిత్యానికి జాతీయిస్థాయిలో దక్కే అవార్డుల కోసం, గౌరవం కోసం, పద్మఅవార్డుల కోసం ఇతర గుర్తింపుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారితో తెలంగాణ వాళ్ళు పోటీ పడాల్సి ఉంటది.
అలాంటప్పుడు నిర్ణేతలు ఆంధ్రప్రాంతానికి చెందిన వాళ్ళు లేదా సాంప్రదాయిక తెలంగాణవాళ్ళు ఉన్నట్లయితే అవి మళ్ళీ మళ్లీ ఆధిపత్య ఆంధ్రులకే దక్కే ప్రమాదముంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే మన సాహిత్యాన్ని అంచనాగట్టేందుకు మనమే కొత్తకొలమానాలను రూపొందించుకోవాలి. ఆధిపత్యుల చెర నుంచి తెలంగాణను రక్షించుకోవాలి. ఇక తెలుగువారి మధ్యన ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కన్నా భారతీయుల మధ్యన ఐక్యత కోరుకుంటే అంతా సమానమన్న భావన వస్తది. (అసలు సిద్ధాంతమయితే ప్రపంచ కార్మికులారా ఏకంకడి అనుకోండి) అయినా 60 యేండ్ల సంది తెలంగాణను నంజుకు తిన్నవారితోటి ఐక్యత ఎవరి అవసరం? కచ్చితంగా ఇది తెలంగాణ వారి మేలుని కోరేదయితే కాదు. అయితే చుండూరు బాధితుల తరపున, పోలేపల్లి నిర్వాసితుల తరపున ఇటు తెలంగాణవారు, అటు ఆంధ్రవారూ సమస్యల వారిగా సంఘటితంగా పోరాటం చేయవచ్చు.
అంతేగాని మొత్తంగా తెలుగువారి ఐక్యత అంటే మళ్ళీ ఆంధ్రాధిపత్యానికి ఇంకా చెప్పాలంటే ప్రాంతాలకతీతంగా అగ్రకులాధిపత్యానికి ఆహ్వానంగా భావించాలి. అయితే పోలవరం విషయానికొస్తే బుద్ధిజీవులు ఎవరి పక్షాన నిలబడుతారనేది వారి నిబద్ధతకు గీటురాయి. తమ సర్వస్వాన్ని సెజ్‌ల కోసం కోల్పోయే వారికి సంఫీుభావంగా ఉంటారా? సర్వం కొల్లగొట్టి తీరాంధ్రలోని బలహీనవర్గాల భుక్తిని కూడా కొల్లగొట్టే మూడోపంటకు నీరు కోరుకునే వారి పక్షాన నిలబడతారో తేల్చుకోవాలి.
కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ కలకాలం మనగలగాలి అంటే ఈ 60 యేండ్లలో ఈ ప్రాంతంలో జరిగిన దోపిడీ, దౌర్జన్యం, హింస, ఉక్కుపాదంతో అణచివేయబడ్డ ఉద్యమాలు, కబ్జాకు గురైన చెరువులు, భూములు, రాజ్యహింసకు గురైన ప్రతి ఒక్క మనిషి చరిత్రను సాలార్జంగ్‌ మ్యూజియం కన్నా పదింతల పెద్దదయిన ప్రదర్శనశాలలో పెట్టాలి. 1969 కాలంలోనే జరిగిన బంగ్లాదేశ్‌ యుద్ధానికి సంబంధించిన చిత్రాలను, చిన్నారులను చిత్రవధ చేయడం దగ్గరి నుంచి రక్తాలోడుతున్న చిత్రాలను అక్కడి ప్రభుత్వం జాతీయ మ్యూజియంలో నిక్షిప్తం చేసింది. పాకిస్తాన్‌ మిలిటరీ పాల్పడ్డ అకృత్యాలను సజీవంగా చిత్రిక గట్టింది. అందుకే ఆ మ్యూజియం సందర్శించిన వాళ్ళు పాకిస్తాన్‌పై మరింత కసిని పెంచుకొని బైటికి వస్తారు.
అలాగే ఇవ్వాళ తెలంగాణ తాను కోల్పోయిన సహజ వనరుల్ని, విధ్వంసానికి గురైన బతుకుల్ని, ఛిధ్రమైన వారసత్వ సంపదని, నెత్తురోడిన 1969 ఉద్యమ చిత్రాల్ని, వంచనకు, హేళనకు గురైన నిన్న మెన్నటి ఉద్యమ డాక్యుమెంటరీలను, సమైక్య రాష్ట్రంలో పద్మ అవార్డులకు దూరమైన వైతాళికుల్ని, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీలులేదు, ఒక్కపైసా ఇవ్వం ఏం జేసుకుంటారో చేసుకోండి అనే ప్రసంగ పాఠాల్ని, చిత్రాల్ని, తెలంగాణ ప్రజల్ని విలన్లుగా చూపించిన సినిమాలను ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టాల్సిన అవసరముంది. లేకుంటే రేపటి తరానికి నిన్నటి తరానికి జరిగిన అన్యాయంపై అవగాహన లేకుండా పోతుంది. ఇవ్వాళ అవగాహన రాహిత్యంతో బుద్ధిజీవులు చెబుతున్న తెలుగువాళ్ళమంతా ఒక్కటే అనే భావనలో మళ్ళీ తెలుగు వాళ్ళందరూ ఒక్కటే రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్యమం చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అందుకే జరిగిన అన్యాయాన్ని, దోపిడీని, దౌర్జన్యాన్ని, హింసను కచ్చితంగా రికార్డు చేసి పెట్టాలి.
ఇన్నేండ్లు తెలంగాణ విస్మరణ, వివక్షకు, వక్రీకరణకు గురయ్యిందని చెబుతూ వచ్చాం. దానికి సాక్ష్యాలను రికార్డులను ప్రదర్శనకు పెట్టనట్లయితే మళ్ళీ మనం మోసపోయే ప్రమాదముంది. సాహిత్యంగా కన్నా రాజకీయం ఈ అవసరం ఎక్కువగా ఉంది.  మన ప్రతీకల్ని మనం నిర్మించుకోకుండా ఆధిపత్య భావజాలం నుంచి బయటపడలేము. ట్యాంక్‌బండ్‌పై మన విగ్రహాలను కొలువు దీర్చకుండా భావజాలంలో మార్పు తీసుకురాలేము. తెలంగాణ వాండ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే ఇక్కడి వైతాళికులని ఒక్కొక్కరిని లెక్కగట్టి స్మరించుకోవాలి. అది తెలుగు వాళ్ళమన్న భావనలో గాకుండా తెలంగాణవాళ్లమన్న సోయితోనే సాధ్యం.
                                                                                                                                                                  -సంగిశెట్టి శ్రీనివాస్‌

Sunday 4 August 2013











పంపకాల యాళ్ళ విజిలెంట్‌గుండాలి!


60యేండ్లు గోస పెట్టైనా కాంగ్రెస్‌ పార్టీ ఆఖరికి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించడం సంతోషం. కానీ ఇల్లలుకగానే పండుగకాదు. పార్లమెంటులో 29వ రాష్ట్రంగా తెలంగాణ బిల్లు పాసయితేనే  అసలైన పండుగ. ఆ బిల్లు పాసయ్యే వరకు తెలంగాణవాదులంతా జాగరూకతతో ఉండాలి. యూపీఎ ప్రభుత్వంపై వత్తిడి పెంచాలి. ఎందుకంటే 2009 డిసెంబర్‌ తొమ్మిది నుంచి డిసెంబర్‌ 23 వరకు తెలంగాణవాదులు నిష్క్రియాపరంగా ఉండడంతోనే వచ్చిన తెలంగాణ వెనక్కి బోయింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం, కాంగ్రెస్‌, వైఎస్సార్సీపీ పార్టీల ఎమ్మెల్యేలు మళ్ళీ రాజీనామా డ్రామాలాడుతున్నారు. అయితే ఏది ఏమైనా ఈ చివరాఖరి దశలో కాంగ్రెస్‌ వెనక్కిబోదనే విశ్వశిద్దాం. వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండేలా వత్తిడి తెద్దాం.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎప్పటి మాదిరిగానే తన చేతలు ఒకటి మాటలు ఒకటి అని మళ్ళొక్కసారి నిరూపించుకున్నాడు. ఇగ తెలంగాణపై ప్రకటన వస్తుందనగానే ఢల్లీిలో ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌లని ప్రభావితం చేసి రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని రాకుండా చేయాలని మంతనాలు చేసిండు. కనీసం నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరిండు. అలాగే కిరణ్‌ చాలా బాగా పనిచేస్తుండు, తెలంగాణ వాదాన్ని అణచేస్తాడు, ఆయన ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడాం, ఇకముందు కాపాడుతాం అని కూడా ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. ఆఖరి నిమిషం వరకూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాల్చేయ్యాలని జూసిండు. ఇదంతా ‘హిందూస్తాన్‌ టైమ్స్‌’ పత్రిక  బట్టబయలు జేసింది. గతంలో ఆయన సింగపూర్‌ ఆస్తులతో సహా అక్రమాస్తుల్ని లెక్కగట్టింది కూడా ఈ పత్రకే! అదే మనిషి తెలంగాణ ప్రకటన వచ్చిన తెల్లారి సుద్దపూస లెక్క మాట్లాడుతూ విడిపోయి కలిసుందాం అని పైకి పలికిండు. కడుపులో ఇంత విషంబెట్టుకున్నడు కాబట్టే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి సీమాంధ్రల్లో రాజీనామాలను చేసిన వారిని సస్పెండ్‌ చేయలేదు. పళ్లెత్తు మాట అంటలేడు. బహుశా గతంలో మాదిరిగా ఈసారి కూడా ఈ రాజీనామాల వెనుక ఆయనే ఉన్నాడనేది తెలంగాణవాదుల నమ్మకం.  చంద్రబాబు, లగడపాటి, కావూరి, రాయపాటి, కిరణ్‌రెడ్డి, బొత్స ఎవరెన్ని తప్పుడు కూతలు కూసినా, ఎన్ని డ్రామాబాజీలు చేసినా కాంగ్రెస్‌ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. కానీ దీంతోపాటు కేవలం పోలవరానికి జాతీయ హోదా కల్పించి, చేవేళ్ళ`ప్రాణహితను విస్మరించడం దుర్మార్గం. అలాగే హైదరాబాద్‌ పదేళ్ళు ఉమ్మడి రాజధాని అనడం కూడా అవాంఛనీయం.
ఉద్యమకారులు భయపడ్డట్టుగా రాయల తెలంగాణ కాకుండా పదిజిల్లాల రాష్ట్రం ప్రకటించడం ముదావహమే గానీ దానికి హైదరాబాద్‌ని సమిష్టి రాజధానిగా పదేళ్ళుంటుందని ప్రకటించడం పూర్తిగా అన్యాయం.        సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి కేవలం రెండు మూడేళ్ళు సరిపోతుంది. అలాంటిది పదేళ్ళపాటు అనడంలోనే దుర్మార్గమైన ఆలోచన ఉంది. ఈ ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్‌పై పాలనాధికారం ఎవరికుంటుంది? రెవిన్యూ, ఆదాయం ఎవరికి దక్కుతుంది? పన్నులు వేసే ఆధికారం, వసూలు చేసుకునే అవకాశం ఎవరికి దక్కుతుంది? వనరుల్ని ఏ నిష్పత్తిలో వాడుకోవాలి? ఇలాంటి ఇంకా అనేక ప్రశ్నలకు ఇప్పుడు జవాబుల్లేవు.
‘ఇసుంత రమ్మంటె ఇల్లంత నాదే’ అనే ఆధిపత్యాంధ్రులతో రెండు మూడేళ్ళు రాజధానిని పంచుకోవడానికి  అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఈ రెండేళ్ళ కటాఫ్‌ డేట్‌ తరువాత ఆంధ్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఎన్ని రోజులు ఎక్కువగా ఉంటాయో ఆ కాలానికి మార్కెట్‌ రేటు ప్రకారం కిరాయి చెల్లించేలా చట్టాల్ని తీసుకురావాలి. దాన్ని కూడా మూడేళ్ళకు మించకుండా చూసుకోవాలి. గతంలో మద్రాసు నుంచి కార్యాలయాలు కర్నూలుకు తరలించక బోవడంతో రాజాజీ ఆంధ్రుల దగ్గరి నుంచి కార్యాలయాల కిరాయి వసూలు జేసిండు కూడా!
సమిష్టి రాజధాని విషయంలో ఏ మాత్రం రాజీపడ్డా ఆంధ్ర నాయకులు హైదరాబాద్‌లో శాశ్వతంగా తిష్టవేసేందుకు కుట్రలు పన్నే అవకాశముంది. ఇప్పటికే హైదరాబాద్‌ని ఆవాసంగా చేసుకొని, ఇక్కడి సంస్కృతి పట్ల గౌరవంతో ఉన్న వారితో ఏ తెలంగాణవాదికి ద్వేషభావం లేదు. అయితే ఆధిపత్యం చలాయించి, దబాయించాలనుకుంటే, రుబాబు చేయాలనుకుంటే చెల్లదు. హైదరాబాద్‌ని అంగడి సరుకుగా మార్చి నిత్యం వేలం వేసిన సీమాంధ్ర నాయకులు తామున్న పదేళ్ళ కాలంలో నగరాన్ని ‘లూటి పోయిన చేను’ని చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ దశలో తెలంగాణ సమాజం అత్యంత జాగరూకతతో ఉండాలి.
ఈ పంచాయితి ఎట్లున్నా తెలంగాణ కల సాకారం కాబోతున్న తరుణంలో ఉద్యమకారులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు మరింత జాగరూకతతో ఉండాలి. విభజన సమయంలో విజిలెంట్‌గా లేనట్లయితే మోసాకారి విద్యలు బాగా తెలిసిన వలసాంధ్రుల చేతిలో మరోసారి భంగ పడే అవకాశముంది. ఆస్తులు, అప్పులు పంచుకునే విషయంలో తెలివిగా లేనట్లయితే అప్పులన్నీ మన నెత్తిన బెట్టి ఆస్తులు వాళ్లు కాజెయ్యగలరు.  ఇప్పటికే సెక్రెటేరియట్‌లోని కీలక శాఖల్లో ఫైళ్ళను తగలబెడుతూ తమ అవినీతి, దోపిడీకి, కబ్జాలకు సాక్ష్యాలు మాయం జేస్తున్నారు.
తెలంగాణ వచ్చిందనే సంబూరంలో ఆంధ్రులు పెట్టే అన్ని డిమాండ్లకు, షరతులకు ఇక్కడి నాయకులు గుడ్డిగా ఆమోదం తెలిపే అవకాశముంది. అందుకే ఈ నాయకులను కూడా చైతన్యవంతుల్ని చేసే విధంగా వివిధ రంగాల్లోని నిష్ణాతులు గ్రూప్‌లుగా ఏర్పడి విభజన రూట్‌మ్యాప్‌ని నిర్దేశించాల్సిన అవసరముంది. పంపకాలు ఎట్లా జేసుకోవాలి అనే మార్గదర్శకాలని తయారు చేసి అన్యాయం జరగకుండా చూడాలి. విద్యుత్‌, విద్య, నీటిపారుదల ఇలా సకల రంగాల్లో లెక్కలు తీసి భవిష్యత్తరాల వారు నష్టపోకుండా పంపకాలు న్యాయంగా జరిగేందుకు ఇరు ప్రాంతాల వారికి ఆమోదమైన పెద్దమనుషులతో కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు ట్రాన్స్‌పరెంట్‌గా ఎక్కడ అవినీతికి, ద్వంద్వనీతికి తావివ్వకుండా ఈ కమిటీలు పనిచేయాలి. ఇక్కడ ఏమాత్రం ఆలసత్వం వహించినా మన 60 యేండ్ల పోరాటం సున్నా చుడుతుంది. భవిష్యత్తరాల వారికి తీరని అన్యాయం జరుగుతుంది. ఒక్క తప్పుడు నిర్ణయం మనది మనకు కాకుండా జేస్తుంది. ‘నాది నాకే, నీదీ నాకే’ అనే దోపిడీ మనస్తత్వంతో ఉండే వలసాంధ్రుల ప్రతిపాదనలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి.

                                                                                                                                                                                                                                                                             -సంగిశెట్టి శ్రీనివాస్‌ 








KCR interview with ABN - sangishetty

http://www.youtube.com/watch?v=b3S_jMTJcVA

watch this video i was mentioned in the ending in this interview 

Wednesday 29 May 2013

The warrior poet of Telangana Ruknuddin

ప్రత్యేక తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దిన్‌

The Warrior poet Ruknuddin (1947-27th may 2013)
          1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్‌ కలం, గళం మూగపోయింది. ఆయన గుజరాత్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు గాలిబ్‌ వద్ద సోమవారం కన్నుమూశారు. వలసాంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని తన అక్షరాలతో బోనులో నిలబెట్టడమే గాకుండా, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు జైలు శిక్ష సైతం అనుభవించాడు. కవిగా అక్షరాలను సంధించడమే గాకుండా, మహబూబ్‌నగర్‌ జిల్లా అంతటా తిరిగి తన మాటాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిండు.
కేవలం 22 యేండ్ల వయసులో మొత్తం పాలమూరు జిల్లా అంతటా తిండి తిప్పలు లేకుండా రాత్రనకా పగలనకా తిరుగుతూ ఉద్యమానికి ఊపిరిపోసిన రుక్నుద్దిన్‌ కవిగా, రచయితగా, ఉద్యమకారుడిగా, పరిశోధకుడిగా, ప్రొఫెసర్‌గా తెలంగాణ ముఖచిత్రానికి మెరుగైన రంగుల్ని అద్దిండు. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌లు ఆయన కార్యక్షేత్రాలుగా ఉండేవి. పాలెం ఓరియంటల్‌ కళాశాలలో బిఓఎల్‌ చదువుతూ గురువు శ్రీరంగాచార్య ప్రోత్సాహం, గైడెన్స్‌లో ఉద్యమ కవిత్వాన్ని, కరపత్రాల్ని రాసిండు. మిత్రుడు, క్లాస్‌మేట్‌, రూమ్‌మేట్‌ కూడా అయిన జి.యాదగిరితో కలిసి కవిత్వాన్ని పుస్తకంగా తీసుకొచ్చిండు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్న దశలోనే అప్పుచేసి ‘విప్లవ ఢంకా’ పేరుతో కవిత్వాన్ని పుస్తకంగా తీసుకొచ్చిండ్రు. ఈ అప్పుని ఉద్యోగాలు వచ్చిన తర్వాత తీర్చామని నాటి ఉద్యమస్ఫూర్తిని, చైతన్యాన్ని రుక్నుద్దిన్‌ సహ రచయిత అయిన జి.యాదగిరి ఇప్పటికీ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.
తండ్రి, అన్న కమ్మరి పనిచేసి రుక్నుద్దిన్‌ని చదివించారు. దానికి తగ్గట్టుగానే చదువులో పాలెం కళాశాల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదటి స్థానాల్లో నిలిచేవారు. పాలెంలో రుక్నుద్దిన్‌ క్లాస్‌మేట్‌లు, రూమ్మేట్లు వామపక్ష ఉద్యమాలతో పెనవేసుకున్న జి.యాదగిరి ఒకరు కాగా మరొకరు రైటిస్ట్‌ తెలుగు ప్రొఫెసర్‌ కసిరెడ్డి వెంకటరెడ్డి. 
మొదట తెలుగు పండితుడిగా టీచర్‌ ఉద్యోగంలో చేరిన రుక్నుద్దిన్‌ పోల్కంపల్లి, మాసపేట తదితర గ్రామాల్లో పనిచేశాడు. అనంతరం 1976లో జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికై జడ్చర్ల, మఖ్తల్‌, కల్వకుర్తి, భువనగిరి తదితర ప్రాంతాల్లో పనిచేశారు. సంస్కృతంలో కూడా ఎమ్మే చేసిన రుక్నుద్దిన్‌ 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అసిస్టెంట్‌ రీడర్‌గా జాయినై ఎందరో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచాడు. తాను జూనియర్‌ కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకు తలలో నాలుకలా ఉండడమే గాకుండా వారికి అన్నివిధాల సహాయ సహకారాలందించే వారు. తన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు తన చేతనైన సాయం జేసేవాడు. ఈయన నేతృత్వంలో ఎందరో విద్యార్ధులు, ఎంఫిల్‌, పి.హెచ్‌డీ పట్టాలను పొందారు. చందాల కేశవదాసు మీద జరిగిన పరిశోధనకు కూడా రుక్నుద్దిన్‌గారే గైడ్‌గా వ్యవహరించారు. లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల భావాల మూలంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎబివిపీ విద్యార్ధుల నుంచి దాడుల్ని కూడా ఎదుర్కొన్నాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన ధైర్యశాలి రుక్నుద్దిన్‌. కులాలు, మతాల పట్టింపులు ఏమాత్రం లేని రుక్నుద్దిన్‌కు ఇద్దరు కుమారులు, ఒక్క కూతురు. కొడుకు మతాంతర వివాహాన్ని కూడా ఆయన ఆహ్వానించాడు. 
1947లో కల్వకుర్తి తాలూకా రాచూరులో చాంద్‌బీ, జహంగీర్‌ దంపతులకు జన్మించిన రుక్నుద్దిన్‌ విద్యార్థి దశలో అత్యంత పేదరికం అనుభవించాడు. ఆకలి, కసి, తెలంగాణపై సీమాంధ్రుల ఆధిపత్యం ఆయన్ని పోరాట కవిగా తర్చిదిద్దింది. విద్యార్థిగా ఉన్నప్పుడే గుళ్ళు, చెరువు గట్లమీద శాసనాలను సేకరించి పరిశోధన చేసేవాడు. అలాగే 1984లో తెలుగులో జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన చేసిండు. విశ్వదర్శనం గేయ సంపుటి. రిటైర్మెంట్‌ సందర్భంగా ప్రయాణం పేరిట తాను నడిచివచ్చిన దారిని గుర్తు చేసుకుంటూ పుస్తకాన్ని వెలువరించారు.
‘తెలంగాణము’ నా జన్మ హక్కని
తెలిసి చాటవోయీ!
దుష్ట శత్రువుల కరకర గోయుచు
దును మాడుమురోయీ!
మృతవీరుల హృదయాంత రంగముల ముచ్చట గూర్చోయీ! అంటూ ఆనాడు కవిత్వాన్ని ఆయుధంగా మలిచి ఆధిపత్యాంధ్రులపై ప్రయోగించాడు. ఇట్లా అనేక కవితలు ‘విప్లవ ఢంకా’లో చోటు చేసుకున్నాయి. 
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలుగులో సాహిత్యం వెలువడలేదని సీమాంధ్ర సాహిత్యకారులు, చరిత్రకారులు, విమర్శకులు గుడ్డిగా అవాకులు చవాకులు పేలుతున్న సందర్భంలో ఆనాటి ఉద్యమ కవిత్వాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి నేను ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ‘1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం’ పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కవిత్వం రాసిన తొట్ట తొలికవుల్లో రుక్నుద్దిన్‌ది అద్వితీయస్థానం. 
‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం తరపున ముస్లిం ప్రత్యేక సంచికను తెస్తున్నాం దానికి మీరు మార్గదర్శన చేయాలని అడిగినప్పుడు, అవసరమైన మంచి పని చేస్తున్నారు, నా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి. అయితే నేనిప్పుడు మా కొడుకు దగ్గరికి అమెరికాకు వెళ్తున్నాను తిరిగి వచ్చిన తర్వాత కలుద్దాం కలకాలం నిలిచిపోయేలా సంచికను తీసుకొద్దాం అని చెప్పిన రుక్నుద్దిన్‌ అమెరికా నుంచే అనారోగ్యంతో వచ్చారు. అక్కడి వాతావరణం సరిపడక అస్వస్థులయ్యారు. చివరకు అదే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆశించిన ప్రత్యేక తెలంగాణ సాధన, అందుకు కవులుగా, రచయితలుగా ఎవరికీ, దేనికీ తలవంచకుండా పోరాడడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి.
- సంగిశెట్టి శ్రీనివాస్‌

Monday 4 March 2013

Kothwal Venkata ramireddy and his contribution to the press

కోటి ఆలోచనలకు ప్రాణంపోసిన కొత్వాలు

తెలంగాణలో సాంస్కృతిక వికాసానికి పునాది శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ స్థాపన. చదువుకున్న నలుగురు చైతన్యవంతులున్న తెలంగాణలోని ప్రతి ఊరిలోనూ 1950ల వరకూ గ్రంథాలయాల ఏర్పాటు అనేది ఒక తప్పనిసరి ప్రక్రియగా ఉండిరది. ఈ గ్రంథాలయాలే తర్వాతి కాలంలో రాజకీయ చైతన్యానికి పునాదిగా నిలిచాయి. గ్రంథాలయాలు కేవలం కూడలి కేంద్రంగా కాకుండా రోజువారి దేశీయ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు చర్చించుకునే రచ్చబండలుగా ఉండేవి. తొలి దశలో తెలంగాణాలో పుస్తక/పత్రిక ప్రచురణ తక్కువగా ఉండడంతో ఈ గ్రంథాలయాలు ఆంధ్రప్రాంతానికి చెందిన వీరేశలింగం, గురజాడ అప్పారావుతో పాటుగా కొమర్రాజు లక్ష్మణరావు తదితరుల రచనలు తెప్పించేవి. కొన్ని గ్రంథాలయాలకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఉచితంగా ఆంధ్రపత్రికను పంపించేవారు. అయితే గ్రంథాలయాలు పెరగడంతో పాటు దానికి ప్రేరణగా పత్రికల స్థాపన జరిగింది. ఇవన్నీ కలగలిసి నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం  స్థాపనకు దారి తీసింది. అది తర్వాతి కాలంలో నిజాం రాష్ట్రాంధ్ర మహాసభగా మారడం జరిగింది.
గ్రంథాలయాలు పెరగడం, దాంట్లో చదవడానికి పత్రికలు అవసరం కావడంతో 1922లో నల్లగొండ నుంచి నీలగిరి పత్రికను షబ్నవీసు వెంకటరామనరసింహారావు, తర్వాత వరంగల్‌్‌ జిల్లా ఇనుగుర్తి నుంచి ఒద్దిరాజు సోదరులు తెనుగు పత్రికను స్థాపించి నిర్వహించారు. ఇవి రెండూ తెలంగాణ ప్రజల్లో ఒకవైపు రాజకీయ చైతన్యం, మరోవైపు సాహిత్య సృజనకు ఇతోధికంగా తోడ్పడ్డాయి. 1925లో సురవరం ప్రతాపరెడ్డి హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్‌ నిర్వాహకుడిగా హైదరాబాద్‌లో ఉండేవాడు. అప్పటికే మద్రాసులో చదువుకోవడమే గాకుండా వేదం వెంకటరాయశాస్త్రి లాంటి వారి శిష్యరికం, అక్కడి నుంచి వెలువడుతున్న ఆంధ్రపత్రిక, 1924 నుంచి భారతి పత్రిక తెలుగు సమాజంపై వేస్తున్న గాఢమైన ప్రభావాన్ని సురవరం ప్రతాపరెడ్డి చాలా దగ్గరి నుంచి చూసిండు. తాను చదువుకున్న ‘లా’ చదువు కేవలం రెడ్డి హాస్టల్‌ వార్డెన్‌కు మాత్రమే పరిమితం కావడం ప్రతాపరెడ్డికి ఇష్టం లేకుండేది. అందుకే తెలంగాణలో ప్రజా చైతన్యం కోసం, ఆత్మగౌరవం కోసం, మహారాష్ట్రీయుల, ముస్లిముల ఆధిపత్యాన్ని ఎదుర్కునేందుకు, తెలంగాణలోని తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఒక పత్రిక స్థాపన అవసరమున్నదనే విషయాన్ని తనను హైదరాబాద్‌లో ఉండేందుకు వత్తిడి తెచ్చి కృతకృత్యుడైన రాజబహద్దూర్‌ వెంకటరామారెడ్డితో చెప్పిండు. నిజానికి ప్రతాపరెడ్డికి విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వారపత్రిక నడపాలని కోరిక ఉండేది. దానికి ‘దేశబంధు’ అనే పేరు పెట్టాలని కూడా తన డైరీలో రాసుకున్నాడు.
ఒక వైపు 1922 నుంచే ‘రెడ్డిరాణి’, ‘మాతృసేవ’ తదితర ఆంధ్రప్రాంత పత్రికల్లో ప్రతాపరెడ్డి వెలువరించిన రచనలు ఆయనకు యావదాంధ్రలో మంచి పేరు తీసుకొచ్చింది. మరోవైపు రెడ్డి హాస్టల్‌ నిర్వహణ ఒక్కటే తనలోని జ్ఞానతృష్ణను తీర్చబోదని తెలుసుకున్నాడు. దీంతో పత్రికస్థాపన అంశంపై దృష్టి కేంద్రీకరించి తరచూ రెడ్డిహాస్టల్‌ అధ్యక్షులు రాజబహదూర్‌ వెంకటరామారెడ్డితో ప్రస్తావించేవాడు. దీనికి కొత్వాలు వెంకటరామారెడ్డి కూడా సూత్రప్రాయంగా అంగీకరించాడు. ఎందుకంటే తాను గతంలో లింగ్సూగూర్‌, యాద్గీర్‌, ఔరంగాబాద్‌, గుల్బర్గా తదితర ప్రదేశాల్లో పనిచేసినపుడు తన వృత్తిలో భాగంగా పత్రికలు ప్రజలపై వేసిన ప్రభావాన్ని గ్రహించాడు. అందునా అది నిజామాబాద్‌ అయినా, హైదరాబాద్‌ అయినా కార్యాలయాల్లో, కోర్టుల్లో, వివిధ అధికార భవనాల్లో కేవలం ఉర్దూ పత్రికలు కొన్ని చోట్ల ఇంగ్లీషు పత్రికలు మాత్రమే ప్రాచుర్యంలో ఉండడాన్ని కొత్వాలు గ్రహించాడు. తెలంగాణలోని తెలుగు ప్రజలకు ప్రభుత్వంలో జరుగుతున్న విషయాల్ని తెలియజెప్పడానికైనా, ప్రజలు ఏమి కోరుతున్నారో ప్రభుత్వం తెలుసుకోవడానికైనా ‘తెలుగు పత్రిక’ అవసరమున్నదనే విషయాన్ని నమ్మాడు. సురవరం ప్రతాపరెడ్డి లాంటి సమర్ధుడైన నిర్వాహకుడు లభించడంతో తాను ఆశించిందే, ఆయన కోరుకున్నడు కాబట్టి పత్రిక స్థాపన సాధ్యమయింది.
పత్రిక స్థాపించినట్లయితేనే తాను హైదరాబాద్‌లో ఉంటానని లేనట్లయితే తానిక్కడ ఉండడంవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కొత్వాలుతో సురవరం చాలా సార్లు చెప్పిండు. దీనికి కొత్వాలు వెంకటరామారెడ్డి కూడా సూత్రప్రాయంగా అంగీకరించి దానికి తగిన సమయం కోసం ఆలోచిస్తూ ఉండేవాడు. ప్రతాపరెడ్డిని హైదరాబాద్‌లో నిలిపి ఉంచినట్లయితే కేవలం రెడ్లకే గాకుండా మొత్తం తెలంగాణ సమాజవికాసానికి ఉపయోగంగా ఉంటుందని భావించి ఆ మేరకు ప్రతాపరెడ్డికి హామీ కూడా ఇచ్చాడు.
హామీ మేరకు వనపర్తి సంస్థానాధీశులు, పింగళి వెంకటరామారెడ్డి తదితర ఏడుగురి నుంచి తలా వేయి రూపాయలు సేకరించి మొత్తం ఏడువేల మూడు వందల రూపాయలు ప్రతాపరెడ్డికి అప్పజెప్పి ముద్రణాయంత్రం ఖరీదు చేసేందుకు మద్రాసుకు పంపించారు. పత్రికను ఆర్థికంగా ఆదుకున్న వారిని రాజపోషకులు, పోషకులు, అభిమానులుగా విభజించి వారిచ్చిన విరాళాల ఆధారంగా గుర్తింపునిచ్చేవారు. మద్రాసు నుంచి తీసుకొచ్చిన ముద్రణా యంత్రాన్ని మొదట రెడ్డిహాస్టల్‌ భవనంలోనే ఏర్పాటు చేయాలని భావించారు. ఈ రెడ్డిహాస్టల్‌ ఉన్న ప్రదేశం రెసిడెన్సీ కిందికి రావడంతో అక్కడి అధికారులు ప్రతాపరెడ్డిలోని తిరుగుబాటు భావజాలాన్ని సాకుగా ఎంచుకొని పత్రిక స్థాపనకు అనుమతి నిరాకరించారు.
పత్రిక స్థాపనలో కీలక వ్యక్తి కొత్వాలు వెంకటరామారెడ్డి కావడంతో అందుకు అనుమతి సునాయసంగా దొరుకుతుందని ప్రతాపరెడ్డి విశ్వసించాడు. అయితే రెసిడెన్సీ ప్రాంతంలో అంటే బ్రిటీష్‌ వారి అజమాయిషీ, అధికారం, న్యాయం, చట్టం, రక్షణ అమల్లో ఉన్న కోఠీ, ఆబిడ్స్‌, ఇసామియా బజార్‌లలో బ్రిటీష్‌ వారి పాలన సాగేది. అక్కడ పత్రికకు అనుమతి లభించడం కష్టం కావడంతో పత్రిక కార్యాలయాన్ని వేరే ప్రదేశానికి మార్చారు. అప్పుడు పత్రికను నిజాం పాలిత మురళీధర్‌బాగ్‌ (ట్రూప్‌ బజార్‌కు సమీపంలో)లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పత్రిక పేరులో ‘ఆంధ్ర’ అని ఉన్నట్లయితే అంత సునాయసంగా అనుమతి నిజామ్‌ అధికారుల నుంచి కూడా దొరకవనే గత అనుభవాలున్నాయి. దీంతో చివరికి పత్రిక పేరును ‘గోలకొండ’ గా పెట్టారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ సంబంధించినదిగా, ఆత్మగౌరవ ప్రతీకగా, హిందూ`ముస్లిం మైత్రికి చిహ్నంగా, చారిత్రక గుర్తు కావడంతో జనులందరి ఆమోదం పొందింది.
పత్రికను ఎలా తీసుకురావాలనే విషయంలో రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు తదితర ముఖ్యులు చాలాసార్లు చర్చలు కూడా చేశారు. పత్రికకు ఆర్థిక వసతి సమకూర్చడమే గాకుండా అనుమతి కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకున్న రాజబహదూర్‌ కొత్వాలు వెంకటరామారెడ్డి మే పదో తేదీనాడు (1925) నాడు పత్రిక మొదటి ప్రతి తీసుకురావాలని ప్రతాపరెడ్డికి నిర్దేశించారు. కేవలం రెండు రోజుల ముందుగా, అది తన కుమారుడు రంగారెడ్డి దౌరాకు పోతున్నందున అక్కడ పత్రికకు చందాలు, విరాళాలు సేకరించడం వీలవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి గారు అప్పట్లో అబ్కారీ మొహతమీమ్‌గా ఉండేవారు. నిజానికి ప్రతాపరెడ్డికి మొదటి నుంచీ పత్రికను వార పత్రికగా తీసుకొచ్చినట్లయితే సమగ్రంగా తీసుకురావడానికి, ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంటుందని భావించాడు. అయితే అప్పటికే నీలగిరి, తెనుగుపత్రికలు వారపత్రికలుగా నడుస్తూ, ఆర్థిక ఇబ్బందులతో మూలుగుతున్నందున వాటికి పోటీగా అన్ని హంగులతో ‘గోలకొండ’ పత్రిక వచ్చినట్లయితే వాటిని మూసేయడం తప్ప మరో మార్గం ఉండదని భావించి మాడపాటి హనుమంతరావు పత్రికను ద్వైవార పత్రికగా తీసుకురావాలని కోరాడు. ఆయన కోరికమేరకు పత్రికను ద్వైవార పత్రికగా, అంతకు ముందు ఎవ్వరూ తీసుకురాని విధంగా ప్రతి సోమ, బుధవారాల్లో పత్రికను వెలువరించారు. పత్రిక కొద్ది రోజుల నడిచిన తర్వాత ఒకవైపు నిజాం ప్రభుత్వాధికారుల నోటీసులు, తనిఖీలు, మరోవైపు ఫ్యూన్‌ నుంచి సంపాదకుడి వరకు అన్నీ తానే అయి పత్రికను నిర్వహించాల్సి రావడం, మరోవైపు వకాలత్‌ కాకుండా సంపాదకుడిగా వ్యవహరించడం చిన్నాన్న రామకృష్ణారెడ్డికి నచ్చక పోవడం అన్నీ కలగలిసి పత్రికను మూసేద్దాం, నావల్ల కావడం లేదు, మా చిన్నాన్న వకాలతు పనిచేపట్టమని వత్తిడి తెస్తున్నాడని కొత్వాలుతో ప్రతాపరెడ్డి చెప్పుకున్నాడు. దానికి కొత్వాలు ఆలోచించి తనకు తెలిసిన మార్వాడీల లావాదేవీలు చూసేందుకు హైకోర్టులో సనదు ఇప్పించడమే గాకుండా నెలకు మూడువందల రూపాయల ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేశాడు. దీంతో పత్రిక సజావుగా సాగింది. పత్రికను తన సొంతబిడ్డలా సాకడమే గాకుండా తెలంగాణ ప్రజల గొంతుకై వివిధ వేదికల నుంచి వినిపించిండు.
కొత్వాలు గారి పూర్తి పూనికమేరకే గోలకొండ స్థాపితమయింది. అందులో వాటదార్లను చేర్పించడానికి వివిధ సంపన్నుల్ని తన వద్దకి పిలిపించుకొని పత్రిక ఆవశ్యకతను వారికి చెప్పి ఒప్పించాడు. పత్రికపట్ల వారికి అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ కొత్వాలుగారి మాటను తీసిపారెయ్యలేకనే చాలామంది పోషకులుగా చేరారు. ఈ ఒక్క పత్రిక స్థాపన మూలంగా తర్వాతి కాలంలో నారాయణగూడ బాలికల పాఠశాల, ఆంధ్రవిద్యాలయం, ఆంధ్రసారస్వత పరిషత్తు, విజ్ఞానవర్ధినీ పరిషత్తు, రెడ్డి బాలికల కళాశాల తదితర ప్రజాహితమైన సంస్థల స్థాపన సాధ్యమయింది. వీటన్నింటికీ ప్రధాన కారణం కొత్వాలుగారి పూనిక. తోడ్పాటు.
గోలకొండ పత్రిక ప్రారంభమైన తర్వాత తెలంగాణలోని తెలుగుప్రజల్లో నూతన ఉత్తేజం వచ్చింది. ఇది 1930లో ఆంధ్రమహాసభ మొదటి మహాసభ ప్రతాపరెడ్డి అధ్యక్షతన జోగిపేటలో జరగడానికి దోహదపడిరది. అంతేకాదు ప్రభుత్వం తరపున ఈ సభల్లో ఆయా శాఖల ప్రదర్శనల ఏర్పాటు కూడా రాజబహదూర్‌ చొరవ వల్ల ఏర్పాటయ్యాయి.
కొత్వాలుసాబ్‌ పత్రికారంగానికి చేయూతనివ్వడమంటే ప్రజాభ్యుదయానికి తోడ్పడడమే అని అర్థం చేసుకోవాలి. చాలా వరకు ఆర్థికంగా ఆదుకోవడమే గాకుండా తన పరిధిలో మాట సాయం చేసి దాదాపు అసాధ్యమైన పనుల్ని సుసాధ్యం చేశాడు. పత్రికా నిర్వహకులకు ఇతోధికంగా తోడ్పడుతూ తద్వారా సమాజాభ్యున్నతికి తనవంతు కృషి చేసిండు. గోలకొండ పత్రిక ఏర్పాటు కావడం నుంచి అది 1948లో హైదరాబాద్‌ రాష్ట్రంపై పోలీసుచర్య తర్వాత లిమిటెడ్‌ కంపెనీగా మారేవరకు రాజబహద్దూర్‌ గారి ప్రత్యక్ష తోడ్పాటు అక్షరాలకందనిది. ఏ కష్టమొచ్చినా, తాను ముందుండి ఆదుకున్నాడు. పత్రిక స్థాపన కాలంలో రెడ్డిహాస్టల్‌ విద్యార్థులే విలేకరులు, విలేఖకులై గోలకొండను నిలబెట్టారు. వారికి అన్ని విధాల రెడ్డి హాస్టల్‌ అధ్యక్షుడిగా కొత్వాల్‌ సహాయ సహకారాలందించేవాడు. పత్రికారంగానికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది. ఆయన పోలీసు అధికారి కావడంతో తాను చేసిన ఏ పనికీ ప్రాచుర్యత ఇచ్చేవారు కాదు. దాంతో ఆయన సేవ గురించిన సమాచారం అరకొరగా దొరుకుతోంది. గోలకొండ పత్రికను తన హృదయానికి దగ్గరగా చూసుకున్నాడు కాబట్టే పత్రిక నిర్వహణలో ప్రతాపరెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే ప్రతాపరెడ్డి దొరలు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండ్యాలు, సంస్థానాధీశుల్ని తన సంపాదకీయాల్లో, వార్తల్లో ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఉండేవాడు. ఒక వైపు పత్రికలో పెట్టుబడులు పెట్టిన వారినే విమర్శిస్తున్నా ఎవ్వరు కూడా ప్రతాపరెడ్డిని విమర్శించే లేదా తప్పుబట్టే సాహసం చేయలేదు. దానికి ప్రధాన కారణం ప్రతాపరెడ్డి గారికి కొత్వాలుగారి అండదండలు పుష్కలంగా ఉండడమే!
గోలకొండ పత్రికతో పాటు 1925`40 మధ్యకాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా వెలువడ్డ తెలుగు, ఉర్దూ పత్రికలన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొత్వాలు సాబ్‌ సహాయముండేదంటే అతిశయోక్తి కాదు. నారాయణగూడా బాలికల పాఠశాల తరపున ‘మాతృభారతి’ అనే వార్షిక పత్రికను వెలువరించేవారు. బిదురు వెంకటశేషయ్య నేతృత్వంలో వెలువడే ఈ పత్రికకు ఆర్థికంగా,హార్థికంగా కూడా కొత్వాలుసాబ్‌ తోడ్పడే వారు.
 మాతృభారతి పత్రిక ఏర్పాటు కొత్వాలుగారి ‘బ్రెయిన్‌చైల్డ్‌’ అంటే తప్పుకాదు. ఇది తెలంగాణలో తొలి స్త్రీల పత్రిక. బిదురు వెంకటశేషయ్య, చలమచర్ల రంగాచార్యులుతో పాటుగా కె.రామమూర్తి కూడా సంపాదకవర్గంలో ఉండేవారు. అలాగే మరో ముగ్గురు మహిళలు కూడా సంపాదకవర్గంలో ఉండేవారు. వాళ్ళు వి.సుందరమ్మ, కె.లక్ష్మిబాయమ్మ, కె.వెంకటరమణమ్మ. పదుల సంఖ్యలో విద్యార్థినులు పరిణతి చెందిన రచనలు ఈ సంపుటాల్లో వెలువరించారు. అందుకే భారతి లాంటి పత్రికలు వీటిని సమీక్షిస్తూ ఇవి విద్యార్థులు రాశారంటే నమ్మశక్యంగా లేదు. ఏ చేయితిరిగిన రచయితో రాశారనే విధంగా ఉన్నాయని కొనియాడిరది. అంటే పత్రికయొక్క ఉన్నతస్థాయి విలువలు అర్థం చేసుకోవచ్చు.
1928లో మాడపాటి హనుమంతరావు, వడ్లకొండ నరసింహారావులతో కలిసి నారాయణగూడ బాలికల పాఠశాలను కొత్వాలుగారు స్థాపించారు. ఈ పాఠశాల కమిటీకి ఆయనే అధ్యక్షుడిగా ఉండేవారు. తెలుగు మాధ్యమంలో బోధన చేసిన మొట్టమొదటి హైదరాబాద్‌రాష్ట్ర పాఠశాల ఇది. ఈ పాఠశాలలో బిదురు వెంకటశేషయ్య, చెలమచెర్ల రంగాచార్యులు తదితరులు ఉపాధ్యాయులుగా ఉండేవారు. ఈ పాఠశాల విద్యార్థులు సృజనాత్మక రచనలు చేసేవిధంగా ప్రోత్సహించేందుకు గాను ‘మాతృభారతి’ అనే లిఖితపత్రికను ఏర్పాటు చేశారు. ఈ లిఖిత పత్రికను ప్రతి యేడాదికోసారి ముద్రించేవారు కూడా. ఈ పాఠశాల నుండి తర్వాతి కాలంలో ఉన్నతస్థాయి రచయిత్రులుగా ఎదిగిన వారిలో నందగిరి ఇందిరాదేవి, నేమాని భారతి రత్నాకరాంబ తదితరులు ముఖ్యులు. 1930వ దశకంలోనే కథలు, పద్యాలు, నాటికలు ఈ పాఠశాల విద్యార్థులు రాశారంటే ఈ పత్రిక వేసిన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పత్రికను వెలువరించడంలో కొత్వాలుగారిది ముఖ్య భూమిక. 1935లో వెలువడ్డ వార్షిక సంచికకు రాజబహద్దూర్‌ వెంకటరామారెడ్డి ‘తొలిపలుకు’ రాస్తూ ‘‘మాతృభారతి’ యను లిఖిత మాసపత్రిక మా పాఠశాల విద్యార్థినులలో లేఖనోత్సాహమును వృద్ధిపరచునుద్దేశముతో గత సంవత్సరమునుండి వెలువడుచున్నది. సంవత్సరాంతమున దీనియందు వ్రాయబడిన వ్యాసములను సంపుటముగా ముద్రించి ఆంధ్రమహాజనుల కందజేయవలెనని నిశ్చయింపబడెన. ఈప్రయత్నము ఫలరూపమును దాల్చుట సంతోషావహము.
బాలికలకు తమతమ మాతృభాషలో స్త్రీల కనుగుణ్యమగు ప్రత్యేకవిధానము ననుసరించి ఉన్నత విద్యను నేర్పుటకు హిందూదేశమునందవకాశములను మొట్టమొదట కల్పించగలిగినది భారతమహిళా విశ్వవిద్యాలయమే. దీని స్థాపకులగు ఆచార్య కర్వేగారు నాకు చిరకాల మిత్రులు. వీరీవిషయమున చేయుచున్న కృషి త్యాగము ఆదర్శ ప్రాయములు’’ అన్నారు. అంటే ఈ పాఠశాలను కొత్వాలుగారు ఎంతగా అభిమానించారో అర్థమవుతుంది. పాఠశాలకు స్థలం, భవనం తానే దగ్గరుండి సమకూర్చాడు. అట్లాంటిది పత్రిక కూడా ఆయన ప్రోత్సాహంతో 1940 వరకు ప్రతి యేటా ప్రచురితమయింది. దీంట్లో కేవలం తెలుగులోనే గాకుండా సంస్కృతంలో కూడా రచనలుండేవి.
ఇంగ్లీషులో వెలువడ్డ హైదరాబాద్‌ బులిటెన్‌, ఉర్దూ పత్రిక రయ్యత్‌, భాగ్యరెడ్డి వర్మ నిర్వహించిన ఆదిహిందూ, ఆదిశక్తి, భాగ్యనగర్‌ పత్రికల ప్రచురణకు కొత్వాలు వెన్నుదన్నుగా నిలిచిండు. వాటికి తనకు తెలిసిన వారి నుంచి ప్రకటనలు ఇప్పించడమే గాకుండా ప్రభుత్వం నుంచి ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకునేవాడు. వేదాల తిరువేంగళాచార్యులు వెలువరించిన ఆయుర్వేద కళ, బుక్కపట్టణం రామానుజాచార్యులు ప్రచురించిన ‘తెలంగాణ’ పత్రికలకు కూడా కొత్వాలుగారు వెన్నుదన్నుగా నిలిచారు. బిదురు వెంకటశేషయ్య (1907`1963) ‘మేధావి’ పేరిట ఆంధ్రసారస్వత పరిషత్తుకు అనుబంధంగా 1946లో ఒక పత్రికను వెలువరించాడు. ఈ పత్రికలో విజ్ఞానవర్ధినీ పరిషత్తు సభ్యులు తమ రచనలు వెలువరించేవారు. ఈ పత్రిక స్థాపనలో చాలా సంస్థల విషయంలో చేసిన విధంగానే ‘గుప్త’దానం చేసి పత్రికను నిలబెట్టాడు. వెంకటశేషయ్య గతంలో నారాయణగూడా పాఠశాలలో పనిచేయడంతో అందుకు కృతజ్ఞతగా అన్నట్టుగా కొత్వాలుగారు ఆర్థికంగా ఆదుకున్నారు.
రోజువారి పోలీసు ఉద్యోగంలో తలమునకలుగా ఉంటూ కూడా వివిధ ప్రజాహిత కార్యకలాపాల్లో కొత్వాలుగారు పాల్గొనేవారు. వీటి వివరాలు చాలా వరకు గోలకొండ పత్రికలో రికార్డయ్యాయి. నిజానికి కొత్వాలుగారి సేవ కులాలకు, మతాలకు అతీతమైనది. హైదరాబాద్‌లో మతోద్రిక్త పరిస్థితులున్నప్పుడల్లా వాటిని చాకచక్యంగా పరిష్కరించి అటు ప్రజల మన్ననలేగాకుంగా, ప్రభువుల మన్ననలందుకొని పత్రికలవారి ప్రశంసలందుకునేవారు. హైదరాబాద్‌లోని ప్రతి కులసంఘం వారు ఆయన సహాయం తీసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అట్లాంటి కొత్వాలుగారు పత్రికారంగానికి చేసిన సేవ కంటికి ఎక్కువగా కనిపించదు. ఆయన ఏది చేసిన కర్తవ్యంగా భావించి చేసేవాడు. ప్రతిఫలమాశించేవాడు కాదు. కొత్వాలు గారు పత్రికారంగానికి ముఖ్యంగా, గోలకొండ, మాతృభారతిలకు చేసిన సేవ తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, చారిత్రక పునర్వికాసానికి పునాదులు వేశాయి. ఉన్నతమైన విలువలున్న సమాజ ఏర్పాటుకు తోడ్పాటు నందించాయి.
-సంగిశెట్టి శ్రీనివాస్‌