Wednesday 31 October 2012

Vakkikota Alwar swamy telangana pioneer




   
   తెలంగాణ పునర్వికాసోద్యమానికి పునాదులు వేసి విభిన్న జీవనరంగాలలో అపారమైన కృషిచేసి నలభైఆరు సంవత్సరాల జీవిత కాలంలోనే అసాధారణ విజయాలు సాధించిన మేధావి, ప్రజలమనిషి వట్టికోట ఆళ్వారుస్వామి.
    కథ, నవల, విమర్శ, నాటకం, కవిత్వం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియలన్నిటిలోనూ ఆళ్వారుస్వామి ప్రవేశించారు. కొన్ని ప్రక్రియలలో చెప్పుకోదగిన ఫలితాలు సాధించారు. స్టేట్‌ కాంగ్రెస్‌, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌, గుమాస్తాల సంఘం, రిక్షాకార్మికుల సంఘం, గ్రంథాలయోద్యమం, పత్రికారచన, పత్రికా నిర్వహణ, సూచీ గ్రంథాలయ నిర్వహణ, తొట్టతొలి పౌరహక్కుల పరిరక్షణ యత్నాలు, పరిశోధన, ప్రచురణలు` తెలంగాణలో ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్ధభాగంలో ఇన్ని రంగాలలోనూ అరుదైన కృషి చేసిన వట్టికోట ఆళ్వారుస్వామిని గుర్తు చేసుకునేందుకు, గౌరవించుకునేందుకు  ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 
    జీవితం మొత్తాన్ని సమాజసేవకు అంకితం చేసి దేశోద్ధారకుడు కాశీనాథుని నాగేశ్వరరావు పేరిట గ్రంథమాలను నిర్వహించి ఎన్నో ఆణిముత్యాలను ప్రచురించాడు. ‘ఉదయఘంటలు’ పేరిట మొదటిసారిగా ఆంధ్ర`తెలంగాణ ప్రాంత కవుల కవిత్వాన్ని పుస్తకంగా అచ్చేసిండు. పౌరహక్కుల ఉద్యమ నేతగా దొడ్డి కొమురయ్య హత్యోదంతాన్ని సాహసోపేతంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వ దురంతాల్ని ఎండగట్టిండు. 

sangisetti speech @ adhore book relaese


Thursday 18 October 2012

DECCAN SARDAR : JAMALAPURAM KESHAVARAO

దక్కన్‌ సర్దార్‌ కేశవరావు

 అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ హైదరాబాద్‌ రాజ్యంలో కాంగ్రెస్‌  పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిగర్వి సర్దార్‌ జమలాపురం కేశవరావు. సత్యాగ్రహిగా, క్విట్‌ ఇండియా ఉద్యమ కార్యకర్తగా, ఆంధ్రమహాసభ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, ఆదివాసీ, దళిత జనోద్ధారకుడిగా, పత్రిక స్థాపకుడిగా ఇలా కొన్ని ఎన్నో కార్యకలాపాలు చేపట్టి హైదరాబాద్‌ రాజ్య ప్రజల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపిన కేశవరావు శత జయంతి సంవత్సరమిది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సభలు, సమావేశాలు జరిగినపుడు ఒక సామాన్య కార్యకర్త మాదిరిగా పందిళ్ళు వేయడానికి గుంజలు కూడా నాటే వాడంటే ఆయన నిరాడంబరత, శ్రమైక జీవనం తెలుస్తుంది. కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాల మూలంగా ఆయనకు రావాల్సినంత పేరు రాలేదుగానీ, ఆయన మరే ఇతర పార్టీలో ఉండి ఉన్నా జాతీయ స్థాయి నాయకుడయ్యేవాడంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తన రాజకీయాల మూలంగా రెండు సార్లు జైలుకెళ్లి శిక్షను, హింసను ఎదుర్కొన్నాడు. తన కంచు కంఠంతో, ఆజానుబాహు రూపంతో తాను చేపట్టిన ప్రతి ఉద్యమంలోనూ విజయాల్ని సాధించాడు. అయితే స్వాతంత్య్రానంతర పరిణామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు ద్రోహం చేసి ఓడిరచింది. రాజకీయాల నుంచి, ఈ లోకం నుంచి ఆయన్ని శాశ్వతంగా పైకి పంపించింది. తెలంగాణ కేసరిగా, ‘దక్కన్‌ సర్దార్‌’గా బిరుదులందుకున్న జమలాపురం కేశవరావు తనదైన శైలిలో ఉద్యమాలు నడిపి కాంగ్రెస్‌కు, తెలుగువారి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఊపిరి పోశారు.
 గాంధీజి బోధనలు, ఉపన్యాసాల ప్రభావంతో కాంగ్రెస్‌ వాదిగా మారిన సర్దార్‌ విద్యార్థి నాయకుడిగా ఉంటూ 1929లో గాంధీ హైదరాబాద్‌ పర్యటించినపుడు ఆయన్ని కలుసుకున్నాడు. తర్వాతి కాలంలో గాంధీ విజయవాడ వచ్చినపుడు కూడా అక్కడికి వెళ్లి ఆ సభల నిర్వహణల్లో కూడా పాల్గొన్నాడు. విద్యార్థి నాయకుడిగా నిజాం కళాశాలలో నిషేధించిన వందేమాతరగీతాన్ని పాడి తోటివారిలో ఉత్తేజాన్ని నింపాడు. గోడలపై నినాదాలు, రోజూ వందేమాతర గీతాలాపన చేస్తుండటంతో కళాశాల యాజమాన్యం అతన్ని బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయినా కూడా గీతాలాపన ఆగక పోవడంతో కళాశాల పాలకమండలి నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అది కేశవరావు తొలి విజయం. ఆనాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. తండ్రి వత్తిడి మేరకు రెవిన్యూ, హెల్త్‌ శాఖల్లో కొన్ని రోజులు ఉద్యోగం చేసినప్పటికీ అవి తన ప్రజాహిత కార్యక్రమాలకు, ఉద్యమాలకు ఆటంకంగా నిలుస్తున్నాయని నమ్మి  ఉద్యోగానికి రాజీనామ ఇచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాడు.
 1938లో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ స్థాపనలో తన వంతు పాత్రను పోషించాడు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన నాడే దానిపై నిషేధం విధించింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్‌ సత్యాగ్రహోద్యమాన్ని చేపట్టింది. మొదటి జట్టులో గోవిందరావు నానల్‌, జనార్ధనరావు దేశాయి, రావి నారాయణరెడ్డి, రామకృష్ణదూత్‌లు పాల్గొన్నారు. వీరందరిని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. వెంటనే స్వామి రామనందతీర్థ నేతృత్వంలో రెండో జట్టు సత్యాగ్రహాన్ని చేపట్టింది. దీంట్లో కేశవరావు కూడా ఉన్నాడు.  ప్రభుత్వాజ్ఞలు ధిక్కరించినందుకు గాను కఠిన కారాగార శిక్షను వరంగల్లు జైలులో అనుభవించాడు. విడుదల అనంతరం 1940లో రామ్‌గఢ్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాల్లో పాల్గొన్నాడు. కాంగ్రెస్‌ ప్లీనరీలకు, మహాసభలకు తప్పనిసరిగా హాజరయ్యేవాడు. ఆర్యసమాజంతో కూడా సర్దార్‌కు సన్నిహిత సంబంధాలుండేవి. ఆర్యసమాజం వారు నిర్వహించే సభల్లో క్రమం తప్పకుండా పాల్గొనేవారు. ఖమ్మంలో నరసింగ్‌ ప్రసాద్‌ మోరియా ఆధ్వర్యంలో జరిగే సభల్లో విద్యార్థి దశనుంచే పాల్గొనేవారు. ఈ ప్రభావంతో దళితుల అభ్యున్నతికై కృషి చేసిండు. వారిలో విద్యావ్యాప్తికై చైతన్య కార్యకలాపాలు చేపట్టాడు. అస్పృశ్యతా నివారణకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు. అలాగే ఆదివాసీల అభివృద్ధికి కూడా ఉద్యమాలు చేపట్టిండు. పాల్వంచ ప్రాంతంలో పానుగంటి పిచ్చయ్య, వనం నర్సింహారావు, ఊటుకూరు నారాయణరావు తదితరులతో కలిసి పర్యటించి అక్కడి ఆదివాసీల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార కోసం ప్రయత్నించాడు. ప్రభుత్వం ఇచ్చే సహాయం వారికి సక్రమంగా అందడం లేదని తెలుసుకొని అక్కడే ఒక ఆదివాసీ మహాసభను ఏర్పాటు చేశారు. దీంట్లో వేలాదిగా ఆదివాసీలు పాల్గొన్నారు. వడ్డీవ్యాపారులు, షాహుకార్లు చేస్తున్న దోపిడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. గ్రంథాలయోద్యమ కార్యకర్తగా ఊరూరా గ్రంథాలయాల స్థాపనకు ప్రోత్సహించాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో మూడవ రాష్ట్రస్థాయి గ్రంథాలయ మహాసభలు నిర్వహించి అందరి మన్ననలందుకున్నారు. కేశవరావు మిత్రుల సహాయ సహకారాలతో ఎఱ్ఱుపాలెంలో మహబూబియా ఆంధ్రభాషానిలయం, రేమిడిచర్లలో ‘సిద్ధిమల్లేశ్వర స్వామి గ్రంథాలయం’’ స్థాపించి వాటిద్వారా అంతర్లీనంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాడు. 1945`47 మధ్యకాలంలో కాంగ్రెస్‌ భావాలు ప్రచారం చేసేందుకు గాను విజయవాడ నుంచి మిత్రులు తాళ్లూరి రామానుజస్వామి, దాశరథి కృష్ణమాచార్యల సహాయ సహకారాలతో ‘సారథి’ అనే రాజకీయ, సాహిత్య పత్రికను నిర్వహించాడు. ఈ పత్రికను రహస్యంగా వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చేరవేసి ప్రచారం కల్పించేవారు.
 1942లో క్విట్‌ఇండియా ఉద్యమంలో కూడా కేశవరావు చురుగ్గా పాల్గొన్నాడు. దేశమంతటా క్విట్‌ఇండియా ఉద్యమం హోరెత్తుతుండగా, హైదరాబాద్‌ రాజ్యంలో కేశవరావు తన సహచరులతో రహస్యసమావేశాలు ఏర్పాటు చేస్తూ  కాలినడకన వరంగల్‌, ఖమ్మం (ఈ జిల్లా 1953లో ఏర్పడిరది ), నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాలు పర్యటిస్తూ క్విట్‌ ఇండియా ఉద్యమానికి తోడుగా ‘నిజాంని గద్దెదించండి’ అనే నినాదాన్ని కూడా జోడిరచాడు. ఈ కాలంలో నాగపూర్‌ విప్లవకారులతో కలిసి కొన్నాళ్లు పనిచేశాడు.
 కేశవరావు ప్రధానంగా ప్రజానాయకుడు. కాంగ్రెస్‌ పార్టీపై నిషేధం ఉండడంతో ఆయన ఆంధ్రమహాసభ ద్వారా అంతర్లీనంగా రాజకీయ కార్యకలాపాలు చేపట్టేవాడు. ఆంధ్రమహాసభలో చీలిక తర్వాత మడికొండలో మందుముల నరసింగరావు అధ్యక్షతన జరిగిన సభల్లో కేశవరావు వందలాది మంది తన అనుచరులతో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆంధ్రమహాసభను కూడా ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆ సమావేశాలను 1946లో మెదక్‌ జిల్లా కందిలో, అనంతరం జడ్బర్లలో కూడా నిర్వహించాడు. అంటే ఆంధ్రమహాసభలు 1930లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మెదక్‌ జిల్లా జోగిపేటలో ఆరంభంకాగా 1947లో కేశవరావు అధ్యక్షతన మహబూబునగర్‌ జిల్లా జడ్చర్ల సభతో ముగిశాయని చెప్పవచ్చు. నిజాం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శిస్తూ వీధుల్లో ప్రదర్శనలు జరిపి నిలదీసినందుకు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపినందుకు గాను కేశవరావు 1947లో అరెస్టయ్యారు. జైలులో మహారాష్ట్ర, కర్నాటక నుంచి వచ్చిన ఖైదీలందరూ కలిసి వందేమాతర గీతం ఆలపిస్తుండగా జైలర్‌ గీతాలాపన ఆపేయాలని, లేదంటే కాల్చేస్తామని బెదిరించాడు. దీంతో కేశవరావు అందరికన్నా ముందుండి దమ్ముంటే కాల్చమని తుపాకికి ఎదురు నిలిచాడు. వరంగల్‌ జైలులో ఆనాడు కేశవరావు సహచరులుగా ఉన్నవారిలో ఎమ్మెస్‌ రాజలింగం, కాళోజి నారాయణరావు, బి.చంద్రమౌళీశ్వరరావు, కొలిపాక కిషన్‌రావు, అయితరాజు రామారావు, హీరాలాల్‌ మోరియా ముఖ్యులు.
 హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను తీవ్రంగా నిరసించిన మొట్టమొదటి కాంగ్రెస్‌ వ్యక్తి కేశవరావు. అప్పటి మిలిటరీ అధికారి నంజప్పను నిలదీసిన నిజమైన ప్రజానాయకుడు సర్దార్‌. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి జాగీర్దార్లను, జమిందార్లను విమర్శించమంటే ఆనాడు నిజంగా సాహసమే. అయితే ఆ పనిని సమర్ధవంతంగా, ప్రజారంజకంగా నిర్వహించిన నేత ఈయన. నంజప్ప నేతృత్వంలో మిలిటరీ వారు కమ్యూనిస్టుల ఏరివేత పేరిట జరిగిన హింసాకాండను, ముస్లిముల ఊచకోతను కేశవరావు ఖండిరచి ప్రజల పక్షాన నిలిచాడు. ‘‘మనం ఏ ప్రభుత్వాన్ని అయినా సరే అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, జాతీయ ప్రభుత్వం అయినా, కాంగ్రెసు ప్రభుత్వం అయినా, కాంగ్రెసు కాని ప్రభుత్వం అయినా అమాయక ప్రజలపై అత్యాచారాలు జరపడాన్ని సహించబోము. నంజప్ప మన ప్రభుత్వంలో ఒక అధికారి మాత్రమే. యింకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన మన ప్రజలకు సేవకుడు. ఆయన యధేచ్ఛగా ప్రవర్తించడానికి, మేము అనుమతించడానికి సిద్ధముగా లేము. ఈయన చేస్తున్న అకృత్యాలు నిజాం తొత్తులైన జాగీర్దార్లను, నాజీ హిట్లరును తలదన్నిన నిజాంను మరిపిస్తున్నది. నంజప్ప తెలంగాణ రక్షకుడిగా కాక, భక్షకుడిగా వచ్చినట్లు అనిపిస్తున్నది.’’ అని డోర్నకల్లులో జరిగిన ఒక సభలో కేశవరావు ప్రకటించాడు.
 సర్దార్‌ జమలాపురం కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నాడు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో మిళితమైన హైదరాబాద్‌ రాష్ట్రం అలాగే ఉండాలని కోరుకున్నాడు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కివక్కాణించాడు. విద్యాపరంగా, సామాజిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయకుండా విశాలాంధ్ర ఏర్పాటు వల్ల స్థానికులపై స్థానికేతరుల అజమాయిషీ ఆరంభమవుతుందని కరెక్టుగానే అంచనా వేసిండు.
 రాష్ట్ర కాంగ్రెస్‌ స్థాపన నాటి నుంచి దాని అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన కేశవరావు చివరికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. అహోరాత్రాలు ఎండనకా, వాననకా ప్రజల కష్టాల్లో తానున్నానంటూ ఆదుకున్న సర్దార్‌ని తర్వాతి కాలంలో కాంగ్రెస్‌లో చేరిన రాజకీయ నాయకులు ధనిక, భూస్వామ్య, ప్రజాకంటకులకు చోటు కల్పించి స్వీయ ప్రయోజనాలకు పార్టీని పణంగా పెట్టారు. 1952 సాధారణ ఎన్నికల్లో కేశవరావు గెలిచినట్లయితే సి.ఎం. పదవికి పోటీదారుడవుతాడనే భావనతో ఆయనకు తన సొంత నియోజకవర్గం మధిరను కేటాయించకుండా నర్సంపేట తాలూకాలోని పాఖాల్‌ని ఇచ్చారు. ఇక్కడి నుంచి పోటీచేస్తే ఓడిపోతానని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు నుంచే కాంగ్రెస్‌ పార్టీకి ప్రక్షాళన అవసరమనీ, స్థాపించిన కాలం నాటి త్యాగనిరతి కొరవడిరదనీ, సోషలిస్టు పంథా అవలంభించాలని ఆయన పిలుపునిచ్చారు. తాను నమ్మిన వారే నిండా ముంచడం, ఉద్యమ సమయంలో సరైన సమయానికి సరైన భోజనం లేకుండా తిరగడం, జైలు జీవితం అన్ని కలగలిపి 45 యేండ్లకే ఆయనకు ఆయుష్షు తీరేలా చేశాయి.
 1908 సెప్టెంబర్‌ మూడో తేదిన ఖమ్మం జిల్లా (అప్పటి వరంగల్‌ జిల్లా) మధిర తాలూకా ఎఱ్ఱుపాలెం గ్రామంలో  వెంకటనరసమ్మ, వెంకటరామారావు దంపతులకు జన్మించాడు. తండ్రి పట్వారీ హోదాలో ఉండి కొడుకుని హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదివించాలని ఆశించినప్పటికీ కేశవరావుకు ప్రజాసేవలో అనురక్తి ఉండడంతో అది సాగలేదు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, ఫారసీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యుడైన కేశవరావు ‘‘ నామాతృభాష తెలుగు. అయితే నామంచం, నా పక్క, నా కంచం అంతా ఉర్దూ. దానికి కారణం ఈ దేశపు జనానికి నేను సన్నిహితుడు కావడానికి ప్రయత్నం మాత్రమే.’’ అని ఉర్దూని ఒక మతానికి అంటగట్టే ప్రయత్నాన్ని ఎండగట్టాడు. తెలంగాణ నినాదాన్ని కాంగ్రెస్‌ తరపున బలహీనంగానైనా బహిరంగంగా వినిపించిన తొలి నేత కేశవరావు. ఈయన 1953 మార్చి, 29న మరణించాడు.                                                             
- సంగిశెట్టి శ్రీనివాస్‌

Friday 5 October 2012

March @ TANKBUND

 సీమాంధ్ర ఆధిపత్యంపై గెలిచిన మార్చ్‌

    ఘడియ కొక్కరు ఫోన్‌ చేసి ఏడున్నవన్నా, ఎట్లవోతున్నవ్‌, యాడ కలుద్దాం అని ముప్పై తారీఖు నాటి పొద్దుగాలటి సందే దోస్తులందరు పలుకరించుడు షురు జేసిండ్రు. సాగరహారంలో షామిల్‌ అయ్యేందుకు ఇంట్లకేలి బయట్కొచ్చెసరికి మిర్యాలగూడ నుంచి ‘సింగిడి’ కన్వీనర్‌, మిత్రుడు ఏశాల శ్రీనివాస్‌ ఫోన్‌ జేసిండు. అన్న మనోళ్లు లారి మాట్లాడుకొని
హైదరాబాద్‌కొస్తుంటే ‘రామోజి ఫిల్మ్‌సిటీ’కాడ ఆపేసిండ్రట. వాళ్లంత నడుసుకుంట అప్పుడే దిల్‌సుఖ్‌నగర్‌ దాకా వచ్చిండ్రు. ఎట్లయితదో ఏమో? ఏమైనా జరుగొచ్చు మనోళ్లందర్ని జాగ్రత్తగుండుమను. నువ్వు కూడా జాగ్రత్త అని మల్లొక్కసారి జెప్పి ఫోన్‌ పెట్టేసిండు. నాకు టెన్షన్‌ షురువైంది. ఎక్కడికక్కడ ఆపేస్తే ఎట్లవోతం. ఇంత అన్నాలమా? ‘సాగర హారం’ కోసం అనుమతి తీసుకొచ్చినమని సంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్‌ ఎంపీలను కూడా అరెస్టు చేసిండ్రని తెలిసింది. మరి ఈయింత దానికి అనుమతెందుకిచ్చిండ్రని ఎవ్వలి కోపం ఆళ్లు ఎల్లగక్కుతుండ్రు. ఎహె అనుమతియ్యకుంటెనే మంచిగుండేది. ఎక్కడోళ్లని అక్కడ ఆంధ్రోళ్లను యియ్యరమయ్యర జోపడానికి అవకాశముండె అని కూడా దోస్తులన్నరు. అనుమతిచ్చి మనల్ని నమ్మించి మోసం జేసిన వలసాధిపత్య గవుర్నమెంటుపై కోపం అంతకంతకు పెరుగుతోంది.         ఎక్కడెక్కడి నుంచో అన్న మేము గీడున్నమ్‌ నువ్వేడున్నవ్‌ అనే ఫోన్ల మధ్యనే మధ్యలో స్కైని కలుపుకొని ఆటోల ఖైరతబాద్‌ జంక్షన్‌ దగ్గరికి చేరుకున్నం. ఇగ బ్రిడ్జి దిగితె నెక్‌లెస్‌ రోడ్డు వస్తది కదా అని అటుదిక్కు పోవోతుంటె ఇనుప ముండ్ల కంచె కనబడ్డది. అగో ఇట్ల పోనిస్తరని పేపర్ల రాసిండ్రు కదా ఎందుకు పోనిస్తలేరు అని పోలిసోళ్లని అడిగితే ఇట్లకేలి పొయ్యేది లేదు. పేపర్ల తప్పుగ రాసిండ్రు. అని జవాబొచ్చింది. ఇగ ఏంజెయ్యాలె? ఎట్ల పోదామని ఆలోచన చేస్తూ ఖైరతబాద్‌ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కిందొచ్చి స్కైబాబ, నేను నిలబడ్డం. ఇంతల్నే ఖైరతబాద్‌ రైల్వే స్టేషన్‌ డోర్లు మూసేసి ఉన్నయి. అయితే మెల్ల మెల్లగ ఒక్కొక్కళ్లు బ్రిడ్జి వెనకనుంచి చిన్నగ తొవ్వతీసి రైలు పట్టాలు దాటేది కనిపించింది. ఇంకేంది తొవ్వ దొరికిందని సాగర హారం బాట పట్టినం. కొంత దూరం పోయినంక ఎవ్వరికి వాళ్లు ఎట్లకేలి పోవాల అని ప్రశ్నలేసుకునుడు షురు జేసిండ్రు. ఎందుకంటే అక్కడున్న అందరికీ అది కొత్త దారే! మూడ్నాలుగు గల్లీలు తిరిగినంక 15,20 మంది జై తెలంగాణ అంటూ నినాదాలిస్తూ కనబడ్డరు, ఇగ వాళ్లెన్క, వాళ్లతో పాటు నినాదాలిస్తూ మరో నాలుగు గల్లీలు తిరిగే సరికి ఐమాక్స్‌ ఎదురుగ తేలినం. మస్తు సంతోషమైంది. ఇంకేంది ఇగ నెక్లెస్‌ రోడ్డేక్కుడే అనుకుంటే... పోలీసోళ్లు ఇక్కడ కూడ ఇనుప ముండ్ల కంచే ఏసి ఆపేసిండ్రు. అప్పటికే ఓ రెండు మూడొందల మంది ముండ్ల కంచె ముందట కూసొని నినాదాలిస్తుండ్రు. నేను, స్కై మెల్లగా ఆడికి చేరుకునే సరికి అప్పటి దాకా సప్పుడు చేకుండ ఉన్న పోలీసోళ్లు ఒక్కసారిగా లాఠీ చార్జికి దిగిండ్రు. కొత్తగ ఇచ్చిన స్టీల్‌ రాడ్ల లాంటి లాఠీలను వాళ్ళు రెండు చేతుల పట్టుకొని తమ బలమంతా ఉపయోగించి వెనక్కి ఫోర్స్‌గా తీసుకుంటే అంతకంటే ఎక్కువ ఫోర్స్‌తోటి ఉద్యమకారులపై దాడికి దిగిండ్రు. ఎవ్వరైన బక్కపానముంటే ఖచ్చితంగా బొక్కలిరిగేవి. ఏమో ఎవరియన్న యిరిగినయో ఏమో నాకు తెల్వదు. నా మీద దెబ్బ పల్లేదు గానీ ఉద్యమకారులు ఒక్కరి మీద ఒక్కరు తొక్కుకుంట ఉరుక బట్టిండ్రు. ఆగితే ఇంకొక దెబ్బ ఎక్కువ పడుతది కాబట్టి ఎవ్వరికి వాళ్లు ఆ లాఠీ దెబ్బలను తప్పించుకోడానికి ఉరక వట్టిండ్రు. నేను బూట్లేసుకున్న కాబట్టి కొంచెం రక్షింపబడ్డ, అయినా పిక్కల మీద్దాకా  ఒక్కటే తొక్కుడు.  షర్ట్‌ ఎన్కంతా రక్త మరుకలే. ఎట్లనో అట్ల మెల్ల మెల్లగ గోడపొంటి బయటికొచ్చిన. కొంచెం సేపు వెతికితే స్కై కనిపించిండు. మనిషి మూడ్నాలుగు రోజుల సంది జెరంతోటి బాధపడుతూ అయ్యాల్నే కొంచెం కోలుకొని బయటికొచ్చిండు. కాళ్లకు చెప్పులు లేవు. అరచేయి నుంచి రక్త కారుతుంది. బలంగ నిలబడలేకవోతుండు. పోలీసోళ్ల లాఠి దెబ్బలు స్కైమీద బలంగనే పడ్డయి. తొడమీద దద్దులు తేలి రక్తం పేరింది. ఆ నొప్పి సక్కగ నిలువనిస్తలేదని అర్థమయింది. పోలీసోళ్లు ఉర్కించే సరికి మెల్ల మెల్లగ నడుసుకుంట ఖైరతాబాద్‌ వినాయకుణ్ని పెట్టే జాగదన్క వచ్చినం. ఆడ మెడికల్‌ షాపు కనబడితె అండ్ల గ్లూకోన్‌డి అడిగితే లేదన్నడు. ఎలక్ట్రాల్‌ పౌడరుంది కావాల్నా అని అడిగిండు షాపాయన. సరే యియ్యిమని తీసుకొని అప్పటికే స్కై తెచ్చుకున్న నీళ్లల్ల దాన్ని కలిపిన. నేను గూడా ఓ నీళ్ల బాటిల్‌ కొని నడుస్తుంటే గాదె వెంకటేష్‌ ఫోన్‌జేసిండు. ఆయన ఇల్లు కూడా గక్కడ్నే ఉంటది. సెన్సేషన్‌ థియేటర్‌ దిక్కు వస్తున్నం, జెన్‌ కాలేజి దగ్గర కలుద్దామని చెప్పిన, ఇదే విషయం అప్పటికే రిజర్వ్‌బ్యాంక్‌ దగ్గర ఉన్న పసునూరి రవీందర్‌కు కూడా చెప్పిన రమ్మన్న. ఆయనతో పాటు ఉన్న శ్యామల, కొల్లూరి చిరంజీవి, ఉమేర్‌ ఖాన్‌ కూడా ఓ పదినిమిషాల తర్వాత వచ్చిండ్రు. ఆ తర్వాత గాదె వెంకటేష్‌ వచ్చిండు. అప్పటికే నెక్లెస్‌రోడ్డుకి ఖైరతబాద్‌ నుంచి చేరుకున్న ఊడ్గుల వేణు స్కైకి ఫోన్‌ జేసి అన్న మేము జేరుకున్నం, తొవ్వ ఖుల్లా అయింది ఇగరా అని చెప్పిండు. జెన్‌ కాలేజి దగ్గర చాయ్‌ తాగి నేను, స్కై, పసునూరి, గాదె వెంకటేశ్‌, పసూనూరి రాజేష్‌, తదితరులం మెల్లగ మళ్ల వచ్చిన దారిల్నే నడువబట్టినం. ఈసారి రోడ్డు ఖుల్లా అయింది. ఖైరతాబాద్‌ వినాయకుడ్ని పెట్టిన రోడ్ల నుంచి ఐమాక్స్‌కు, ఆ తర్వాత నెక్లెస్‌ రోడ్డుకు చేరుకున్నం.
    రోడ్డుల నడుసుకుంట పోతున్న దశలో పోలీసోళ్లను, ఆంధ్రోళ్లను అందరు ఒక్కటే తిట్టుడు. మంచి మంచి తెలంగాణ పదాలల్ల తిట్లు సాగినయి. తొవ్వల శాన మంది కలిసిండ్రు. తెలంగాణ టీచర్స్‌ ఫోరమ్‌ రాములు, శ్రీధర్‌ (టీచర్‌), నీలిజెండా పత్రిక బాధ్యుడు మిత్రుడు జి.జ్ఞానేశ్వర్‌, తాండూర్‌ టిఆర్‌ఎస్‌ మిత్రులు విజయ్‌ ఇట్లా కొన్ని వందలమంది కలిసిండ్రు. జలవిహార్‌కాడ కొంచెం సేపు కూలబడ్డం. నెక్లెస్‌ రోడ్డుకి అటువైపు పీవీఘాట్‌ దగ్గర చీమల దండులాగా ఉస్కెపోస్తే రాలనంద జనం కనబడుతుండ్రు. ఎటు జూసినా జనం జాతర సాగుతోంది.
    ఈ జాతర మధ్యలోనే గాలి నల్లటి పొగలు పైకి లేస్తున్నయి. పోలీసోళ్ల వ్యాన్లు లాఠీ దెబ్బలు తిన్నోళ్ల చేతిలో అహుతయ్యాయని చెప్పిండ్రు. ఆ యెంటనే పోలీసోళ్ల భాష్పవాయువు గోళాల సప్పుడు టప్ప టప్ప ఒక్కటే పేలుతున్నయి. కండ్లు మండపట్టినయి. వశంగాకుంటయ్యింది. మూతికి బట్టకట్టుకొని జెర్ర పక్కకు నిలబడ్డ. ఇంతల్నే జై తెలంగాణ అంటూ అప్పుడే మా ముందటికేళి ఫిరంగుల్లా దూసుకెళ్లిన ఆడపిల్లలు అంతే స్పీడుగా వాపస్‌ రావట్టిండ్రు. పోలీసోళ్లు వాల్ల కొత్త లాఠీలకు మల్ల పన్జెప్పిండ్రు. ఆడపిల్లలు అనిసూడకుండా ఆళ్ల మీద పడ్డరు. కొంచెం దూరం ఉర్కించి కొద్దిగంత సేపు పోలిసోళ్లు రెస్ట్‌ తీసుకుంటుండ్రు. మళ్ల జెర్రసేపాగి మళ్ల లాఠీలు పట్టుకొని పబ్లిక్‌ ఎన్క పడ్డరు.
    రెండు మూడు సార్లు అటురికి ఇటురికి. చిన్న సందుల కేలి రైలుపట్టాలు దాటినం. వెంటనే అన్న నా పుస్తకం అని గాదె వెంకటేశ్‌ అన్నడు. అప్పుడు గుర్తుకొచ్చింది. గాదె వెంకటేశ్‌కు ఫోన్జేసినప్పుడు అన్న నేను ఇంటికాడున్న నా కవిత్వం ‘పొలి’ని ఆవిష్కరించుకుందాం అని జెప్పిండు. అప్పటికే ఎన్క టప్ప టప్ప గోళాల సప్పుడెక్కువైంది. ఎట్లయితె అట్లాయె పుస్తకాన్ని ఆవిష్కరించాలని మళ్లీ పట్టాలు దాటొచ్చి ఎన్క భాష్పవాయుగోళాల మధ్యన నెక్లెస్‌ రోడ్డు నడి మధ్యల ఎనకాల పబ్లిక్‌ ముక్కులకు బట్టలుగట్టుకొని ఉరుకొస్తుంటే ‘పొలి’ని నేను అవిష్కరించిన. పసునూరి రవీందర్‌, గాదె వెంకటేశ్‌ కూడ ఉన్నరు. జైతెలంగాణ అంటూ నినదిస్తూ ఒక చారిత్రక సంఘటనకు ప్రాణం పోసినం. బహుశా భాష్పవాయువు గోళాల మధ్యన, లక్షలాది తెలంగాణ ప్రజల మధ్యన ఆవిష్కరణ జరుపుకున్న ఏకైక పుస్తకం ‘పొలి’. ఈ యాది, పుస్తక ఆవిష్కరణ తెలంగాణ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయే అరుదైన, అపురూపమైన అవకాశాన్ని అందించింది. అందుకు అవకాశమిచ్చిన గాదె వెంకటేశ్‌కు షుక్రియా.
    మా ముందు నుంచే 20 లారీలల్ల పోలీసోళ్లు అంతకుముందే ఉన్న వాళ్లకు తోడుగా చేరుకున్నరు. ప్రజల్ని అటిటు ఎటూ పోనియకుండా జేసి తొక్కిసలాటలో వాళ్లే చనిపోయేలా చెయ్యాలనే ప్లాన్‌ వేసినట్లు కూడా అనుమానమొచ్చింది. యుద్ధాక్షేత్రాన్ని ముద్దాడాలని చేసిన ప్రయత్నం సఫలమయ్యింది. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడేందుకు ఈ మార్చ్‌ మంచి టానిక్‌లాగా పనిచేస్తదని నమ్ముతున్న.
                                                                                                                                         -సంగిశెట్టి శ్రీనివాస్‌

Saturday 8 September 2012

Telangana son of the soil:Guduri

మట్టి మనిషి గూడూరి


    ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కారణంగా తెలంగాణ భాషకు, యాసకు సీమాంధ్ర పాలకులు, వారికి వత్తాసు పలికే పత్రికలు, పాఠ్యపుస్తకాలు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. అసలు తెలంగాణలో మాట్లాడే భాష తెలుగే కాదని, ఇక్కడ ఉర్దూ మిశ్రమ, తౌరక్యాంధ్రము (తురకముGఆంధ్రము) మాట్లాడుతారని ఎద్దేవా చేసిండ్రు. మీకు భాష రాదు,  కాబట్టే మేం నేర్పించడానికే వచ్చాం అనే ఆధిపత్య, అహంభావాన్ని సీమాంధ్ర పంతుళ్లు, అధికారులు, ఆఖరికి వలస జీవులు కూడా ప్రదర్శించారు. ఎవ్వరెన్ని రకాలుగా తెలంగాణ భాషను ఎక్కిరించినా అదే భాషను, మట్టి పరిమళాన్ని తన రచనల ద్వారా బతికించిన గొప్ప కథకుడు గూడూరి సీతారాం.
    మొన్న ఆదివారం (25, సెప్టెంబర్‌, 2011) హైదరాబాద్‌లో క్యాన్సర్‌తో కన్నుమూసిన గూడూరి సీతారాం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కాలంలో ఒక దశాబ్ద కాలం పాటు రాసిన కథలు తెలంగాణ నుడికారాలతో, మూలవాగు వాసనలతో, ఇక్కడి మట్టి పరిమళాన్ని, వెట్టి బతుకుల్ని, వ్యథల్ని రికార్డు చేసినవి. తెలంగాణ మీది ప్రేమతో, సోయితో ప్రత్యేక తెలంగాణవాదులు చేసిన పరిశోధన, కృషి వల్ల ఆయన కథలు సంకలన రూపం తీసుకున్నాయి. ఇది విస్మృత తొలితరం తెలంగాణ కథకుణ్ణి తెలుగు కథానిక రంగంపై చిరస్థాయిగా నిలిపింది. అప్పటి వరకూ విస్మరించిన సీమాంధ్ర సంకలనకర్తలు సిగ్గుతో తలదించుకునేలా జేసింది. నిజానికి తొలితరం తెలంగాణ రచయితలకు తమ స్వీయ రచనల మీద ప్రత్యేక అభిమానం ఏనాడూ లేదు. తాము రాసింది ప్రజలకు చేరేంత వరకే తమ పని అని భావించారు. అందుకే ఆనాటి రచయితలు తమ రచనల్ని సంపుటాలుగా తీసుకురావడానికి పెద్దగా ప్రయత్నించలేదు. సురవరం ప్రతాపరెడ్డి మొదలు గూడూరి సీతారాం వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. 354మంది కవుల కవిత్వాని ‘గోలకొండ కవుల సంచిక’ పేరిట 1934లోనే వెలువరించిన సురవరం ప్రతాపరెడ్డి తాను రాసిన కవిత్వాన్ని అచ్చేసుకోలేక పోయాడు. అలాగే గూడూరి సీతారాం కూడా దాదాపు 80 కథలు కేవలం ఒక (1954`1964) దశాబ్దకాలంలో రాసినప్పటికీ వాటిని ఏనాడు పుస్తకంగా తీసుకురాలేదు. అయితే కొంతమంది మిత్రులం వత్తిడి తీసుకొచ్చి మీ కథలు వెలుగులోకి రావాలని చెవినిల్లుకట్టుకొని పోరితే గాని ఆయన కథలు పుస్తకంగా వెలువడలేదు. కథలు రాసిన ఐదుదశాబ్దాల తర్వాత వాటిని వెతికి పట్టుకోవడం చాలా కష్టమయ్యింది. అందుకే సీతారాం 80 కథలు రాసినా కేవలం 14 కథలే అందుబాటులో ఉండడంతో వాటినే పుస్తకంగా మానేరు రచయితల సంఘం ప్రచురించింది. ఇందుకు క్రెడిట్‌ పత్తిపాక మోహన్‌కు దక్కుతుంది. 
    అందుబాటులో ఉన్న 14 కథలూ ఆణిముత్యాలే. తెలంగాణ సామాజిక చరిత్రకు చిత్రిక గట్టాయి. తెలంగాణ జీవితంలోని ఒడిదొడుకుల్ని, గ్రామీణ స్త్రీలు, రైతులు, పేదలు, విద్యార్థులు,ప్రేమలు, పెండ్లిళ్లు, కులవృత్తులు, వలసలు, అన్నీ ఆయన కథల్లో ప్రాణం పోసుకున్నాయి. తెలంగాణ జీవద్భాషలో తనదైన కథనంతో మట్టిమనుషుల్ని అత్యంత సహజంగా గుండెలకత్తుకునే విధంగా మలిచిండు. తాను పుట్టిన కులమైన పద్మశాలీయుల జీవితాలనే గాకుండా పిచ్చుకుంట్ల, గౌడుల దయనీయ స్థితుల్ని, లచ్చి లాంటి కథలో ఫెమినిజాన్ని కూడా మానవీయ కోణంలో ఆవిష్కరించిండు.
    కథా రచయితగా ప్రసిద్ధుడైన సీతారాం నాటకాలు, కవిత్వం, నవలలు కూడా రాసిండు. ఆయన సేకరించిన పల్లె పదాలు ఎన్నో బిరుదురాజు రామరాజు పరిశోధనకు ఉపయోగపడ్డాయి. రామరాజు తన సాంపాదకత్వలో వెలువరించిన ‘త్రివేణి’ సంకలనంలో ఇవి చోటు చేసుకున్నాయి. తెలంగాణ మట్టిపరిమళాలను జానపదాలు, గేయాల రూపంలో ఆనాడు సేకరించి రికార్డు చేయడంతో మన మూలాల్ని మనం ఈనాడు  తెలుసుకోవడానికి వీలవుతోంది. సీమాంధ్రులు కప్పెట్టిన ఖజానా ఇప్పుడిప్పుడే సోయితో చేస్తున్న పరిశోధనల వల్ల వెలుగులోకి వస్తూంది. ఈ ఖజానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరెవరి ప్రతిభ ఏంటిదో విడమర్చి చెప్పెటోడు సీతారాం. పరిశోధకులకు ప్రాథమిక సోర్స్‌గా ఉండిన సీతారాం ఎన్నో సభలు సమావేశాల్లో ఎన్కటి తెలంగాణ కథగురించి వివరంగా చెప్పెటోడు. అందరికీ అర్థమయ్యే రీతిలో ముచ్చట పెట్టినట్టు గిది గిట్ల గదిగట్ల అని తెలుగు కథకుల గురించి, తెలంగాణ సాహితీవేత్తల గురించి వందల కొద్ది ‘అనెక్‌డోట్స్‌’ చెప్పెటోడు.
    గూడూరి సీతారాం సాహితీవేత్తగానే కాకుండా మానేరు రచయితల సంఘ స్థాపకుడిగా, నిర్వాహకుడిగా, విశాల సాహిత్య అకాడెమీ కార్యక్రమాల్లో ఎడతెరిపి లేకుండా పనిచేసిండు. మరుగున పడ్డ తెలంగాణ కథానికా సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలని నిరంతరం పరితపించిండు. ఆ తపనలోంచే జి.రాములు కథలు ‘పెరటి చెట్టు’ వెలువరింప జేసిండు. మరో కథకుడు సురమౌళి కథలు కూడా వేయాలని ప్రయత్నం చేసిండు.
    1953లో తెలంగాణ రచయితల సంఘం స్థాపన నాటి నుంచే వట్టికోట ఆళ్వారుస్వామి, బిరుదురాజు రామరాజు, దాశరథి కృష్ణమాచార్య, వానమామలై వరదాచార్యులు, పల్లా దుర్గయ్య, కాళోజి నారాయణరావు లాంటి వారితో కలిసి పనిచేసిండు. సిరిసిల్లలో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి దాని తరపున అనేక పుస్తకాలు ఆ కాలంలోనే తెలంగాణ వాళ్ల పుస్తకాలు అచ్చేసిండు. తన చిన్ననాటి మిత్రుడు కవి సి.నారాయణరెడ్డి ప్రోత్సాహంతో నిజాం కాలేజిలో చదువుకునే రోజుల్నుంచే సాహిత్య రంగంలోకి అడుగిడిన సీతారాం చివరి వరకూ ఆ దోస్తానీని విడువలేదు.
    75 ఏళ్ళ సీతారాం మృతితో తెలంగాణ ఒక కథా శిఖరాన్ని కోల్పోయింది. ఆయన మృతి మొత్తం తెలుగు కథానికా సాహిత్యానికి కూడా లోటే. ఈ లోటుని పూడ్చే పనిని ‘గూడూరి సీతారాం కథలు’ పేరిట వై.సత్యనారాయణ కొంత చేసిండు. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సబ్మిట్‌ చేసిన ఎం.ఫిల్‌ సిద్ధాంత గ్రంథం. అలాగే సీతారాం గురించిన విశేషాలు, వివరాలతో ‘కానుగ చెట్టు’ (స్వర్ణోత్సవ సంచిక) 2005లో వెలువడిరది. ఇటువంటి పరిశోధనలు మరిన్ని జరిగినట్లయితే సీతారాం కథల్లోని భిన్న పార్శ్యాలు వెలుగులోకి వస్తాయి. గూడూరి సీతారాం స్మృతిలో తెలుగు అకాడెమీ గానీ, తెలుగు యూనివర్సిటీ గానీ ఆయన పేరిట ‘తెలుగు కథా అకాడెమీ’ని ఏర్పాటు చేసి కథా సాహిత్యంలో పరిశోధనలకు వీలు కల్పించాలి. అలాగే జాతీయ సాహిత్య అకాడెమీ వారు గూడూరి సీతారాం జీవితాన్ని పుస్తకంగా వెలువరించి అన్ని భాషల్లోకి తర్జుమా చేసినట్లయితే తెలంగాణ వాడి ప్రతిభ భారతదేశ వాసులందరికీ తెలుస్తుంది. సీతారాం కథల్ని ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో పాఠ్యాంశాలుగా నిర్ణయించాలి. ఇదే మనం ఆ మట్టిమనిషికి అందించే నివాళి.
    ఎప్పుడూ చిర్నవ్వు చెరగకుండా, చెలిమిని చాటి చూపులతో, తెల్లటి పంచెకట్టుతో, నుదుట బొట్టుతో తెలంగాణ సాహితీ లోకానికి పరిచయమైన గూడూరి సీతారాం ‘కాక’ లేని లోటు పూడ్చలేనిది. నాకు వ్యక్తిగతంగా తీర్చలేనిది. మాట్లాడితే సాలు కొత్త ముచ్చట్లు సాక వోసే గొంతు శాశ్వతంగా మూగ వోయింది. గొంతు మూగబోయినా ఎట్లనన్న జేసి తెలంగాణ తెచ్చుకోవాలె! అని ఆయన జెప్పిన మాటలు దిశా నిర్దేశం చేస్తున్నయి. -సంగిశెట్టి శ్రీనివాస్‌

తెలంగాణ ‘పగడం’ సుబ్బారావు

    తమను గురించి తాము చెప్పుకునే, ప్రచారం చేసుకునే అలవాటు, కీర్తి కాంక్ష తెలంగాణ కవులకు లేకపోవడంతో అది అంతిమంగా ఈ ప్రాంతంలో కవులు లేరు అని ఆంధ్రులు గుడ్డి నిర్ధారణ చేయడానికి దారి తీసింది. పూర్వ నిర్ధారణకు వచ్చి తెలంగాణ కవులు, రచయితలు, వైతాళికులకు చరిత్రలో తగిన స్థానం దక్కకుండా చేయడంలో ఆంధ్రుల ఆధిపత్య, అహంకార పూరిత రచనలు, ప్రచారాలే ప్రధాన కారణం. ఈ తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ సురవరం ప్రతాపరెడ్డి 354 మంది తెలంగాణ కవుల కవిత్వాన్ని సంకలనం చేసి వారికి ప్రాణం పోసిండు. అట్లా ప్రాణం పోసుకున్న వాళ్లలో ఒకరు పైడిమర్రి వెంకట సుబ్బారావు(1916`1998).
    కవిత్వం, కథలు, నాటకాలు, నవలలు, పద్యకావ్యాలు, వ్యాసాలు, అనువాదాలు వందలాదిగా రాసిన పైడిమర్రి వెంకటసుబ్బారావు నేటి తరం పాఠకులకు అంతగా పరిచయం లేరు. ‘ప్రతిజ్ఞ’ను అక్షరబద్ధం చేసి ప్రతిరోజూ బడిపిల్లల నోళ్లలో నానుతున్న ఈయన పుట్టింది నల్లగొండ పక్కనున్న అన్నేపర్తిలో. విస్మృత సాహితీవేత్త పైడిమర్రి గురించి తెలిసింది తక్కువ. తెలియాల్సింది, పరిశోధన జరగాల్సింది చాలా ఉంది. ఉద్యోగ రీత్యా ఖమ్మం నుంచి విశాఖపట్నం వరకు వివిధ ప్రాంతాలు తిరిగిన సుబ్బారావు సృజించని సాహిత్యం లేదంటే అతిశయోక్తి కాదు. తల్లి వేర్లను కత్తిరించి భాషా పరంగా, సాహిత్య పరంగా తెలంగాణను గత 60 యేండ్లుగా ఈ మట్టి పరిమళానికి దూరంగా ఉంచింది సీమాంధ్ర సాహిత్య కారులు, వారి తాబేదార్లుగా ఉన్న పాఠ్యపుస్తక నిర్ణేతలు, అధికారులు. సుబ్బారావు పేరు, ఆయన పని చేసిన ప్రాంతం రెండూ ఆంధ్రతో ముడిపడి ఉండడంతో తెలంగాణ పరిశోధకులు గానీ, సాహిత్యవేత్తలు గానీ ఈ విషయమై లోతుగా పరిశీలించలేదు. ఈ విషయాన్ని మొదటిసారిగా నేను 2004లో ప్రచురించిన ‘దస్త్రమ్‌’ తెలంగాణ తొలితరం కథల సూచిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన కథల జాబితా కూడా ఆ పుస్తకంలో ఇచ్చాను. ‘‘పైడిమర్రి వెంకటసుబ్బారావు జీవితం`సాహిత్యం’’ అనే అంశంపై పిహెచ్‌డీ పరిశోధనకు తగినంత సమాచారముంది. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన ప్రస్తుత తరుణంలో ఈ పనిని మరింత బాధ్యతతో చేయాల్సిన అవసరముంది. తన మూలాల్ని తాను మళ్లీ వెతికి పట్టుకుంటున్న తెలంగాణ నేడు స్మరణకు నోచుకోకుండా పోయిన దీపధారుల్ని వెతికి వెలుగులోకి తెస్తోంది. అందులో భాగంగా  వెలుగు చూసిన పగడం ఈ పైడిమర్రి.
    నౌకరి, పిల్లిపోడు, రాజులు, బడిగంటలు కథలు ఈయన కలం నుంచి వెలువడ్డాయి. అయితే ఇవి గాకుండా ఉషస్సు సంకలనంలో ఈయన కథ చోటు చేసుకుంది. నౌకరి కథలో 1952 నాటి ముల్కి ఉద్యమాన్ని ఉర్దూ`తెలుగు మిశ్రమ భాషలో చిత్రించిండు. ఈ ఉద్యమంలో ఏడుగురు మంది సిటీకాలేజి విద్యార్థులు అమరులయ్యిండ్రు. ఉద్యమం చేసిన వారికి ఉద్యోగాలు రాకపోవడం, ఆంధ్ర అధికారుల ఛీత్కారాన్ని పైడిమర్రి రికార్డు చేసిండు. రాజులు అనే కథలో పుట్టుపూర్వోత్తరాలు ఏవీ తెలియని ఒక వ్యక్తి ఊళ్లో వాళ్లందరికి తలలో నాలుకలా ఉంటూ, అందరికీ పనుల్లో ఆసరా అవుతూ ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం గురించిన కథ ఇది. ఇందులో బియ్యం పోటేయ్యడం దగ్గరి నుంచి పేడకళ్లు ఎత్తే వరకు అన్ని పనులు చేసే రాజులు ఆకస్మాత్తుగా అనారోగ్యం పాలయి చనిపోవడంతో ‘‘ వాడికి యిల్లు లేదు. డబ్బు లేదు. బిడ్డలు లేరు. చుట్టాలు లేరు. వాడెవరో? ఏ గ్రామమో తెలియని పిచ్చివాడు రాజులు. నల్లా తెల్లా తెలియకుండా సేవచేశాడు. వాడి సేవకు ఋణపడ్డ ఆ అగ్రహారమే వాడి సర్వస్వము. పెండ్లి పల్లకీలాగా జనమంత వెళ్లి వాడి భౌతిక దేహానికి సంస్కారం చేశారు’’ అని అంతిమ ఘట్టాన్ని వెంకటసుబ్బారావు వర్ణించాడు. కథలో భాగంగా చిన్న చిన్న పాటలు రాయడం సుబ్బారావుకు అలవాటు ఈ రాజులు కథలోనే ఇలా రాసిండు.
    పాడి పంటలు మాకు భగవంతుడిస్తాడు
    వాని దయ ఉంటేను లోప మేమీ లేదు,
    బీద సాద మాకు సోదరీసోదరులు.
    పెట్టిపోతలు మాకు విడిపోని ధర్మాలు
    లేదు లేదను మాట లేదు మామాటల్లో..’’ అంటూ తెలంగాణ ఆత్మీయతను ఆయన పాటల్లో వ్యక్తీకరించాడు.
   
    1956 నాటికే బ్రహ్మచర్యము, గృహస్థ జీవితము, స్త్రీ ధర్మము, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాల్ని రచించిన సుబ్బారావు వాటిని ప్రదర్శన యోగ్యంగా కూడా తీర్చి దిద్దాడు. 1951 నాటి సుజాత పత్రికలో శ్రీమతి అనే నాటకాన్ని వెలువరించాడు. ఇందులో బింబిసారుని అనంతరం రాజ్యాధికారంలోకి వచ్చిన ఆయన కొడుకు అజాత శత్రువు కాలంలో బౌద్ధమతం విద్రోహద్యమంగా నిర్ణయించబడడం, బౌద్ధ స్థూపాలను పూజించేవారిని నిర్దాక్షిణ్యంగా వధింపబడే సంఘటనలను తీసుకొని నాటకాన్ని రాసిండు. ఆనాటి కాలాన్ని బౌద్ధం బోధించిన ప్రదేశంలోనే హింస చోటు చేసుకోవడాన్ని ఆయన రికార్డు చేసిండు. నాటకాలతో పాటుగా కాలభైరవుడు అనే చిన్న నవలను 1934 నాటికే సుబ్బారావు వెలువరించిండు. అంటే 18 యేండ్లు కూడా నిండకముందే ఈయన నవల వెలువడిరది.    
    నవలతో బాటుగా ప్రతికృతి, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకృతులు కూడా సుబ్బారావు కలం నుండి వెలువడ్డాయి. వీటితో పాటుగా సింగపురీ నృకేసరీ శతకము, బాలరామయణము, వెంకటేశ్వరస్తుతి భక్తి రచనలు కూడా ఆయన రచించారు. అలాగే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల ప్రతిభను, కీర్తిని పొగడ్తూ ‘‘శ్రీకృష్ణదేవరాయల’’ పేరిట 11 పద్యాలను వెలువరించాడు. అందులో అల్లసాని పెద్దన గూర్చి ఇలా రాసిండు.

    మా కవితా పితామహుడు మంజుల భాషలతో వరూధినీ
    వ్యాకుల మోహరక్తి బ్రవరాఖ్యు పరాజ్ముఖ ధీరవృత్తి నీ
    లోకములో జిరమ్ము రసలుబ్ధుల చిత్తము లుల్లసిల్లగా
    నీకతనన్‌ రచించె నొక నిస్తుల చిత్రము లీలదీర్చునన్‌.
దీనితో పాటుగా పల్లెటూరు పత్రికలో 1952లో పద్యాలు వెలువరించాడు. కవీ పేరిట వెలువరించిన ఈ పద్యాల్లో కవియొక్క గొప్పతనాన్ని, ఆయన సృజనాత్మకతను అక్షరీకరించాడు. పద్యాలతో పాటుగా అనేక భాషల నుంచి  ముఖ్యంగా, హిందీ, ఉర్దూ భాషలనుంచి అనువాదం చేసిండు. హిందీ నుంచి గీతామీమాంస (1938), దైవభక్తి (1938), మీమాంస త్రయము (1936) అనువాదం చేసిండు. ఆధ్యాత్మిక రచనలతో పాటుగా ‘‘మనిషికెంత భూమి కావాలి’’ అనే విప్లవాత్మక రచనలు కూడా సుబ్బారావు అనువాదం చేసిండు.
    సుబ్బారావు రచనలు తెలంగాణ నుంచి వెలువడ్డ గోలకొండ, సుజాత, పల్లెటూరు పత్రికలతో పాటుగా ఆంధ్రప్రాంతంలోని ఆంధ్రపత్రిక, భారతి, నవజీవన్‌, ఆనందవాణి పత్రికల్లో అచ్చయ్యాయి.
    ఎప్పటికైనా సుబ్బారావు సమగ్ర రచనలు ఒక్కదగ్గర వెలువడినట్లయితే అటు ఆయన ప్రతిభకు నిదర్శనమేర్పడుతుంది. అలాగే పరిశోధకులకు, విమర్శకులకు మరింత లోతుగా సుబ్బారావుని అంచనా వేయడానికి వీలవుతుంది. అందుకు ఈ వ్యాసం ఒక ప్రేరణగా నిలవాలని ఈ రేఖామాత్ర పరిచయం. 

                                                                                                                                -సంగిశెట్టి శ్రీనివాస్‌  

Century old awakening centre, Srikrishnadevarayaadhra bhasha nilayam

తెలంగాణ పునర్వికాసోద్యమానికి పునాది భాషానిలయం


    వందకు 90శాతం మంది ప్రజల మాతృభాష తెలుగు అయినప్పటికీ, పాలన భాషగా ఉర్దూ ఉండడం, అచ్చతెనుగు కావ్యానికి జన్మనిచ్చిన ప్రాంతంలోనే తెలుగు సాహిత్యానికి, భాషకు దక్కాల్సిన గౌరవం, కీర్తి దక్కలేదనే కసితో ఏర్పాటు చేసిందే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం. నిజాం ప్రాంతంలో ఎక్కడ తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేసినా ప్రభుత్వం నుండి అడ్డంకులు వస్తాయనే ఉద్దేశ్యంతోనే హైదరాబాద్‌ రాజ్యంలో బ్రిటీష్‌ వారి ద్వీపంగా వెలిగిన ‘రెసిడెన్సీ బజార్‌’ (ఇప్పటి కోఠీ, సుల్తాన్‌ బజార్‌ ప్రాంతం)లో ఈ గ్రంథాలయాన్ని నెలకొలిపారు.
    మునగాల జమీందారు రాజా నాయని వెంకటరంగారావు, ఆయన మిత్రుడు, మంత్రి కూడా అయిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మైలవరపు నరసింహశాస్త్రిల పూనిక మేరకు ఈ గ్రంథాలయం స్థాపించబడిరది. వీరికి అండగా ముత్యాల గోవిందరాజులు నాయుడు (సరోజినిదేవి నాయుడు భర్త), ఆదిపూడి సోమనాథరావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు నిలిచిండ్రు. 1901 సెప్టెంబర్‌ ఒకటిన రెసిడెన్సీ బజార్‌లోని రావిచెట్టు రంగారావు బంగళాలో పాల్వంచ సంస్థానాధీశుడు రాజా పార్థసారథి అప్పారావు బహదూర్‌ అధ్యక్షతన ఏర్పాటయిన సభతో భాషానిలయం ఉనికిలోకి వచ్చింది. పరిశోధకుడు, రచయిత ఆదిరాజు వీరభద్రరావు చిన్నవాడైనప్పటికీ ఈ నిలయం స్థాపన నాటి నుంచీ బాధ్యతలు పంచుకున్నాడు.
    మొత్తం తెలుగుసీమలోనే ఈ నిలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. తెలుగు పుస్తకాలు విశేషంగా ఉన్న గ్రంథాలయాల్లో ఇదే మొదటిది. దీని స్థాపనతో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి తెర లేచిందంటే ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టుగా ఈ నిలయం స్థాపన తెలంగాణలో మరిన్ని విజ్ఞాన జ్యోతులు వెలగడానికి, వెలిగించడానికి ఇది స్ఫూర్తిగా నిలిచింది. 1927లో నిలయం రజతోత్సవాలు జరిగే నాటికి తెలంగాణలో 100కు పైగా గ్రంథాలయాలు స్థాపించబడ్డాయంటే దీని ప్రభావం అర్థమవుతుంది. అలాగే ఈ గ్రంథాలయాల స్థాపన పుస్తకాలు, పత్రికల ప్రచురణకు దారులు వేసింది. ముద్రణా యంత్రాల స్థాపనకు దారి తీసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రంథాలయాలే తర్వాతి కాలంలో ప్రజల రాజకీయ కూడలి ప్రదేశాలుగా మారాయి. ఈ రాజకీయ చైతన్యమే 1926లో గోలకొండ పత్రిక స్థాపనకు కారణమయ్యింది. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయానికి అనుబంధంగా ‘‘ఆంధ్ర భాషోజ్జీవని నాటక సంఘం’ ఏర్పాటయింది. అలాగే తెలుగులో శాస్త్ర గ్రంథాలను ప్రచురించే పనిని కూడా ఈ గ్రంథాలయ నిర్వాహకులు స్థాపించిన ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమాల’ తరపున 1906లో ప్రారంభమయింది. తెలుగులో శాస్త్ర గ్రంథాలు మొట్టమొదటి సారిగా ఈ గ్రంథమాల తరపునే వెలువడ్డాయి. దీని తరపున మొదట హైదరాబాద్‌నుంచి, ఆతర్వాత మద్రాసు నుంచి పదుల సంఖ్యలో పుస్తకాలు అచ్చయ్యాయి. రావిచెట్టు రంగారావు, కొమర్రాజు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి తదితరులు గ్రంథమాల నిర్వహణలో పాలు పంచుకున్నారు.  అలాగే భాగ్యరెడ్డి వర్మ లాంటి దళితులకు రావిచెట్టు రంగారావు ఆశ్రయం కల్పించి నిలయం నిర్వహణలో భాగస్వామిని చేసిండు. 1925 నాటికే మహిళల కోసం గ్రంథాలయంలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి వారిలో పఠనాసక్తిని పెంచారు. ఇవన్నీ తెలంగాణ సమాజం చైతన్యం చెందడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడ్డాయి.
    ఈ గ్రంథాలయం ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ`సీమాంధ్ర ప్రాంతానికి వారధిగా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రంథాలయంలో ఉపన్యాసం ఇవ్వని తెలుగు సాహితీవేత్త, సన్మానం పొందని కవి, పండితుడు, ప్రసిద్ధుడు తెలుగునేలలో 1990లకు ముందు లేడు. చిలకమర్తి, జాషువా, శ్రీపాద, కావ్యకంఠ గణపతి ముని, కట్టమంచి, దువ్వూరి, కోడి రామ్మూర్తి నాయుడు ఇలా ఒక్కరేమి లబ్ధప్రతిష్టులయిన ప్రతి ఒక్కరూ ఈ నిలయంలో ఏదో ఒక సమయంలో సన్మానం పొందినవారే!
    సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, వడ్లకొండ నరసింహారావు, వేలూరి రంగధామనాయుడు,  ఆదిరాజు వీరభద్రరావు, రావిచెట్టు లక్ష్మీనరసమ్మ ఇలా ఎందరో ఈ నిలయ అభివృద్ధికి కృషి చేసిండ్రు. అలాంటి భాషానిలయం నేడొక పురాస్మృతిగా మిగిలింది.
    ఇరవై యేళ్ల క్రితం వరకూ హైదరాబాద్‌లో ఏ సాహిత్య సభ జరిగినా, సమావేశం జరిగినా అది కచ్చితంగా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలోనే జరిగేది. ఇప్పుడు ఆ శోభ పోయింది. పాత భవనం స్థానంలో జీవంలేని నూతన భవనం నిర్మాణమయింది. ఇందులో ఇప్పటికీ వేలాది ‘రేర్‌’ పుస్తకాలు అల్మారాల్లోనే ఉండిపోయాయి. ఇవన్నీ పరిశోధకులకు అందుబాటులోకి రావాల్సిన అవసరముంది. ఈ భవనంలో సాహిత్య సభలు, సమావేశాలు, పుస్తకావిష్కరణలు చేసుకోవడానికి తక్కువ ధరకు హాల్‌ కేటాయించి రచయితలను ప్రోత్సహించాలి. రేర్‌ పుస్తకాలన్నింటిని డిజిటైజ్‌ చేయించి నిలయం తరపున వెబ్‌సైట్‌లో ఉంచి అందరికీ అందుబాటులోకి తేవాలి. ఈ చర్యల ద్వారా 110 యేండ్ల ఈ గ్రంథాలయానికి పూర్వశోభ సంతరించుకుంటుంది. అలాగే ఈ నిలయంతో సంబంధం ఉన్న వారి లిస్ట్‌ తయారు చేసినట్లయితే చాలు అలనాటి తెలంగాణ సాహిత్యకారుల పట్టిక తయారవుతుంది. వారి ఫోటోలన్నింటిని ఎగ్జిబిట్‌ చేయడమే గాకుండా వాటిని నిలయం వార్షికోత్సవాల్లో ప్రదర్శనకు పెట్టాలి. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు ఇది దోహదపడుతుంది. 

                                                                                                      -సంగిశెట్టి శ్రీనివాస్‌

Telangana 'gem' veldurthi manikya rao's centenary

     తెలంగాణ మట్టిలోని    ‘మాణిక్యం’ వెల్దుర్తి

     తెలంగాణ ఆర్తి, ఆత్మీయత, ఆప్యాయతలు మేళవించి సాహిత్య, సామాజికోద్యమాల్ని నిర్మించి నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి వెల్దుర్తి మాణిక్యరావు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో ప్రత్యక్ష పరిచయముండి వివిధ కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహించిన ప్రతిభావంతుడు. కవిగా, కథకుడిగా, రచయితగా, చరిత్రకారుడిగా, గ్రంథమాల నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, ఆంధ్రమహాసభ కార్యదర్శిగా, పౌరహక్కుల నేతగా, గోలకొండ పత్రికలో జర్నలిస్టుగా, పలు పత్రికల సంపాదకుడిగా, అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడిగా, ప్రభుత్వోద్యోగిగా విభిన్న పాత్రలు పోషించి సమర్ధుడనిపించు కున్నాడు. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. సురవరం, మాడపాటి, కాళోజి, వట్టికోట మొదలైన మహామహులతో సన్నిహిత సంబంధాలుండేవి. వారు నిర్వహించిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన ఉద్యమశీలి వెల్దుర్తి. తెలంగాణ భాషలో నాటకాన్ని రాసి దానికి ప్రాచుర్యం కల్పించిన ప్రయోక్త. తెలుగు, ఉర్దు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో రచనలు చేయగలిగినంత ప్రతిభ కలిగిన వెల్దుర్తి శతజయంతి సంవత్సరమిది. 12 డిసెంబర్‌, 1912లో వెల్దుర్తి జన్మదినం. తెలంగాణలో తెలుగువారి సాహిత్య సృజనకు ప్రోత్సాహమిచ్చేందుకు, వివిధ అభ్యుదయాంశాలపై చర్చలు జరిపేందుకు గాను మిత్రులు కాళోజి నారాయణరావు, గోలకొండ పత్రికలో జర్నలిస్టుగా ఉన్న మంథనికి చెందిన వేంకట రాజన్న అవధానిలతో కలిసి 1935లో హైదరాబాద్‌లో ‘వైతాళిక సమితి’ని ఏర్పాటు చేశారు. అభ్యుదయ భావాలు వ్యాప్తి చేసేందుకు తెలంగాణలో ఏర్పడ్డ మొట్టమొదటి సారస్వత సమితి ఇదే. ఈ సమితి సభ్యులుగా వీరు ముగ్గురు కలిసి కథలు రాశారు. ఇవి గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి. జంట కవుల్ని చూశాము కానీ వీరు ‘కథక త్రయం’గా వెలిగారు. వీరు రాసిన ‘భూతదయ’ కథ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ తర్వాతి కాలంలో వెల్దుర్తి కతలు అనేకం గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి. హిందూ`ముస్లింల సాన్నిహిత్యాన్ని తన కథల్లో చక్కగా మలిచారు. భారం, ఏయిర్‌మెయిల్‌ కథలు వివిధ కథా సంకలనాల్లో చోటు చేసుకోగా, ఇప్పటికీ పత్రికల పుటల్లో ఎవ్వరికీ అందుబాటులో లేని కథలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా 1934`36 మధ్య కాలంలో గోలకొండ పత్రికలో వచ్చిన కథలు చాలా మందికి తెలియవు. అశోకుడు, కళోపాసన, నాదేశపు బట్ట, నిష్కామకర్మ, పిల్లలు`సొమ్ములు, చిన్న కల ఇలా ఎన్నో కథలు ఆయన కలం నుంచి జాలువారాయి. తెలంగాణ భాషలో మొట్టమొదటి సారిగా పుస్తకం రాసిన ఘనత కూడా వెల్దుర్తికే దక్కుతుంది. ‘దయ్యాల పన్గడ’ పేరిట వెలువడ్డ నాటకంలో అచ్చమైన పచ్చి పల్లెటూరి భాషను ఉపయోగించానని ఆయన చెప్పుకున్నారు. ఆరు అంకాలు, 80పేజీలు గల ఈ పుస్తకం రష్యన్‌ రచయిత టాల్‌స్టాయ్‌ పుస్తకం ‘ద ఫస్ట్‌ డిస్టిలర్‌’కు అనుసరణగా రాసిన ఈ నాటకంలో మద్యపాన నిరోధం ఆవశ్యకత గురించి తెలిపారు. తాగుడుకు మనిషి బానిసకావడం వల్ల జీవితం ఎలా పతనమవుతుందో ఇందులో చెప్పాడు. తాను మధ్యపాన నిరోధక సంఘ ఉద్యోగిగా ఉంటూ ఆ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఈ నాటకం రాసిండు. ఇది దేవరాజు మహారాజు పూనిక వల్ల ‘మా తెలంగాణ’ పత్రికలో సీరియల్‌గా పునర్ముద్రించబడిరది. కథకుడిగానే గాకుండా జీవిత చరిత్రల రచయితగా కూడా వెల్దుర్తి చేసిన సేవ తక్కువదేమీ కాదు. దయానందుల చరిత్ర, మాడపాటి హనుమంతరావుగారి జీవితం, ఎం.ఎన్‌.రాయ్‌, నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, వీర సావర్కర్‌ జీవితం, నిరంతర కృషి పేరిట సంస్కర్త, 1969 ఉద్యమ నాయకుడు బొజ్జం నర్సింలు జీవిత గాథల్ని అక్షరీకరించాడు. సుభాష్‌ చంద్రబోస్‌ పుస్తకం నిషేధానికి గురయింది. ప్రచురణ కర్తల్లో ఒకరైన కె.సి.గుప్త ఖైదు కావడానికి ఈ పుస్తకమే కారణం. జీవిత చరిత్రలతో పాటుగా వెల్దుర్తి కవిత్వం కూడా రాశాడు. ‘మాణిక్య వీణ’ పేరిట కవితా సంకలనాన్ని వెలువరించాడు. అలాగే హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ చరిత్ర గ్రంథాన్ని ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కొత్త విషయాలతో వెలుగులోకి తెచ్చాడు. వీరి తెలంగాణ స్వాతంత్య్రోద్యమ చరిత్రను అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్‌ ఆవిష్కరించారు. వందల సంఖ్యలో వ్యాసాలు వివిధ పత్రికల్లో అనేంకాంశాలపై ప్రచురించాడు. ఆలిండియా రేడియోలో ఆయన చేసిన ప్రసంగాలు, నాటకాలు అన్నీ ఆణిముత్యాలే. మల్లి, చేనుకాడ, మంచెమీద నాటికలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆయన రాసిన వందలాది బాల గేయాల్ని ‘హసీనా’ పేరిట వెలువరించాలనుకున్న కల తీరనే లేదు. దాశరథి కృష్ణమాచార్య, కాళోజి, శివశంకరశాస్త్రి, సానె గురూజీ, ప్రేంచంద్‌ మొదలైన తన అభిమాన రచయితల స్ఫూర్తితో ఎన్నో రచనలు వెలువరించాడు. కథలు, నాటకాలు, కవిత్వం, గేయాలు  ఇలా ఒక్కటేమిటి అనేక ప్రక్రియల్లో పలు రచనలు చేసిండు. గోలకొండ పత్రికలో ఉపసంపాదకులుగా పనిచేస్తున్న కాలంలో అనేక మంది పెద్దలతో పరిచయముండేది. సురవరం, మాడపాటి, బూర్గుల, పండిత నరేంద్రజీ, శివశంకర శాస్త్రి ఇంకా ఎందరో గోలకొండ దర్బారులో పాల్గనేవారు. తన రచనలు కేవలం గోలకొండ పత్రికలోనే గాకుండా సుజాత, శోభ, తెలుగు స్వతంత్ర మొదలైన పత్రికల్లో వెలువరించేవాడు. సంఘసేవకు మద్యపాన నిరోధక ప్రచార మార్గాన్ని ఎంచుకున్నాడు. నిజాం ప్రభుత్వం వివిధ భాషల్లో మద్యపాన నిరోధ ప్రచారానికి గాను పోస్టర్లు, కళాజాతలు, పాటలు, సభలు, సమావేశాలు, పత్రికల ద్వారా ఊరూరా ప్రచారం చేయించేవారు. ఈ శాఖలో పౌరసంబంధాల అధికారిగా ఉంటూ తెలుగులో వెలువడ్డ ‘మద్యపాన నిరోధక పత్రిక’కు సంపాదకులుగా వ్యవహరించారు. ముస్లిం మత పెద్దలు, సంఘ సంస్కర్తలతో కూడిన ప్రచార కమిటీకి సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సభలు, సమావేశాలు, కళాజాతల ద్వారా మద్యపాన నిరోధాన్ని వెల్దుర్తి ప్రచారం చేసేవారు. అందులో భాగంగానే ‘దయ్యాల పన్గడ’ నాటకాన్ని వెలువరించాడు. హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన తర్వాత హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వోద్యోగిగా షాద్‌నగర్‌, మహబూబునగర్‌ లాంటి ప్రాంతాల్లో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి స్థాయిలో పనిచేశారు. దాదాపు ఇదే కాలంలో హైదరాబాద్‌ కో`ఆపరేటివ్‌ జర్నల్‌, గ్రామసుధార్‌, రిసాల తర్కె`ముస్కిరాత్‌ పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టి సమర్దవంతంగా నిర్వహించాడు. విజయవాడ నుంచి వెలువడ్డ ‘యుగవాణి’ పత్రికకు ‘హైదరాబాద్‌ లేఖలు’ కాలమ్‌ని నిర్వహించాడు.    1938లో కె.సి.గుప్తతో కలిసి హైదరాబాద్‌లో కేవలం ఒక్క అణాకే పుస్తకాన్ని అందివ్వాలన్న ఉద్దేశ్యంతో ‘అణా గ్రంథమాల’ను స్థాపించారు. సాధన సమితి, ఆంధ్రసారస్వత పరిషత్‌ నిర్వాహణలో కూడా వెల్దుర్తి పాలు పంచుకున్నాడు. సారస్వత, సాంస్కృతిక రంగాలతోపాటుగా రాజకీయ రంగంలో కూడా వెల్దుర్తి తన ముద్రను చాటుకున్నాడు. 1938లోనే ఆంధ్రమహాసభ కార్యదర్శిగా పనిచేశాడు. ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే పౌరహక్కుల కోసం ఉద్యమాలు చేశాడు. హైదరాబాద్‌లో రజాకార్ల చర్యల్ని ఎండగట్టిన అతి కొద్దిమందిలో ఈయనొకరు. చెన్నారెడ్డి తాను రాసిన దయ్యాల పన్గడలో వేషం వేసేవాడు. అలాగే అనంతర కాలంలో చెన్నారెడ్డి విజయవాడ నుంచి హైదరాబాదీయుల కోసం నిర్వహించిన ‘హైదరాబాద్‌’ పత్రిక నిర్వహణలో కూడా వెల్దుర్తి పాలు పంచుకున్నాడు.
    వెల్దుర్తి మాణిక్యరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి ఎం.ఎల్‌. నరసింహారావు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటయ్యింది. ఇందులో దేవులపల్లి ప్రభాకరరావు, వెల్దుర్తి అన్నపూర్ణ, సంగిశెట్టి శ్రీనివాస్‌, వాసిరెడ్డి నవీన్‌, పాశం యాదగిరిలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వారు వెల్తుంర్తి రచనలన్నింటిని సంకలనాలుగా వెలువరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ చరిత్ర పుస్తకాన్ని మొదటి సంపుటిగా వెలవరించనున్నారు. 
    1912లో మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో  రుక్మిణమ్మ, వెంకటేశ్వరరావు దంపతులకు జన్మించిన మాణిక్యరావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో గల మున్సిపల్‌ క్వార్టర్స్‌లో నివసించిన వెల్దుర్తి జూలై 28, 1994నాడు మరణించారు. ఆయన భార్య విమలాదేవి కూడా సారస్వత, రాజకీయోద్యమాల్లో భర్తకు అండగా నిలిచింది. తండ్రి నుంచి సాహిత్యాన్ని వారసత్వంగా స్వీకరించిన వీరి కుమారుడు హర్షవర్ధన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉన్నతోద్యోగంలో ఉన్నారు. పాత తరం తెలంగాణ సాహితీ వేత్తలెవరికీ తమ రచనల్ని అచ్చేసుకోవాలనే కోరిక ఉండేది కాదు. అందువల్ల వారి రచనలు చాలా వరకు పుస్తకం రూపంలో రాకుండా పోయాయి. వెల్దుర్తి రచనలు కూడా అధిక భాగం అచ్చుకు నోచుకోలేదు. ఈయన రాసిన కథలు నలభైకి పైగా ఉన్నప్పటికీ ఇప్పుడు అందుబాటులో ఉన్నవి పదికి మించవు. ఇప్పటికైనా ఆయన రచనలన్నీ సేకరించి ఆయన శతజయంతి నాటికి పూర్తి స్థాయిలో అచ్చేసి నట్లయితే పాత తరం తెలంగాణకు సంబంధించిన ఎన్నో కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశముంది. అలాగే ఏదైనా విశ్వవిద్యాలయంలో ఆయనపై పి.హెచ్‌.డీ పరిశోధన జరిపించేలా తెలంగాణాభిమానులు, సాహితీ వేత్తలు, ప్రొఫెసర్లు కృషి చేయాలి. 

                                                                                                                             -సంగిశెట్టి శ్రీనివాస్‌


Saturday 1 September 2012

SAAKSHI LO REPORT

NAMASTE TELANGANA PATRIKALO REPORT ON 01-09-2012

Thursday 30 August 2012

ADIVI BAPIRAJU : THE BRIDGE BETWEEN ANDHRA AND TELANGANA

ఆంధ్ర-తెలంగాణల సాహిత్య వారధి అడివి బాపిరాజు

    రచయితగా తెలుగు సాహిత్యానికి, సంపాదకుడిగా తెలంగాణ పత్రికా రంగానికి తద్వారా మొత్తం తెలుగు సమాజానికి అడివి బాపిరాజు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిజాం జమానాలో హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు పత్రికా రంగానికి బలమైన పునాదులు వేసిన అగ్రగణ్యులైన సాహితీ వేత్తల్లో, సంపాదకుల్లో ఆయనొకరు. హైదరాబాద్‌లో 1943లో స్థాపించబడ్డ ‘మీజాన్‌’ దిన పత్రిక సంపాదకుడిగా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ తెలంగాణ ప్రజలకు ఆప్తుడయ్యాడు. పత్రికా యాజమాన్యం ప్రధానోద్దేశ్యం ‘మీజాన్‌’ ద్వారా ‘నిజాం కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడిరప జేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం.’’ అయితే అడివి బాపిరాజు ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు జరిపిన ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటా’నికి, కాంగ్రెస్‌ వారు నిర్వహించిన ‘ఆంధ్రమహాసభ’, ‘భారతదేశంలో హైదరాబాద్‌ విలీనోద్యమాల’కు మద్ధతుగా వార్తలు ప్రకటించేవాడు. అసిధారావ్రతం లాంటి తన  సంపాదకీయ బాధ్యతలను ఎంతో చాకచక్యంగా నిర్వహించిన ఆయన ప్రతిభ అద్వితీయం. అన్ని పార్టీల్లోనూ మిత్రులుండడం, అభ్యుదయ రచయితల సంఘం హైదరాబాద్‌ స్థాపక అధ్యక్షుడిగా, చారిత్రక నవలా చక్రవర్తిగా, తెలంగాణ చరిత్రను నవలా రూపంలో అక్షరీకరించి గోనగన్నారెడ్డి లాంటి వ్యక్తులకు జీవం పోసిన బాపిరాజు తెలంగాణకు ఆత్మీయుడు.
    హైదరాబాద్‌ రాజ్య ప్రజలతో మమేకమవడమే గాకుండా ఇక్కడి చారిత్రక స్థలాలకు సంబంధించిన విశేషాలెన్నింటినో పత్రికలో వ్యాసాలుగా ప్రకటించాడు. తెలుగు తల్లి పత్రికను అభ్యుదయ రచయితల సంఘ పత్రికగా మల్చడంలోనూ, ఎందరో కొత్త కథకులకు మీజాన్‌లో అవకాశమిచ్చి మలితరం తెలంగాణ కథకు జీవం పోసిండు. సాయుధ పోరాట సాహిత్యానికి అండగా నిలిచిన ఏకైక హైదరాబాద్‌ రాజ్య పత్రిక మీజాన్‌ అంటే అతిశయోక్తి కాదు.
    రచయిత అయినందుకే బాపిరాజుకు ‘మీజాన్‌’ పత్రిక సంపాదకపదవి దక్కింది. అయితే పత్రిక సంపాదకత్వం చేపట్టిన తర్వాతే ఆయన రచనలు అధికంగా అచ్చుకు నోచుకున్నాయి. అందరికీ అందుబాటులోకొచ్చాయి. తెలుగు నవలాకాశంలో ఆయన్ని ధృవతారగా నిలబెట్టిన ‘హిమబిందు’, ‘గోనగన్నారెడ్డి’, ‘కోనంగి’, ‘తుపాను’ మొదలైన నవలలన్నీ బాపిరాజు సంపాదకునిగా ఉన్న సమయంలోనే మీజాన్‌ పత్రికలో సీరియల్‌గా వెలువడ్డాయి. బాపిరాజు తన రచనల్ని ఏరోజు కారోజు దగ్గర నిలబడి చెబుతూ పోతుంటే పత్రికా కార్యాలయంలో కంపోజ్‌ చేసేవారట. అలాగే నిన్నటి కథ ఎంతవరకైందో కూడా చూడకుండా కథను డిక్టేట్‌ చేసేవాడంటే సాహితీవేత్తగా, సంపాదకుడిగా ఆయన ప్రతిభ తెలుస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ఆంధ్రమహాసభల సందర్భంగా మీజాన్‌ పత్రిక ప్రత్యేక సంచికలు వెలువరించేదంటే ఆయన సాహసం తెలుస్తుంది.  పత్రిక యాజమాన్యం పాలసీ భిన్నంగా ఉన్నప్పటికీ బాపిరాజు చాలా నేర్పుగా ‘తెలంగాణ సాయుధ పోరాట’ వార్తలను అధిక ప్రాధాన్యత నిచ్చి ప్రచురించేవాడు. ఆళ్వారుస్వామి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మాడపాటి హనుమంతరావులతో సాన్నిహిత్యం ఉండటంతో వారు నిర్వహించే వివిధ ప్రజా ఉద్యమాలకు పత్రిక ద్వారా దన్నుగా ఉండేవాడు. మీజాన్‌ పత్రికలో బాపిరాజు వెలువరించిన వందల కొద్ది రచనలు ఇప్పటికీ పుస్తక రూపంలో అందుబాటులోకి రాలేదు. మందుమల నరసింగరావు, రామచంద్రరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, రాజబహదూర్‌ గౌర్‌ లాంటి ఆనాటి రాజకీయ ఉద్యమకారుల జీవితాల్ని ‘ప్రతిరూపములు’ శీర్షికన శశికాంతుడు పేరిట అడివి బాపిరాజు వెలువరించారు. ఈ వ్యాసాలు ఆనాటి ఉద్యమరూపానికి ప్రత్యక్ష ప్రతిరూపాలు. అయితే దురదృష్ట వశాత్తు ఈ వ్యాసాలేవి ఇంతవరకూ పుస్తక రూపంలో ముద్రణకు నోచుకోలేదు. దీనికంతటికీ ప్రధాన కారణం మీజాన్‌ పత్రిక ప్రతులు చాలా అరుదుగా లభించడం, అవికూడా అందరికీ అందుబాటులో లేకపోవడమే. తెలంగాణ`ఆంధ్ర అన్న తేడా లేకుండా ఇరు ప్రాంతాల అభిమానులు బాపిరాజు అముద్రిత రచనల ప్రచురణకు ఉమ్మడిగా ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాల్సిన అవసరముంది. దీనితో అడివి బాపిరాజుని భిన్న పార్శ్వాల్లో బయటి ప్రపంచానికి చూపెట్టడానికి వీలవుతుంది. తెలంగాణ` ఆంధ్ర ప్రజల ఉమ్మడి వారసత్వమైన ఆయన రచనలు వెలుగు చూసినట్లయితే మరుగునపడ్డ సాహిత్యమెంతో వెలుగు చూస్తుంది. ఎన్నో కొత్త కోణాల్ని ఆవిష్కరించుకోడానికి అవకాశమిస్తుంది.
    అడివి బాపిరాజుని ఆంధ్ర` తెలంగాణ ప్రజల మధ్య వారధిగా చెప్పొచ్చు. హైదరబాద్‌లో మొట్టమొదటి సారిగా అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో ఆయన విశేషమైన కృషి చేసిండు. తమ పత్రికా కార్యాలయంలోనే ఆ సంఘం సమావేశాలు నిర్వహించేవారు. అక్టోబరు ఆరు 1944లో హైదరాబాద్‌లోని థియోసాఫికల్‌ సొసైటీలో  జంటనగరాల అరసం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వట్టికోట ఆళ్వారుస్వామి, బిదురు వెంకటశేషయ్య, వెల్దుర్తి మాణిక్యరావు, మానేపల్లి తాతాచార్య, ఎల్లాప్రగడ సీతాకుమారి, భాస్కరభట్ల కృష్ణారావు, జమ్మలమడక పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇందులోనే జంటనగరాల అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాపిరాజు, కార్యదర్శిగా ఆళ్వారుస్వామి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌తో బాపిరాజుకు గల సాన్నిహిత్యంలో ఇదొక చిన్న ఉదహరణ. నిజాం ప్రభుత్వ కోరికమేరకు అజంతా, ఎల్లోరా ప్రదేశాల్ని సందర్శించి వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తూ నివేదిక సమర్పించాడు. చిత్రకారుడు కూడా అయిన బాపిరాజు అజంతా, ఎల్లోరా శిల్ప సౌందర్యాన్ని హృదయానికి అత్తుకునేలా రాసి చిన్న పుస్తకంగా అచ్చువేయించాడు. బాపిరాజు స్థానికేతరుడే అయినప్పటికీ ఆయనకు తెలంగాణ అంటే మక్కువ ఎక్కువ. ఇక్కడి ప్రజలపై అభిమానం చూపించేవాడు. ఇక్కడి ప్రజలు చేస్తున్న వీరోచిత పోరాటల పట్ల సానుభూతితో ఉండేవారు. సంఫీుభావం చూపేవారు. అందుకే బాపిరాజు బంధువు, మీజాన్‌ పత్రికలో పనిచేసిన వెటరన్‌ జర్నలిస్టు బుద్ధవరపు కామరాజు ఇలా అన్నారు. ‘‘మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా పనిచేసి తెలంగాణ ఆంధ్రులలో ఐక్యమై, తెలంగాణ సాహితీ పరులకు సన్నిహిత బంధువైనాడు. తెలంగాణ చారిత్రక శిల్ప సంప్రదాయాన్ని శోధించి, ఆకళించుకొని తెలంగాణయే సిసలైన తెలుగు గడ్డ అని చాటి చెప్పాడు.’’
    నిజాం ప్రభుత్వాధికారులు, పాలకుడు ఉస్మాన్‌ అలీఖాన్‌లు ప్రజలపై తమ పట్టు సడలుతున్నట్లు భావించి, వారికి తాము చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాలను వారి భాషలోనే తెలిపితే బాగుటుందన్న ఆలోచనతో ‘మీజాన్‌’ పత్రిక స్థాపించబడిరది. 1943లో మీజాన్‌ అనే అరబిక్‌ పేరుతో ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు దిన పత్రికలను గులామ్‌ అహమద్‌ కలకత్తావాలా అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్త వీటి యజమాని. ఈయన ఖాన్‌ బహదూర్‌ అహమద్‌ నవాజ్‌ జంగ్‌ అనే నిజాం సన్నిహితుడి అల్లుడు. దేశంలోనే మొట్టమొదటి సారిగా మూడు భాషల్లో ప్రచురించబడ్డ ఈ పత్రికలు మూడు వేర్వేరు పాలసీలు అవలంభించాయి. ఇంగ్లీషు పత్రిక నిజామ్‌కు, ప్రభుత్వ పాలసీలకు మద్ధతుగా నిలిచేది. ఉర్దూ పత్రిక ముస్లిం లీగ్‌ని, మజ్లిస్‌ని, దాని నాయకుడు బహదూర్‌ యార్‌ జంగ్‌ని, ఆ తర్వాతి కాలంలో రజాకార్లకు అండగా ఉండేది. తెలుగు పత్రిక మాత్రం నిజాం వ్యతిరేక శక్తులకు, ముఖ్యంగా కమ్యూనిస్టులకు ఊతమిచ్చేది. ఆంధ్ర మహాసభ నాయకుడిగా, తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సర్వదేవభట్ల రామనాథం, వట్టికోట ఆళ్వారుస్వామి పంథాలను సమర్థిస్తూ వారికి అండగా ఉండేది. వారికి విశేష ప్రచారం కల్పించేది. ఈ పత్రిక స్థాపనలో డబ్బు సంపాదించడం కూడా ఒక ప్రధానోద్దేశ్యం. మీజాన్‌ (అరబిక్‌లో తరాజు (త్రాసు) అని అర్థం) పత్రికలో  తిరుమల రామచంద్ర, రాంభట్ల కృష్ణమూర్తి, శ్రీనివాస చక్రవర్తి, బుద్ధవరపు కామరాజు, విద్వాన్‌ విశ్వం లాంటి వారెందరో పనిచేసిండ్రు. మీజాన్‌ పత్రిక కార్యాలయంలో బాపిరాజు నిర్వహించే దర్బార్‌లో కురుగంటి, రాయప్రోలు, శ్రీశ్రీ, శివశంకరస్వామి తదితరులు క్రమం తప్పకుండా పాల్గొనేవారు.  హైదరాబాద్‌ వచ్చిన ఆంధ్రప్రాంత సాహితీకారుడు ఆనాడు మీజాన్‌ సందర్శించుకోవడం, పత్రిక కార్యాలయంలో నిర్వహించే దర్బార్‌లో పాల్గొనడం ఆనవాయితిగా ఉండేది. ‘స్వాతంత్య్రము, సమత్వము, సౌభ్రాతృత్వము’ అని పత్రిక ముఖపత్రంపై ఒక నినాదంగా ప్రకటించి పత్రిక ఉద్దేశ్యాన్ని వెల్లడిరచేవారు. 
    మొదట మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా కాకినాడకు చెందిన హైదరాబాద్‌ ప్రభుత్వోద్యోగి, సాహితీవేత్త ఖాసింఖాన్‌ని సంపాదకునిగా ఎంపిక చేద్దామని అనుకున్నారు. అయితే ముస్లిమ్‌ల పత్రిక అని ముద్రపడితే తెలుగు వారు చదవబోరు అనే ఆలోచనతో రాయప్రోలు, కురుగంటి, ఖాసింఖాన్‌ల సలహాతో అడివి బాపిరాజుని మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా ఎంపిక చేశారు. అప్పటికే బాపిరాజు కృష్ణా పత్రిక దర్బార్‌లో రెగ్యులర్‌గా పాల్గొనడం, ముట్నూరి కృష్ణారావు దగ్గర జర్నలిజంలో ఓనమాలు దిద్దుకోవడం ఆయన ఎంపికకు దారి తీసింది. పత్రిక సంపాదకునిగా స్థానికున్ని నియమించినట్లయితే అతను నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాసి రహస్యంగా ఆంధ్రమహాసభకు మధ్దతిస్తాడనే ఆలోచనతో తెలంగాణ వాళ్ళకు అవకాశమివ్వలేదు. ఎందుకంటే అప్పటికి ప్రచారంలో ఉన్న గోలకొండ పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక వార్తలతో ప్రభుత్వానికి తలనొప్పిగా ఉండేది. ఆ ఉద్దేశ్యంతోనే స్థానికున్ని గాకుండా గైర్‌ ముల్కీని నియమించాలనుకున్నారు. ఈ కారణాలు బాపిరాజు ఎంపికకు దోహదం చేశాయి. అయితే బాపిరాజు ఎంపిక మొత్తం తెలంగాణకు, ఆనాటి తెలంగాణ ఉద్యమాలకు, సాహిత్యానికి, పౌరహక్కులకు చేసిన మేలు ఎంతో గొప్పది.
     ధూపదీపాలు పేరిట ప్రతి ఉగాదికి తెలుగు వ్యక్తులకు వ్యంగ్యంగా బిరుదులు తగిలించి వారికి మొత్తం తెలుగువారిలో బాపిరాజు ప్రచారం కల్పించేవారు. 1945 ఉగాది సందర్భంగా ఆయన కొంతమంది తెలుగువారికిచ్చిన బిరుదులు గమనిస్తే అందులోని వ్యగ్యం అర్థమవుతుంది. 1. మాడపాటి హనుమంతరావు ` ఆంధ్రపార్టీ ఎస్కేపిస్టు బహదూర్‌, 2. మందుముల నరసింగరావు `సర్‌ ఆంధ్రాం థ్రాం థ్రాం, 3. రావి నారాయణరెడ్డి ` సౌమ్య సౌమ్యాంధ్రా జి.సి.హెచ్‌.ఎస్‌. 4. సురవరం ప్రతాపరెడ్డి `ముల్కేతర ముల్కీ ఆంధ్రాదివాన్‌, 5. రాయప్రోలు సుబ్బారావు `దండకారణ్య వాల్మీక, 6. కాళోజి నారాయణరావు `ఆంధ్ర సభాఅభినవ గోపరాజగీతామృతకలశా. ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బిరుదు తగిలించి బాపిరాజు ఆట పట్టించేవాడు.
    తెలంగాణ అభ్యుదయం కోసం తమ కలాన్ని కత్తిలా వాడి తనకు ఉపాధి కల్పించిన వారిపైనే సమరం చేసిన యోధుడు అడివి బాపిరాజు. బాపిరాజుకు హైదరాబాద్‌తో గల సాన్నిహిత్యం, ఆయన సాహిత్యం, ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఆయనపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగి పిహెచ్‌డీలు అవార్డయినప్పటికీ మీజాన్‌ పత్రికల సమాచారం ఉపయోగించుకుంది చాలా తక్కువ. దాదాపు శూన్యం. అందుబాటులో ఉన్న అరకొర మీజాన్‌ సంచికల్ని ప్రెస్‌ అకాడెమీ వారు ఒక ప్రాజెక్టుగా చేపట్టి గతించిన  తరం సాహిత్యాన్ని, సమాజాన్ని రికార్డు చేయాల్సిన అవసరముంది. ఈ పని ఆంధ్ర`తెలంగాణల ఉమ్మడి వారసత్వంగా బయటికి రావాల్సిన అవసరముంది. 

                                                                                                                                      -సంగిశెట్టి శ్రీనివాస్‌